ప్రధాన మంత్రి కార్యాలయం

జి-20 నాయకుల 15వ సదస్సు

Posted On: 22 NOV 2020 11:26PM by PIB Hyderabad

1.           2020 నవంబర్,  21-22 తేదీలలో సౌదీ అరేబియాలో  వర్చువల్ మాధ్యమంగా ఏర్పాటు చేసిన జి-20 దేశాల 15వ  సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.  జి-20 శిఖరాగ్ర సమావేశం రెండవ రోజు ఎజెండా, సమగ్రమైన, స్థిరమైన మరియు స్థితిస్థాపకంగా ఉండే భవిష్యత్తును నిర్మించడంపై దృష్టి సారించింది.  ఈ సదస్సు నేపథ్యంలో భూగ్రహాన్ని పరిరక్షించుకోవడంపై కూడా ఒక కార్యక్రమం జరిగింది.

2.          ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, కోవిడ్ అనంతర ప్రపంచంలో సమ్మిళిత, స్థితిస్థాపక, స్థిరమైన పునరుద్ధరణ కోసం, సమర్థవంతమైన ప్రపంచ పాలన అవసరమని పేర్కొన్నారు.  ప్రవర్తన మెరుగుదల ద్వారా బహుపాక్షికతను సంస్కరించాలి. బహుళ పక్ష సంస్థల పాలన మరియు ప్రక్రియల అవసరం కూడా ఉంది.

3.      ‘ఎవరూ వెనుకబడకుండా ఉండాలనే’ లక్ష్యంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం 2030 ఎజెండా యొక్క ప్రాముఖ్యతను ప్రధానమంత్రి నొక్కిచెప్పారు.  పురోగమించడానికీ, భాగస్వామ్య సమ్మిళిత అభివృద్ధి ప్రయత్నాల కోసం ‘సంస్కరణ-పనితీరు-పరివర్తన’ వ్యూహంలో భారతదేశం అదే సూత్రాన్ని అనుసరిస్తోందని ఆయన అన్నారు.

4.           కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో మారుతున్న పరిస్థితులతో, భారతదేశం ‘స్వావలంబన భారతదేశం’ కోసం కృషి చేస్తోంది.   ఈ దృష్టిని అనుసరించి, దాని సామర్థ్యం మరియు విశ్వసనీయత ఆధారంగా, భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు గ్లోబల్ సరఫరా వ్యవస్థ యొక్క ముఖ్యమైన మరియు నమ్మదగిన ఆధారంగా మారుతుంది.  ప్రపంచ స్థాయిలో, అంతర్జాతీయ సౌర కూటమి మరియు విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి వంటి సంస్థలను స్థాపించడానికి కూడా భారతదేశం చొరవ తీసుకుంది.

5. ‘భూ గ్రహాన్ని కాపాడటం’ అనే అంశంపై జరిగిన ఒక కార్యక్రమం కోసం రికార్డ్ చేసిన సందేశంలో, ప్రధానమంత్రి మాట్లాడుతూ  వాతావరణ మార్పులపై సమగ్ర, విస్తృతమైన, సంపూర్ణ పద్ధతిలో పోరాడవలసిన అవసరాన్ని గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. పారిస్ ఒప్పంద లక్ష్యాలను భారతదేశం నెరవేర్చడంతో పాటు, ఆ లక్ష్యాలను మించిపోతుందని ఆయన అన్నారు.  పర్యావరణానికి అనుగుణంగా జీవించే సాంప్రదాయిక నీతి ద్వారా భారతదేశం ప్రేరణ పొందిందని మరియు తక్కువ కార్బన్ మరియు వాతావరణ స్థితిస్థాపక అభివృద్ధి విధానాన్ని అవలంబించిందని ఆయన ఉద్ఘాటించారు.  మానవత్వం అభివృద్ధి చెందాలంటే, ప్రతి ఒక్క వ్యక్తి అభివృద్ధి చెందాలి, శ్రమను ఉత్పత్తి కారకంగా మనం చూడకూడదని ఆయన అన్నారు.  బదులుగా, ప్రతి కార్మికుడి మానవ గౌరవంపై కూడా మనం దృష్టి పెట్టాలి.  ఈ విధానం, మన గ్రహం పరిరక్షణకు ఉత్తమమైన హామీ అని ఆయన పేర్కొన్నారు.

6.           రియాద్ శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు సౌదీ అరేబియా కు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు.  2021 లో జి-20 అధ్యక్ష పదవిని చేపట్టినందున ఇటలీని అయన స్వాగతించారు.  జి-20 అధ్యక్ష పదవిని 2022 లో ఇండోనేషియా, 2023 లో భారతదేశం, 2024 లో బ్రెజిల్ నిర్వహించనున్నట్లు నిర్ణయించారు.

7.           సదస్సు ముగింపులో, జి-20 నాయకుల ప్రకటన జారీ చేయబడింది.  ప్రస్తుత సవాళ్లను అధిగమించడానికి, ప్రజలను శక్తివంతం చేయడం, భూగ్రహాన్ని పరిరక్షించడం, కొత్త సరిహద్దులను రూపొందించుకోవడం ద్వారా అందరికీ 21వ శతాబ్దపు అవకాశాలను గ్రహించడానికి సమన్వయ ప్రపంచ చర్య, సంఘీభావం మరియు బహుపాక్షిక సహకారం కోసం ఈ ప్రకటన పిలుపునిచ్చింది.

 

 

*****



(Release ID: 1675016) Visitor Counter : 206