రక్షణ మంత్రిత్వ శాఖ
ఐసీజీ సిబ్బంది, వారి కుటుంబాల కోసం చరిత్రాత్మక విధాన సంస్కరణలను ఆవిష్కరించిన రక్షణ మంత్రి
प्रविष्टि तिथि:
28 JUL 2026 12:33PM by PIB Hyderabad
భారత తీర రక్షక దళం (ఐసీజీ) కోసం రెండు ముఖ్యమైన విధాన సంస్కరణలను రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించారు. అధికారుల నియామకం, సేవా నిబంధనల్లో స్త్రీపురుష సమానత్వాన్ని ప్రోత్సహించడం, విధి నిర్వహణలో భాగంగా.. సముద్రంలో గల్లంతయిన సిబ్బంది కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా మంజూరు చేసే పరిపాలనా విధానాలను క్రమబద్ధీకరించడం ఈ సంస్కరణల లక్ష్యాలుగా ఉన్నాయి. రక్షణ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్, డీజీ ఐసీజీ డైరెక్టర్ జనరల్ పరమేశ్ శివమణి, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్–2లో 2026, జులై 28న ఈ కార్యక్రమం జరిగింది.
గడచిన అయిదు దశాబ్దాలుగా ఐసీజీ చేస్తున్న ఉత్తమ సేవలను రక్షణ మంత్రి కొనియాడారు. 2027లో స్వర్ణిమ్ జయంతి (గోల్డెన్ జూబ్లీ) దిశగా పయనిస్తున్న నేపథ్యంలో ఈ బలగాల నైతిక స్థైర్యాన్నీ, కార్యాచరణ సామర్థ్యాన్నీ... భవిష్యత్తు దృష్టితో కూడిన ఈ విధానాలు మరింత బలోపేతం చేస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఐసీజీని ఆధునికమైన, సామర్థ్యం కలిగిన, భవిష్యత్తకు తగిన తీరభద్రతా దళంగా బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సారథ్యంలోని ప్రభుత్వ సంకల్పాన్ని ఆయన పునరుద్ఘాటించారు.
లింగ వివక్షకు తావు లేని నియామకాలు, కెరీర్ వృద్ధి
ఐసీజీలో అధికారుల నియామకంలో లింగ వివక్షకు తావు లేని విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా సమగ్రమైన, మహిళా కేంద్రీకృత పద్ధతిని మొదటి విధానం ఏర్పాటు చేస్తుంది. స్వల్పకాలిక సేవా నియామకాలు (ఎస్ఎస్ఏ), శాశ్వత నియామకాలు (పీఏ) రెండింటిలోనూ మహిళా అభ్యర్థులను పురుషులతో సమానంగా నియమించడం కూడా ఈ విధానంలోని ముఖ్యాంశాల్లో ఉంది. పురుష అభ్యర్థులకు కూడా ఎస్ఎస్ఏను అందుబాటులోకి తీసుకువచ్చారు.

ప్రారంభ శిక్షణ దశ నుంచే కెరీర్ పురోగతికి సమాన అవకాశాలను ఈ విధానం అందిస్తుంది. ఇప్పటికే పీఏ విధానంలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా అధికారులను వారి నిర్దేశిత అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నత పదవుల కోసం పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే ప్రస్తుతం ఎస్ఎస్ఏ విధానంలో పనిచేస్తున్న మహిళా అధికారులు, నిర్దేశిత అర్హత ప్రమాణాలు కలిగి ఉన్నట్లయితే తమ సర్వీసును పీఏగా మార్చుకొనే అవకాశాన్ని కల్పిస్తుంది. దేశ నావికా దళంలో నారీశక్తికి సమాన అవకాశాలు కల్పించాలనే ప్రభుత్వ నిబద్ధతను ఈ పురోగామి చర్య ప్రతిబింబిస్తుంది.
సముద్రంలో గల్లంతైన సిబ్బంది కోసం క్రమబద్ధీకరించిన ఎక్స్–గ్రేషియా విధానాలు:
విధి నిర్వహణలో దురదృష్టవశాత్తూ సముద్రంలో గల్లంతైన సిబ్బంది సమీప బంధువు (ఎన్ఓకే)కి ఉపశమనాన్ని, పాలనాపరమైన సౌలభ్యాన్ని రెండో విధాన సంస్కరణ అందిస్తుంది. ఎక్స్–గ్రేషియా ప్రయోజనాలను అందించేలా విధి నిర్వహణలో సముద్రంలో గల్లంతైన ఐసీజీ సిబ్బందిని ‘మరణించినట్లుగా భావిస్తున్నట్లు’ ప్రకటించే అధికారాన్ని కల్పించడం ఈ విధానంలో ఉన్న అత్యంత ప్రధానాంశం. ఎన్వోకేకు ఎక్స్-గ్రేషియా పరిహారం, పదవీ విరమణ ప్రయోజనాలను మంజూరు చేసే ప్రక్రియను గణనీయంగా సులభతరం చేసి, వేగవంతం చేస్తుంది. ఈ చర్య, మానసిక క్షోభ సమయంలో ధైర్యవంతులైన సైనికుల కుటుంబాలను దీర్ఘకాలిక పరిపాలనా జాప్యాల ప్రభావానికి గురి కాకుండా చేస్తుంది.

***
(रिलीज़ आईडी: 2290351)
आगंतुक पटल : 11