రైల్వే మంత్రిత్వ శాఖ

మంగళవారం ఉదయానికి 450 మె.ట. వైద్య ఆక్సిజన్‌ రవాణా చేయనున్న ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లు

దిల్లీ, ఉత్తరప్రదేశ్‌కు వెళ్తున్న ఆక్సిజన్‌ రైళ్లు

మరింత ఆక్సిజన్‌ తీసుకొచ్చేందుకు లఖ్‌నవూ నుంచి బొకారోకు మరో రైలు వెళ్లే అవకాశం

Posted On: 26 APR 2021 5:35PM by PIB Hyderabad

కొన్ని రోజుల క్రితం, ఆక్సిజన్‌ కోసం ముంబయి ప్రాంతం నుంచి విశాఖకు ఖాళీ ట్యాంకర్లతో మొదటి రైలు వెళ్లిన నాటి నుంచి ఇప్పటివరకు, భారతీయ రైల్వేలు 302 మె.ట.కు పైగా ఆక్సిజన్‌ను దేశంలోని వివిధ రాష్ట్రాలకు భద్రంగా చేర్చాయి. మరో 154 టన్నుల ద్రవరూప వైద్య ఆక్సిజన్‌ రవాణాలో ఉంది. ఆక్సిజన్‌ డిమాండ్‌ ఉన్న రాష్ట్రాలకు ప్రాణవాయువు చేరవేతను సవాలుగా తీసుకుని రైల్వేలు పని చేస్తున్నాయి.

    నాలుగు నిండు ట్యాంకర్లను తీసుకెళ్తున్న ఒక ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ మంగళవారం ఉదయానికి రాయ్‌గఢ్‌ నుంచి దిల్లీకి చేరుకోనుంది.

    మహారాష్ట్ర ప్రజల అవసరాల కోసం, 44 మె.ట. ఆక్సిజన్‌ను (3 ట్యాంకర్లు) ఒక రైలు గుజరాత్‌లోని హాపా నుంచి ముంబయి సమీపంలోని కలంబోలికి చేర్చింది.

    మరో రైలు 90 మె.ట. ఆక్సిజన్‌ను (5 ట్యాంకర్లు) బొకారో నుంచి లఖ్‌నవూకు చేర్చే దారిలో ఉంది. మంగళవారం ఉదయానికి ఇది లఖ్‌నవూ చేరుకుంటుందని అంచనా.

    మరిన్ని ఆక్సిజన్‌ ట్యాంకర్లను తీసుకొచ్చేందుకు మరో రైలు ఖాళీ ర్యాకులతో లఖ్‌నవూ నుంచి బొకారోకు వెళ్లింది. 

    రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్న విజ్ఞప్తులన్నింటికీ రైల్వే శాఖ స్పందింస్తోంది. అదనపు ఆక్సిజన్‌ రైళ్ల అవసరాలపై ఆయా ప్రభుత్వ యంత్రాంగాలతో నిరంతరం చర్చలు జరుపుతోంది.

 

***



(Release ID: 1714269) Visitor Counter : 190