కేంద్ర మంత్రివర్గ సచివాలయం

కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న 13 నగరాల్లో పరిస్థితిపై కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి సమీక్ష

కేసుల నియంత్రణకు అక్కడి అధికారులు చేపట్టిన చర్యలపై చర్చ
సాంకేతిక సమాచారం ఆధారంగా సరైన పద్ధతిలో కంటెయిన్‌మెంట్‌ జోన్లను గుర్తించాలని సూచన

Posted On: 28 MAY 2020 3:50PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతంగా ఉన్న 13 నగరాలకు చెందిన మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లా న్యాయాధికారులతో కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి సమావేశం నిర్వహించారు. ఆ నగరాల్లో ఉన్న పరిస్థితిని సమీక్షించారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

    ఈ 13 నగరాల్లో కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతుండటం, మొత్తం దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 70 శాతం ఈ నగరాల నుంచే వస్తున్న దృష్ట్యా ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఆ 13 నగరాలు.. ముంబయి, చెన్నై, దిల్లీ, అహ్మదాబాద్‌, థానే, పుణె, హైదరాబాద్‌, కోల్‌కతా, ఇండోర్‌, జైపూర్‌, జోథ్‌పూర్‌, చెంగల్పట్టు, తిరువల్లూరు. ఈ నగరాల్లో కరోనా కేసుల నియంత్రణకు అక్కడి అధికారులు చేపట్టిన చర్యలపై సమావేశంలో చర్చించారు.

    నగరాల్లో వైరస్‌ వ్యాప్తి నిరోధానికి చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది.    వైరస్‌ వ్యాప్తి కారకాల మీద ఎక్కువ దృష్టి పెట్టడం, వైరస్‌ నిర్ధరణ రేటు, మరణాల రేటు, ప్రతి 10 లక్షల మందిలో ఎంతమందికి పరీక్షలు చేశారు వంటివి మార్గదర్శకాల్లోని ముఖ్యాంశాలు. కేసుల మ్యాపింగ్‌, రోగుల పరిచయాలు, భౌగోళిక వ్యాప్తి వంటి అంశాల ఆధారంగా కంటెయిన్‌మెంట్‌ జోన్లను భౌగోళికంగా గుర్తించాలని కేంద్రం స్పష్టంగా చెప్పింది. దీనివల్ల వైరస్‌ ప్రభావిత ప్రాంతాల పరిధిని కచ్చితంగా నిర్ణయించానికి, లాక్‌డౌన్‌ను గట్టిగా అమలు చేయడానికి వీలవుతుంది.

    అవసరమైతే.., నివాసిత కాలనీలు, మొహల్లాలు, వార్డులు, పోలీస్‌ స్టేషన్‌ పరిధులు, మున్సిపల్‌ జోన్లు, పట్టణాల పరిధులను కంటెన్‌మెంట్‌ జోన్లుగా మున్సిపల్‌ కార్పొరేషన్లే నిర్ణయించుకోవచ్చు. క్షేత్ర స్థాయి నుంచి వచ్చే సాంకేతిక సమాచారాన్ని విశ్లేషించి, ఆయా ప్రాంతాలను కంటెయిన్‌మెంట్‌ జోన్లుగా సరైన పద్ధతిలో గుర్తించాలని ఈ 13 నగరాల అధికారులకు కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి సూచించారు.

***



(Release ID: 1627460) Visitor Counter : 312