ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ చికిత్సలో మరో మైలు రాయి: 20 లక్షలు దాటిన కోలుకున్నవారి సంఖ్య

గత 24 గంటల్లో నమోదైన అత్యధికంగా కోలుకున్నవారి సంఖ్య 60,091

73% దాటి వేగంగా పెరుగుతున్న కోలుకున్నవారి శాతం

Posted On: 19 AUG 2020 11:24AM by PIB Hyderabad

మొత్తం పరీక్షల సంఖ్య మూడు కోట్లు దాటిన వెంటనే భారత్ మరో సరికొత్త రికార్డు సాధించింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులలో కోలుకున్నవారి సంఖ్య ఈ రోజు 20 లక్షలు  దాటింది. కచ్చితంగా చెప్పాలంటే 20,37,870 గా నమోదైంది.

దీంతోబాటే ఒకే రోజులో కోలుకున్నవారి సంఖ్య కూడా గరిష్ఠంగా గడిచిన 24 గంటల్లో  60,091 గా నమోదైంది. ఈ విధంగా ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ అయినవారు, స్వల్ప లక్షణాలతో ఉండి హోమ్ ఐసొలేషన్ లో ఉన్నవారు విముక్తి పొందటం పెద్ద సంఖ్యలో పెరుగుతూ ఉండటంతో కోలుకున్నవారి శాతం అత్యధికంగా 73%   ( కచ్చితంగా చెప్పాలంటే 73.64%) నమోదైంది.  దీనివలన పాజిటివ్ కేసులలో మరణాల శాతం కూడా తగ్గుముఖం పడుతూ నేడు అత్యల్పంగా 1.91%  గా నమోదైంది.

 


ఇలా రికార్డు స్థాయిలో కోలుకుంటున్నవారు పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వం మీద చికిత్సలో ఉన్నవారి భారం తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసులలో చికిత్సలో ఉన్నవారు పావుభాగం మాత్రమే ( 24.45%) . కోలుకున్నవారి శాతం పెరుగుతూ, మరణాల శాతం తగ్గుతూ రావటం భారతదేశం అనుసరిస్తున్న వ్యూహం సరైనదేనని చాటి చెబుతోంది. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య 6,76,514 కాగా ఇప్పటికే కోలుకున్నవారి సంఖ్య 13,61,356  గా ఉంది.

  2020 జనవరి ఆరంభం నుంచి భారత ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ముందస్తు జాగ్రత్తలతోబాటు క్రియాశీలంగా వ్యవహరిస్తూ వస్తోంది. దేశమమ్తటా చికిత్సకు కూడా తగిన వ్యూహం అవలంబిస్తూ వచ్చింది. ఏకమొత్తంగా తదేక దృష్టితో సమన్వయం చేసుకుంటూ చర్యలు ప్రారంభించింది. ఈ కారణంగానే ఆశించిన ఫలుతాలు కూడా సాధించగలిగింది.


నిరాటంకంగా జాగ్రత్తలు తీసుకుంటూ దూకుడుగా పరీక్షించు, సమగ్రంగా ఆనవాలు పట్టు, సమర్థవంతంగా చికిత్స అందించు అనే త్రిముఖ వ్యూహంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా బాసటగా నిలవటంతో కోవిడ్ మీద సమర్థవంతమైన పోరాటం సాధ్యమవుతూ వచ్చింది. నిఘా వ్యవస్థను బలోపేతం చేసి ఇంటింటికీ వెళ్ళి వ్యాధి సోకినవారిని ఆరా తీయటం ద్వారా తొలిదశలోనే బాధితులను గుర్తించటం. తీవ్రత ఆధారంగా ఆస్పత్రికి తరలించటమా, ఇళ్ళలోనే ఐసొలేషన్ లో ఉంచటమా అనేది నిర్ణయించటం సాధ్యమైంది. ప్రమాణాలకు అనుగుణంగా చికిత్స అందించటం, సరైన వైద్యం, పర్యవేక్షణ ద్వారా ఫలితాలు సాధించటం వీలైంది.

భారత ప్రభుత్వంతోబాటు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆస్పత్రులలో వసతులు పెంచటంతో వివిధ రకాల రోగస్థాయి ఆధారంగా వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయటం సాధ్యమైంది. పాజిటివ్ గా తేలినవారిని ప్రత్యేక కోవిడ్ రక్షణ కేంద్రాలకు, ప్రత్యేక కోవిడ్ ఆరోగ్య కేంద్రాలకు, ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులకు పంపించటం మొదలైంది.వాటి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈరోజు దేశంలో ప్రత్యేక కోవిడ్ రక్షణ కేంద్రాలు1667 ఉండగా, ప్రత్యేక కోవిడ్ ఆరోగ్య కేంద్రాలు 3455  ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులు 11,597  ఉన్నాయి. వీటన్నిటిలో మొత్తం 15,45,206 ఐసొలేషన్ పడకలు, 2,03,959 ఆక్సిజెన్ తో కూడిన పడకలు, 53,040 ఐసియు పడకలు ఉన్నాయి.

ప్రతి బాధితునికీ వైద్య చికిత్స అందించటం విజయవంతం కావటానికి సమర్థవంతమైన అంబులెన్స్ సేవలు కూడా పనిచేశాయి. ఎక్కడా ఏ బాధితుణ్ణీ వదలకుందా ఆస్పత్రులకు తరలించి సకాలంలో చికిత్స్ అందించటం, అవసరమైన చోట ఆక్సిజెన్ పరికరాల వాడకం, పరిశోధనలతో కూడిన థెరపీలు కూడా వాడటం జరిగింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని డాక్టర్ల సామర్థ్యం పెంచేవిధంగా ఎప్పటికప్పుడు టెలి మెడిసిన్ ద్వారా సూచనలు, సలహాలు, సంప్రదింపులకు అవకాశం కల్పించటంలో ఢిల్లీలోని ఎయిమ్స్ ఎంతగానో కృషి చేసింది. ఈ సరికొత్త సేవ ద్వారా ఎయిమ్స్ లోని స్పెషలిస్టులు మార్గదర్శనం చేస్తూ రాష్ట్రాలలోని ఆస్పత్రులలో పనిచేసే డాక్టర్లతో తమ అనుభవాన్ని పంచుకోగలిగారు. ఈ విధంగా మరణాల తగ్గుదలకు దోహదం చేశారు.

ఈ కృషికి తోడుగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని ఆశా కార్యకర్తల సేవలు కూడా ఎంతగానో ఉపయోగపడ్దాయి. పాజిటివ్ కేసుల ఆచూకీ తెలుసుకోవటంలోను, నిఘా పెంచటం ద్వారా వ్యాధి సోకిన వారిని సైతం గుర్తించటంలోనూ, వ్యాధుగ్రస్తులను రోజువారీగా పర్యవేక్షించటంలోను  ఆశా కార్యకర్తలు కీలకమైన పాత్ర పోషించారు. వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉన్నవారిని సకాలంలో ఆస్పత్రికి తరలించి వైద్యం అందేలా చూడటంలోనూ వాళ్ళదే ప్రధాన పాత్ర. ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహన పెంచి, వ్యాపించకుండా ముందు జాగ్రత్తలు తీసుకునేలా చేయటంలో కూడా ఆశా కార్యకర్తలు విశేష సేవలందించారు.


కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి


కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు


కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం చూడండి:  https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf

***



(Release ID: 1646906) Visitor Counter : 201