రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

శిక్షణ పొందిన 20 మిలిటరీ అశ్వాలు, మందుపాతరలు గుర్తించగల 10 శునకాలను బంగ్లాదేశ్‌ సైన్యానికి అప్పగించిన భారత సైన్యం

Posted On: 10 NOV 2020 5:13PM by PIB Hyderabad

భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య, ముఖ్యంగా ఇరు సైన్యాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా, శిక్షణ పొందిన 20 మిలిటరీ గుర్రాలు, మందుపాతరలు గుర్తించగల 10 శునకాలను బంగ్లాదేశ్‌ సైన్యానికి భారత సైన్యం బహూకరించింది. సైన్యానికి చెందిన 'రీమౌంట్‌, వెటర్నరీ కార్ప్స్‌' వీటికి శిక్షణ ఇచ్చింది. ఈ ప్రత్యేక అశ్వాలు, శునకాలను నియంత్రించేందుకు బంగ్లాదేశ్‌ సైనికులకు కూడా భారత సైన్యం శిక్షణ ఇచ్చింది.
    
    భారత బృందానికి మేజర్‌ జనరల్‌ నరీందర్‌ సింగ్‌ ఖ్రౌద్‌, బంగ్లాదేశ్‌ బృందానికి మేజర్‌ జనరల్‌ మొహమ్మద్‌ హుమయూన్‌ కబీర్‌ నాయకత్వం వహించారు. రెండు దేశాల సరిహద్దులోని 'పెట్రాపోల్‌-బెనాపోల్‌ ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్ట్‌' వద్ద ఈ కార్యక్రమం జరిగింది. బంగ్లాదేశ్‌లో భారత హై కమిషనర్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.    

    బంగ్లాదేశ్‌తో భారత్‌ భాగస్వామ్యం, పొరుగు దేశాలతో సఖ్యత విషయంలో ఈ ప్రాంతంలో నమూనాగా మారింది. రెండు దేశాల బంధం ఈ చర్యతో మరింత బలోపేతమవుతుందని భావిస్తున్నారు.

    "భారత సైన్యంలోని శునకాల పనితీరు ప్రశంసనీయం. రక్షణ సంబంధ అంశాల్లో బంగ్లాదేశ్‌కు సాయం అందించేందుకు మేం సదా సిద్ధం. రక్షణ విషయంలో ఈ శునకాలు వాటి స్ఫూర్తిని నిరూపించుకున్నాయి. మందుపాతలతోపాటు, నిషేధిత పదార్థాల గుర్తింపులో, బంగ్లాదేశ్‌కు అందించిన శునకాలు అత్యంత సమర్థవంతమైనవి" అని మేజర్‌ జనరల్‌ నరీందర్‌ సింగ్‌ ఖ్రౌద్ తెలిపారు.

***



(Release ID: 1671798) Visitor Counter : 201