రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ఇరాన్‌కు మిడుతల‌ నియంత్రణ పురుగు మందును అందించడానికి హెచ్ఐఎల్ స‌న్న‌ద్ధం

కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ క్రెడిట్ రేటింగ్ తాజాగా బీబీ నుంచి బీబీబీ-కి అప్‌గ్రేడ్ చేయబడింది

Posted On: 24 MAY 2020 1:59PM by PIB Hyderabad

కోవిడ్‌-19 లాక్‌డౌన్ కార‌ణంగా లాజిస్టిక్స్‌తో పాటు ప‌లు ఇత‌ర సవాళ్లు ఎదుర‌వుతున్న‌ప్ప‌టికీ కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ హెచ్‌ఐఎల్ (ఇండియా) లిమిటెడ్ స‌కాలంలో పురుగుల మందుల‌ను స‌ర‌ఫ‌రా చేసేలా చురుగ్గా ముందుకు సాగుతోంది. కేంద్ర రసాయనాలు మరియు పెట్రోకెమికల్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్ర‌భుత్వ రంగ సంస్థ హెచ్‌ఐఎల్ (ఇండియా) ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ స‌కాలంలో స‌ర‌ఫ‌రా జ‌రిపే విధంగా చ‌ర్య‌లు చేప‌డుతోంది. భార‌త ప్ర‌భుత్వం, ఇరాన్ ప్ర‌భుత్వాల మ‌ధ్య కుదిరిన ఒప్పందం మేర‌కు ఆ దేశానికి మిడుతల‌ నియంత్రణ కార్యక్రమానికి అవ‌స‌ర‌మైన‌
25 ఎమ్‌టీల‌ మలాథియాన్ టెక్నికల్‌ను ఉత్పత్తి మరియు సరఫరా చేసే ప్రక్రియలో హెచ్‌ఐఎల్ నిమ‌గ్న‌మై ఉంది. ఇరాన్‌కు స‌ర్కారు కోరిక మేర‌కు మలాథియాన్ టెక్నికల్ స‌ర‌ఫ‌రా నిమిత్తం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) హెచ్‌ఐఎల్‌ను సంప్రదించింది.
మెరుగుప‌డిన సంస్థ రేటింగ్‌..
కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ) క్రెడిట్ రేటింగ్ తాజాగా బీబీబీ- కి అప్‌గ్రేడ్ చేయబడింది. అంటే ఇది స్థిరమైన పెట్టుబడి గ్రేడ్ అని అర్థం. అంత‌కు ముందు సంస్థ రేటింగ్ బీబీగా ఉండేది. ఈ కంపెనీ ఇప్ప‌టికే లాటిన్ అమెరికన్ దేశం పెరూకు 10 మెట్రిక్ టన్నుల శిలీంద్ర సంహారిణి - మాన్‌కోజెబ్‌ను ఎగుమతి చేసింది మరియు మరో 12 మెట్రిక్ టన్నుల శిలీంద్ర సంహారిణి మరో వారంలో ఎగుమతి చేయ‌నుంది. మిడుత‌ నియంత్ర‌ణ కార్య‌క్ర‌మంలో భాగంగా రాజస్థాన్  మరియు గుజరాత్ రాష్ర్టాల‌కు మలాథియాన్ టెక్నికల్ సరఫరా కోసం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖతో హెచ్ఐఎల్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. హెచ్‌ఐఎల్ గత వారం వరకు 67 మెట్రిక్ టన్నుల మలాథియాన్ టెక్నికల్‌ను తయారు చేసి సరఫరా చేసింది.
మునిసిపల్ కార్పొరేషన్లకు స‌ర‌ఫ‌రా..
డెంగ్యూ మరియు చికున్‌గున్యా నియంత్రణ కార్యక్రమాల‌ కోసం మునిసిపల్ కార్పొరేషన్లకు మలాథియాన్ టెక్నికల్‌కు హెచ్‌ఐఎల్ సరఫరా చేసింది. కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఎన్‌వీబీడీసీపీ కార్య‌క్ర‌మాల వారు ఆర్డ‌ర్ చేసిన 314 మెట్రిక్ టన్నుల డీడీటీ 50% డ‌బ్య్లూడీపీని రాజస్థాన్, పంజాబ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ వంటి వివిధ రాష్ట్రాలకు  సరఫరా కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డ‌మైంది. 252 మెట్రిక్ టన్నుల మిగ‌తా పరిమాణాన్ని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసే ప్రక్రియలో కంపెనీ నిమ‌గ్న‌మై ఉంది.
లాక్‌డౌన్ స‌మ‌యంలోనూ మెరుగైన ప‌నితీరు..
లాక్‌డౌన్‌ స‌మ‌యంలో హెచ్ఐఎల్ ఈ నెల 15వ తేదీ వరకు దాదాపు 120 మెట్రిక్ టన్ను‌లు మలాథియన్ టెక్నికల్, 120.40 మెట్రిక్ ట‌న్నుల డీడీటీ టెక్నికల్, 288 మెట్రిక్ టన్నుల‌ డీడీటీ 50%, దాదాపు 21 మెట్రిక్ ట‌న్నుల‌ హిల్‌గోల్డ్‌ (నీటిలో కరిగే ఎరువులు), ఎగుమతుల కోసం 12 మెట్రిక్ ట‌న్నుల మాన్‌కోజెబ్‌ను శిలీంద్ర సంహారిణిని సంస్థ త‌యారు చేసింది. దీనికి తోడు లాక్‌డౌన్ కారణంగా రైతాంగం, ఆరోగ్య శాఖ‌ల‌పై ఎలాంటి ప్ర‌తికూల ప్ర‌భావం పడ‌కుండా ఉండేలా చూసేందుకు గాను దాదాపు 35 మెట్రిక్ ట‌న్నుల మేర వివిధ ర‌కాల వ్య‌వ‌సాయానికి అవ‌స‌ర‌మ‌య్యే రసాయనాల‌ను సంస్థ త‌యారు చేసింది.



(Release ID: 1626627) Visitor Counter : 307