ఆయుష్

"నా జీవితం నా యోగ " వీడియో బ్లాగ్ పోటీని 'మన్ కీ బాత్'లో ప్రకటించిన ప్రధాని

Posted On: 31 MAY 2020 5:46PM by PIB Hyderabad

భారత ప్రధాని  నరేంద్ర మోడీ  ఆదివారం జాతి నుద్దేశించి నెల నెలా ప్రసారమయ్యే  'మన్  కీ బాత్'  కార్యక్రమంలో ప్రసంగించారు. ప్రసంగవశాత్తు  కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ, భారత సాంస్కృతిక సంబంధాల మండలి (ఐ సి సి ఆర్)  సంయుక్తంగా "నా జీవితం నా యోగ " (జీవన యోగ అని కూడా చెప్పవచ్చు)  అనే అంశంపై నిర్వహించే వీడియో బ్లాగ్ పోటీని గురించి  ప్రధానమంత్రి ప్రకటన చేశారు. ప్రతి ఒక్కరూ ఈ పోటీలో పాల్గొనాలని ఆయన పిలుపు ఇచ్చారు. వ్యక్తుల జీవితాల్లో యోగ ఎలాంటి పరివర్తన తెస్తుందనే విషయంపై ఈ పోటీ కేంద్రీకృతమవుతుంది.     2020 జూన్ 21న జరిగే ఆరవ అంతర్జాతీయ యోగ దినోత్సవ (ఐ డి వై) కార్యక్రమాల్లో భాగంగా ఈ పోటీని నిర్వహిస్తున్నారు.   ఈ పోటీని గురించి   ఆయుష్ మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాల్లో ఈ రోజు, 2020 మే 31వ తేదీ నుంచి పోటీని గురించి ప్రచారం చేస్తున్నారు.  

గడచిన సంవత్సరాలలో ఐ డి వై  సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో అధిక సంఖ్యలో ఒకేచోట చేరి యోగ ప్రదర్శనలు నిర్వహించేవారు.   అయితే  కోవిడ్ -19 అంటువ్యాధి కారణంగా ఈ సంవత్సరం జన సమూహం ఒకేచోట చేరి ప్రదర్శనలు నిర్వహించడం యుక్తమైన పని కాదు.  అందువల్ల మంత్రిత్వ శాఖ ఈ ఏడాది ప్రజలు తమ కుటుంబ సభ్యులు అందరితో  కలసి ఇంటిలోనే యోగా అభ్యసించాలని మంత్రిత్వ శాఖ ప్రోత్సహిస్తోంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు ఐ సి సి ఆర్   "నా జీవితం నా యోగ "  వీడియో బ్లాగ్ పోటీ ద్వారా  యోగ గురించిన అవగాహనను పెంపొందించడంతో పాటు  ఐ డి వై 2020 పాటించడంలో చురుకైన భాగస్వాములు అయ్యేలా ప్రజలకు స్ఫూర్తిని కలుగజేయాలని భావిస్తున్నాయి.  సామాజిక మాధ్యమ వేదికలు ఫేస్ బుక్, ట్విట్టర్,   ఇన్స్టాగ్రామ్ ద్వారా పోటీలో ప్రాతినిధ్యం పొందడాన్ని అనుమతిస్తారు.   అన్ని దేశాలకు చెందిన వారు  పోటీలో పాల్గొనవచ్చు.

పోటీ రెండు చరణాల్లో ఉంటుంది. మొదటి చరణంలో అంతర్జాతీయ వీడియో బ్లాగింగ్ పోటీలో  ఒక దేశం నుంచే విజేతలను ఎంపిక చేస్తారు.  ఆ తరువాత  వివిధ దేశాల విజేతల నుంచి  గ్లోబల్ విజేతలను  ఎంపికచేస్తారు.  

మూడు కేటగిరీలలో ఎంట్రీలను సమర్పించవచ్చు. యువత (18 సంవత్సరాల వయస్సు నిండని వారు ),  వయోజనులు  (18 సంవత్సరాలు దాటిన వారు) మరియు యోగ వృత్తి నిపుణులు మరియు  స్త్రీ , పురుషులకు వేర్వేరుగా ఉంటాయి. అంటే మొత్తం మీద ఆరు కేటగిరీలలో పోటీ ఉంటుంది.    మొదటి చరణంలో  మన దేశంలో పోటీపడే వారికోసం ప్రతి కేటగిరీలో మొదటి బహుమతి రూ.  1 లక్ష, రెండవ బహుమతి రూ.  50 వేలు,  మూడవ బహుమతి రూ. 25 వేలుగా నిర్ణయించారు.  గ్లోబల్ బహుమతుల వివరాలను త్వరలో
ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన యోగ పోర్టల్ లో ప్రకటిస్తారు.    

ప్రపంచంలో ఏ ప్రాంతం వారైనా ఈ పోటీలో పాల్గొనవచ్చు.  పోటీలో పాల్గొనదలచిన వారు  మూడు నిమిషాల వ్యవధి గల వీడియోను అప్ లోడ్ చేయాలి.  దానిలో మూడు యోగ అభ్యాసాలు ( క్రియ, ప్రాణాయామ, బంధ లేక ముద్ర)  చేసి చూపాలి.  అంతేకాక సదరు యోగాభ్యాసం వారి జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిందో వివరించే స్వల్ప వీడియో సందేశాన్ని / వివరాన్ని దానికి జతచేయాలి.  
ఆ వీడియోను ఫేస్ బుక్, ట్విట్టర్ లేక  ఇన్ స్టాగ్రామ్ లో  పోటీ సూచిక #MyLifeMyYogaINDIA మరియు తగిన కేటగిరీ సూచికను తెలియజేస్తూ అప్ లోడ్ చేయాలి.  పోటీకి సంబంధించిన పూర్తి వివరాలు ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన యోగ పోర్టల్ (https://yoga.ayush.gov.in/yoga/) లభిస్తాయి.  

పోటీకి సంబంధించిన ప్రకటన ప్రధానమంత్రి చేయడం వల్ల ప్రజలలో బ్రహ్మాండమైన కుతూహలాన్ని, ఆసక్తిని రేకెత్తించింది. యోగ వల్ల  దేశంలో కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కోవడంలో  కలిగిన సానుకూల ప్రభావం ఎలాంటిదో  ప్రజలకు అనుభవంలోకి వచ్చినందువల్ల ఈ ఆసక్తి  గణనీయమైన ప్రజారోగ్య ప్రయోజనాలకు దారితీయగలదని ఆయుష్ మంత్రిత్వ శాఖ విశ్వసిస్తోంది.  

 



(Release ID: 1628209) Visitor Counter : 360