యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కోసం ఆగస్ట్ 2, 2026న నషా ముక్త యువ కార్యక్రమం ప్రారంభం
మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 100 వారాల జన్ భాగీదారీ ఉద్యమాన్ని ప్రారంభించనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
ఒకేసారి దాదాపు 10,000 ప్రాంతాల్లో నషా ముక్తి ప్రతిజ్ఞ చేయనున్న కోటి మందికి పైగా యువత
प्रविष्टि तिथि:
29 JUL 2026 2:32PM by PIB Hyderabad
నషా ముక్త్ భారత్, వికసిత్ భారత్-2047 స్వప్నాన్ని సాకారం చేయటంలో భాగంగా ఆగస్ట్ 2, 2026న "వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కోసం నషా ముక్త యువ" కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. జన్ భాగీదారీ స్ఫూర్తితో మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా జరిగే ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించాలని దేశ యువతకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా యువత క్రియాశీలక భాగస్వామ్యంతో మై భారత్ ఆధ్వర్యంలో జన ఉద్యమంగా ఈ ప్రచారం ప్రారంభం అవుతుంది. అవగాహన కల్పించటం, సామాజిక భాగస్వామ్యం, సుస్థిర భాగస్వామ్యాన్ని ప్రోత్సహించటం ద్వారా మాదకద్రవ్య రహిత భారత్ను నిర్మించాలనే సమష్టి జాతీయ లక్ష్యంతో యువతను ఏకం చేయటమే ఈ కార్యక్రమం ఉద్దేశం.
ప్రధానమంత్రి ప్రసంగం స్ఫూర్తితో దేశవ్యాప్తంగా సుమారు 10,000 ప్రాంతాల్లో ఒకేసారి ప్రతిజ్ఞను నిర్వహించనున్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం నిబద్ధతను తెలియజేస్తూ, నషా ముక్త యువ వాలంటీర్లుగా దేశ నిర్మాణానికి తమను అంకితం చేసుకుంటూ... కోటి మందికి పైగా యువత నషా ముక్తి ప్రతిజ్ఞలో పాల్గొంటారు.
ఈ ప్రచారంలో మై భారత్ వాలంటీర్లు, మై భారత్ నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్) వాలంటీర్లు, యూత్ క్లబ్బులు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వేతర సంస్థలు, పారిశ్రామిక సంఘాలు, 125కు పైగా ఆధ్యాత్మిక సంస్థలు పాల్గొంటాయి. మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా యువత నేతృత్వంలో జరుగుతున్న అతిపెద్ద ప్రజా ఉద్యమాల్లో ఒకటిగా ఈ కార్యక్రమం నిలవనుంది.
సాధారణ అవగాహన కార్యక్రమాల మాదిరిగా కాకుండా "వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కోసం నషా ముక్త యువ" కార్యక్రమాన్ని 100 వారాల పాటు సాగే ప్రజా భాగస్వామ్య ఉద్యమంగా రూపొందించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు, సామాజిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయటానికి, దేశ నిర్మాణం దిశగా యువశక్తిని మళ్లించేందుకు రాబోయే 100 వారాల పాటు ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా యువత ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు.
మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే హానికర ప్రభావాల గురించి సమాజంలో అవగాహన కల్పించటం, సానుకూల సామాజిక విలువలను పెంపొందించటం వంటి కార్యకలాపాలను ప్రతీ వారం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా క్రీడా పోటీలు, వాకథాన్లు, ధ్యాన సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళాత్మక, సృజనాత్మక పోటీలు, వీధి నాటకాలు, అవగాహనా కార్యక్రమాలు, ఇతర సామాజిక భాగస్వామ్య కార్యక్రమాలను నిర్వహిస్తారు.
నిరంతర భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు, విశేష కృషిని గుర్తించేందుకు, ఈ ప్రచారంలో అద్భుతమైన సేవలందించే స్వచ్ఛంద కార్యకర్తలు, సంస్థలను.. 50, 75, 100 వారాలను పూర్తి చేసుకున్న కీలక సందర్భంగా సత్కరిస్తారు. దీని ద్వారా ప్రజా సేవ, ఉమ్మడి బాధ్యతా స్ఫూర్తిని బలోపేతం చేస్తారు.
దేశ ప్రయోజనాల దృష్ట్యా గౌరవ ప్రధానమంత్రి పిలుపుమేరకు ఈ చరిత్రాత్మక ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనాలని దేశవ్యాప్తంగా ఉన్న యువతను, సామాజిక సంస్థలను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. లక్షలాది మంది యువత, వివిధ సంస్థలు, సామాజిక సంఘాల సమష్టి కృషితో మాదకద్రవ్యాల వినియోగాన్ని తిరస్కరించేలా వ్యక్తులకు స్ఫూర్తినిస్తూనే.. ఆరోగ్యకరమైన, బలమైన, మరింత అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి దోహదపడే దేశవ్యాప్త సామాజిక ఉద్యమాన్ని రూపొందించటమే ఈ ప్రచార లక్ష్యం.
మాదకద్రవ్యాలపై పోరాటాన్ని పౌరుల క్రియాశీల భాగస్వామ్యంతో నడిచే ప్రజా ఉద్యమంగా మార్చాలనే ప్రధానమంత్రి దృక్పథాన్నివికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కోసం నషా ముక్త యువ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది. "మాదకద్రవ్య రహిత యువతే వికసిత్ భారత్కు అత్యంత బలమైన శక్తి" సందేశం ద్వారా జాతీయ సంకల్పాన్ని ప్రతి గ్రామానికి, పట్టణానికి, నగరానికి తీసుకెళ్లటం.. వికసిత్ భారత్-2047 దిశగా భారత్ ప్రయాణాన్ని మరింత బలోపేతం చేయటమే ఈ ప్రచారం ఉద్దేశం.
***
(रिलीज़ आईडी: 2291203)
आगंतुक पटल : 9