వ్యవసాయ మంత్రిత్వ శాఖ

రైతులకు ఊరట కల్పించే చర్యలపై కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ అధ్యక్షతన రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులతో సమీక్ష సమావేశం

కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలోనూ వ్యవసాయ కార్యకలాపాల
కొనసాగింపులో రాష్ట్రాల చొరవను ప్రశంసించిన శ్రీ తోమర్‌;
వివిధ వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలకు మినహాయింపులపై
క్షేత్రస్థాయి సంస్థలకు అవగాహన కల్పించాలని రాష్ట్రాలకు సూచన;
ఖరీఫ్‌ సంసిద్ధతపై దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా
ఏప్రిల్‌ 16న జాతీయ సదస్సు నిర్వహణ: శ్రీ తోమర్‌

Posted On: 09 APR 2020 10:17AM by PIB Hyderabad

   కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ నిన్న దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఆ శాఖ సహాయమంత్రి శ్రీ పురుషోత్తం రూపాలతోపాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రధాన వ్యవసాయ కార్యకలాపాలు, పంటకోతలు, వ్యవసాయ మార్కెట్లు, టోకు మండీల నిర్వహణ, కనీస మద్దతు ధరతో ఉత్పత్తుల సేకరణ, రైతులకు విత్తనాలు-ఎరువులు, ఇతర సదుపాయాల అందుబాటు తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారి సవాలు విసిరిన సమయంలోనూ వ్యవసాయ కార్యకలాపాలపై రాష్ట్రాలు చూపిన చొరవను కేంద్ర మంత్రి ప్రశంసించారు. దేశంలో ఖరీఫ్‌ సీజన్‌ సంసిద్ధతపై ఏప్రిల్‌ 16వ తేదీన జాతీయ సదస్సును దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా నిర్వహిస్తామని, అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర మంత్రి ప్రకటించారు. కేంద్రం ఇచ్చిన మినహాయింపులపై క్షేత్రస్థాయి సంస్థలకు అవగాహన కల్పించాలని రాష్ట్రాలను కోరారు. దిగ్బంధం నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చిన కార్యకలాపాలు కిందివిధంగా ఉన్నాయి:

  • కనీస మద్దతుధర కార్యకలాపాలుసహా వ్యవసాయోత్పత్తుల సేకరణలోగల సంస్థలు;
  • పొలాల్లో రైతులు, రైతు కూలీలు చేసుకునే వ్యవసాయ పనులు;
  • వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు లేదా రాష్ట్ర అనుమతిగల ‘మండీలు’,
  • రాష్ట్ర/కేంద్రపాలిత ప్రభుత్వాల అనుమతితో రైతులు/సహకారసంఘాల నుంచి నేరుగా వ్యవసాయోత్పత్తులు కొనుగోలుచేసే ‘టోకు మండీలు’;
  • విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల తయారీ, ప్యాకేజింగ్‌ సంస్థలు; చిల్లర దుకాణాలు;
  • వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అద్దెకు ఇచ్చే కేంద్రాలు;
  • రాష్ట్రంలో, రాష్ట్రాలమధ్య పంటకోతలుసహా ఇతర కార్యకలాపాలకు వాడే యంత్రాల సంచారం;
  • శీతల-సాధారణ గిడ్డంగుల సేవలు; ఆహార ఉత్పత్తుల ప్యాకింగ్‌ సామగ్రి తయారీ సంస్థలు;
  • నిత్యావసర వస్తు రవాణా;
  • వ్యవసాయ యంత్రాలు, విడిభాగాల (టోకు సరఫరా సంస్థలుసహా) విక్రయ దుకాణాలు;
  • కార్మికుల గరిష్ఠ సంఖ్య 50 శాతం మించకుండా తేయాకు (తోటలుసహా) పరిశ్రమ.

రాష్ట్రాలు తీసుకోవాల్సిన చర్యలు కింది విధంగా ఉన్నాయి:

  • విత్తనాలు వేయడం, పంటకోతలు, ఉత్పత్తుల విక్రయాలుసహా వ్యవసాయ కార్యకలాపాలపై క్షేత్రస్థాయి సంస్థలకు అవగాహన కల్పన;
  • మినహాయింపుగల కార్యకలాపాల సంబంధిత సంస్థల సిబ్బంది, యంత్రాలు, సామగ్రి ప్రయాణ-రవాణా తదితరాలకు సత్వర అనుమతుల మంజూరు;
  • నిత్యావసరాల పంపిణీకి జాతీయ సరఫరా శృంఖలాలుగల కంపెనీలు/సంస్థలకు అనుమతి పత్రాలు, వాటి సిబ్బందికి అంతర్గతంగానే ప్రాంతీయ పాసుల జారీ అధికారం మంజూరు;
  • ఈ మినహాయింపుల అమలులో భాగంగా సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత నిబంధనల తప్పనిసరి అమలు, అన్ని బహిరంగ ప్రదేశాల్లో ఇన్ఫెక్షన్‌ నిర్మూలన చర్యలు చేపట్టడం.

ఈ సంక్షోభ సమయంలో తలెత్తే సవాళ్లను ఎదుర్కొనడంలో పూర్తి సహాయ-సహకారాలు అందిస్తామని కేంద్రమంత్రి అన్ని రాష్ట్రాలకూ హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగ కార్యకలాపాల విషయంలో కేంద్ర ప్రభుత్వ చర్యలను రాష్ట్రాల వ్యవసాయశాఖ మంత్రులు ఈ సందర్భంగా కొనియాడారు. సామాజిక దూరం, పరిశుభ్రత నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేస్తామని వారు ప్రకటించారు.

*****

 



(Release ID: 1612471) Visitor Counter : 160