ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

శారీరక దూరం, పరిశుభ్ర ప్రవర్తనే కొవిడ్‌కు శక్తిమంతమైన సామాజిక టీకాలు: మంత్రి డా.హర్షవర్ధన్‌

రికవరీ రేటు 37.5 శాతానికి పెరిగింది, 22 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహణ
దేశంలో కరోనా పరీక్షల సామర్థ్యం రోజుకు లక్షకు పెంపు
దేశం పూర్వ స్థితికి చేరిన తర్వాత సాధారణ పరిశుభ్రలు పాటించాలి

Posted On: 17 MAY 2020 5:58PM by PIB Hyderabad

కేంద్రంలో ఉన్న బలమైన నాయకత్వం ద్వారా.. దూకుడైన, ముందస్తు చర్యలతో కూడిన విధానపర పట్టుదల కారణంగా కొవిడ్‌పై పోరాటంలో ప్రోత్సాహవంతమైన ఫలితాలు కనిపిస్తున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా.హర్షవర్ధన్‌ చెప్పారు. లాక్‌డౌన్‌ 3.0 ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. కొవిడ్‌ మరణాల రేటు 3.1 శాతానికి పడిపోయిందని, రికవరీ రేటు 37.5 శాతానికి పెరిగిందని మంత్రి వెల్లడించారు. శనివారం నాటికి, 3.1 శాతం క్రియాశీల కొవిడ్‌-19 రోగులు ఐసీయూలో ఉన్నారని, వెంటిలేటర్లపై 0.45 శాతం, ఆక్సిజన్ సపోర్ట్‌పై 2.7 శాతం మంది రోగులు ఉన్నట్లు  మంత్రి డా.హర్షవర్ధన్‌ తెలిపారు. 

    17 మే 2020 నాటికి, దేశవ్యాప్తంగా 90,927 కేసులు నమోదయ్యాయి. వీరిలో 34,109 మందికి నయమైంది. 2,872 మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లో కొత్తగా 4,987 కేసులు వచ్చాయి.

దేశంలో కరోనా పరీక్షల సామర్థ్యం రోజుకు లక్షకు పెంపు
    373 ప్రభుత్వ ప్రయోగశాలలు, 152 ప్రైవేట్ ప్రయోగశాలల ద్వారా దేశంలో కరోనా పరీక్షల సామర్థ్యం రోజుకు లక్షకు పెరిగిందని డా.హర్షవర్ధన్ స్పష్టం చేశారు. "ఇప్పటివరకు 22,79,324 పరీక్షలు జరిగాయి. శనివారం ఒక్కరోజే 90,094 నమూనాలను పరీక్షించారు. ఇవాళ (ఆదివారం), ఎనిమిది 
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గత 24 గంటల్లో కొవిడ్‌ కేసులు రాలేదు. అవి.. అండమాన్‌&నికోబార్‌ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, దాద్రా&నగర్ హవేలి, చండీగఢ్‌, లడఖ్, మేఘాలయ, మిజోరాం, పుదుచ్చేరి. డామన్&డయ్యు, సిక్కిం, నాగాలాండ్, లక్షద్వీప్‌లోనూ ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని" మంత్రి వివరించారు. 

90.22 లక్షల ఎన్-95 మాస్కులు, 53.98 లక్షల పీపీఈలు
    దేశంలో కొవిడ్‌-19ను నియంత్రణ, నిర్వహణ కోసం అభివృద్ధి చేసిన ఆరోగ్య మౌలిక సదుపాయాలపై మాట్లాడుతూ, "ఇప్పటివరకు, 1,80,473 పడకలతో 916 డెడికేటెట్‌ కొవిడ్‌ ఆస్పత్రులు (ఐసోలేషన్ పడకలు- 1,61,169, ఐసీయూ పడకలు- 19,304), 1,28,304 పడకలతో 2,044 డెడికేటెడ్‌ కొవిడ్ ఆరోగ్య కేంద్రాలు (ఐసోలేషన్ పడకలు- 1,17,775, ఐసీయూ పడకలు- 10,529) 9,536 క్వారంటైన్ కేంద్రాలు, 5,64,632 పడకలతో 6,309 కోవిడ్ కేర్ సెంటర్లు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 90.22 లక్షల ఎన్-95 మాస్కులు, 53.98 లక్షల వ్యక్తిగత రక్షణ పరికరాలను కేంద్రం (పీపీఈలు) అందించిందని" తెలిపారు.

శారీరక దూరమే అత్యంత శక్తివంతమైన సామాజిక వ్యాక్సిన్
    భారత్‌ సాధారణ స్థితికి చేరిన తర్వాత.. చేతులను తరచూ కనీసం 20 సెకన్లపాటు సబ్బుతోగానీ, ఆల్కాహాల్‌ ఆధారిత శానిటైజర్లతోగానీ కడుక్కోవడం; బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకుండా ఉండటం; పని ప్రాంతాలు, తరచూ తాకే టేబుళ్ల వంటి వాటి ఉపరితలాలను శుభ్రపరచడం; బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తిగత, ఎదుటివారి భద్రత కోసం ముఖ కవచాలు ఉపయోగించడం; శ్వాసకోశ పరిశుభ్రత తప్పనిసరిగా ఉండేలా చూసుకోవడం వంటి సాధారణ పరిశుభ్రత చర్యలను పాటించాలని మంత్రి డా.హర్షవర్ధన్‌ సూచించారు. శారీరక దూరం మనకు అందుబాటులో ఉన్న అత్యంత శక్తివంతమైన సామాజిక వ్యాక్సిన్ అని, ఇతరులతో మాట్లాడేటప్పుడు ‘రెండు గజాల దూరం’ ఉండేలా చూడటం, వర్చువల్ సమావేశాలను ఎంచుకోవడం ద్వారా సామాజిక సమావేశాలను పరిమితం చేయడం మంచిది అని ఆయన అన్నారు. కచ్చితంగా అవసరమైనప్పుడు మాత్రమే ప్రయాణాలు పెట్టుకోవాలని, రద్దీగా ఉండే ప్రదేశాలను సందర్శించవద్దని డా.హర్షవర్ధన్‌ సూచించారు.

 



(Release ID: 1624798) Visitor Counter : 157