శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
చెన్నైలో బ్రిక్స్ సైన్స్ మంత్రుల సమావేశ ప్రారంభోత్సవంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో శాస్త్ర, సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో భారత్ ప్రపంచవ్యాప్త విస్తరణను వివరించిన డాక్టర్ జితేంద్ర సింగ్
అందరికీ అందుబాటులో ఉండే, సరసమైన, విశ్వసనీయమైన, సుస్థిరమైన ఆవిష్కరణల కోసం సమష్టి కృషికి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపు
प्रविष्टि तिथि:
21 AUG 2026 2:19PM by PIB Hyderabad
బ్రిక్స్ శాస్త్ర, సాంకేతికత, ఆవిష్కరణల మంత్రివర్గ 14వ సమావేశం ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర శాస్త్ర-సాంకేతిక శాఖ, భౌగోళిక విజ్ఞాన శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), పీఎంవో- అణు ఇంధన - అంతరిక్ష విభాగం - సిబ్బంది, ప్రజా వ్యవహారాలు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ ప్రారంభోపన్యాసం చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో శాస్త్ర, సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో భారత్కు పెరుగుతున్న అంతర్జాతీయ ప్రాధాన్యతను ఆయన వివరించారు.
బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులకు స్వాగతం పలికిన డాక్టర్ జితేంద్ర సింగ్.. 2026లో బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతల కోసం భారత్ “స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం” ఇతివృత్తాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణలు మానవాళికి ఉపయోగపడేలా ఉండాలని, విపత్తులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచాలని, సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించాలని, సుస్థిర అభివృద్ధికి దోహదపడాలని, దేశాల మధ్య సమాన భాగస్వామ్యాలను బలోపేతం చేయాలని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుందని చెప్పారు.
కృత్రిమ మేధ,, క్వాంటం సాంకేతికతలు,, అధునాతన పదార్థాలు, బయోటెక్నాలజీ, ఫోటోనిక్స్, భౌగోళిక సమాచార సాంకేతికతలు, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో ప్రపంచం వేగంగా మారుతోందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ సాంకేతికతలు అపూర్వమైన అభివృద్ధి అవకాశాలను సృష్టిస్తున్నప్పటికీ, ఆవిష్కరణలు అందరికీ అందుబాటులో ఉండేలా, అందరూ భరించగలిగేలా, విశ్వసనీయంగా, సుస్థిరంగా ఉండేలా చూడటానికి మరింత బలమైన అంతర్జాతీయ సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు.
బ్రిక్స్లో విస్తారమైన జనాభా, శాస్త్రీయ ప్రతిభ, పెరుగుతున్న పరిశోధనా సామర్థ్యాలు ఉన్నందున సహకారపూర్వక, బాధ్యతాయుతమైన, భవిష్యత్తు అవసరాలకు అనుగుణమైన ఆవిష్కరణల వ్యవస్థను అభివృద్ధి చేయడానికి బ్రిక్స్కు మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. సంభాషణను కొనసాగించడంలో, వాటిని ఆచరణాత్మక సహకారం, స్పష్టమైన ఫలితాలుగా మార్చడంలో ఎస్టీఐ స్టీరింగ్ కమిటీ, సీనియర్ అధికారులు, వివిధ ఎస్టీఐ వర్కింగ్ గ్రూపులు అందిస్తున్న సహకారాన్ని కేంద్రమంత్రి శ్రీ జితేంద్ర సింగ్ ప్రశంసించారు.
పరిశోధన సహకారం, ఆవిష్కరణ భాగస్వామ్యాలు, యువ శాస్త్రవేత్తల మార్పిడి కార్యక్రమాలు, పరిశోధనా మౌలిక వసతులు, అంశాలవారీ వర్కింగ్ గ్రూపులతో కూడిన బలమైన వేదికగా బ్రిక్స్ ఎస్టీఐ సహకారం రూపుదిద్దుకుందని మంత్రి తెలిపారు. భారత అధ్యక్షతలో, అభివృద్ధి చెందుతున్న శాస్త్రీయ, సాంకేతిక రంగాలతో పాటు సమాజాల అభివృద్ధి ఆకాంక్షలకు అనుగుణంగా సహకారాన్ని తీర్చిదిద్దేందుకు బ్రిక్స్ ఎస్టీఐ ప్రాధాన్యతలపై సమగ్ర సమీక్ష జరుగుతోందని పేర్కొన్నారు.
శాస్త్ర, ఆవిష్కరణల విషయంలో బహిరంగ, సమ్మిళిత, మానవ కేంద్రీకృత విధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ కట్టుబడి ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. జాతీయ క్వాంటం మిషన్, జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్, బయోఈ3 విధానం, జాతీయ జియోస్పేషియల్ విధానం, విస్తరిస్తున్న డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల వ్యవస్థ వంటి దేశ కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. ఆవిష్కరణలు చివరికి ప్రజల జీవనాన్ని మెరుగుపరచడం, సామాజిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడం, సుస్థిర ఆర్థిక పరివర్తనకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా ఉండాలన్న విధానాన్ని ఇవి ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు.
అత్యాధునిక పరిశోధన, ఆవిష్కరణలకు ఆర్థిక సహాయం, ప్రతిభావంతుల రాకపోకలు, పరిశోధనా మౌలిక వసతుల భాగస్వామ్యం, అంకుర సంస్థల భాగస్వామ్యాలు, సామర్థ్య నిర్మాణం వంటి అంశాల్లో మరింత లోతైన సహకారం కోసం ప్రతిష్ఠాత్మకమైనప్పటికీ ఆచరణాత్మక మార్గాలను గుర్తించాలని బ్రిక్స్ భాగస్వామ్య దేశాలకు కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. ఇటువంటి సహకారం ద్వారా ప్రపంచ సవాళ్లకు స్పందించే, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆకాంక్షలకు మద్దతు ఇచ్చే భవిష్యదకదే అవసరాలకు సిద్ధమైన బ్రిక్స్ ఎస్టీఐ వ్యవస్థను రూపొందించవచ్చని అన్నారు.
చెన్నైలో జరుగుతున్న చర్చలు బ్రిక్స్ భాగస్వామ్య స్ఫూర్తిని మరింత బలోపేతం చేసి, మరింత ఆవిష్కరణాత్మక, స్థిరమైన, సుస్థిర ప్రపంచ నిర్మాణానికి అర్థవంతమైన సహకారం అందిస్తాయని డాక్టర్ జితేంద్ర సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
***
(रिलीज़ आईडी: 2302071)
आगंतुक पटल : 5