యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

సురక్షిత బయో బబుల్‌లో జాతీయ షూటింగ్ శిబిరం సాగేలా సంయుక్తంగా బాధ్యత తీసుకోనున్న సాయ్‌, ఎన్‌ఆర్‌ఏఐ

Posted On: 13 OCT 2020 1:17PM by PIB Hyderabad

ముఖ్యమైన ఒలింపిక్‌ షూటర్ల కోసం, ఈనెల 15 నుంచి డిసెంబర్‌ 17వ తేదీ వరకు డా.కర్ణిసింగ్‌ షూటింగ్‌ రేంజ్‌లో జాతీయ షూటింగ్‌ శిబరం జరగనుంది. కరోనా భయం లేకుండా, షూటర్లు సురక్షితంగా శిక్షణపొందేలా బయో బబుల్‌లో ప్రామాణిక కార్యాచరణ విధానాలను (ఎస్‌ఓపీ) నిర్వహించే బాధ్యతను భారత క్రీడల అథారిటీ (సాయ్‌), భారత జాతీయ రైఫిల్‌ అసోసియేషన్‌ (ఎన్‌ఆర్‌ఏఐ) సంయుక్తంగా చేపడతాయి.

    షూటింగ్ రేంజ్‌ బాధ్యతలను డా.కర్ణిసింగ్ షూటింగ్ రేంజ్‌ నిర్వాహకుడు చూస్తారు. భద్రత కోసం; క్రీడాకారులు, సిబ్బంది మధ్య సంబంధాలను తగ్గించడానికి షూటింగ్‌ ప్రాంగణాన్ని రిస్క్‌ ప్రకారం పచ్చ‌, కాషాయం‌, పసుపు, ఎరుపు భాగాలుగా విభజించాలని నిర్ణయించారు.

    శిబిరానికి దగ్గరలో ఉన్న హోటల్‌లో క్రీడాకారులకు వసతిని ఎన్‌ఆర్‌ఏఐ ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం సాయ్‌ సాయం చేస్తుంది. హోటల్‌ నుంచి షూటింగ్‌ రేంజ్‌కు వరకు, సురక్షిత బయో బబుల్‌ నిర్వహించేందుకు ఎస్‌వోపీ అమలుచేసే బాధ్యత ఎన్‌ఆర్‌ఏఐదే. దిల్లీ-ఎన్‌సీఆర్‌ బయటి ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులు/శిక్షకులను ఏడు రోజులపాటు హోటల్‌లో క్వారంటైన్‌ చేసే ప్రక్రియను ఎన్‌ఆర్‌ఏఐ రూపొందించింది. దిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలోని క్రీడాకారులు/శిక్షకులు వారు ఉంటున్నచోటే ఏడు రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. ఆ తర్వాత, హోటల్లో ఉన్న సహచరులతో వారిని కలుపుతారు. శిబిరం ముగిసేవరకు అంతా కలిసే ఉండాలి.

    "ఎస్‌వోపీ ద్వారా సాయ్‌ విడుదల చేసిన రక్షణ నిబంధనలు వివరంగా ఉన్నాయి. లాక్‌డౌన్‌ తర్వాత నిర్వహిస్తున్న మొట్టమొదటి జాతీయ స్థాయి శిబిరం ఇది. సురక్షిత, సౌకర్యవంత వాతావరణంలో షూటర్లు సాధన చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం" అని ఎన్‌ఆర్‌ఏఐ కార్యదర్శి రాజీవ్‌ భాటియా వెల్లడించారు.    

    ఎన్‌ఆర్‌ఏఐ, హోటల్‌లో నిర్వహించే కొవిడ్‌ పరీక్షను షూటర్లు, శిక్షకులు తప్పనిసరిగా చేయించుకోవాలి.

***



(Release ID: 1664003) Visitor Counter : 189