రాష్ట్రపతి సచివాలయం
12వ జాతీయ చేనేత దినోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి
సంత్ కబీర్ చేనేత పురస్కారాలు, 2025 జాతీయ చేనేత పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి
చేనేత రంగ సుస్థిరాభివృద్ధికి నూతన సాంకేతికతలను ఉపయోగించుకోవాలి: రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము
సాంప్రదాయిక హస్తకళలతో ఆధునిక ధోరణులు, బ్రాండ్లు, అంతర్జాతీయ స్థాయి సమగ్ర వ్యవస్థలను అనుసంధానించి
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, డిజైనర్లు, అంకుర సంస్థలు ఈ రంగంలో కొత్త అవకాశాల్ని సృష్టించవచ్చు
प्रविष्टि तिथि:
07 AUG 2026 4:27PM by PIB Hyderabad
ఈ రోజు, అంటే 2026 ఆగస్టు 8న పన్నెండో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు. సంత్ కబీర్ చేనేత పురస్కారాలను, 2025 సంవత్సరానికిగాను జాతీయ చేనేత పురస్కారాలను రాష్ట్రపతి ప్రదానం చేశారు. భారత సుసంపన్న, వైవిధ్యపూరిత చేనేత సంప్రదాయాలకు గుర్తుగా నాలుగు తపాలా బిళ్లలను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
సభను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తూ... శతాబ్దాల తరబడి భారత నాగరికత అభివృద్ధి ప్రస్థానంలో చేనేత ఓ అంతర్భాగంగా ఉందనీ, ఇది మన దేశానికున్న అసాధారణ వైవిధ్యాన్ని చాటుతూ, ప్రాంతీయ విశిష్టతను పరిరక్షిస్తోందని శ్రీమతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఉపాధిని, మహిళా సాధికారత కల్పనను, కళలను, సంస్కృతిని, ప్రకృతి పట్ల ప్రేమను చేనేత రంగం పెంపొందింపచేస్తోందని రాష్ట్రపతి వివరించారు. భారత స్వాతంత్య్ర పోరాటంతో, స్వావలంబన భావనతో కూడా చేనేత జతపడి ఉందన్నారు.
స్వదేశీ ఉద్యమాన్ని 1905 ఆగస్టు 7న లాంఛనంగా ప్రారంభించారని రాష్ట్రపతి అన్నారు. బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ మొదలుపెట్టిన ఈ ఉద్యమ లక్ష్యం స్వదేశీ వస్తువులు, దేశీయ పరిశ్రమలతో పాటు మరీ ముఖ్యంగా దేశ చేనేత కార్మికులను ప్రోత్సహించడమని వివరించారు. ఈ చరిత్రాత్మక ఘటనను గౌరవించుకుంటూ, కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహిస్తోందన్నారు. చేనేత రంగంలో అనుబంధం కలిగి ఉన్న ప్రతి ఒక్కరికీ జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి అభినందనలు తెలిపారు. భారత చేనేత రంగానికి అధిక నాణ్యతతో కూడిన ప్రతిష్టను అందించే దిశగా ప్రభుత్వం, చేనేత సమాజం కలిసికట్టుగా చేస్తున్న ప్రయత్నాలను గుర్తించాల్సిన సందర్భమని రాష్ట్రపతి అన్నారు.
భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక, మానవ శ్రమ ప్రధాన ఉదాహరణగా మారే సామర్థ్యాన్ని మన చేనేత రంగం రోజు రోజుకూ పెంచుకొందని రాష్ట్రపతి అన్నారు. కీలక చేనేత క్లస్టర్లను ఆధునిక సాంకేతికతతో, సమకాలీన శిక్షణ పద్ధతులతో అనుసంధానిస్తున్నారన్నారు. కళాకారుల ఆదాయాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటోందని రాష్ట్రపతి అన్నారు. ఈ రంగాన్ని ప్రామాణిక సాంస్కృతిక ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో భారత చేనేత రంగానికి అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు వస్తున్నాయని శ్రీమతి ద్రౌపదీ ముర్ము తెలిపారు.
అనేక మంది యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సాంకేతిక, వినూత్న డిజైన్లతో ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారని రాష్ట్రపతి తెలిపారు. ప్రభుత్వ పథకాలు, సంస్థలు యువతకు వెన్నుదన్నుగా నిలవాలనీ, అప్పుడు వారి ఉత్సాహం, నైపుణ్యాలు ఈ రంగానికి దీర్ఘకాలిక, బహుళ విజయాలను అందించగలుగుతాయని శ్రీమతి ద్రౌపదీ ముర్ము అన్నారు. యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, డిజైనర్లు, అంకుర సంస్థలు సాంప్రదాయిక హస్తకళలను ఆధునిక ధోరణులు, బ్రాండ్లు, గ్లోబల్ వేల్యూచైన్లతో అనుసంధానించి ఈ రంగంలో కొత్త కొత్త అవకాశాల్ని సృష్టించడానికి అవకాశం ఉందని రాష్ట్రపతి చెప్పారు. యువత ఈ రంగంలో పనిచేయడానికి ముందుకు వచ్చేలా ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఆధ్వర్యంలోని డిజైన్ రిసోర్స్ సెంటర్లతో పాటు వీవర్స్ సర్వీస్ సెంటర్లు గణనీయమైన కృషిని చేస్తున్నట్లు తెలుసుకొన్నట్లు రాష్ట్రపతి తెలిపారు.
చేనేత రంగం దీర్ఘకాలం పాటు అభివృద్ది పథంలో పయనించాలంటే కొత్త సాంకేతికతలను సరైన పద్ధతిలో ఉపయోగించుకోవడం ఎంతైనా అవసరమని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఆధునిక డిజిటల్ సేవలను తో మరిన్ని ఎక్కువ మార్కెట్లకు చేరుకోవడం సాధ్యపడుతుందని చెప్పారు. దీనికి తోడు, ఈ-కామర్స్ వేదికలను వినియోగించుకొని భారతీయ చేనేత ఉత్పాదనలను అంతర్జాతీయ మార్కెట్లకు చేర్చడాన్ని గణనీయ స్థాయిలో పటిష్ఠపరచవచ్చన్నారు. దేశ సమ్మిళిత అభివృద్ధికి, స్వావలంబనకు చేనేత రంగం బలమైన పునాదిగా మారగలదన్న విశ్వాసాన్ని రాష్ట్రపతి వ్యక్తం చేశారు.
నేత కళాకారుల అంకితభావాన్నీ, భారత చేనేత సంప్రదాయాల పరిరక్షణ, దిశగా అందించే దేశ అత్యున్నత పురస్కారమే సంత్ కబీర్ చేనేత పురస్కారం. సాంప్రదాయిక నైపుణ్యాలను సంరక్షిస్తూ, ఆధునిక సాంకేతికతలను అనుసరిస్తూ అసాధారణ సృజనాత్మకత, నాణ్యత, నూతన ఆవిష్కరణలు, ప్రావీణ్యాన్ని కనబరిచే చేనేత కార్మికులకు, ఇతర ఆసక్తిదారులకు జాతీయ చేనేత పురస్కారాలను ప్రదానం చేసి, వారిని సత్కరిస్తున్నారు.
రాష్ట్రపతి ప్రసంగం ఇక్కడ.. Please click here to see the President’s Speech
***
(रिलीज़ आईडी: 2296437)
आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Kannada