సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
గత ఏడాదిగా ప్రభుత్వ ప్రసార సంస్థల సంపాదకీయ స్వయంప్రతిపత్తి, పనితీరుపై నమోదుకాని ఫిర్యాదులు
प्रविष्टि तिथि:
05 AUG 2026 3:26PM by PIB Hyderabad
దేశంలో ప్రసార భారతికి చెందిన ప్రసార మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆధునికీకరణ, అప్గ్రేడేషన్ కోసం బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెట్వర్క్ డెవలప్మెంట్ (బీఐఎన్డీ) అనే కేంద్ర రంగ పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొదట 2021-26 కాలానికి రూపొందించిన ఈ పథకాన్ని మార్చి 31, 2027 వరకు పొడిగించారు. ఈ పథకానికి కేటాయించిన బడ్జెట్ నిధులు, వాస్తవ వ్యయం, ఆదాయానికి సంబంధించిన వివరాలన్నీ ప్రసార భారతి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
సంపాదకీయ వ్యవహారాలను ప్రధాన సంపాదకుడు, సీనియర్ సంపాదకీయ బృందాలు క్రమం తప్పకుండా సమీక్షిస్తుంటాయి. ప్రసార భారతి సంపాదకీయ విధానాలు, ప్రసార నిబంధనలకు అనుగుణంగా వార్తల నాణ్యత, ఖచ్చితత్వం, నిష్పాక్షికత, ప్రదర్శనను పెంచడానికి అవసరమైన మార్గదర్శకాలను, దిద్దుబాటు చర్యలను తీసుకుంటారు. సంపాదకీయ కంటెంట్కు సంబంధించి వీక్షకుల నుంచి వచ్చే ఫిర్యాదులు లేదా అభిప్రాయాలను నిర్ణీత విధానం ప్రకారం తదుపరి చర్యల కోసం సంబంధిత సంపాదకీయ బృందానికి పంపుతారు.
గత ఏడాది కాలంలో ప్రభుత్వ ప్రసార సంస్థల స్వయంప్రతిపత్తి, నియామకాలు లేదా సంపాదకీయ పనితీరుకు సంబంధించి విలేకరులు, ఉద్యోగులు లేదా మీడియా సంస్థల నుంచి ఎలాంటి ఫిర్యాదులు గానీ, అధికారిక వినతిపత్రాలు గానీ రాలేదు. అయితే నియామకాలకు సంబంధించి దరఖాస్తుదారుల నుంచి 07 ఫిర్యాదులు వచ్చాయి.
దేశంలో ఆకాశవాణి దాదాపు 98 శాతం జనాభాకు, 90 శాతం భౌగోళిక ప్రాంతానికి తన ప్రసార సేవలను అందిస్తోంది. ఇక డీడీ ఫ్రీ డిష్ సేవలు ఎలాంటి నెలవారీ చందా రుసుములు లేకుండా దేశంలో ఎక్కడైనా ఉచితంగా వీక్షించేందుకు అందుబాటులో ఉన్నాయి. ప్రసార భారతి తన సాధారణ సంపాదకీయ ప్రక్రియలో భాగంగా వీక్షకుల డేటా, వారి అభిప్రాయాలు, సామాజిక మాధ్యమ విశ్లేషణలను నిరంతరం సమీక్షిస్తుంది. ఈ విశ్లేషణల ఆధారంగా తన వార్తల నాణ్యత, కంటెంట్, ప్రదర్శనా రీతిని నిరంతరం మెరుగుపరుస్తుంది.
ఈ వివరాలను నేడు లోక్సభలో ఎంపీలు అడ్వకేట్ ప్రియా సరోజ్, శ్రీ పుష్పేంద్ర సరోజ్ అడిన ప్రశ్నకు సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ లిఖితపూర్వక సమాధానంగా వెల్లడించారు.
***
(रिलीज़ आईडी: 2294922)
आगंतुक पटल : 5