PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 06 AUG 2020 6:25PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • కోవిడ్‌ న‌య‌మైన‌వారి సంఖ్య 13.2 ల‌క్ష‌ల‌కుపైగానే; కోలుకునే సగటు 67.62 శాతంగా నమోదు.
  • దేశవ్యాప్తంగా కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడంతో 67.62 శాతానికి దూసుకెళ్లిన సగటు.
  • మ‌ర‌ణాల స‌గ‌టు మ‌రింత త‌గ్గి 2.07 శాతానికి ప‌త‌నం.
  • రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కోవిడ్‌-19 రెండోవిడత ఆర్థిక సాయం కింద రూ.890.32 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం.
  • కోవిడ్‌-19 నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు మరింత మద్దతు, ద్రవ్యలభ్యత దిశగా అదనపు ప్రగతి-నియంత్రణ విధాన చర్యలు ప్రకటించిన రిజర్వు బ్యాంకు.

కోవిడ్‌-19 న‌య‌మైన‌వారి సంఖ్య 13.2 ల‌క్ష‌ల‌కుపైగానే; కోలుకునేవారి శాతం 67.62కు పెరుగుద‌ల‌; మ‌ర‌ణాల స‌గ‌టు మ‌రింత త‌గ్గి 2.07 శాతానికి ప‌త‌నం

దేశంలో ఇప్పటిదాకా కోవిడ్‌-19 వ్యాధి నయమైనవారి సంఖ్య 13,28,336కు చేరింది. గత 24 గంటల్లో 46,121 మంది కోలుకున్నారు. వ్యాధి నయమయ్యేవారి సంఖ్య స్థిరంగా పెరుగుతుండటంతో ప్రస్తుత-కోలుకున్న కేసుల మధ్య అంతరం 7,32,835కు చేరడమేగాక కోలుకునేవారి సగటు 67.62 శాతంతో కొత్త రికార్డు నమోదు చేసింది. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులలో ప్రస్తుత క్రియాశీల కేసులు (5,95,501) 30.31 శాతంగా ఉన్నాయి. వీరంత ఆస్పత్రులలో లేదా ఏకాంత గృహవాసంలో చికిత్స పొందుతున్నారు.  ఇక మొత్తం కేసులలో 2020 జూలై 24నాటికి క్రియాశీల కేసులు 34.17 శాతం కాగా, గణనీయంగా తగ్గుతూ ఇవాళ 30.31 శాతానికి దిగివచ్చాయి. ఇక మరణాల సగటు ప్రపంచ నేపథ్యంతో పోలిస్తే క్రమంగా పడిపోతూ నేడు 2.07 శాతానికి పతనమైంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643730

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ సంచాలకుడు, దక్షిణాసియా ప్రాంత ఆరోగ్యశాఖ మంత్రులతో డాక్టర్ హర్షవర్ధన్‌ సంభాషణ

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆగ్నేయాసియా ప్రాంతీయ సంచాలకుడు డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్, ఈ ప్రాంత భాగస్వామ్య దేశాల ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వాస్తవిక సాదృశ సమావేశంలో పాల్గొన్నారు. కోవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో అవసరమైన ఆరోగ్య సేవలు-ప్రజారోగ్య కార్యక్రమాల నిర్వహణపై ఈ సందర్భంగా వారు దృష్టి సారించారు. కాగా, భారత్‌లో కోవిడ్‌-19 నిర్వహణ ప్రతిస్పందన చర్యల గురించి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. “భారత్‌లో బహుళ స్థాయి వ్యవస్థాగత క్రమబద్ధ, చురుకైన ప్రతిస్పందన కారణంగా అధిక జనసాంద్రత, తక్కువశాతం జీడీపీ వ్యయం, తలసరి డాక్టర్ల-ఆస్పత్రి పడకల లభ్యత వంటి పరిమితులు ఉన్నప్పటికీ ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ప్రతి 10 లక్షల జనాభాకు చాలా తక్కువ కేసులు-మరణాలు నమోదయ్యాయి” అని ” వివరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643754

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కోవిడ్‌-19 రెండోవిడత ఆర్థిక సాయం కింద రూ.890.32 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

దేశంలోని 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కోవిడ్‌-19 అత్యవసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత కోసం ప్రకటించిన ప్యాకేజీలో భాగంగా రెండోవిడత ఆర్థికసాయం కింద కేంద్ర ప్రభుత్వం రూ.890.32 కోట్లు విడుదల చేసింది. ఆయా రాష్ట్రాల్లో నమోదైన కేసుల సంఖ్య ఆధారంగా ఈ సహాయం అందుతుంది. ‘సంపూర్ణ ప్రభుత్వ బాధ్యత’ కింద రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో కోవిడ్‌ మహమ్మారి నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సాంకేతిక మరియు ఆర్థిక వనరుల తోడ్పాటుతో నాయకత్వం వహిస్తోంది. తదనుగుణంగా ప్రధానమంత్రి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. ఇందులో తొలివిడత నిధులతో పరీక్షల, ఆస్పత్రుల మౌలిక వసతులను పెంచడానికి, రోజువారీ అత్యవసర కార్యకలాపాల నిర్వహణకు, అవసరమైన పరికరాలు-మందులు, ఇతర సామగ్రి సమకూర్చుకోవడానికి వీలుగా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రభుత్వాలకు కేంద్రం రూ.3,000 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా 5,80,342 ఏకాంత చికిత్స పడకలు, 1,36,068 ప్రాణవాయు మద్దతుగల, 31,255 ఐసీయూ పడకలతో సదుపాయాలు బలోపేతం చేయబడ్డాయి. అంతేకాకుండా 86,88,357 పరీక్ష కిట్లు, 79,88,366 వయల్‌ రవాణా మాధ్యమాలను (VTM) కొనుగోలు చేశారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643694

గృహనిర్మాణ, గ్రామీణ, ప్రాధాన్యరంగాలకు రిజర్వు బ్యాంకు ఆర్థిక మద్దతు

జాతీయంగా, అంతర్జాతీయంగా కోవిడ్‌-19 విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ద్రవ్యలభ్యత మెరుగుతోపాటు ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిచ్చే విధంగా రిజర్వు బ్యాంకు ఇవాళ అదనపు ప్రగతి-నియంత్రణ విధాన చర్యలను ప్రకటించింది. ఈ మేరకు కేంద్రబ్యాంకు గవర్నర్‌ శ్రీ శక్తికాంత దాస్ వివరాలు వెల్లడించారు. “గడచిన వందేళ్లలో శాంతి సమయాన తలెత్తిన ఈ అత్యంత తీవ్ర ఆర్థిక-ఆరోగ్య సంక్షోభం” సృష్టించిన అవరోధాల కారణంగా ఏర్పడే ఆర్థిక ఒత్తిడిని ఈ చర్యలు తగ్గిస్తాయన్నారు. ప్రకటనల సారాంశం ఇలా ఉంది... సాధారణ పౌరులపై కోవిడ్‌ ప్రభావం తగ్గించడం కోసం బంగారం-ఆభరణాలపై వ్యవసాయేతర అవసరాల కోసం వాటి విలువపై 90 శాతందాకా రుణాలను  అనుమతించాలని నిర్ణయించింది. ఈ తరహా రుణాలపై 75 శాతం నుంచి 90 శాతానికి పెంచిన రుణమంజూరు పరిమితి 2021 మార్చి 31దాకా అమలులో ఉంటుంది. ఇక గృహనిర్మాణ రంగానికి నిధుల ప్రవాహం మెరుగు దిశగా జాతీయ గృహనిర్మాణ బ్యాంకుకు రూ.5,000 కోట్ల ప్రత్యేక ద్రవ్యత్వ సౌకర్యం కల్పించింది. మరోవైపు బ్యాంకింగేతర, సూక్ష్మ ఆర్థిక సహాయ సంస్థలకు నిధుల లభ్యత మెరుగు కోసం నాబార్డు (NABARD)కు రూ.5,000 కోట్ల నిధిని కేటాయించింది. రుణ స్వీకార సంస్థలపై అప్పుల భారం తగ్గించేందుకు అర్హతగల కార్పొరేట్ అప్పులతోపాటు వ్యక్తిగత రుణాల పరిష్కార ప్రణాళిక అమలుకు రుణదాతలను అనుమతించాలని నిర్ణయించింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643736

కరోనా యోధుల కోసం ‘ఈఎన్‌సీ’ బ్యాండ్‌ ప్రత్యక్ష ప్రదర్శన

భార‌త 74వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో తూర్పు నావికాదళ కమాండ్‌ బ్యాండ్‌ బృందం విశాఖపట్నంలోని సంకారంలోని బొజ్జనకొండ వారసత్వ ప్రాంతంలో 2020 ఆగస్టు 5న ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చింది. దాదాపు గంటపాటు మార్షల్, ఇంగ్లీష్ పాప్-మ్యూజిక్ నుంచి దేశభక్తి గీతాలదాకా అందర్నీ కదిలించే రీతిలో ఈ సంగీత విభావరి సాగింది. దూరదర్శన్‌ హైదరాబాద్‌, సప్తగిరి, యాదగిరిలలో చానెళ్లలో ఈ ప్రదర్శన ప్రత్యక్ష ప్రసారమైంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643685

గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్ కింద 6వారాల్లో 17 కోట్ల పనిదినాలతో వలస కార్మికులకు రూ.13,240 కోట్లు చెల్లింపు

కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో గ్రామాలకు తిరిగివచ్చిన వలస కార్మికులతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావిత పేదలకు ఉపాధి, జీవనోపాధి కల్పనలో భాగంగా గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ యోజన (GKRA) ప్రారంభమైంది. దీనికింద ప్రస్తుతం ఆరు రాష్ట్రాలు... బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌ల పరిధిలోని 116 జిల్లాల్లో గ్రామస్థులకు జీవనోపాధి కల్పన కోసం ప్రభుత్వం ఉద్యమ తరహాలో చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇది ఆరో వారంలో ప్రవేశించగా, ఇప్పటికే లక్ష్యసాధన దిశగా పురోగమిస్తోంది. తదనుగుణంగా 17 కోట్ల పనిదినాలు కల్పించగా రూ.13,240 కోట్లు చెల్లించబడ్డాయి. ఈ పనుల్లో భాగంగా 62,532 జల సంరక్షణ పనులు, 1.74 లక్షల గ్రామీణ గృహాలు, 14,872 పశువుల షెడ్లు, 8,963 వ్యవసాయ చెరువులు, 2,222 సామాజిక పారిశుధ్య ప్రాంగణాలు నిర్మాణంతోపాటు జిల్లా ఖనిజ నిధిద్వారా మరో 5,909 పనులు నిర్వహించారు. మరోవైపు 564 పంచాయతీలకు ఇంటర్నెట్ సంధానం, 16,124 మంది అభ్యర్థులకు రైతు విజ్ఞాన కేంద్రా(KVK)ల ద్వారా నైపుణ్య శిక్షణ ఇచ్చారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643632

‘కోవిడ్-19- మహమ్మారి వేళ సుపరిపాలన పద్ధతులు’పై  ఐటిఈసీ-ఎన్‌సీజీజీ అంతర్జాతీయ వర్క్‌ షాప్‌ను ప్రారంభించిన డాక్టర్ జితేంద్ర సింగ్

కోవిడ్‌ మహమ్మారి నిర్వహణలో అంతర్జాతీయ సహకారంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నేతృత్వంలో భారతదేశం నాంది పలికిందని కేంద్ర సిబ్బంది-పిజి-పెన్షన్లశాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తుచేశారు. గడచిన ఆరేళ్లలో విదేశాలతో సాన్నిహిత్యం సాధించడంలో శ్రీ మోదీ అనుసరిస్తున్న అసాధారణ విధానాలే మహమ్మారిపై పోరుకు అంతర్జాతీయ సంకీర్ణం ఏర్పడటంలో దోహదపడ్డాయని ఆయన అన్నారు. “కోవిడ్-19- మహమ్మారి వేళ సుపరిపాలన పద్ధతులు”పై  ఐటిఈసీ-ఎన్‌సీజీజీ అంతర్జాతీయ వర్క్‌ షాప్‌ను ప్రారంభించిన అనంతరం డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643811

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • పంజాబ్: రాష్ట్రంలో ‘మిషన్ ఫతే’ కింద కోవిడ్‌-19పై పోరులో భాగంగా పంజాబ్‌ ఐటీఐ విద్యార్థులు 17 లక్షల మాస్కులు తయారుచేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఏ ఇతర సాంకేతిక విద్యాసంస్థ కూడా ఈ రికార్డుకు చేరువగా రాకపోవడం విశేషం.
  • హర్యానా: కోవిడ్‌-19 నేపథ్యంలో విద్యార్థులకు ఆర్థిక ఒత్తిడినుంచి ఉపశమనం దిశగా J.C.బోస్ శాస్త్ర-సాంకేతిక విశ్వవిద్యాలయం, ఫరీదాబాద్‌కు చెందిన వైఎంసీఏ (YMCA) తమ నిబద్ధతను నిరూపించుకున్నాయి. ఈ మేరకు ఆర్థికంగా వెనుబడిన వర్గాలతోపాటు ఆపన్నులైన విద్యార్థులకు మద్దతిచ్చే ఒక విధానాన్ని రూపొందించి అమలుచేసింది. ఇందులో భాగా వారు చెల్లించాల్సిన ట్యూషన్‌ ఫీజు 100 శాతాన్ని వదులుకోవడం, ఇప్పటికే చెల్లించినవారికి వాపసు ఇవ్వడమేగాక కుటుంబంలో ఆర్థిక సంక్షోభంవల్ల రుసుములు లేదా బకాయిలు చెల్లించలేని విద్యార్థులు ఈ సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానించడం విశేషం.
  • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్ -19 రోగులతో వ్యవహరించడంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మెడికల్ కాలేజీ తాండా, కాంగ్రా కొన్ని నెలలుగా మెరుగైన పనితీరు కనబరిచాయని గవర్నర్ ప్రశంసించారు. ఆస్పత్రిని కోవిడ్‌ ప్రత్యేక చికిత్స కేంద్రంగా ప్రకటించనప్పటికీ పరిస్థితిని ఎదుర్కోవటానికి అధికారులు అన్ని ప్రయత్నాలు చేశారు. ఆ మేరకు ప్రారంభంలో ఇక్కడ రోజుకు 107 పరీక్షల సామర్థ్యం ఉండగా, ఇవాళ 700కిపైగా నమూనాలను పరీక్షిస్తుండటం ఇందుకు నిదర్శనమన్నారు. ఈ సదుపాయాన్ని మరింత పెంచాలని ఆయన సూచించారు. ఇక రక్తదాన శిబిరాలను నిర్వహణ కోసం రక్తదాతలను ప్రోత్సహించాలని, ఇతర స్వచ్చంద బృందాలతో సమన్వయం చేసుకోవాలని ఆయన ఆదేశించారు.
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రానికి తిరిగివచ్చేవారు గృహనిర్బంధ వైద్య పర్యవేక్షణ కోరేట్లయితే ముందుగా  dmoiccitanagar[at]gmail[dot]comలో నిర్దేశిత పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
  • మణిపూర్: రాష్ట్రంలోని కోవిడ్‌-19పై తౌబల్, కాచింగ్ జిల్లాల ఇన్‌చార్జి మంత్రి డాక్టర్ తోక్‌చోమ్‌ రాధేశ్యామ్‌ జిల్లాలో మహమ్మారి నియంత్రణ చర్యలపై జిల్లా పాలన యంత్రాంగంతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు.
  • మిజోరం: రాష్ట్ర ఎన్నికల సంఘం మిజోరంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీచేసింది. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 27 న పోలింగ్ జరుగుతుంది.
  • నాగాలాండ్: రాష్ట్రంలో  82 కొత్త కేసులు నిర్ధారణ కాగా, పరీక్షించిన 606 నమూనాలకుగాను దిమాపూర్‌లో 58, కోహిమాలో 22, ఫేక్ నుంచి 2 వంతున నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 2580 క్రియాశీల కేసులున్నాయి.
  • కేరళ: రాష్ట్ర రాజధాని తిరువనంతపురం తీరప్రాంతాల్లో కోవిడ్-19 కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి, ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం వరకు నిర్వహించిన ర్యాపిడ్‌ యాంటిజెన్ పరీక్షల్లో 104మందికి వ్యాధి నిర్ధారణ అయింది. కోవిడ్‌ సంక్రమణ నిరోధం దిశగా షాపులు, మాల్స్, బ్యాంకులలో కొన్ని ఆంక్షలు విధిస్తూ పోలీసుశాఖ కొత్త సర్క్యులర్ జారీచేసింది. రాష్ట్రంలో కొన్నిచోట్ల కురుస్తున్న భారీవర్షాలతో కోవిడ్‌ ఉపశమన, పునరావాస కార్యకలాపాలకు సవాలుగా మారాయి. కేరళలో నిన్న 1,195 కొత్త కేసులు నమోదవగా, 1,234మంది కోలుకున్నారు. ప్రస్తుతం 11,492 మంది చికిత్స పొందుతుండగా వివిధ జిల్లాల్లో 1,47,974 మంది పరిశీలనలో ఉన్నారు.
  • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 195 తాజా కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 4621కు పెరిగింది. ఇందులో ప్రస్తుతం 1743 క్రియాశీల కేసులు కాగా, ఇప్పటివరకూ 70 మంది మరణించారు. ఇక తమిళనాడులో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామితో బుధవారంనాటి సమావేశంలో పాల్గొనాల్సినవారిలో 30మందికిపైగా కోవిడ్‌ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో నిన్న 5,175 కొత్త కేసులు నమోదవగా అత్యధికంగా 112 మరణాలు ఒకేరోజు నమోదవడం గమనార్హం. కాగా, ప్రస్తుతం 54,184 క్రియాశీల కేసులుండగా ఇప్పటిదాకా మరణించినవారి సంఖ్య 4461కి చేరింది.
  • కర్ణాటక: రాష్ట్రంలో భారీవర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి బి.ఎస్.యెడియూరప్ప జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులను ఆదేశించారు. ఆ మేరకు తమ నియోజకవర్గాల్లో నే ఉండి, దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటిస్తూ, సహాయ-పునరావాస చర్యలు పటిష్ఠంగా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిన్న 5619 కొత్త కేసులు, 100 మరణాలు నమోదవగా 5407 మంది కోలుకున్నారు. ప్రస్తుతం మొత్తం కేసులు: 1,51,449; యాక్టివ్‌ కేసులు: 73,958; మరణాలు: 2804గా ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్ నిర్వహణకు ప్రభుత్వం నెలకు రూ.350 కోట్లు ఖర్చుచేస్తున్నదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. దేశంలో కనీవినీ ఎరుగని స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నదని ఆయన చెప్పారు. మారుమూల ప్రాంతాల నుంచి కూడా నమూనాల సేకరణకు సంజీవని బస్సులను ప్రవేశపెట్టామన్నారు. కోవిడ్ చికిత్స కోసం హైదరాబాద్ వెళ్తున్న అధికార పార్టీ నాయకులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముఖ్యమంత్రి లేఖ రాశారు; ఇలాంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్‌లో చికిత్స పొందుతున్న సామాన్య ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిన్న 10,128 కొత్త కేసులు, 77 మరణాలు నమోదవగా 8729 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం కేసులు: 1,86,461; క్రియాశీల కేసులు: 80,426; మరణాలు: 1681గా ఉన్నాయి.
  • తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని జ్వరాల క్లినిక్‌లలోగల అవుట్‌ పేషెంట్‌ సదుపాయాలలో పరీక్షల ద్వారా కోవిడ్‌ నిర్ధారణ అయిన వ్యక్తులకు వైద్య సంప్రదింపుల అవసరంపై రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు ప్రాధాన్యమిస్తున్నారు. తెలంగాణలో గత 24 గంటల్లో 2092 కొత్త కేసులు, 13 మరణాలు నమోదవగా 1289 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 535 జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. మొత్తం కేసులు: 73,050; క్రియాశీల కేసులు: 20,358; మరణాలు: 589; డిశ్చార్జి అయినవి: 52,103గా ఉన్నాయి. ఇక కేసులలో మరణాల సగటు ఆగస్టు 3న 0.81 శాతం నుంచి కొద్దిగా తగ్గి 0.80గా నమోదైంది. ఇది జాతీయ సగటు 2.09శాతం కన్నా తక్కువ.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలోని పుణె జిల్లా బుధవారం లక్ష కేసుల స్థాయిని అధిగమించింది. 101,262కు చేరింది. ఇక 99,563 కేసులతో థానె తర్వాతి స్థానంలో ఉంది. కాగా, లక్షకుపైగా కోవిడ్ కేసులు నమోదైన ఢిల్లీ, ముంబై, చెన్నైల జాబితాలో ఇప్పుడు పుణె చేరింది. కాగా, ప్రస్తుతం మహారాష్ట్రలో 1.45 లక్షల క్రియాశీల కేసులున్నాయి.
  • గుజరాత్: అహ్మదాబాద్‌లోని కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 8 మంది మరణించారు. మిగిలినవారు నవరంగపురలోని శ్రేయ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మరో 40 మంది రోగులను సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు.
  • రాజస్థాన్: కోలుకునేవారి సంఖ్య రీత్యా జాతీయస్థాయిలో అగ్రస్థానంలోగల రాజస్థాన్, ఇటీవల కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో కేసులరీత్యా జాబితాలో పైకి వెళ్తోంది. కాగా, రాష్ట్రంలో తొలి 13,000 కేసులు 108 రోజులు పట్టగా, ఇది కేవలం 12 రోజుల్లో రెట్టింపు కావడం గమనార్హం. గత 24 గంటల్లో రాజస్థాన్‌లో 593 కొత్త కేసులు నమోదవగా, క్రియాశీల కేసుల సంఖ్య 13,630గా ఉంది.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో బుధవారం 652 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 35,734కు చేరాయి. కాగా, ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్ కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే, ఆయన 7 రోజులపాటు ఏకాంత గృహవాసం చేయాలని ఆస్ప్రతి అధికారులు సూచించారు.
  • గోవా: గోవాకు వచ్చే పర్యాటకుల కోసం భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ తాజా మార్గదర్శకాలు జారీచేసింది. దీని ప్రకారం... వారు 14 రోజుల నిర్బంధవైద్య పరిశీలనలో ఉండాల్సి ఉంటుంది. అయితే, ఎవరైనా ఐసీఎంఆర్ గుర్తింపు పొందిన ప్రయోగశాల నుంచి 48 గంటల వ్యవధిలో పొందిన కోవిడ్‌ నెగటివ్‌ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పిస్తే ఈ నిబంధన నుంచి మినహాయింపు లభిస్తుందని పేర్కొంది.

***



(Release ID: 1643911) Visitor Counter : 210