శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 రోగుల పరీక్ష కోసం శాస్త్రవేత్తల వినూత్న ఆవిష్కరణ

టెలిఫోన్‌ బూత్‌ వంటి వ్యాధివ్యాప్తి నిరోధక గదికి SCTIMST రూపకల్పన
తాకకుండానే పరీక్షించే వీలు – రోగి వెళ్లాక యూవీ లాంప్‌తో బూత్‌ ప్రక్షాళన
ముందుచూపుతో రూపొందించిన ఉపకరణం: DST కార్యదర్శి అశుతోష్‌ శర్మ

Posted On: 08 APR 2020 11:38AM by PIB Hyderabad

భారత ప్రభుత్వం శాస్త్ర-సాంకేతిక విభాగం (DST) కింద కేరళలోని త్రివేండ్రంలో  స్వయంప్రతిపత్తిగల ‘శ్రీ చిత్ర తిరునాళ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ’ (SCTIMST) కోవిడ్‌-19 రోగులను పరీక్షించేందుకు వినూత్న ఉపకరణాన్ని ఆవిష్కరించింది. రోగుల నుంచి డాక్టర్లకు వైరస్‌ సోకకుండా ఈ సంస్థ శాస్త్రవేత్తలు టెలిఫోన్‌ బూత్‌ తరహాలో వ్యాధి వ్యాప్తి నిరోధక గదిని రూపొందించారు. ఇందులో ఒక సాధారణ లైటు, 254 నానోమీటర్ల తరంగదైర్ఘ్యం (వేవ్‌లెంగ్త్‌)గల 15వాట్ల అతినీల లోహిత (UV) బల్బ్‌, టేబుల్‌ ఫ్యాన్‌, ర్యాక్‌ ఉంటాయి. ఈ బూత్‌కు ఒకవైపుగల ద్వారం నుంచి రోగి లోనికి ప్రవేశిస్తారు. రెండోవైపున చేతులు మాత్రమే పట్టే రెండు మార్గాలుంటాయి. వీటిలో ఒకదాని నుంచి గ్లోవ్స్‌ తొడుక్కున్న చేతిని, రెండో మార్గం నుంచి స్టెత్‌స్కోప్‌ను డాక్టర్లు లోనికి చాపి రోగిని పరీక్షిస్తారు. ఆ తర్వాత ప్రతి రోగి బయటకు వెళ్లగానే- బూత్‌లోని UV లైట్‌ ఆన్‌ చేస్తారు. దీంతో బూత్‌లో వైరస్‌ సముదాయం ఉంటే 3 నిమిషాల్లో పూర్తిగా నాశనమైపోతుంది. అనంతరం మరొక రోగిని లోనికి అనుమతిస్తారు. “రోగులకు  ప్రత్యక్ష సేవలందించే డాక్టర్లకు, ఇతర సిబ్బందికి పూర్తి భద్రతనిచ్చేలా ఎంతో ముందుచూపుతో శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు” అని డీఎస్టీ కార్యదర్శి ప్రొఫెసర్‌ అశుతోష్‌ శర్మ ఈ సందర్భంగా అభినందించారు.

 

*****



(Release ID: 1612175) Visitor Counter : 193