ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

చండీగఢ్‌లో ఆరోగ్య సంరక్షణ.. విద్య.. రహదారి మౌలిక సదుపాయాలు సహా ₹4,700 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

“ఆరోగ్య సంరక్షణ.. విద్య.. అనుసంధానంలో గణనీయంగా పురోగమిస్తున్న చండీగఢ్‌లో ఈ రోజు ప్రజలకు మరింత లబ్ధి చేకూర్చే ప్రాజెక్టులను ప్రారంభించడం ఆనందంగా ఉంది”

“పరిశుభ్రత అనేది ఒక్క రోజుతో సాధ్యమయ్యేది కాదు.. అదొక జీవన విధానం”

“కోవిడ్-19 మహమ్మారి విజృంభించిన వేళ భారత్‌ సాయం కోరేదిగా కాకుండా ప్రపంచానికే ఆపన్నహస్తం అందించే దేశంగా నిలిచింది”

“భారత్‌లో ఆరోగ్య సంరక్షణ ఇకపై విశేషాధికారం కాదు.. అదొక హక్కుగా మారుతోంది”

प्रविष्टि तिथि: 17 JUL 2026 5:24PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు చండీగఢ్‌లో ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి మౌలిక సదుపాయాలు సహా ₹4,700 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. క్రమబద్ధ జాతీయ ప్రగతికి ఈ నగరం ఒక ఆదర్శప్రాయ నమూనాగా నిలుస్తున్నదని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. దేశంలో దీనికిగల ప్రత్యేక స్థానాన్ని ప్రస్తావిస్తూనే- మెరుగైన జీవనశైలితో పాటు జీవన సౌలభ్య కల్పనలో నగరానికిగల ప్రాచుర్యాన్ని పునరుద్ఘాటించారు. ఈ ప్రాంతంపై చండీమాత కృప మెండుగా ఉందంటూ- దీని నిరంతర, వ్యవస్థీకృత ప్రగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. “ప్రస్తుత ప్రభుత్వం చండీగఢ్ ప్రగతికి సదా అగ్ర ప్రాధాన్యం ఇస్తోంది” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.

ఏడాదిన్నర కిందట దేశ న్యాయవ్యవస్థలో ప్రవేశపెట్టిన భారీ, చారిత్రక సంస్కరణలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. శిక్షాత్మక వలసవాద చట్టాల నుంచి న్యాయ ప్రదాన వ్యవస్థ వైపు పరిణామాన్ని వివరిస్తూ- “భారతీయ న్యాయ సంహిత అమలు చండీగఢ్ నుంచే మొదలైంది” అని ఆయన గుర్తుచేశారు.

పట్టణ రూపురేఖల ఆధునికీకరణ దిశగా పెట్టుబడుల వివరాలను ఏకరవు పెడుతూ- ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, డిజిటల్ గవర్నెన్స్ వంటి పరిణామాత్మక కార్యక్రమాలను ఆయన ఉటంకించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభోత్సవంపై నగర ప్రజలకు అభినందనలు తెలిపారు. భవిష్యత్ అవసరాలకు తగిన నవీకరణ కార్యక్రమాల కోసం భారీగా పెట్టుబడులు పెడుతుండటాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. “నగరాన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దే కార్యక్రమం కింద రూ.2,500 కోట్లకు పైగా ఖర్చు చేశారు” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ప్రాంతీయ ప్రగతికి ఉద్దేశించిన నేటి తన విస్తృత పర్యటన వివరాలను ఈ సందర్భంగా ప్రధానమంత్రి వెల్లడించారు. హర్యానాలోని జింద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నానని, ఇప్పుడు పంజాబ్‌లోని జలంధర్‌ సందర్శనకు వెళ్లబోతున్నానని ప్రకటించారు. ఈ పర్యటనను ఇరుగుపొరుగు రాష్ట్రాలను నిరంతరం సంధానించే ఓ ప్రధాన భౌగోళిక-పరిపాలన వారధిగా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు “హర్యానా-పంజాబ్ రాష్ట్రాలు రెండింటినీ మన చండీగఢ్ నగరం సమర్థంగా జోడిస్తుంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

స్థానిక పట్టణాభివృద్ధికిగల విస్తృత ప్రాంతీయ ప్రభావాన్ని ప్రస్తావిస్తూ- నగరంలో చేపట్టే అభివృద్ధి పనులతో హిమాచల్ ప్రదేశ్-జమ్మూకాశ్మీర్‌ పొరుగు రాష్ట్రాల జనజీవన నాణ్యత ప్రత్యక్షంగా మెరుగుపడే తీరును ప్రధానమంత్రి వివరించారు. ప్రాంతీయ ఆరోగ్య సంరక్షణలో నగరానికి గల అద్వితీయ-కీలక పాత్రను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. “ఈ ప్రాంతమంతటికీ వైద్య సేవలందించే భారీ కూడలి చండీగఢ్ నగరం” అని శ్రీ మోదీ వివరించారు.

స్థానిక వైద్య సంస్థలలో అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ సదుపాయాల భారీ విస్తరణను ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ మేరకు చండీగఢ్‌లోని “న్యూరోసైన్స్ సెంటర్, మదర్ అండ్ చైల్డ్ సెంటర్, క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్‌” సహా ఇక్కడి కీలక మార్పుచేర్పులను వివరించారు. “ఈ ప్రాజెక్టులతో  లక్షలాది ప్రజలకు మరింత మెరుగైన చికిత్స సౌలభ్యం కలుగుతుంది” అని శ్రీ మోదీ చెప్పారు. ఈ సంస్థ స్నాతకోత్సవం పాల్గొనేందుకు తానీ నగరాన్ని సందర్శించడాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. గడచిన దశాబ్ద కాలంలో సాధించిన అసాధారణ సామర్థ్య వికాసాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఈ ప్రగతిని నిరంతరం కొనసాగిస్తున్న పాలన యంత్రాంగం, అధ్యాపక సిబ్బందితోపాటు వైద్య నిపుణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “ఈ సంస్థ సామర్థ్య విస్తరణలో తమ వంతు పాత్ర పోషించిన ప్రొఫెసర్లు, యువ వైద్యులను నేనెంతో అభినందిస్తున్నాను” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

పటిష్ట ప్రజారోగ్యం, కఠిన పారిశుధ్య ప్రమాణాల మధ్యగల ప్రత్యక్ష సంబంధాన్ని వివరిస్తూ- దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ మిషన్‌ను ప్రారంభించామని గుర్తుచేశారు. దీనికింద కోట్లాది మరుగుదొడ్ల నిర్మాణం నుంచి బహిరంగ విసర్జన నిర్మూలన దాకా అమలు చేసిన భారీ స్వరూపాత్మక మార్పులను ప్రధానమంత్రి ప్రస్తావించారు. పరిశుభ్రత ర్యాంకింగ్‌ మెరుగుదల దిశగా చండీగఢ్‌ కృషిని ఆయన ప్రశంసించారు. “పరిశుభ్రత మన దైనందిన జీవనశైలిలో  అంతర్భాగమయ్యేలా వివిధ కార్యక్రమాలను ప్రారంభించాం” అని శ్రీ మోదీ విశదీకరించారు.

పౌర జీవనంపై అసాధారణ అంకితభావం కనబరిచిన స్థానిక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కృషి ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. క్షేత్రస్థాయిలో పారిశుధ్య ఉద్యమానికి నాంది పలికిన ‘చీపురు యోధుడు’గా ప్రజల మెప్పు పొందిన శ్రీ ఇందర్‌జిత్ సింగ్ సిధ్ధూను ఆయన ప్రశంసించారు. ఈ స్ఫూర్తిదాయక సామాజిక కృషిని ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారంతో అధికారికంగా గుర్తించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సగర్వంగా స్వాగతిస్తున్నానని ప్రకటించారు. తదనుగుణంగా “పౌరులలో నవ చైతన్యం రగిల్చిన ఆయనను మా ప్రభుత్వం ఈ ఏడాది పద్మ పురస్కారంతో సత్కరించింది” అని శ్రీ మోదీ గుర్తుచేశారు.

ప్రజారోగ్యం తాత్కాలిక కార్యక్రమం కాదని, అదొక జీవన విధానమని ప్రధానమంత్రి అభివర్ణించారు. నేటి కార్యక్రమంలో ‘స్వచ్ఛత సే స్వాగత్’ను ప్రత్యేకంగా చేర్చడంపై ఆయన హర్షం వెలిబుచ్చారు. దీన్ని అంకితభావంతో అమలు చేస్తున్న స్థానిక పౌరులను ప్రశంసిస్తూ, వ్యాధుల నివారణలో ఇదెంతో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. “దేశవ్యాప్తంగా అనేక వ్యాధుల నివారణలో పరిశుభ్రత కార్యక్రమాలు అద్భుతంగా దోహదం చేశాయి” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

దేశ ఆరోగ్య సంరక్షణ రంగ సామర్థ్యంపై గతంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన ద్యోతకమయ్యేదని ఆయన గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా సంక్షోభ సమయాల్లో తలెత్తిన ఆనాటి చారిత్రక సందేహాలకు, కరోనా మహమ్మారి వేళ దేశం ప్రదర్శించిన చురుకైన నాయకత్వ పటిమకు మధ్యగల వ్యత్యాసాన్ని ప్రధానమంత్రి వివరించారు. మహమ్మారి విజృంభించినపుడు సహాయం కోరేదిగా కాకుండా ప్రపంచానికి ఆపన్న హస్తం అందించేదిగా దేశం సగర్వంగా నిలిచిందని పేర్కొన్నారు. ఇక నేడు సంక్లిష్ట వైద్య చికిత్స అవసరమైనపుడు భారత్‌ ఒక ప్రధాన వైద్య కేంద్రంగా ప్రపంచానికి కనిపిస్తున్నదని ఆయన సగర్వంగా గుర్తుచేశారు. “భారత్‌ సామర్థ్యాన్ని ఆమూలాగ్రం తీర్చిదిద్దడం ద్వారా దేశంపై ప్రపంచ దృక్పథాన్ని మా ప్రభుత్వం పూర్తిగా మార్చేసింది” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.

పన్నెండేళ్లుగా అంకితభావంతో కూడిన విధానాల అమలు వల్లే ఈ వినూత్న మార్పు సాధ్యమైందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వైద్య సదుపాయాల లేమిని నిర్మూలించి, పౌరులందరికీ చౌకైన, నాణ్యమైన సంరక్షణను అందించాలనే ప్రాథమిక ప్రతినను ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. “పుష్కర కాలంలో దేశం సాధించిన విజయం ఈ సంకల్పం ఫలితమే” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

దేశవ్యాప్తంగా వైద్య మౌలిక సదుపాయాల విస్తరణను వివరిస్తూ- 2014 తర్వాత 15 కొత్త ‘ఎయిమ్స్‌’ నిర్మాణానికి ఆమోదం తెలిపామని వివరించారు. అలాగే, వందలాది వైద్య కళాశాలల స్థాపన సహా ప్రత్యేక ఆసుపత్రుల సత్వర విస్తరణ వంటి అంశాలను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుతం వేలాది రోగులకు నిపుణ సేవలందిస్తున్న చండీగఢ్‌లోని హోమీ భాభా కేన్సర్ ఆసుపత్రిని 2022లో తాను ప్రారంభించడాన్ని ఆయన సగర్వంగా ప్రస్తావించారు. “ఇటీవలి కాలంలో భారత్‌ తన ఆరోగ్య  సంరక్షణ మౌలిక సదుపాయాలను వేగంగా, భారీగా విస్తరించింది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

క్షేత్రస్థాయి వైద్య సదుపాయాల కల్పనను ప్రస్తావిస్తూ- ‘క్రిటికల్ కేర్ బ్లాక్‌’లు, ‘పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌’ల ద్వారా ప్రాథమిక సంరక్షణను బలోపేతం చేయడంలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ పాత్రను ప్రధానమంత్రి వివరించారు. పట్టణ, గ్రామీణ, గిరిజన ప్రజానీకం నివసించే ప్రాంతాలన్నిటా దాదాపు 1.75 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం వీటిలో కీలక స్క్రీనింగ్, సమగ్ర ఆరోగ్య ప్యాకేజీలు లభిస్తున్నాయని ఆయన వెల్లడించారు. “ప్రతి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల సత్వర అభివృద్ధిపై ముమ్మరంగా దృష్టి పెడుతున్నాం” అని శ్రీ మోదీ తెలిపారు.

ప్రజారోగ్యంతో డిజిటల్ సాంకేతికత విప్లవాత్మక అనుసంధానాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- ‘ఇ-సంజీవని’ మిషన్‌ ద్వారా నిపుణ వైద్య సంప్రదింపులను అందరికీ అందుబాటులోకి తేవడాన్ని ప్రశంసించారు. దీనివల్ల మారుమూల ప్రాంతాల ప్రజలు ఇప్పుడు శ్రమకోర్చి ప్రయాణం చేయాల్సిన అవసరం లేదన్నారు. “ఈ రోజు దేశవ్యాప్తంగా 48 కోట్లకు పైగా టెలిమెడిసిన్ సంప్రదింపులు నమోదయ్యాయి” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ఈ సమగ్ర వైద్య సంస్కరణల ప్రాణరక్షక ప్రభావాన్ని వివరిస్తూ- ఇప్పుడు 90 శాతానికి పైగా ప్రసవాలు అత్యంత సురక్షిత సంస్థాగత వాతావరణంలో విజయవంతం అవుతున్నాయని ప్రధానమంత్రి వెల్లడించారు. దేశంలో ప్రసూతి మరణాలు 86 శాతం మేర  తగ్గడంతోపాటు శిశు మరణాలు కూడా గణనీయంగా తగ్గాయని ఆయన వెల్లడించారు. “ఆరోగ్య సేవల భారీ విస్తరణ వల్ల శిశు మరణాల శాతం కూడా భారీగా దిగివచ్చింది” అని శ్రీ మోదీ చెప్పారు.

చికిత్సల పరంగా ప్రగతి, చురుకైన ఆరోగ్య వ్యూహాల సమతౌల్యం ద్వారా నివారణ ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వం రెండువైపులా దృష్టి సారిస్తున్నదని ప్రధానమంత్రి చెప్పారు. సంభావ్య ఆరోగ్య సంక్షోభాల నుంచి భారీ జనాభాను చురుగ్గా కాపాడుతుండటాన్ని ఆయన ప్రస్తావించారు. దీంతోపాటు పోషణ్ అభియాన్, మిషన్ ఇంద్రధనుష్, యోగాకు ప్రోత్సాహం, ‘హెచ్‌పివి’ టీకా కార్యక్రమాలు, ‘యు-విన్’ వేదిక తదితర సమగ్ర కార్యక్రమాలకు ఈ ఘటన దక్కుతుందని తెలిపారు. “ఇలాంటి అనేక ప్రధాన కార్యక్రమాల ద్వారా కోట్లాది ప్రజలకు నిరంతర ఆరోగ్య సంరక్షణ లభిస్తోంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

క్షయవ్యాధిపై జాతీయ స్థాయిలో ముమ్మర పోరు సాగడాన్ని వివరిస్తూ- సకాలంలో స్క్రీనింగ్-చికిత్సపై సమాజాధారిత ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’ దృష్టి సారిస్తున్నదని ప్రధానమంత్రి తెలిపారు. ప్రపంచ ఆరోగ్యం సంస్థ ప్రకటించిన ఇటీవలి నివేదికను ఆయన ఉటంకించారు. భారత్‌లో గత దశాబ్దం కాలంలో ఇన్ఫెక్షన్లు 21 శాతం తగ్గాయని, 90 శాతానికి పైగా ప్రజలకు పటిష్ట చికిత్స లభిస్తున్నదని పేర్కొంటూ ఆయన అభినందనలు తెలిపారు. “క్రియాశీల ప్రజా భాగస్వామ్యంతో ప్రతి ఒక్కరికీ మరింత అవగాహన కల్పిస్తున్నాం” అని శ్రీ మోదీ వివరించారు.

ఈ ఆరోగ్య విప్లవంలో ప్రాథమిక లబ్ధిదారుల గురించి ప్రస్తావిస్తూ- అల్ప, మధ్యాదాయ వర్గాలు అత్యంత కీలక ప్రయోజనాలు పొందుతున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సమాన వైద్య సదుపాయ లభ్యతపై దేశ దృక్పథంలో ప్రాథమిక మార్పు అవశ్యమని ఆయన నొక్కి చెప్పారు. “దేశంలో ఆరోగ్య సేవలు ఇకపై విశేషాధికారం కాదు... అదొక సంపూర్ణ హక్కుగా మారుతోంది” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.

వైద్య విద్యలో చారిత్రక ప్రతిబంధకాలపై స్పందిస్తూ- లోగడ విద్యార్థుల ఆశలను దెబ్బతీసిన సీట్ల కొరతను ప్రధానమంత్రి గుర్తుచేశారు. నేడు వైద్య కళాశాలల సంఖ్య దాదాపు రెట్టింపు అయిందని, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు రికార్డు స్థాయిలో పెరిగాయని, స్థానిక సంస్థల పరిధిలో ఎంబీబీఎస్ కళాశాలల ఏర్పాటుకు ఆమోదం ఇచ్చామని ఆయన ప్రకటించారు. “ఈ భారీ విస్తరణతో ప్రతిభావంతులైన యువతకు అగ్రశ్రేణి సంస్థలలో విద్యాభ్యాస అవకాశం లభించడం ద్వారా దేశానికి ఉత్తమ వైద్యులు అందుబాటులోకి వస్తారు” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

చండీగఢ్‌లో విద్యా, ఇంజనీరింగ్, వైద్య పరిశోధన సంస్థలు కేంద్రీకృతం కావడాన్ని ప్రశంసిస్తూ- అంకుర సంస్థలు, సాంకేతిక ఆవిష్కరణలకు ఒక ప్రధాన కూడలిగా ఈ నగరం వేగంగా ఎదుగుతున్నదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ విద్యా ప్రస్థానాన్ని వేగిరపరచే దిశగా పంజాబ్ ఇంజినీరింగ్ కళాశాలలో ‘కురుక్షేత్ర బాలుర హాస్టల్’ ప్రారంభోత్సవాన్ని, పరిశోధక విద్యార్థుల కోసం కొత్త వసతి గృహాలకు శంకుస్థాపనను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. “ఆధునిక పరిశోధనల దిశగా మన యువతకు సాధ్యమైనంత ఉత్తమ ప్రయోగశాలలు, మెరుగైన బోధకులు లభించాలన్నదే మా తపన” అని శ్రీ మోదీ చెప్పారు.

కఠిన విద్యా వాతావరణాన్ని సాంకేతిక ప్రగతితో నేరుగా సంధానిస్తూ- కృత్రిమ మేధ, సెమీకండక్టర్లు, డీప్-టెక్ రంగాల్లో ముందంజ కోసం ఒక పటిష్ట పరిశోధన వ్యవస్థ ఆవశ్యకతను ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ కీలక జాతీయ లక్ష్యాన్ని విజయవంతంగా అమలు చేయడంలో స్థానిక విద్యావేత్తలు, విద్యార్థుల సామర్థ్యంపై ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. “పరిశోధన వాతావరణం వాస్తవికంగా బలమైనదైతేనే ఆవిష్కరణల వేగం ఇనుమడిస్తుంది” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

పటిష్ట మౌలిక సదుపాయాలే ఆర్థిక సౌభాగ్యానికి అంతిమ నమూనా అని ప్రకటిస్తూ- ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న సర్వతోముఖాభివృద్ధి విధానాన్ని ప్రధానమంత్రి ఉదాహరించారు. విమానాశ్రయ రహదారి రద్దీ తగ్గించే దిశగా ఐటీ సిటీ నుంచి కురాలి వరకూ ఆరు వరుసల కొత్త రహదారిని ఆయన ప్రారంభించారు. అలాగే ప్రాంతీయ ప్రయాణికులకు మరింత ప్రయాణ సౌలభ్యం దిశగా ‘పీఆర్ సెవెన్ స్పర్’కు శంకుస్థాపన చేశారు. “ఇటువంటి వ్యూహాత్మక అభివృద్ధి పనులతో పరిశ్రమలు, వ్యాపారాలకు నవ్యోత్తేజం కలుగుతుంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ప్రాంతీయ అనుసంధానం గురించి వివరిస్తూ- పంజాబ్‌లోని జలంధర్‌లో పలు రైల్వే ప్రాజెక్టులను ఏకకాలంలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జింద్-సోనిపత్‌ మార్గంలో దేశంలోనే తొలి కాలుష్య రహిత హైడ్రోజన్ ఇంధన రైలు చారిత్రక ప్రారంభాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. సుస్థిర, పర్యావరణ హిత రవాణా రంగంలో సాధించిన ఈ చరిత్రాత్మక జాతీయ విజయంపై ఆయన ప్రజలకు అభినందనలు తెలిపారు. “పూర్తి కాలుష్య రహిత ఇంధనంతో నడిచే ఈ రైలు దేశం ఒక చారిత్రక మలుపు తిరగడాన్ని సూచిస్తుంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

వికసిత భారత్ కోసం దూరదృష్టి సహిత ఆలోచనను తన ప్రసంగంలో ఉటంకిస్తూ- భవిష్యత్ సంసిద్ధ సాంకేతికతలు, రవాణా వ్యవస్థలు, ఆరోగ్య సంరక్షణ ప్రాంగణాల నిర్మాణంపై నిరంతరం దృష్టి సారించాల్సి ఉందని ప్రధానమంత్రి సూచించారు. భవిష్యత్తరాలకు సేవలందించే శాశ్వత సంస్థల నిర్మాణానికి ప్రస్తుత ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. చివరగా- “మన భావి తరాలకు గరిష్ఠ ప్రయోజనాలు సునాయాసంగా లభించాలంటే మనం సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి” అని శ్రీ మోదీ తన ప్రసంగం ముగించారు.

 

***


(रिलीज़ आईडी: 2286108) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada