జౌళి మంత్రిత్వ శాఖ
ఆగస్టు 7న 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు.. రాష్ట్రపతి చేతుల మీదుగా 2025 జాతీయ చేనేత అవార్డుల ప్రదానం
భారత చేనేత రంగంలో అత్యుత్తమ ప్రతిభకు సత్కారం.. 22 మందికి సంత్ కబీర్, జాతీయ చేనేత పురస్కారాలు
प्रविष्टि तिथि:
06 AUG 2026 4:42PM by PIB Hyderabad
భారతీయ సంస్కృతికి, ఆర్థిక వ్యవస్థకు చేనేత కార్మికులు అందిస్తున్న అమూల్యమైన సేవలను గుర్తిస్తూ, జాతీయ చేనేత రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆగస్టు 7, 2026న 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించనుంది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో (ఆర్బీసీసీ) వేదికగా ఈ వేడుకలు జరగనున్నాయి.
ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై ప్రసిద్ధ ‘సంత్ కబీర్ చేనేత అవార్డులు’, ‘జాతీయ చేనేత అవార్డులు-2025’లను అందజేయనున్నారు. ఈ వేడుకలో కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్, జౌళి శాఖ సహాయ మంత్రి శ్రీ పవిత్ర మార్గరీటా, కార్యదర్శి శ్రీమతి నీలం షమీ రావు, అభివృద్ధి కమిషనర్ (చేనేత) డాక్టర్ ఎం. బీనా, పార్లమెంట్ సభ్యులు, ఉన్నతాధికారులు, చేనేత పరిశ్రమ ప్రతినిధులు, ప్రముఖ నేత కార్మికులు, డిజైనర్లు, ఎగుమతిదారులు, చేనేత కళాకారులు , అవార్డు గ్రహీతలు, ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు.
చేనేత రంగంలో విశేష నైపుణ్యం, ఆవిష్కరణలు, డిజైన్ అభివృద్ధి, మార్కెటింగ్, అంకుర సంస్థలు. ఉత్పత్తిదారుల సంస్థల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ వేడుకలో 22 పురస్కారాలను ప్రధానం చేయనున్నారు. వీటిలో 3 సంత్ కబీర్ చేనేత అవార్డులు, 19 జాతీయ చేనేత పురస్కారాలు ఉన్నాయి. ‘జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం’ (ఎన్హెచ్డీపీ) లోని ‘చేనేత మార్కెటింగ్ సహాయం’ (హెచ్ఎంఏ) విభాగం కింద అందించే ఈ అవార్డులు... దేశంలో చేనేత రంగానికి ఇచ్చే అత్యున్నత జాతీయ పురస్కారాలుగా గుర్తింపు పొందాయి.
దేశంలోనే చేనేత నేత కార్మికులకు ఇచ్చే అత్యున్నత పురస్కారమే సంత్ కబీర్ చేనేత అవార్డు. భారతీయ నేత సంప్రదాయాలను కాపాడుతూ, ప్రచారం చేస్తూ, జీవితాంతం అంకితభావంతో పనిచేసిన చేతివృత్తి కళాకారులను ఈ అవార్డుతో సత్కరిస్తారు. ఇక జాతీయ చేనేత అవార్డు ద్వారా సంప్రదాయ నైపుణ్యాలను కాపాడుకుంటూనే, ఆధునిక పద్ధతులను పుణికిపుచ్చుకుని అద్భుతమైన సృజనాత్మకత, నాణ్యత, ఆవిష్కరణలు చూపిన కళాకారులను గౌరవిస్తారు. పూర్తి పారదర్శకత, నిష్పాక్షికతతో నిపుణుల కమిటీల ద్వారా బహుళ అంచెల పరిశీలన తర్వాతే విజేతలను ఎంపిక చేస్తారు.
ఈ వేడుకల్లో భాగంగా భారతీయ చేనేత వైవిధ్యాన్ని, గొప్ప సంప్రదాయాలను చాటిచెప్పే 4 స్మారక తపాలా బిళ్లలను విడుదల చేయనున్నారు. ప్రాముఖ్యత కలిగిన- ఎర్త్ రూట్ థ్రెడ్-ఆల్ డైడ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ ఆఫ్ సెంట్రల్ ఇండియా, హ్యాండ్లూమ్ అవార్డ్స్ బుక్ 2025 – రెండు పుస్తకాలను కూడా ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా అవార్డు గెలుచుకున్న చేనేత ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారు. సంప్రదాయ కనీ నేత, వాల్ హ్యాంగింగ్ నేతల ప్రత్యక్ష ప్రదర్శనలు, భారతీయ చేనేత సంప్రదాయాల్లో ఉన్న వైవిధ్యం, కళాత్మకత, అత్యుత్తమ హస్తకళా నైపుణ్యాలను సందర్శకులను కనువిందు చేయనున్నాయి.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి వేడుకతో పాటు దేశవ్యాప్తంగా ప్రదర్శనలు, డిజైనర్ సమావేశాలు, ఐఐహెచ్టీ సదస్సులు, ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
దేశంలో పర్యావరణహిత గ్రామీణ ఉపాధికి అత్యంత కీలకమైన వనరుగా చేనేత రంగం కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ రంగం దేశవ్యాప్తంగా 35 లక్షల మందికి పైగా ప్రజల జీవనోపాధికి అండగా నిలుస్తోంది. ఇందులో మొత్తం కార్మికుల్లో 70 శాతానికి పైగా మహిళలే ఉండటం విశేషం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలమైన చేయూతనివ్వడమే కాకుండా, భారతీయ సంప్రదాయ జౌళి రంగాన్ని పరిరక్షించడంలో, పర్యావరణహిత ఉత్పత్తి విధానాలను ప్రోత్సహించడంలో చేనేత రంగం కీలక పాత్ర పోషిస్తోంది.
1905 ఆగస్టు 7న ప్రారంభమైన స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా.. ప్రతి ఏడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. నాటి స్వదేశీ ఉద్యమం భారతీయ స్వదేశీ పరిశ్రమలకు, ముఖ్యంగా చేనేత రంగానికి సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించింది. భారతీయ చేనేత కళాకారుల నైపుణ్యం, కళాత్మకత, అంకితభావాన్ని కొనియాడటంతో పాటు, చేనేత రంగాన్ని పరిరక్షించి, ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.
***
(रिलीज़ आईडी: 2295762)
आगंतुक पटल : 8