కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

గ‌డిచిన‌ రెండు ఆర్థిక సంవ‌త్స‌రాల‌లో ఈపీఎఫ్ఓ భ‌ద్రత‌‌ కింద‌కు కొత్త‌గా 1.39 కోట్ల మంది

Posted On: 22 JUN 2020 4:13PM by PIB Hyderabad

ఉద్యోగుల భ‌విష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ఇటీవ‌ల ప్ర‌చురించిన తాత్కాలిక పేరోల్ డేటా ప‌లు ఆసక్తిక‌ర‌మైన అంశాల‌ను వెలుగులోకి తెచ్చింది. ఈ డేటా మేర‌కు గ‌డిచిన రెండేండ్ల కాలంలో గతంలో ఎన్న‌డూ లేని విధంగా ఈపీఎఫ్ఓ చందాదారుల సంఖ్య పెరిగింది. 2017 సెప్టెంబ‌రు నుంచి స‌మాచారాన్ని విశ్లేషించి చూస్తే చందాదారుల సంఖ్య మెరుగ్గా న‌మోదు అయింది. ఈపీఎఫ్ఓ విడుదల చేసిన ఈ పేరోల్ డేటా 2018-19 మరియు 2019-20 సంవత్సరానికి సంబంధించిన ఏకీకృత వార్షిక గణాంకాలను వెలువ‌రించింది. 2018 - 19 సంవ‌త్స‌రంలో చందాదారుల సంఖ్యకు నికరంగా 61.12 లక్షల మంది కొత్త చందాదారులు చేరారు. 2019-20లో ఈ సంఖ్య 28 శాతం వృద్ధితో 78.58 లక్షలకు పెరిగింది. ఈపీఎఫ్ఓలో కొత్త‌గా చేరిన చందాదారులు మ‌రియు వారు చెల్లించిన చందా ఆధారంగా ఈ స‌మాచారాన్ని ప్ర‌చురించారు.


మంచి రాబ‌డి కార‌ణంగా త‌గ్గిన నిష్క్రమ‌ణ‌లు ఇప్ప‌టికే చందాదారులైన సభ్యులు త‌క్కువ మొత్తంలో ఈపీఎఫ్ఓ స‌భ్య‌త్వాన్ని వ‌దులుకోవ‌డంతో పాటుగా వివిధ కార‌ణాల వ‌ల్ల నిష్క్రమించిన సభ్యులచే తిరిగి సంస్థ‌లో చేరడం వ‌ల్ల చందాదారుల సంఖ్య పెరిగింది. ఇతర సామాజిక భద్రతా సాధనాలు మరియు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పోలిస్తే 2019-20 సంవత్సరానికి అత్య‌ధికంగా 8.5 శాతం మేర పన్ను రహిత రాబడి ఈపీఎఫ్ఓలో ల‌భించ‌డం, మునుపటి సంవత్సరంతో పోలిస్తే 2019-20 సంవత్సరానికి దాని నిష్క్రమణలు దాదాపు 10 శాతం తగ్గ‌డం కూడా ఈపీఎఫ్ఓ స‌భ్య‌త్వం నుంచి ఎక్కువ సంఖ్య‌లో స‌భ్యులు వైద‌ల‌గ‌కుండా ఉండేందుకు దోహ‌దం చేసింది. అంతేకాకుండా, నిష్క్రమించిన సభ్యులు తిరిగి చేరడం 2018-19లో 43.78 లక్షల మేర‌ ఉండ‌గా ఇది సుమారు 75 శాతం పెరుగుదలతో 2019-20 సంవ‌త్స‌రానికి 78.15 లక్షలకు చేరింది.


ఆక‌ట్టుకున్న ఆటో-ట్రాన్స్‌ఫర్ సౌకర్యం ఉద్యోగం మారిన‌ప్ప‌టికీ పాత ఖాతా నుండి కొత్త ఖాతాకు పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఇబ్బంది లేకుండా బదిలీ చేసే ఆటో-ట్రాన్స్‌ఫర్ సౌకర్యం స‌భ్యులు త‌మ సభ్యత్వం కొనసాగించడాన్ని నిర్ధారించడంలో చాలా సంద‌ర్భాల్లో ప్ర‌ధాన‌ పాత్ర పోషించింది. 2019-20 మధ్య వయస్సుల‌ వారీగా విశ్లేషణ చేసి చూస్తే 26-28, 29-35 మరియు 35 దాటిన వారి నికర నమోదు మునుపటి సంవత్సరంతో పోలిస్తే 50 శాతం కంటే ఎక్కువగా పెర‌గ‌డం విశేషం. ఆన్‌లైన్ మోడ్ సేవ‌ల‌ డెలివరీ నాణ్యతలో వేగ‌వంత‌మైన‌ మెరుగుదల దేశంలోని శ్రామికశక్తిని ఈపీఎఫ్ఓ సేవల వైపు చూసేలా ఆకర్షించింది. అంతే కాకుండా, పీఎఫ్‌లో చేరడం.. ఇక్క‌డ చందా క‌ట్టిన పైస‌లు ఇకపై లాక్-ఇన్ డబ్బుగా చూడన‌క్క‌ర్లేదు అనే భావన‌ ప్ర‌జ‌ల్లో మ‌రింత విశ్వాసాన్ని నింపింది. ఈపీఎఫ్ఓ సంస్థ కోవిడ్‌-19 నేప‌థ్యంలో అడ్వాన్స్ చెల్లింపుల‌ను మూడు రోజుల్లో పరిష్కరించ‌డంతో, పీఎఫ్‌లో చేరడం ఇప్పుడు పీఎఫ్‌ను ద్ర‌వ ఆస్తిగా చూడవచ్చున‌నే భావ‌న‌ను పెంపొందిస్తోంది. సంక్షోభ సమయంలో చందాదారుల అవసరాల్ని ఈపీఎఫ్ఓ సంస్థ స‌కాలంలో తీర్చగలవు అనే న‌మ్మ‌కం చందాదారుల్లో పెరిగింది. అదేవిధంగా, నిరుద్యోగం, వివాహ వ్యయం, ఉన్నత విద్య, గృహ నిర్మాణం మరియు వైద్య చికిత్స విషయంలోనూ పీఎఫ్ అడ్వాన్స్ పొందే సౌక‌ర్యాన్ని స‌ర్కారు క‌లిపించింది.


శ్రామిక శ‌క్తిలో పెరిగిన మ‌హిళ‌ల భాగ‌స్వామ్యం మునుపటి సంవత్సరాలతో పోలిస్తే 2019-20 సంవ‌త్స‌రంలో మహిళా కార్మికుల నమోదు 22  శాతం పెరిగింది. శ్రామిక శ‌క్తిలో మ‌హిళ‌ల భాగ‌స్వామ్యం పెరుగుద‌ల‌ను ఇది సూచిస్తోంది. 2018-19 మరియు 2019-20 సంవత్సరాల్లో మొత్తం 1.13 లక్షల కొత్త సంస్థలు మొదటి సారిగా ఈపీఎఫ్ఓ ప‌రిధిలోనికి అడుగుపెట్టిన‌ట్టుగా తాజా డేటా సూచిస్తుంది. చేరిక ప్ర్ర‌క్రియ సరళీకరణ.. పోర్టల్ ద్వారా ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ (ఈసీఆర్) ఆన్‌లైన్‌లో దాఖలు.. స్వ‌చ్ఛంద కాంప్లియెన్స్ సదుపాయాలు ఆయా సంస్థలు పీఎఫ్ కోడ్‌ను సులభంగా పొందటానికి వీలు కల్పిస్తోంది. పరిశ్రమల వర్గం వారీగా విశ్లేషణలు చేస్తే ఆసుప‌త్రులు మ‌రియు ఫైనాన్సింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ 50 శాతం కంటే ఎక్కువ వృద్ధిని క‌న‌బ‌రిచాయి, అయితే ట్రేడింగ్ & కమర్షియల్ సంస్థలు, వస్త్రాలు మరియు క్లీనింగ్‌ మరియు స్వీపింగ్ సేవలను అందించే సంస్థల‌ నికర నమోదు దాదాపు 20 శాతం కంటే ఎక్కువగా ఉన్నాయి. 2019-20 ఎకనామిక్ సర్వే ద్వారా ధ్రువీకరించబడిన విధంగా భారతీయ ఉపాధి మార్కెట్ నందు ఎక్కువ ఉద్యోగాల క్ర‌మ‌బద్ధీక‌ర‌ణ‌ జరుగుతోందనేందుకు ఇది ఒక సూచికగా నిలుస్తోంది‌.

 

******



(Release ID: 1633402) Visitor Counter : 235