ప్రధాన మంత్రి కార్యాలయం

కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి

నూతన పార్లమెంటు దేశం ఆకాంక్షలను నెరవేరుస్తుంది : ప్రధాన మంత్రి  

ప్రజాస్వామ్యమే మన సంస్కృతి: ప్రధాన మంత్రి

కొత్త పార్లమెంటు ఆత్మ నిర్భర్ భారత్  ఆవిష్కరణ కు సాక్షి అవుతుంది: ప్రధాన మంత్రి


దేశ హితాన్ని అన్నిటి కంటే మిన్న గా నిలబెడతామంటూప్రతిజ్ఞ స్వీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు: ప్రధాన మంత్రి

Posted On: 10 DEC 2020 4:00PM by PIB Hyderabad

కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శంకుస్థాపన చేశారు. ఈ నూతన భవనం ‘ఆత్మ నిర్భర భారత్’ దార్శనికత లో ఒక అంతర్భాగమని, స్వాతంత్ర్యం అనంతర కాలం లో మొట్టమొదటి సారి గా ఓ ప్రజా పార్లమెంటు ను నిర్మించేందుకు లభించిన చరిత్రాత్మక అవకాశమని, అంతేకాకుండా 2022 వ సంవత్సరం లో స్వాతంత్ర్య 75 వ వార్షికోత్సవ సందర్భం లో ‘న్యూ ఇండియా’ అవసరాలకు, ఆకాంక్షలకు ఇది తులతూగగలుగుతుందని ఆయన అన్నారు.

ఈ సందర్భం లో ప్రధానమంత్రి మాట్లాడుతూ.. ఈ రోజు భారతీయత నిండిన భారతదేశ ప్రజాస్వామ్య చరిత్ర లో ఒక మైలురాయి వంటి రోజు అన్నారు. భారతదేశ పార్లమెంట్ భవనం నిర్మాణ పనులు ఆరంభం కావడం అనేది మన ప్రజాస్వామ్య సంప్రదాయాలలో అత్యంత ముఖ్యమైన దశలలో ఒక దశ అని కూడా ఆయన అన్నారు. ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని మనమందరం కలిసి కట్టుగా నిర్మిద్దామంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. భారతదేశం స్వాతంత్ర్యాన్ని సంపాదించుకొని 75 సంవత్సరాల వేడుక ను జరుపుకోబోయే వేళ మన పార్లమెంట్ నూతన భవనాని కన్నా మించి శుద్ధమైంది గాని, లేదా సుందరమైంది గాని మరి ఏదీ ఉండబోదని ఆయన అన్నారు.

తాను 2014 లో పార్లమెంట్ సభ్యుని గా పార్లమెంట్ భవనం లో మొట్టమొదటి సారి అడుగుపెట్టిన క్షణాన్ని ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చుకొన్నారు. పార్లమెంట్ భవనం లో తొలిసారి గా తాను ప్రవేశించినప్పుడు, దీనిలోకి అడుగిడే ముందు, ప్రజాస్వామ్యాని కి ఆలయం అయిన ఈ భవనానికి శిరస్సు ను వంచి ప్రణామం చేశానని ఆయన అన్నారు. నూతన పార్లమెంట్ భవనం లో ఎన్నో కొత్త సంగతులు చోటుచేసుకొంటున్నాయని, అవి ఎంపీల సామర్థ్యాన్ని పెంచుతాయని, వారి పని సంస్కృతి ని ఆధునీకరిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. పాత పార్లమెంట్ భవనం స్వాతంత్ర్యం అనంతర కాలం లో భారతదేశానికి ఒక దిశ ను అందిస్తే, కొత్త పార్లమెంట్ భవనం ఒక ‘ఆత్మ నిర్భర్ భారత్’ ఆవిష్కారానికి సాక్షి గా మారనుందని ఆయన చెప్పారు. దేశం అవసరాలను తీర్చడానికి సంబంధించిన కృషి పాత పార్లమెంట్ భవనం లో జరగగా, 21వ శతాబ్దపు భారతదేశం ఆకాంక్షలను నెరవేర్చే పని నూతన భవనం లో జరగగలదని ఆయన తెలిపారు.

మరో చోట ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల ప్రక్రియల కు, పరిపాలన కు సంబంధించింది కావచ్చని ప్రధాన మంత్రి అన్నారు. కానీ, భారతదేశం లో ప్రజాస్వామ్యం అంటే జీవన విలువలు, జీవన మార్గం, దేశ ప్రజల ఆత్మ అని ఆయన అభివర్ణించారు. భారతదేశ ప్రజాస్వామ్యం శతాబ్దాల తరబడి పోగుపడిన అనుభవం ద్వారా రూపు దిద్దుకొన్న ఒక వ్యవస్థ అని ఆయన పేర్కొన్నారు. అందులో ఒక జీవన మంత్రం, ఒక జీవన శక్తి తో పాటు క్రమానుగత వ్యవస్థ కూడా ఉంది అని ఆయన అన్నారు. దేశాభివృద్ధి కి ఒక కొత్త శక్తి ని ఇస్తున్నది భారతదేశ ప్రజాస్వామ్యం బలమేనని, అది తన దేశ వాసుల లో ఒక కొత్త నమ్మకాన్ని కూడా రేకెత్తిస్తోందని ఆయన అన్నారు. భారతదేశం లో ప్రతి ఏటా ప్రజాస్వామ్యాన్ని పునర్ నవీకరించడం జరుగుతూ వస్తోందని, ఈ విషయాన్ని ప్రతి ఎన్నిక లో పెరుగుతున్న వోటర్ ల నమోదు లో గమనించవచ్చని ఆయన చెప్పారు.

భారతదేశం లో ప్రజాస్వామ్యం అంటే పాలన తో పాటు, అభిప్రాయ భేదాలను పరిష్కరించే ఒక సాధనం గా కూడా ఉందని ప్రధాన మంత్రి అన్నారు. వేరు వేరు అభిప్రాయాలు, భిన్నమైన దృష్టి కోణాలు ఒక హుషారైన ప్రజాస్వామ్యానికి సాధికారిత ను ప్రసాదిస్తాయని ఆయన చెప్పారు. ప్రక్రియ ల నుంచి పూర్తి గా తెగిపోనంత వరకు అభిప్రాయభేదాలకు ఎల్లప్పటికీ తావు ఉంటుందనే ఉద్దేశం తో మన ప్రజాస్వామ్యం ముందుకు సాగిపోయిందని ఆయన అన్నారు. విధానాలు , రాజకీయాలు వేరు గా ఉండవచ్చును, కానీ మనం ప్రజలకు సేవ చేయడం కోసమే ఉన్నాం; ఈ అంతిమ లక్ష్యాన్ని సాధించడంలో ఎలాంటి అభిప్రాయభేదాలు ఉండకూడదు అని ఆయన స్పష్టంచేశారు. చర్చలు పార్లమెంట్ లోపల జరిగినా, లేదా బయట జరిగినా, వాటిలో నిరంతరమూ దేశ ప్రజలకు సేవ చేయడమూ, దేశ ప్రజల హితం దిశ గా సమర్పణ భావం ఉట్టి పడుతూ ఉండాలి అని ఆయన చెప్పారు

పార్లమెంట్ భవనం ఉనికి కి మూలాధారమైన ప్రజాస్వామ్యం దిశ లో ఆశావాదాన్ని మేల్కొలపవలసిన బాధ్యత ప్రజలదేనన్న సంగతి ని గుర్తుపెట్టుకోవలసిందిగా ప్రజలకు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ లోపలికి అడుగుపెట్టే ప్రతి సభ్యుడు, ప్రతి సభ్యురాలు ప్రజలతో పాటు రాజ్యాంగానికి కూడా జవాబుదారుగా ఉండాలి అని ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామ్య ఆలయాన్ని పరిశుభ్రపర్చడానికికంటూ ఎలాంటి క్రతువులు లేవని ఆయన చెప్పారు. దీనిని ప్రక్షాళన చేసేది ఈ ఆలయం లోకి వచ్చే ప్రజాప్రతినిధులే అని ఆయన అన్నారు. వారి అంకిత భావం, వారి సేవ, వారి నడవడిక, వారి ఆలోచనలు, వారి ప్రవర్తన .. ఇవే ఈ ఆలయానికి ప్రాణం అని ఆయన చెప్పారు. భారతదేశ ఏకత్వం, అఖండత్వం దిశ గా వారు చేసే ప్రయత్నాలు ఈ ఆలయానికి జీవ శక్తి ని ప్రసాదిస్తాయన్నారు. ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి తన జ్ఞానాన్ని, తెలివితేటలను, విద్య ను, తన అనుభవాన్ని ఇక్కడ పూర్తిగా వినియోగించిన పక్షం లో, అలాంటప్పుడు కొత్త పార్లమెంట్ భవనం పవిత్రత ను సంపాదించుకుంటుంది అని ఆయన చెప్పారు.

భారతదేశాన్ని అగ్రస్థానం లో నిలబెడతామని, భారతదేశ ప్రగతి ని మాత్రమే ఆరాధింస్తామని ప్రతిజ్ఞ ను స్వీకరించవలసిందిగా ప్రజల కు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రతి నిర్ణయం దేశ శక్తి ని పెంపొందించాలని, దేశ హితం అన్నింటి కంటే మిన్నగా ఉండాలని ఆయన అన్నారు. దేశ ప్రజల హితం కంటే గొప్పదైన హితం మరి ఏదీ ఉండదు అంటూ శపథం చేయాలని ప్రతి ఒక్కరిని ఆయన కోరారు. వారి స్వీయ ఆందోళనల కన్నా దేశం గురించిన ఆందోళనే పెద్దదని ఆయన అన్నారు. దేశ ఏకత, అఖండత ల కంటే మరి ఏదీ వారికి ఎక్కువ ప్రాముఖ్యం కలిగింది కాదన్నారు. దేశ రాజ్యాంగ గౌరవాన్ని, రాజ్యాంగ ఆకాంక్షలను నెరవేర్చడం ప్రజల జీవితం లో అతిపెద్దదైన లక్ష్యం అని ఆయన అభివర్ణించారు.

***

 



(Release ID: 1679701) Visitor Counter : 299