హోం మంత్రిత్వ శాఖ

కొత్త మార్గదర్శకాలను జరీ చేసిన ఎంహెచ్ఎ

కంటైన్మెంట్ ప్రాంతాల మినహా మిగిలిన ప్రాంతాల్లో మరిన్ని కార్యకలాపాలకు అవకాశం ఇచ్చిన అన్ లాక్-4


కంటైన్మెంట్ ప్రాంతాల్లో మాత్రం 2020 సెప్టెంబర్ 30వ తేదీ వరకు కఠినంగానే లాక్ డౌన్ నిబంధనలు అమలు

Posted On: 29 AUG 2020 8:05PM by PIB Hyderabad

కంటైన్మెంట్ ప్రాంతాల బయట మరిన్ని కార్యకలాపాలకు అనుమతి ఇస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు జరీ చేసింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి అమలులోకి వచ్చే అన్ లాక్ - 4 లో, కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కావడానికి దశల వారీ అనుమతులు ఇచ్చే ప్రక్రియ ఇంకా కొనసాగించనున్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి వచ్చిన ప్రతిస్పందన, వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలతో సంప్రదింపులు, సమాలోచనలు తర్వాత ఈ కొత్త మార్గ దర్శకాలను హోంమంత్రిత్వ శాఖ జరీ చేసింది. 

కొత్త మార్గదర్శకాల లోని ముఖ్యమైన అంశాలు:

* మెట్రో రైల్ కు సెప్టెంబర్ 7వ తేదీ నుండి అనుమతి ఇస్తారు. ఇందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో సంప్రదించి, గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ/ రైల్వే మంత్రిత్వ శాఖ తగు చర్యలు తీసుకుంటాయి. గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రామాణిక విధాన ప్రక్రియ (ఎస్ఓపి) ని జరీ చేస్తుంది. 

* సామజిక, విద్యాపరమైన, క్రీడా సంబంధిత, సాంస్కృతిక, ధార్మిక, రాజకీయ కార్యక్రమాలు, ఇతర సమావేశాలకు 100 మంది వ్యక్తుల పరిమితితో సెప్టెంబర్ 21వ తేదీ నుండి అనుమతి ఇస్తారు.  అయితే ఈ పరిమితమైన సమావేశాలలో ఫేస్ మాస్కులు, సామజిక దూరం, థర్మల్ స్కానింగ్, హ్యాండ్ వాష్, శానిటైజర్ వంటి చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి. 

* ఓపెన్ ఎయిర్ థియేటర్లను కూడా సెప్టెంబర్ 21వ తేదీ నుండి తెరుచుకోవచ్చు. 

* పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లను 2020 సెప్టెంబర్ 30వ తేదీ వరకు తెరవరాదు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆన్ లైన్ / దూరవిద్య ను కొనసాగిస్తూనే, ఇంకా వాటిని ప్రోత్సహించాలి. అయితే కంటైన్మెంట్ జోన్ల అవతలి ప్రాంతాల్లో ఈ కింది అంశాలకు  2020 సెప్టెంబర్ 21వ తేదీ నుండి అనుమతి ఉంటుంది. ఇందుకు ఎస్ఓపి ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జరీ చేస్తుంది. 

ఎ) ఆన్ లైన్ బోధన / టెలి కౌన్సిలింగ్ సంబంధిత విధుల కోసం పాఠశాలల్లో 50 శాతం మంది ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది హాజరయ్యేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనుమతి ఇవ్వవచ్చు. 

బి) కంటైన్మెంట్ జోన్ బయట 9 నుండి 12 వ తరగతి విద్యార్థులు మాత్రం విద్య సంబంధిత అంశాలకు సంబంధించి టీచర్లను కలవడానికి పాఠశాలను ఎవరికి వారు స్వచ్చందంగా సందర్శించవచ్చు.  అయితే దీనికి తల్లి దండ్రుల నుండి లిఖిత పూర్వకమైన అంగీకారం ఉండాలి. 

సి) జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థలు, పారిశ్రామిక శిక్షణ సంస్థలు (ఐటిఐలు), నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి మిషన్లు లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఇతర మంత్రిత్వ శాఖల కింద రిజిస్టర్ అయి నడుస్తున్న స్వల్పకాలిక శిక్షణ కేంద్రాలకు తెరిచేందుకు అనుమతి ఉంటుంది. 

జాతీయ ఔత్సాహిక పారిశ్రామిక, చిన్న వ్యాపార అభివృద్ధి సంస్థ (ఎన్ఐఈఎస్బియుడి), ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఎంట్రెప్రేన్యూర్షిప్ (ఐఐఈ) వంటి శిక్షణ ఇచ్చే సంస్థలకు కూడా అనుమతి ఉంటుంది. 

* రీసెర్చ్ స్కాలర్లు (పీహెచ్.డి), సాంకేతిక, వృత్తిపరమైన కార్యక్రమాల పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మాత్రమే పరిశోధన, ప్రయోగాలకు సంబంధించి, ఉన్నత విద్య సంస్థలకు అనుమతి ఇచ్చారు. స్థానిక కోవిడ్-19 పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తో సంప్రదించిన మీదట ఉన్నత విద్య శాఖ (డిహెచ్ఈ) ఈ అనుమతులు ఇస్తుంది.

* కంటైన్మెంట్ జోన్లు కానీ ప్రాంతాలకు ఈ క్రింద వాటికి తప్ప మిగిలిన వాటికి అనుమతి ఉంటుంది:

(i) సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులు, థియేటర్లు (ఓపెన్ ఎయిర్ థియేటర్లు మినహా) వంటి స్థలాలు

(ii) కేంద్ర హోమంత్రిత్వ శాఖా అనుమతిచ్చిన వారు కాకుండా ఇతర అంతర్జాతీయ విమాన ప్రయాణీకులు 

* కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ 2020 సెప్టెంబర్ 30వ తేదీ వరకు కఠినంగానే కొనసాగుతుంది 

* వ్యాధి వ్యాప్తి గొలుసును సమర్థవంతంగా విచ్ఛిన్నం చేసే ఉద్దేశంతో ఎంఓహెచ్డబ్ల్యూ మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే కంటైన్మెంట్ జోన్లను సూక్ష్మ స్థాయిలో జిల్లా అధికారులు గుర్తించాలి. ఈ నియంత్రణ మండలుల్లో కఠినతరమైన నియంత్రణ చర్యలు అమలులో ఉంటాయి. అవసరమైన కార్యకలాపాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. 

* ఈ కంటైన్మెంట్ జోన్లను సంబంధిత జిల్లా కలెక్టర్లు,  రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు తమ వెబ్ సైట్లలో నోటిఫై చేస్తారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కూడా ఆ సమాచారాన్ని తెలియజేస్తారు. 

కంటైనేషన్ జోన్ల వెలుపల రాష్ట్రాలు స్థానిక లాక్డౌన్  విధించకూడదు:

రాష్ట్ర / యుటి ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో ముందస్తుగా సంప్రదించకుండా, కంటైన్మెంట్ జోన్ల వెలుపల స్థానిక లాక్డౌన్ (రాష్ట్ర / జిల్లా / సబ్ డివిజన్ / నగర / గ్రామ స్థాయి) విధించవు. 

అంతర్రాష్ట్ర, రాష్ట్రంలోపు కదలికలపై ఆంక్షలు లేవు: 

వ్యక్తులు కానీ, సరకు రవాణా లో కానీ అంతర్-రాష్ట్ర, రాష్ట్రంలోపు రాకపోకలు సాగించడానికి ఎటువంటి ఆంక్షలు, పరిమితులు లేవు. ప్రత్యేకంగా అటువంటి కదలికల కోసం ఇక ఈ విధమైన అనుమతి / ఆమోదం / ఇ-పర్మిట్ అవసరం ఉండదు. 

కోవిడ్-19 నిర్వహణ కోసం జాతీయ ఆదేశికాలు : 

సామజిక దూరాన్ని పాటించే ఉద్దేశంతో కోవిడ్-19 నిర్వహణలో జాతీయ ఆదేశాలను దేశమంతటా అనుసరించాలి. దుకాణాలకు వచ్చే వినియోగదారులు తగినంత భౌతిక దూరాన్ని పాటించాలి. నేషనల్ డైరెక్టివ్స్ సమర్థవంతమైన అమలును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది. 

హాని కలగడానికి ఆస్కారం ఉన్న వ్యక్తుల కోసం రక్షణ చర్యలు: 

దుర్బలమైన వ్యక్తులు, అంటే 65 ఏళ్లు పైబడిన వారు, సహ-అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు, గర్భిణీలు, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఇంట్లోనే ఉండాలని సూచన. ఆరోగ్య అవసరాలు, అత్యవసరం తప్పిస్తే ఇంటి నుండి బయటకు రావద్దు. 

ఆరోగ్య సేతు ఉపయోగం:

ఆరోగ్య సేతు మొబైల్ యాప్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూనే ఉండాలి.

 

*****



(Release ID: 1649690) Visitor Counter : 287