ఆయుష్

జాతీయ ఔషధ మొక్కల బోర్డు, ఐసీఏఆర్‌-నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్‌ రిసోర్సెస్‌ మధ్య అవగాహన ఒప్పందం


సామాజిక, ఆర్థిక భద్రత కోసం.., దీర్ఘకాలంపాటు, సురక్షితంగా, తక్కువ ఖర్చుతో జీవద్రవ్యాన్ని పరిరక్షించడానికి మంత్రిత్వ శాఖల సహకారం

Posted On: 07 JUL 2020 2:43PM by PIB Hyderabad

ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ ఔషధ మొక్కల బోర్డు (ఎన్‌ఎంపీబీ), వ్యవసాయ పరిశోధన, విజ్ఞాన విభాగం ఆధ్వర్యంలోని ఐసీఏఆర్‌-నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్‌ రిసోర్సెస్‌ (ఎన్‌బీపీజీఆర్‌) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఔషధ, సుగంధ మొక్కల జన్యు వనరులను (ఎంఏపీజీఆర్‌) పరిరక్షించడం ఈ ఎంవోయూ ఉద్దేశం. నేషనల్ జీన్ బ్యాంకులోని దీర్ఘకాలిక నిల్వ మాడ్యూల్‌లోని ఐసీఏఆర్‌-ఎన్‌బీపీజీఆర్‌ నిర్ధేశిత స్థలంలో లేదా, ప్రాంతీయ కేంద్రంలోని మాధ్యమిక నిల్వ కేంద్రంలో వీటిని ఉంచి, మొక్కల జీవద్రవ్యం పరిరక్షణ పద్ధతులపై ఎన్‌ఎంపీబీ కార్యాచరణ బృందానికి శిక్షణ ఇవ్వడం కూడా ఒప్పందంలో భాగం.

                ప్రస్తుత, భవిష్యత్‌ తరాల సామాజిక, ఆర్థిక భద్రత కోసం మొక్కల జీవద్రవ్యాన్ని దీర్ఘకాలంపాటు సురక్షితంగా, తక్కువ ఖర్చుతో పరిరక్షించడం ద్వారా దేశానికి సేవ చేసేందుకు ఎన్‌ఎంపీబీ, ఐసీఏఆర్‌-ఎన్‌బీపీజీఆర్‌ కట్టుబడి ఉన్నాయి. ఐసీఏఆర్‌ తరపున, ఎంఏపీజీఆర్‌ల విత్తన నిల్వకు, వివరణాత్మక విధానాలను ఎన్‌ఎంపీబీ, ఐసీఏఆర్‌-ఎన్‌బీపీజీఆర్‌ అభివృద్ధి చేస్తాయి. ఆ నివేదికలను ఆయా సంస్థలకు క్రమం తప్పకుండా పంపుతాయి.

                సంప్రదాయ ఔషధాల గొప్ప వనరులుగా ఔషధ మొక్కలను పరిగణిస్తున్నారు. వైద్య వ్యవస్థలో వీటిని వేలాది సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో వైవిధ్యమైన ఔషధ మొక్కల వనరులున్నాయి. అవి పెరిగే ప్రాంతాల్లో జనావాసాలు పెరగడం వల్ల క్రమంగా అంతరించిపోతున్నాయి. వాటిని పరిరక్షించి, సమర్థంగా ఉపయోగించుకోవలసిన అవసరం ఉంది. జీవ వైవిధ్య పరిరక్షణలో ఈ మొక్కల పరిరక్షణ ఒక భాగం. వివిధ రకాల జన్యువులు, జాతులు, వాటి ఆవాసాలు, జీవావరణ వ్యవస్థలను నాశనం చేయకుండా రక్షించడం, ఉపయోగించడం ద్వారా స్థిరంగా వాటిని అభివృద్ధి చేయడం ఈ పరిరక్షణ ఉద్దేశం.

******



(Release ID: 1637056) Visitor Counter : 253