మంత్రిమండలి

ల‌క్ష్మీ విలాస్ బ్యాంక్‌ ను డిబిఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ తో క‌లిపే ప‌థ‌కానికి ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Posted On: 25 NOV 2020 3:33PM by PIB Hyderabad

ల‌క్ష్మీ విలాస్ బ్యాంక్ లిమిటెడ్ (ఎల్‌విబి) ని డిబిఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ (డిబిఐఎల్‌) తో విలీనం చేసే ప‌థ‌కానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ సమావేశం ఆమోదాన్ని తెలిపింది.  డిపాజిట్‌దారుల హితాన్ని ప‌రిర‌క్షించ‌డాన్ని , ఆర్థిక‌ప‌ర‌మైన‌, బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన స్థిర‌త్వాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంకింగ్ రెగ్యులేశన్ యాక్ట్, 1949 లో 45వ సెక్శన్ కు అనుగుణంగా భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్ బిఐ) నివేదన ప్రకారం విలీనీకరణ పథకాన్ని రూపొందించడం జరిగింది.  దీనితో పాటే ఆర్ బిఐ ప్రభుత్వ సలహాను అందుకొని డిపాజిట్దారుల హితాన్ని రక్షించడం కోసం ఈ నెల 17 న ఎల్‌విబి కి 30 రోజుల పాటు మోరటోరియమ్ ను (రుణాల నిలుపుద‌ల సంబంధిత ఆంక్ష‌లను) విధించింది.  ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించి ఎల్‌విబి డైరెక్ట‌ర్ల బోర్డు కన్నా పైన ఒక ప‌రిపాల‌కుడిని కూడా ఆర్ బిఐ నియ‌మించింది.

ప్ర‌జ‌ల వ‌ద్ద నుంచి, సంబంధిత వ‌ర్గాల నుంచి అభ్యంత‌రాల‌ను, సూచ‌న‌లను, స‌ల‌హాల‌ ను ఆహ్వానించిన అనంత‌రం ఆర్‌బిఐ విలీనీక‌ర‌ణ ప‌థ‌కానికి రూప‌క‌ల్ప‌న చేసి, ఆ పథకాన్ని ప్ర‌భుత్వ మంజూరు కోసం నివేదించింది.  ఈ పని ని మోరటోరియమ్ కాలం ముగిసే క‌ంటే ఎంతో ముందే ముగించడమైంది.  మోరటోరియమ్ కారణంగా బ్యాంకు   డిపాజిట్‌దారులకు న‌గ‌దు ను ఉప‌సంహ‌రించుకోవ‌డంలో ఎదురయ్యే ఇబ్బంది ని తగ్గించాలనే ఉద్దేశ్యంతోనే ఈ పని ని చేయడం జరిగింది.  ఈ ప‌థ‌కానికి ఆమోదం లభించిన తరువాత ఓ తగిన రోజు న ఎల్‌విబి ని డిబిఐఎల్ తో క‌లిపివేయ‌డం జ‌రుగుతుంది.  అప్పుడు,  డిపాజిట్‌దారులు వారి డబ్బును తీసుకోవడంలో మ‌రెలాంటి ఆంక్ష‌లు ఉండ‌బోవు.

డిబిఐఎల్ అనేది ఒక బ్యాంకింగ్ కంపెనీ. దీనికి ఆర్‌బిఐ  లైసెన్సు దక్కింది.  ఇది పూర్తి యాజ‌మాన్యాన్ని క‌లిగివున్న సబ్సిడియ‌రీ మాడ‌ల్ లో భార‌త‌దేశం లో కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హిస్తోంది.  డిబిఐఎల్ కు బ‌ల‌మైన ఆస్తి అప్పుల ప‌ట్టీ (బ్యాలెన్స్ శీట్) ఉంది.  దాని దగ్గర తగినంత మూల‌ధ‌నం కూడా ఉంది.  వీటికి తోడు, ఆసియా లో ఒక ప్ర‌ముఖ ఆర్థిక సేవ‌ల స‌మూహం అయిన‌టువంటి డిబిఎస్ వైపు నుంచి చ‌క్క‌ని అండ‌దండ‌లు కూడా డిబిఐఎల్ కు ల‌భిస్తున్నాయి.  18 మార్కెట్ ల‌లో డిబిఎస్‌ కార్య‌క‌లాపాలు సాగుతున్నాయి.  దీని ముఖ్య కార్యాలయం సింగ‌పూర్ లో ఉంది.  డిబిఎస్ సింగపూర్ స్టాక్  మార్కెట్ లో కూడా నమోదైంది.  విలీనీక‌ర‌ణం అనంత‌రం  డిబిఐఎల్ సంయుక్త బ్యాలెన్స్ శీట్ సుదృఢంగా ఉంటుంది.  దీని శాఖ‌ల సంఖ్య పెరిగి 600 కు చేరుకొంటుంది.

ఎల్‌విబి త్వరిత గతి న విలీనం చేసి దాని సమస్య కు  ప‌రిష్క‌ారాన్ని వెతకడం, స్వ‌చ్ఛ‌మైన బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ ను నెలకొల్పాలన్న ప్ర‌భుత్వ వ‌చ‌న‌బ‌ద్ధ‌త‌ కు అనుగుణం గా ఉంది.  అలాగే ఇది ఒక పక్క డిపాజిట్‌దారుల, సాధారణ ప్రజల ప్రయోజనాలను కాపాడుతూనే, మ‌రొక ప‌క్క ఆర్థిక‌ వ్య‌వ‌స్థ‌ కు సైతం మేలు చేసేదే.


***



(Release ID: 1675713) Visitor Counter : 223