ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 తాజా సమాచారం


60% దాటిన కోలుకున్నవారి శాతం

కోలుకున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుదల: గత 24 గంటల్లో కోలుకున్నవారు 20,033 మంది

చికిత్సలో ఉన్నవారికంటే కోలుకున్నవారు1.5 లక్షల కంటే ఎక్కువే

పరీక్షించు, ఆనవాళ్ళు పట్టు, చికిత్స చెయ్యి అనే త్రిముఖ వ్యూహంలో భాగంగా 24 గంటల్లో 2.4 లక్షలు పైబడ్డ పరీక్షలు

Posted On: 03 JUL 2020 4:34PM by PIB Hyderabad

కోవిడ్ సన్నద్ధత మీద ఈరోజు కేంద్ర కాబినెట్ సెక్రటరీ వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్ బాధితులలో కోలుకున్న వారి శాతం 60% దాటింది. ఈరోజుకు 60.73% చేరింది.

త్వరగా గుర్తించటం, సకాలంలో చికిత్స అందించటం కారణంగా రోజూ కోలుకున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. గడిచిన 24గంటల్లో ఈ సంఖ్య బాదా పెరిగింది. 20,033 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,79,891 కి చేరింది.

ప్రస్తుతం ఇంకా 2,27,439 మంది బాధితులు ఉండగా వారందరికీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది.

భారత ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు, సానుకూల చర్యలు తగిన ఫలితాలు ఇస్తున్నాయి. దీనివలన చికిత్స పొందుతున్నవారికి, కోలుకున్నవారికి మధ్య అంతరం బాగా పెరుగుతోంది. ఈరోజు వరకు కోలుకున్నవారు చికిత్సలో ఉన్నవారి కంటే  1,52,452 మంది  ఎక్కువగా ఉన్నారు.

పరీక్షించు, ఆనవాళ్ళు పట్టు, చికిత్స చెయ్యి అనే త్రిముఖ వ్యూహంలో భాగంగా అనేక చర్యలు తీసుకుంటున్నారు. కోవిడ్ పరీక్షల విషయంలో అన్ని రకాల అవరోధాలనూ కేంద్రం తొలగించటంతో రాష్ట్రాల్లోను, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ పరీక్షల సంఖ్య బాగా పెరిగింది. ఈరోజు వరకు 93 లక్షల శాంపిల్స్ పరీక్షించారు. గత 24గంటల్లోనే 2,41,576 శాంపిల్స్ పరీక్షించారు. దీంతో ఇప్పటివరకు జరిపిన మొత్తం పరీక్షల సంఖ్య ఈరోజుకు 92,97,749 కి చేరింది.

 దేశ వ్యాప్తంగా కోవిడ్ పరీక్షల లాబ్ ల్ నెట్ వర్క్ ను విస్తృతం చేసేందుకు భారత వైద్య పరిశోధనామండలి(ఐసీఎం ఆర్) చర్యలు తీసుకుంటున్నది.  ఇప్పుడు భారత్ లో మొత్తం లాబ్ ల సంఖ్య 1074 కు చేరింది. వీటిలో  775 ప్రభుత్వ లాబ్ లు,  299 ప్రయివేట్ లాబ్ లు. ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది.

 

  • తక్షణం ఫలితాలు చూపే పరీక్షల లాబ్స్ : 579(ప్రభుత్వ: 366  + ప్రైవేట్:  213)
  • ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 405 (ప్రభుత్వ: 376   + ప్రైవేట్: 29)
  • సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 90 (ప్రభుత్వ: 33+ ప్రైవేట్: 57)


అతి తక్కువ, నామమాత్రపు లక్షణాలున్న వారికి ఇంట్లోనే ఐసొలేషన్ లో ఉండటానికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. మే 10 న జారీచేసిన మార్గదర్శకాల స్థానంలో ఇవి అమలులోకి వస్తాయి. మార్చిన మార్గదర్శకాలను ఇక్కడ చూడవచ్చు. https://www.mohfw.gov.in/pdf/RevisedHomeIsolationGuidelines.pdf

కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా  https://www.mohfw.gov.in/  మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి.


కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.


కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf  చూడండి

 

******

 



(Release ID: 1636207) Visitor Counter : 187