నీతి ఆయోగ్

నిధుల సమీకరణ లక్ష్యంగా భారీస్థాయి ప్రణాళిక!

నేషనల్ మానిటైజేషన్ పైప్.లైన్.కు
నిర్మలా సీతారామన్ శ్రీకారం
ఆస్తులను నగదు మార్చుకోవడం ద్వారా రూ. 6లక్షల కోట్లు
సమకూరే అవకాశం: ఎన్.ఎం.పి. అంచనా

ప్రధానమంత్రి దార్శనికతతోనే ఈ ప్రణాళిక: ఆర్థిక మంత్రి

Posted On: 23 AUG 2021 5:45PM by PIB Hyderabad

  నిధుల సమీకరణ లక్ష్యంగా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల, ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను నగదుగా మార్చుకునే భారీ ప్రణాళికను కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు ప్రారంభించారు. ‘నేషనల్ మానిటైజేషన్ పైప్.లైన్ (ఎన్.ఎం.పి. 1,2భాగాలు)’ పేరిట ఈ భారీ ప్రణాళిక రూపుదిద్దుకుంది. 2021-22వ సంవత్సరపు కేంద్ర బడ్జెట్ పరిధిలో ప్రభుత్వ ఖర్చులకోసం ‘ఆస్తులను నగదుగా మార్చుకునే’ ఈ భారీ ప్రణాళికకు నీతీ ఆయోగ్ సంస్థ రూపకల్పన చేసింది. మౌలిక సదుపాయాల రంగంలోని వివిధ మంత్రిత్వ శాఖలను సంప్రదించిన అనంతరం నీతీ ఆయోగ్ ఈ ప్రణాళికను రూపొందించింది. ఈ ప్రణాళిక కింద, కేంద్ర ప్రభుత్వానికి చెందిన కీలకమైన ఆస్తులను నగదుగా మార్చుకోపడం ద్వారా 2022నుంచి 2025వ సవంత్సరం వరకూ నాలుగేళ్లలో సగటున ఆరులక్షల కోట్ల రూపాయలమేర సమీకరించుకోవచ్చని ఎన్.ఎం.పి. అంచనా వేస్తోంది.

   ఎన్.ఎం.పి.కి చెందిన ఒకటవ, రెండవ భాగాల నివేదికను ఈ రోజు విడుదల చేశారు. నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సి.ఇ.ఒ.), మౌలిక సదుపాయాల రంగంలోని వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శుల సమక్షంలో నివేదికలను వెలువరించారు. రోడ్లు, రవాణాశాఖ, జాతీయ రహదారులు, రైల్వేశాఖ, విద్యుత్, పైప్.లైన్, గ్యాస్, పౌర విమానయానం, ఓడరేవులు, జలమార్గాలు, టెలీ కమ్యూనికేషన్లు, ఆహారం, ప్రజాపంపిణీ, గనుల తవ్వకం, గృహనిర్మాణ పట్టణ వ్యవహారాలు వంటి మౌలిక సదుపాయాల మంత్రిత్వశాఖల కార్యదర్శులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి, పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  ఎన్.ఎం.పి. ప్రణాళికను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, గౌరవ ప్రధానమంత్రి దార్శనికత ఫలితంగానే ఆస్తులను నగదుగా మార్చే కార్యక్రమం రూపుదిద్దుకుందన్నారు. “అత్యున్నత ప్రమాణాలు కలిగిన, అందుబాటు యోగ్యమైన మౌలిక సదుపాయాలు భారత దేశ సామాన్య పౌరుడికి చేరువగా ఉండాలని ప్రధానమంత్రి ఎల్లపుడూ భావిస్తారు. కొత్త మౌలిక సదుపాయాల కల్పనకు ప్రైవేటు పెట్టుబడులను రాబట్టాలన్న లక్ష్యంతోనే ఆస్తుల నగదుగా మార్చుకునే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఉపాధి అవకాశాలు కల్పించి, ఉన్నత స్థాయిలో ఆర్థిక ప్రగతిని సాధించడానికి, సంపూర్ణ స్థాయి ప్రజాసంక్షేమం లక్ష్యంగా గ్రామీణ ప్రాంతాలు, పాక్షిక పట్టణ ప్రాంతాలను పటిష్టమైన రీతిలో ఏకీకృతం చేయడానికి ఈ కార్యక్రమం ఎంతో అవసరం.” అని నిర్మలా సీతారామన్ అన్నారు. సత్వర మౌలిక సదాపాయాల అభివృద్ధికి, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను, వివిధ కార్యక్రమాలను ఆమె వివరించారు. మూలధన వ్యయంకోసం రాష్ట్రాలకు ఆర్థిక సహాయం పేరిట ఇటీవల చేపట్టిన కార్యక్రమాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. కొత్త కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగవంతంగా అమలయ్యేలా తమ యాజమాన్యంలోని ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వాలు రీసైకిల్ చేసుకునేలా ప్రోత్సహించేందుకు ఈ ఆర్థిక సహకార పథకాన్ని చేపట్టినట్టు ఆమె తెలిపారు. 

 “ప్రభుత్వ రంగంలోని ఆస్తులకు సంబంధించిన పెట్టుబడుల విలువను తెలుసుకోవడం ఈ కొత్త కార్యక్రమం వ్యూహాత్మక ధ్యేయమని అన్నారు. సంస్థాగతమైన, దీర్ఘకాలిక పెట్టుబడులను రాబట్టడం ద్వారా ఆ తర్వాత వాటిని మరిన్ని పెట్టుబడులకు వినియోగించుకునేలా వెసులుపాటు కల్పించడం” లక్ష్యమని అన్నారు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రభుత్వ రంగంలోని ఆస్తుల విలువను తెలుసుకునేందుకు అనుసరించాల్సన పద్ధతులపై దృష్టిని కేంద్రీకరించాలన్నారు.

  నగదుగా మార్చుకునేందుకు అవకాశం ఉన్న వివిధ ఆస్తుల ప్రాజెక్టులను గుర్తించేందుకు మధ్యకాలిక ప్రణాళికగా పనిచేసేలా ఎన్.ఎం.పి.ని రూపొందించినట్టు నీతీ ఆయోగ్ సి.ఇ.ఒ. చెప్పారు. “ప్రాజెక్టుల పనితీరును ప్రభుత్వ సంస్థలు పర్యవేక్షించేలా ఒక వ్యవస్థీకృత, పారదర్శక యంత్రాగాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంతో ఎన్.ఎం.పి. రూపొందింది. పెట్టుబడిదారుల భావి ప్రణాళికలకు, కార్యకలాపాలకు ఇది దోహదపడుతుంది. ఆస్తులను నగదుగా మార్చుకునే ఈ ప్రక్రియను కేవలం నిధులందించే వ్యవస్థగా మాత్రమే పరిగణించరాదు. మౌలిక సదుపాయాల నిర్వహణకు, ప్రైవేటు రంగం వనరుల సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, ప్రపంచ స్థాయి ఆర్థిక వాస్తవాలకు తగినట్టుగా సదుపాయాలను క్రియాశీలకంగా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడే కార్యక్రమంగా ఎన్.ఎం.పి.ని పరిగణించాలి. పెట్టుబడులకు కొత్త అవకాశాలను కల్పించే మౌలిక సదుపాయాల పెటుబడుల ట్రస్టులు, స్థిరాస్తి పెట్టుబడుల ట్రస్టులు వంటి కొత్త నమూనాలకు దోహదపడేలా ఈ కార్యక్రమాన్ని చూడాలి. సామాన్య ప్రజలు కూడా కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు వీలుంటుంది. అందువల్ల, భారతదేశపు మౌలిక సదుపాయాల రంగం ప్రపంచ స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దగలగే కీలకమైన ముందడుగుగా ఎన్.ఎం.పి.ని పరిగణిస్తాను.” అని నీతీ ఆయోగ్ సి.ఇ.ఒ. అన్నారు.

  నీతీ ఆయోగ్, ఆర్థిక మంత్రిత్వ శాఖ, సంబంధిత మంత్రిత్వ శాఖలు వివిధ భాగస్వామ్య వర్గాలను సంప్రదించి, సేకరించిన అభిప్రాయాలు, అనుభవాల, ఆలోచనల సంకలనంతోనే ఎన్.ఎం.పి. రూపుదిద్దుకుంది. ఈ ప్రణాళిక రూపకల్పనకోసం వివిధ భాగస్వామ్య వర్గాలతో నీతీ ఆయోగ్ పలుదఫాలుగా చర్చలు, సంప్రదింపులు జరిపింది. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూడా ఈ ప్రణాళికపై విస్తృతంగా చర్చ జరిగింది. అంటే, ఇది మొత్తానికి మొత్తంగా సంపూర్ణ స్థాయి ప్రభుత్వ కార్యక్రమమే.

  ఎన్.ఎం.పి. ప్రణాళిక కింద తమకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు సిద్ధంగా ఉన్నట్టు మౌలిక సదుపాయాల రంగానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు స్పష్టం చేశారు. నీతీ ఆయోగ్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో కలసి ఉమ్మడిగా పనిచేయాలని కూడా తీర్మానించుకున్నట్టు వారు తెలిపారు. 

   ఆస్తులను నగదుగా మార్చుకునే కార్యక్రమం అమలు, పర్యవేక్షణకు సంబంధించిన బహుళ అంచెల సంస్థాగత యంత్రాంగంలో భాగంగా కార్యదర్శి స్థాయి అధికారులతో ఒక సాధికార కీలక బృందాన్ని (సి.జి.ఎ.ఎం.ను) ఏర్పాటు చేశారు. కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి ఈ బృందానికి అధ్యక్షత వహిస్తారు. ప్రభుత్వరంగానికి, ప్రైవేటు పెట్టుబడిదారులకు, డెవలపర్లకు విలువైనదిగా ఈ ప్రణాళికను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ‘సామాన్య పౌరులను సమ్మిళితం, సాధికారం చేస్తూ ఉత్తమ శ్రేణి మౌలిక సదుపాయాలను కల్పించాలన్న’ విశాల, దీర్ఘకాల దృక్ఫథంతో ఈ ప్రణాళికను చేపట్టారు.

 

నేషనల్ మానిటైజేషన్ పైప్.లైన్ (ఎన్.ఎం.పి.): ఒక పరిచయం

   సుస్థిరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నిధులందించేందుకు ప్రస్తుతం అమలులో ఉన్న ప్రభుత్వ మౌలిక సదుపాయాల ఆస్తులను నగదుగా మార్చుకోవడమే కీలకమైన మార్గంగా 2021-22వ సంవత్సరపు కేంద్ర బడ్జెట్ గుర్తించింది.  ఈ లక్ష్య సాధనకోసం తగిన ఆస్తుల నగదీకరణ ప్రక్రియను చేపట్టడానికి  ‘నేషనల్ మానిటైజేషన్ పైప్.లైన్ (ఎన్.ఎం.పి.)’ అనే భారీ ప్రణాళిక తయారీకి బడ్జెట్ వీలు కల్పించింది. మౌలిక సదుపాయాల రంగానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరిపిన నీతీ ఆయోగ్ సంస్థ ఎన్.ఎం.పి. నివేదికను తయారు చేసింది.

  ప్రభుత్వ రంగ యాజమాన్యంలోని పర్యవేక్షణ లోపించిన పలు ఆస్తులను ప్రైవేటు రంగం అధీనంలోకి తేవడానికి సంబంధించి మధ్యకాలిక ప్రణాళికను ఎన్.ఎం.పి. కల్పిస్తుంది. ఎన్.ఎం.పి.పై నివేదికను రెండు భాగాలుగా రూపొందించారు. ఒకటవ భాగాన్ని మార్గదర్శక పుస్తకంగా తయారు చేశారు. ఆస్తులను నగదుగా మార్చుకునేందుకు అనుసరించదగిన మార్గాలను, చేపట్టాల్సిన నమూనాలను మొదటి భాగంలో వివరించారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని కీలక ఆస్తులతో సహా వివిధ రకాల ఆస్తులను నగదుగా మార్చుకునేందుకు కావలసిన అసలు ప్రణాళికను రెండవ భాగంలో వివరించారు.

వ్యవస్థ

  సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలతో జరిపిన సంప్రదింపుల్లో అందిన సమాచారం ఆధారంగా ఎన్.ఎం.పి. ప్రణాళికను తయారు చేశారు. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఆస్తులను నగదుగా మార్చుకోవడం, అంతగా కీలకం కాని ఆస్తులను నగదుగా మార్చుకోవడం వంటి అంశాలను కూడా ఎన్.ఎం.పి.లో పొందుపరిచారు. దీనికి తోడుగా, కేంద్ర ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఆస్తులను కూడా ప్రస్తుతం ఈ ప్రణాళిక పరిధిలోకి తీసుకువచ్చారు. ఈ ప్రణాళికకు సంబంధించిన సమన్వయ ప్రక్రియ, వివిధ రాష్ట్రాలనుంచి ఆస్తుల వివరాల క్రోడీకరించడం వంటి కార్యకలాపాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. కీలకమైన ఆస్తులను నగదుగా మార్చుకునే ప్రక్రియ,.. మూడు అంశాలతో కూడుకుని ఉంటుంది.

  https://ci4.googleusercontent.com/proxy/palZsaknDjJI1quUutCJQDILFCwf9784w02CigHPMVrHNSUeFFmkUU5mdh7u812sXT4x0INOEUJo957rZ7V0Ou-iHT7G1sMBS_Pn__4DznqhAH-qsPEPHRG7SA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001FJ3Y.jpg

   సుస్థిరమైన ఆదాయ సృష్టి జరిగే ఆస్తులను, నష్టానికి ఆస్కారంలేని ఆస్తులను ఎంపిక చేయడం, రెవెన్యూ హక్కులు ప్రాతిపదికగా లావాదేవీలను రూపొందించడం వంటి చర్యలు తీసుకుంటారు. నగదు మార్చుకునే ప్రక్రియలో  ఆస్తులకు సంబంధించిన ప్రధాన యాజమాన్య హక్కులు మాత్రం ప్రభుత్వానికి దఖలు పడి ఉంటాయి. లావాదేవీకి సంబంధించిన నిర్దేశిత గడువు ముగిసిన వెంటనే సదరు యాజమాన్య హక్కులను ప్రభుత్వమే తిరిగి స్వాధీనం చేసుకుంటుంది.

 

ప్రణాళిక సామర్థ్యంపై అంచనా

  ఆస్తులను నగదుగా మార్చుకునే ప్రక్రియతో మౌలిక సదుపాయాల కల్పన ముడివడి ఉన్నందున, ఎన్.ఎం.పి. కాల వ్యవధిని,.. జాతీయ మౌలిక సదుపాయాల పైప్.లైన్ కార్యక్రమం (ఎన్.ఐ.పి.)లోని మిగిలిన వ్యవధితో సరితూగేలా నిర్ణయిస్తారు.

  2022వ సంవత్సరంనుంచి 2025 వరకూ నాలుగేళ్ల కాలంలో ఎన్.ఎం.పి. అమలు ద్వారా రూ. 6కోట్ల నిధులను సమీకరించగలమని అంచనా వేస్తున్నారు. ఈ అంచనా మొత్తం విలువ జాతీయ మౌలిక సదుపాయాల పైప్ లైన్ కార్యక్రమానికి సంబంధించిన కేంద్రం పెట్టుబడి (రూ. 43కోట్లు)లో 14శాతంగా ఉంటుంది. 12కు పైగా కేంద్ర మంత్రిత్వశాఖల ఆస్తులు, 20 రకాలకు పైగా ఆస్తులు ఈ ప్రణాళిక పరిధిలోకి వస్తాయి. రోడ్లు, ఓడరేవులు, రైల్వేలు, గిడ్డంగులు, గ్యాస్, ప్రాడక్ట్ పైప్.లైన్, విద్యుదుత్పత్తి, విద్యుత్ పంపిణీ, గనుల తవ్వకం, టెలికమ్యూనికేషన్లు, స్డేడియం, ఆతిథ్య రంగం, గృహనిర్మాణం వంటి రంగాలు ఈ ఎన్.ఎం.పి. ప్రణాళిక పరిధిలోకి వస్తాయి.

 

 

 

 

 

 

 

 

 

2022-25 ఆర్థిక సంవత్సరాల్లో వివిధ రంగాలవారీగా మానిటైజేషన్ లక్ష్యాలు (రూ. కోట్లలో)

https://ci4.googleusercontent.com/proxy/DvuXFZZnXp952Rdp3ltRQKdW2tKEc3noOriMHAZb_ApQT2-maXxrnCfymxke5uD6JnT5Pd00wlJ4XVxZ4Y_9XDTFkQSyl8oxNUUQngfEePzD00KbF6OQBN5juw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0023IP0.jpg

 

అంచనా వేసిన విలువ ప్రకారం అగ్రగామిగా ఉన్న 5 రంగాలే మొత్తం ప్రణాళిక విలువలో 83శాతాన్ని ఆక్రమిస్తాయి.  ఈ ఐదు అగ్రగామి రంగాల్లో : రహదారులు (27శాతం) రైల్వేలు (25శాతం), విద్యుత్ (15శాతం), చమురు, గ్యాస్ పైప్ లైన్లు (8శాతం) టెలి కమ్యూనికేషన్ల రంగం (6శాతం)గా ఉన్నాయి.

  అస్తుల నగదుగా మార్చుకునే ప్రణాళికకు సంబంధించిన వార్షిక విలువల ప్రకారం చూస్తే రూ. 0.88లక్షల కోట్ల విలువైన 15శాతం ఆస్తులు ప్రస్తుత  ఆర్థిక సంవత్సరం (2021-22)లోనే నగదుగా మారే సూచనలు ఉన్నాయి. అయితే, ఎన్.ఎం.పి. ప్రణాళిక కింద నగదుగా మారే ఆస్తులకు సంబంధించి ఈ  విలువ సూచనప్రాయమైనదిమాత్రమే. అప్పటి సమయం, లావాదేవీ కుదరడం, పెట్టుబడి దారుల ఆసక్తి తదితర అంశాల ఆధారంగా నగదుగా మారే ఆస్తుల అసలు విలువ ఉంటుంది.

మానిటైజేషన్ పైప్ లైన్ కింద నగదుగా మారే ఆస్తుల విలువ.., సంవత్సరంవారీగా (రూ. కోట్లలో)https://ci5.googleusercontent.com/proxy/u-yL_HNAjxnj95WYq_xuTT49Gxlia-M1G3qWG0RewRxH3dfAPdyblC6yhbxff7CzXtb4-APubBfiw_EdKQ6cb7lC4vEh0szcOUip4kzuExzIv6SnPhdfxdOTAQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003UGMQ.jpg

 

ఎన్.ఎం.పి. ప్రణాళికి కిందకు వచ్చే ఆస్తుల, లావాదేవీల గుర్తింపు ప్రక్రియను వివిద రకాల చర్యల ద్వారా చేపడతారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య ఒప్పందాలు, భాగస్వామ్య రాయితీలు,.. మౌలిక సదపాయాల ట్రస్టులవంటి పెట్టుబడుల మార్కెట్ పద్ధతులు తదితర అంశాలు ఈ కోవలోకి వస్తాయి. ఏ పద్ధతిలో ఎన్.ఎం.పి. ప్రణాళికను అమలు చేయాలన్న నిర్ణయం మాత్రం,.. ఆయా రంగం ప్రాధాన్యత, ఆస్తుల స్వభావం, లావాదేవీ కుదిరే సమయం, మార్కెట్ పరిణామాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. పెట్టుబడి దారు లక్ష్యం, కార్యకలాపాల స్థాయి, పెట్టుబడులపై ఆస్తుల యాజమాన్య సంస్థకు ఉన్న నియంత్రణ వంటి అంశాలు కూడా ఈ విషయంలో కీలకపాత్ర పోషిస్తాయి. 

 

 మానిటైజేషన్ ప్రణాళిక అమలు, పర్యవేక్షణ యంత్రాగం

 

 మొత్తానికి మొత్తంగా రూపొందిన వ్యూహం ప్రకారం ఆస్తుల సింహభాగం, ఆస్తుల ప్రాతిపదిక ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉంటుంది.

  ప్రభుత్వ ఆధ్వర్యంలోని విధానపరమైన వ్యవస్థ, నియంత్రణతో కూడిన వ్యవస్థ అండగా నిలిచేలా ఎన్.ఎం.పి. ప్రణాళికను రూపొందించారు.  ఆస్తులను నగదుగా మార్చుకునే ప్రక్రియ ప్రభావవంతంగా, సమర్థంగా అమలు జిరిగేలా చూసేందుకు ఈ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా,. నిర్వహణా పద్ధతులను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరించడం, పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, వాణిజ్యపరమైన సామర్థ్యానికి అవకాశాలు కల్పించడం తదితర చర్యలు తీసుకుంటారు. ఆస్తుల నగదుగా మార్చుకునే ప్రక్రియకు సంబంధించి, 2021-22సంవత్సపపు బడ్జెట్లో పేర్కొన్నట్టుగా డ్యాష్ బోర్డు ద్వారా మొత్తం వ్యవహారంపై క్రమబద్ధమైన పర్యవేక్షణ ఉంటుంది.

 ఆస్తులను నగదుగా మార్చుకోవడం ద్వారా మౌలిక సదుపాయాలను కల్పించుకోవడమే ఈ ప్రణాళిక మనకు అందించే తుదిఫలితం. ఈ ప్రణాళిక అమలుతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు తమతమ ప్రాధాన్యాంశాల్లో పరస్పర సహకారంతో, పోటీ తత్వంతో పనిచేస్తాయి. తద్వారా దేశంలో సామాజిక ఆర్థిక ప్రగతిని, దేశ పౌరులకు నాణ్యమైన జీవితాన్ని అందించేందుకు వీలు కలుగుగుతుంది. ఎన్.ఎం.పి. పూర్తి నివేదికను ఈ లింకు ద్వారా చూడవచ్చు.: http://www.niti.gov.in/national-monetisation-pipeline

 

****



(Release ID: 1748408) Visitor Counter : 451