ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి ఇండోనేషియా పర్యటనపై రెండు దేశాల సంయుక్త ప్రకటన
प्रविष्टि तिथि:
07 JUL 2026 5:15PM by PIB Hyderabad
1. ఇండోనేషియా అధ్యక్షుడు గౌరవనీయ ప్రబోవో సుబియాంతో ఆహ్వానం మేరకు, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 6 నుంచి 8 వరకు ఇండోనేషియాలో పర్యటిస్తున్నారు. శ్రీ ప్రబోవో 2025 జనవరి 23 నుంచి 26 వరకు భారత 76వ గణతంత్ర దినోత్సవ ముఖ్యఅతిథిగా భారత్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తుత పర్యటన ఒక కీలక ఘట్టంగా నిలుస్తోంది. భారత్-ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో గణనీయ ప్రగతి దిశగా ఇద్దరు నాయకుల సమష్టి నిబద్ధతను ఈ పర్యటన ప్రతిబింబిస్తోంది.
2. ఈ పర్యటనలో భాగంగా జకార్తా చేరుకున్న ప్రధానమంత్రి శ్రీ మోదీకి ‘ఇస్తానా మెర్డెకా’లో ఘన స్వాగతం లభించింది. అనంతరం అధ్యక్షుడు ప్రబోవో, ప్రధానమంత్రి మోదీ మధ్య ముఖాముఖి సంభాషణతోపాటు ప్రతినిధి బృందాల స్థాయి సమావేశాల్లో ద్వైపాక్షిక చర్చలు సాగాయి. అటుపైన ప్రధానమంత్రి గౌరవార్థం శ్రీ ప్రబోవో అధికారిక విందు ఏర్పాటు చేశారు. ఇండోనేషియా పార్లమెంట్ ప్రతినిధుల సభ స్పీకర్ గౌరవనీయ డాక్టర్ పూవాన్ మహారాణి ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి పార్లమెంటులో ప్రసంగించారు. ఆ తర్వాత యోగ్యకార్తాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ‘ప్రంబనన్’ ఆలయ సముదాయంలో పునరుద్ధరణ-పరిరక్షణ పనులను ప్రధానమంత్రి మోదీ, అధ్యక్షుడు ప్రబోవో సంయుక్తంగా ప్రారంభించారు. పర్యటనార్థం వచ్చిన ప్రధానమంత్రి గౌరవార్థం ఇండోనేషియాలోని భారతీయులు ఏర్పాటు చేసిన విందులోనూ ఇద్దరు నాయకులు పాల్గొన్నారు.
రాజకీయ సహకారం
3. జకార్తాలోని ఇస్తానా మెర్డెకాలో ప్రధానమంత్రి మోదీ, అధ్యక్షుడు ప్రబోవో ఇవాళ అధికారిక ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలు సహా రాజకీయ భాగస్వామ్యం, రక్షణ-భద్రత-సముద్ర సహకారం, వాణిజ్యం-పెట్టుబడులు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, శాస్త్ర-సాంకేతికతలు, అంతరిక్షం, కీలక ఖనిజాలు, ఇంధనం, వ్యవసాయ, ఆరోగ్య, ఔషధ, విద్య, సంస్కృతి, పర్యాటకం, యువత ఆదానప్రదానం, ప్రజల మధ్య సంబంధాలు తదితర పరస్పర ప్రయోజన అంశాలపై పూర్తిలో చర్చించారు. రెండు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ద్వైపాక్షిక పత్రాల ఆదానప్రదానాన్ని వారిద్దరూ పర్యవేక్షించారు.
4. వ్యూహాత్మక సంబంధాలను మరింత విస్తరించే దిశగా ఉన్నత స్థాయి చర్చల ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ, బహుపాక్షిక కార్యక్రమాలు సహా క్రమం తప్పకుండా శిఖరాగ్ర సమావేశాల నిర్వహణకు నాయకులిద్దరూ అంగీకరించారు.
5. ఇప్పటికే కొనసాగుతున్న సంయుక్త కార్యాచరణ యంత్రాంగాల బలోపేతం, సంయుక్త కమిషన్ సమావేశం, విదేశాంగ కార్యాలయ సంప్రదింపులు, ఇతర మంత్రిమండలి-ఉన్నతాధికార స్థాయి సంభాషణల యంత్రాంగాలు, ఆదానప్రదానాలు సహా క్రమబద్ధ ద్వైపాక్షిక సంప్రదింపుల కొనసాగింపు ప్రాముఖ్యాన్ని వారు పునరుద్ఘాటించారు.
6. ఉభయ దేశాల జాతీయ చట్టసభల్లో భారత్-ఇండోనేషియా పార్లమెంట్లరీ స్నేహ బృందాల ఏర్పాటుపై వారు హర్షం వెలిబుచ్చారు. అలాగే, ఆ ప్రతినిధి బృందాల పరస్పర క్రమబద్ధ పర్యటనల ద్వారా రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య పార్లమెంటరీ ఆదానప్రదానాన్ని పెంచాల్సిన అవసరాన్ని కూడా వారు పునరుద్ఘాటించారు.
7. జకార్తాలో 2025 ఏప్రిల్ 23నాటి భారత్-ఇండోనేషియా 3వ విధాన ప్రణాళిక చర్చలు, 2025 సెప్టెంబరు 15-16 తేదీలలో భారత్-ఇండోనేషియా ట్రాక్ 1.5 రెండో దఫా చర్చలు, 2025 ఆగస్టు 5-6 తేదీల్లో ‘జకార్తా ఫ్యూచర్స్ ఫోరమ్’తోపాటు రెండు దేశాల మేధా మథన బృందాలు, విద్యాసంస్థలు, విధాన నిపుణుల మధ్య చర్చా కార్యక్రమాల ద్వారా పరస్పర అవగాహన పెంపు, మెరుగైన భాగస్వామ్యం దిశగా సాగిన కృషిపై నాయకులిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు.
రక్షణ - సముద్ర రంగ సహకారం
8. సముద్ర తీర ఇరుగుపొరుగు దేశాలైన భారత్-ఇండోనేషియాల మధ్య పటిష్ట రక్షణ సహకారం రీత్యా వ్యూహాత్మక భాగస్వామ్యం కింద 2018లో “ఇండో-పసిఫిక్లో సముద్ర సహకారంపై భారత్-ఇండోనేషియా ఉమ్మడి దృక్కోణం” ఆమోదం పొందడాన్ని వారు గుర్తుచేసుకున్నారు. ఈ నేపథ్యంలో రక్షణ-సముద్ర రంగ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడంతోపాటు విస్తరించే దిశగా తమ నిబద్ధతను నాయకులిద్దరూ పునరుద్ఘాటించారు.
9. రెండు దేశాల రక్షణ మంత్రుల స్థాయిలో 2025 నవంబరు 27నాటి 3వ దఫా సమావేశంపై వారిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రక్షణ రంగ చర్చలు, సంయుక్త విన్యాసాలు, సిబ్బంది చర్చలు, నవ్య రక్షణ సాంకేతికతలపై సంయుక్త పరిశోధన-ఉత్పత్తి తదితరాలను క్రమం తప్పకుండా కొనసాగించాలని నిర్ణయించారు. అలాగే, ఓడరేవుల సందర్శన, శాంతి పరిరక్షణ కార్యకలాపాలు, సమాచార భాగస్వామ్యం, జలవిజ్ఞానం, సామర్థ్య వికాసం, కేడెట్ శిక్షణ, ఆదానప్రదానం, రక్షణ పారిశ్రామిక సహకారం సహా సంప్రదాయ-ఆధునిక రంగాల్లో సహకార విస్తృతి దిశగా భాగస్వామ్యాలను పెంచుకోవడానికి అంగీకరించారు. బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థపై సహకారంతోపాటు గగనతల క్షిపణి సహకార ఒప్పందం ద్వారా రక్షణ సహకారాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంపై హర్షం వ్యక్తం చేశారు.
10. రెండు దేశాల పరస్పర ప్రయోజనాలు-ప్రాథమ్యాల ప్రాతిపదికన సముద్ర రంగ అవగాహన, అనుసంధానం, తీరప్రాంత నిఘా, మానవతా-విపత్తు సహాయం, కాలుష్య నియంత్రణ, శోధన-రక్షణ రంగాలు సహా ప్రస్తుతం కొనసాగుతున్న సహకారంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో శాంతి-భద్రతలు, సౌభాగ్యం దిశగానే కాకుండా విస్తృత ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మరింత స్థిరత్వ సాధనకు ఈ సహకారం దోహదం చేస్తుందని వారు అభిప్రాయపడ్డారు. సముద్ర భద్రత, రక్షణ సహకారంపై అవగాహన ఒప్పందం పునరుద్ధరణ సహా ‘బకమ్లా ఆర్ఐ’-ఇండియన్ కోస్ట్ గార్డ్’ మధ్య ఒప్పందం కుదరడంపై వారు హర్షం వెలిబుచ్చారు.
11. ఉమ్మడి విన్యాసాలు, రక్షణరంగ శిక్షణ కార్యక్రమాల వ్యూహాత్మక-కార్యాచరణ ప్రాధాన్యంతోపాటు ప్రస్తుత నావికా సహకారాన్ని మరింత బలోపేతం చేయడంలో వాటి పాత్రను నాయకులిద్దరూ గుర్తించారు. రెండు దేశాల జాతీయ చట్టాలు-నిబంధనలతోపాటు 1982నాటి ‘అంక్లాస్’ సహా అంతర్జాతీయ చట్ట సూత్రాలకు అనుగుణంగా పరస్పర ఆసక్తిగల సముద్ర సంబంధిత అంశాలపై నిర్మాణాత్మక చర్చల కొనసాగింపు అవకాశాల అన్వేషణ ప్రాముఖ్యతను వారిద్దరూ అంగీకరించారు.
12. గురుగ్రామ్లోని ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్-ఇండియన్ ఓషన్ రీజియన్లోఇండోనేషియా నుంచి ఒక అంతర్జాతీయ సంధాన అధికారి నియామకాన్ని వారిద్దరూ స్వాగతించారు. సముద్ర భద్రతలో పరస్పర ప్రయోజనకరమైన సహకారాంశాలను గుర్తించడంపై చర్చల కొనసాగింపుపై అంగీకారానికి వచ్చారు.
13. రక్షణ రంగ పరిశ్రమలు-సాంకేతికతలో సహకారాన్ని ప్రాధాన్య రంగాల్లో ఒకటిగా వారిద్దరూ గుర్తించారు. పరికరాల సంయుక్త ఉత్పాదన, సాంకేతికత బదిలీ-తోడ్పాటు, సామర్థ్య వికాసం, నౌకా నిర్మాణంలో సహకారం సహా రక్షణ పరికరాల కొనుగోళ్లు, ఏకరూప రక్షణ వేదికల దిశగా ‘ఎమ్ఆర్ఓ’ల ఏర్పాటుకు అంగీకరించారు. అలాగే, రక్షణ పరిశోధన-అభివృద్ధి దిశగా మార్గాన్వేషణ రక్షణ సరఫరా వ్యవస్థల బలోపేతం దిశగా పరిశ్రమల మధ్య పరస్పర ప్రయోజన సహకార విస్తరణ తదితరాలపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. సైనిక ఔషధ సరఫరాలపై భారత్-ఇండోనేషియా సాయుధ దళాల వైద్య సంస్థల మధ్య సహకారంలో పురోగతిపై వారు హర్షం వెలిబుచ్చారు.
ఉగ్రవాద నిరోధం - భద్రత సహకారం
14. అన్ని రూపాలు, వ్యక్తీకరణల సంబంధిత ఉగ్రవాదాన్ని నాయకులిద్దరూ నిర్ద్వంద్వంగా నిరసించారు. ఉగ్రవాద బెడద సమూల నియంత్రణ-నిర్మూలనలో అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా నిర్ణయాత్మక, సమన్వయ సహిత కృషి అవసరమని వారు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా నిషేధిత ఉగ్రవాదులు సహా ఐరాస 1267 తీర్మానం కింద ఆంక్షల కమిటీ జాబితాలోగల ఉగ్రవాద సంస్థలపైనా చర్యలకు ఉపక్రమించాలని కోరారు.
15. ఉగ్రవాదంతోపాటు ఆ దిశగా దారితీసే హింసాత్మక తీవ్రవాద నియంత్రణ-నిర్మూలనలో సహకార విస్తృతికి నాయకులిద్దరూ అంగీకరించారు. ఇందులో భాగంగా ఉగ్రవాద నిధుల కట్టడి, అంతర్జాతీయంగా అంగీకరించిన మనీలాండరింగ్ నిరోధం, ఉగ్రవాద నిధుల సమీకరణకు అడ్డుకట్ట వేసే ప్రమాణాలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. అదే సమయంలో ఉగ్రవాద చర్యల కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల దుర్వినియోగం నివారణ, ఆన్లైన్ నియామకాలు, డిజిటల్ వేదికల ద్వారా తీవ్రవాద భావజాల వ్యాప్తి నిరోధం-నిర్మూలన, హింసాత్మక తీవ్రవాద నివారణ కార్యక్రమాల్లో సహకార బలోపేతంపైనా వారు ఏకాభిప్రాయం వెలిబుచ్చారు.
16. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసే విధానాలను అనుసరించాలని నాయకులు పిలుపునిచ్చారు. ఉగ్రవాద నిధుల సమీకరణ మార్గాలను అడ్డుకోవడం సహా ఐక్యరాజ్య సమితి, ‘ఎఫ్ఏటీఎఫ్’ సహా ద్వైపాక్షిక-బహుపాక్షిక సహకార బలోపేతానికి చురుగ్గా చర్యలు కొనసాగించడంపై తమ నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు.
17. ఉగ్రవాదంతో అంతర్జాతీయ వ్యవస్థీకృత నేర సంబంధాలను గుర్తించి, జాతీయ-అంతర్జాతీయ చట్టాలు, బాధ్యతలకు అనుగుణంగా సమాచారంతోపాటు ఉత్తమ విధానాల ఆదానప్రదానంలో సహకారంపై వారిద్దరూ అంగీకారానికి వచ్చారు. సమీప భవిష్యత్తులో రెండు దేశాల మధ్య ఉగ్రవాద నిరోధక సహకారంపై అవగాహన ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయడంపై వారిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు.
18. భద్రత సంబంధ సమస్యలపై సమగ్ర చర్చకు భారత్-ఇండోనేషియా భద్రత చర్చల 3వ ప్రణాళికను నాయకులిద్దరూ స్వాగతించారు. ఈ చర్చల ద్వారా ఉగ్రవాద నిరోధం, వ్యవస్థీకృత, అంతర్జాతీయ నేరాలు, ఆధునిక సాంకేతికతలు-సైబర్ భద్రత, రక్షణ పరిశ్రమ, సముద్ర, అంతరిక్ష రంగాల్లో సంయుక్త కృషి తదితరాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని గణనీయంగా పెంచుకోవాలని రెండు దేశాలూ తీర్మానించాయి.
19. సైబర్ రంగంలో సహకారం అవకాశాలపై చర్చలు కొనసాగించేందుకు వారిద్దరూ అంగీకరించారు. ఈ మేరకు విధానపరమైన చర్చలు, సామర్థ్య వికాసం, ఉత్తమ పద్ధతుల ఆదానప్రదానం, సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆర్థిక సాంకేతికత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, కృత్రిమ మేధ, డిజిటల్ ఫోరెన్సిక్స్-కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సహకారం, కీలక సమాచార మౌలిక సదుపాయాల పరిరక్షణ, డిజిటల్ నైపుణ్య సామర్థ్య వికాసం వంటి రంగాల్లో నైపుణ్య మార్పిడి వంటివన్నీ ఇందులో భాగంగా ఉంటాయి. వెలిబుచ్చారు.
ఆర్థిక - వాణిజ్య సహకారం
20. భారత్-ఇండోనేషియా చైతన్యపూరిత సంబంధాల్లో ఆర్థిక-వాణిజ్య సహకారం కీలక స్తంభమని వారిద్దరూ పేర్కొన్నారు. ‘వికసిత భారత్-2047’, ‘ఇండోనేషియా ఇమాస్- 2045’ సంకల్పాల మధ్య సారూప్యాన్ని నాయకులిద్దరూ ప్రస్తావించారు. ఈ దార్శనికతలకు సబంధించిన విస్తృత ఆర్థిక, అభివృద్ధి సంబంధిత సమన్వయం సహా మరిన్ని ఆర్థిక అవకాశాల సద్వినియోగానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ దిశగా రెండు మధ్య విశాల, విస్తృత ఆర్థిక ఏకీకరణకు గల ప్రాధాన్యాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని అంగీకరించారు. ఈ క్రమంలో సమతుల, పరస్పర ప్రయోజనకర, సౌలభ్య వాణిజ్య వాతావరణం దిశగా ఆసియాన్-ఇండియా వస్తు వాణిజ్య ఒప్పందంపై సమీక్షను సకాలంలో ముగించాలని కోరారు. ఇది ద్వైపాక్షిక వాణిజ్యం పెంపుతోపాటు సమగ్ర, విస్తృత ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మరింత పటిష్ఠం చేసేదిగా ఉండాలని వారిద్దరూ ఆకాంక్షించారు.
21. 2026లో జరగబోయే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వర్కింగ్ గ్రూప్ (డబ్ల్యూజీటీఐ) రెండో సమావేశం, నాలుగో ద్వైవార్షిక వాణిజ్య మంత్రుల ఫోరమ్ (బీఐఎంఎఫ్), జాయింట్ ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ డైలాగ్ (ఈఎఫ్డీ) మొదటి సమావేశంతో సహా ప్రస్తుతం ఉన్న ద్వైపాక్షిక ఆర్థిక యంత్రాంగాలను పూర్తిగా ఉపయోగించుకోవాలనీ, బలోపేతం చేయాలనీ ఇరు దేశాల నాయకులు నిర్ణయించారు. ఇంకా పరిష్కారం కావాల్సి ఉన్న సుంక (టారిఫ్), సుంక రహిత (నాన్-టారిఫ్) అవరోధాలపై స్పష్టమైన, వ్యాపారాభివృద్ధికి తోడ్పడే ఫలితాలను సాధించే దిశగా ఈ యంత్రాంగాలు పనిచేయాలని వారు పేర్కొన్నారు. మార్కెట్ లభ్యతను మెరుగుపరచడం, వాణిజ్యం, పెట్టుబడులను సులభతరం చేయడం, ఆర్థిక రంగం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలు, సరఫరా శ్రేణులలో సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రతి దేశానికి సంబంధించిన నిబంధనలు, అభివృద్ధి ప్రాధాన్యతలను గౌరవిస్తూ చర్యలు చేపట్టాలని వారు నిర్ణయించారు.
22. దేశీయ తయారీ పరిశ్రమల వృద్ధికి అవసరమైన వైవిధ్యభరితమైన, పటిష్టమైన సరఫరా వ్యవస్థల నిర్మాణమే లక్ష్యంగా కీలక ఖనిజాలు, అరుదైన భూమూలకాల రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడం ఎంతో అవసరమనీ, దీని ద్వారా లోపాలను తగ్గించి, ఆర్థిక భద్రతను మరింత పటిష్టం చేయవచ్చని వారు అభిప్రాయపడ్డారు. అరుదైన భూమూలకాల రంగంలో ఇరు దేశాల మధ్య పెరుగుతున్న సహకారాన్ని నాయకులు అభినందించారు. ఈ విషయంలో నాన్-ఫెర్రస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ (ఎన్ఎఫ్టీడీసీ), మిడ్వెస్ట్ లిమిటెడ్, పీటీ పెరుసాహాన్ మినరల్ నాసియోనల్ (పీఈఆర్ఎంఐఎన్ఏఎస్)ల మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందాన్ని స్వాగతించారు.
23. ఖనిజాలు, ఉక్కు సరఫరా శ్రేణుల సాంకేతికత రంగంలో సహకారానికి సంబంధించి కుదిరిన అవగాహనా ఒప్పందాన్ని కూడా నాయకులు స్వాగతించారు. ఇండోనేషియాలో స్టెయిన్లెస్-స్టీల్ స్లాబ్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించడం కోసం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఏఐఎల్), పీటీ క్రాకటౌ స్టీల్ మధ్య వ్యూహాత్మక ఉమ్మడి భాగస్వామ్యం ఏర్పాటును కూడా వారు స్వాగతించారు.
24. భారతీయ రిజర్వ్ బ్యాంక్, బ్యాంక్ ఇండోనేషియా మధ్య స్థానిక కరెన్సీ లావాదేవీల (ఎల్సిటీ) మార్గదర్శకాలను అమలు చేసే దిశగా సాధించిన పురోగతిని ఇరు దేశాల నాయకులు స్వాగతించారు. ఇది భారత్, ఇండోనేషియాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను మరింత ప్రోత్సహిస్తుందని, ఇరు ఆర్థిక వ్యవస్థల మధ్య ఆర్థిక సమకరణను మరింత బలోపేతం చేస్తుందని వారు అభిప్రాయపడ్డారు.
ఆరోగ్యం, ఔషధ రంగం, ఆహారం, ఇంధన భద్రత
25. ఇండోనేషియాలోని రెడ్ అండ్ వైట్ కోఆపరేటివ్ వ్యవస్థను ఒక కీలక రవాణా వేదికగా అభివృద్ధి చేసే అవకాశాలను వారు ప్రస్తావించారు. ఇరు దేశాల సంబంధిత చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ఔషధాలు, వైద్య ఉత్పత్తులు సహా పలు వస్తువులను భారత్, ఇండోనేషియా మధ్య సమర్థవంతంగా రవాణా చేయడంలో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషించగలదని వారు పేర్కొన్నారు.
26. ఆరోగ్య రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ నిబద్ధతను ఇరు దేశాధినేతలు పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా వృత్తిపరమైన ఆరోగ్య మానవ వనరుల అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక ఒప్పందంపై సంతకాలు జరగడాన్ని వారు స్వాగతించారు. ఈ ఒప్పందం ద్వారా ఫెలోషిప్ కార్యక్రమాలు, ఆరోగ్య రంగ నిపుణులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించడం, ప్రత్యేక వైద్య విభాగాల్లో ప్రత్యక్ష క్లినికల్ శిక్షణ అందించడం, వైద్య నిపుణులు, ఆరోగ్య నిపుణుల పరస్పర మార్పిడి, వైద్య, ఆరోగ్య సేవలలో ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకోవడం, పరస్పర అంగీకారంతో చేపట్టే ఇతర సహకార కార్యక్రమాల ద్వారా ఇరు దేశాల మధ్య ఆరోగ్య రంగ సహకారం మరింత బలోపేతం కానుంది. ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల రంగంలో బీపీఓఎం, ఎఫ్ఎస్ఎస్ఏఐ మధ్య అవగాహనా ఒప్పందాన్ని వీలైనంత త్వరగా ఖరారు చేయాలని వారు కోరారు.
27. ఆహార భద్రత, పోషకాహార రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికీ, ప్రతి దేశంలోని విధానాలను గౌరవించడానికీ కూడా ఇద్దరు నాయకులు అంగీకరించారు. పరస్పర అంగీకారంతో, స్థిరమైన, దృఢమైన ఆహార వ్యవస్థలకు మద్దతుగా ఆహార, వ్యవసాయ వాణిజ్యం, ఉమ్మడి అధ్యయనాలు, ఆవిష్కరణలు, విజ్ఞాన మార్పిడి ద్వారా వ్యవసాయం, ఆహార భద్రత రంగాలలో సహకారాన్ని పెంపొందించే ప్రయత్నాలను వారు స్వాగతించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో సహకారంపై అవగాహనా ఒప్పందాన్ని వీలైనంత త్వరగా ఖరారు చేయాలనీ, సముద్ర, మత్స్య సంపద సహకార రంగంలో అవగాహనా ఒప్పందాన్ని త్వరగా పునరుద్ధరించుకోవాలనీ ఇద్దరు నాయకులూ ఆకాంక్షించారు.
28. ఔషధాలు, వైద్య ఉత్పత్తుల రంగంలో కొనసాగుతున్న సహకారాన్ని ఇద్దరు నాయకులు స్వాగతించారు. వైద్య ఉత్పత్తుల నియంత్రణ రంగంలో సహకారంపై సీడీఎస్సీఓ, పీఓఎం మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందాన్ని కూడా వారు స్వాగతించారు.
29. ఎరువుల రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇద్దరు నాయకులు అంగీకరించారు. మారుతున్న ప్రపంచ మార్కెట్ పరిస్థితుల మధ్య స్థిరమైన, అందుబాటు ధరల్లో ఎరువుల విశ్వసనీయ లభ్యత అవసరాన్ని వారు గుర్తించారు.
30. ఇంధన భద్రత రంగంలో సహకారం, ఉమ్మడి అధ్యయనాలు, సామర్థ్యాభివృద్ధిని మరింత బలోపేతం చేయడానికి ఇరు పక్షాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. పరస్పర అంగీకారంతో సాంప్రదాయ, నూతన, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు అంగీకరించాయి. ఎల్ఎన్జీ, గ్రీన్ హైడ్రోజన్, బయోఎనర్జీ, సౌరశక్తి, ఇంధన సామర్థ్య సాంకేతికతల వంటి రంగాల్లో పెరుగుతున్న సహకారాన్ని స్వాగతించాయి.
మౌలిక సదుపాయాలు, అనుసంధానం
31. ఇరు దేశాల మధ్య సముద్ర, వైమానిక అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఇరు దేశాధినేతలు గుర్తించారు. విమాన సర్వీసులను విస్తరించడంతో పాటు, ఓడరేవు నుంచి ఓడరేవుకు అనుసంధానాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని వారు అంగీకరించారు. 2026 రెండో అర్ధభాగంలో నిర్వహించనున్న అండమాన్–ఆచె కనెక్టివిటీపై మూడో సంయుక్త టాస్క్ ఫోర్స్ సమావేశం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంటూ, ఆ సమావేశంలో రూపొందించే కార్యాచరణ ప్రణాళికను వీలైనంత త్వరగా అమలు చేయాలని ఆకాంక్షించారు.
32. సబాంగ్ పోర్టు సమగ్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్న భారత ఆసక్తిని అధ్యక్షుడు ప్రభోవో స్వాగతించారు. క్రూయిజ్, సముద్ర పర్యాటక సౌకర్యాలు, నౌకల మరమ్మత్తు, నౌకా నిర్మాణం, అండమాన్ సముద్రంలోని ఆఫ్షోర్ ఇంధన కార్యకలాపాలకు అవసరమైన తీరప్రాంత సేవలను కలిగి ఉండే ఈ భాగస్వామ్యం ద్వారా భారతదేశంలోని అండమాన్, నికోబార్ దీవులు, ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలోని ప్రావిన్సుల మధ్య సంస్థాగత, భౌతిక, డిజిటల్ అనుసంధానం, ప్రజల ప్రయాణ , సరకు రవాణా మరింత బలోపేతం అవుతాయని ఇరు దేశాధినేతలు అభిప్రాయపడ్డారు. ఈ భాగస్వామ్యం పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, ప్రాంతీయ ఉమ్మడి సుసంపన్నతకు దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పరిధి, అమలు విధానం, ఆర్థిక వనరుల సమీకరణ వంటి అంశాలను ఇండోనేషియా అభివృద్ధి ప్రణాళికలు, అమల్లో ఉన్న నిబంధనలకు అనుగుణంగా, నిర్ణీత కాలవ్యవధిలో, పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఖరారు చేయాలని సంబంధిత అధికారులను ఇరు దేశాధినేతలు ఆదేశించారు.
33. భారతదేశంలోని ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) నిర్మాణ విధానంపై ఆధారపడి రూపొందించిన ఇండోనేషియా ఓపెన్ నెట్వర్క్ (ఐఓఎన్) ప్రారంభాన్ని ఇరు దేశాధినేతలు స్వాగతించారు. డిజిటల్ నెట్వర్క్ల ద్వారా ఇండోనేషియాలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో మరింత విస్తృతంగా భాగస్వామ్యం కావడానికి ఈ వేదిక దోహదపడుతుందని వారు పేర్కొన్నారు.
34. భారతీయ రిజర్వ్ బ్యాంక్, బ్యాంక్ ఇండోనేషియా మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, భారత్, ఇండోనేషియా మధ్య సరిహద్దు దాటి క్యూఆర్ చెల్లింపుల అనుసంధానం అమలు దిశగా సాధిస్తున్న పురోగతిని ఇరు దేశాధినేతలు స్వాగతించారు. ఈ కార్యక్రమం ఇండోనేషియా, భారత్ మధ్య ద్వైపాక్షిక చెల్లింపుల అనుసంధానాన్ని బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన విజయంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. ఈ అనుసంధానం లావాదేవీల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని బలోపేతం చేసి, సమగ్ర ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, పర్యాటక రంగం, విద్యార్థులకు ఇది మరింత ప్రయోజనం చేకూరుస్తుంది.
35. భారత్, ఇండోనేషియా మధ్య టెలికమ్యూనికేషన్ సాంకేతికతలు, సేవల రంగంలో సహకారానికి సంబంధించి ఖరారైన అవగాహన ఒప్పందాన్ని ఇరు దేశాధినేతలు స్వాగతించారు. సమ్మిళిత ఆర్థిక వృద్ధికీ, డిజిటల్ మార్పునకూ దోహదపడేవిధంగా టెలికమ్యూనికేషన్ సాంకేతికతలు, డిజిటల్ అనుసంధాన రంగాల్లో సహకారాన్ని ఈ ఒప్పందం మరింత బలోపేతం చేస్తుంది.
జీవ వైవిధ్య పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి
36. జీవవైవిధ్య పరిరక్షణ రంగంలో భారతదేశం పోషిస్తున్న కీలక పాత్రను గుర్తిస్తున్నట్లు అధ్యక్షుడు ప్రబోవో తెలిపారు. అంతర్జాతీయ పెద్దపులుల కూటమి (ఐబీసీఏ) విషయంలో ప్రధానమంత్రి మోదీ తీసుకున్న చొరవను ఆయన అభినందించారు. సంబంధిత దేశీయ నిబంధనలకు అనుగుణంగా ఐబీసీఏలో చేరాలనే ఇండోనేషియా సంకల్పాన్ని ప్రధానమంత్రి మోదీ స్వాగతించారు. ఇండోనేషియా చేపట్టిన ప్రపంచ మడ అడవుల కేంద్రం (డబ్ల్యూఎంసీ), ఇంటర్నేషనల్ ట్రాపికల్ పీట్ల్యాండ్ సెంటర్ (ఐటీపీసీ) వంటి కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. ఇవి జీవవైవిధ్యం, మడ అడవులు, సమృద్ధ కర్బన నేలల పరిరక్షణపై ప్రపంచ సహకారాన్ని బలోపేతం చేయడంలో ఇరుదేశాలకున్న ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయి.
37. ప్రకృతి సిద్ధమైన, మానవ ప్రేరేపిత విపత్తుల విషయంలో రెండు దేశాలకున్న ముప్పును గుర్తిస్తూ విపత్తు నిర్వహణ సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఇరు నేతలు ప్రధానంగా చెప్పారు. సమాచారం, అనుభవాలు, అత్యుత్తమ విధానాల మార్పిడితో పాటు విపత్తు ప్రతిస్పందన, పునరుద్ధరణ, నివారణ, సంసిద్ధత, సమర్థవంతమైన విపత్తు నివారణకు డేటా అప్లికేషన్.. విపత్తులను తట్టుకోగల మౌలిక సదుపాయాల కోసం సామర్థ్య పెంపు, శిక్షణ ద్వారా సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఇరు దేశాల జాతీయ విపత్తు నిర్వహణ సంస్థల మధ్య విపత్తు నిర్వహణ సహకార ఒప్పందం (ఎంఓయూ) కుదరడాన్ని ఇరువురు నాయకులు స్వాగతించారు. విపత్తు నష్టాల తగ్గింపు, దృఢత్వంలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడంలో కోయిలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్ఐ) ప్రాముఖ్యతను కూడా నాయకులు గుర్తించారు.
శాస్త్ర సాంకేతిక రంగాలు, వ్యూహాత్మక- వర్ధమాన సాంకేతికతల రంగం, అంతరిక్ష రంగం
38. 2025 ఆగస్టు 12న శాస్త్ర సాంకేతిక రంగంపై మొదటి జాయింట్ కమిషన్ సమావేశం జరగడాన్ని.. భారత్ - ఇండోనేషియా మధ్య పరిశోధన, సాంకేతికత, ఆవిష్కరణల సహకార ఒప్పందం (ఎంఓయూ) కుదరడాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు.
39. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), ఇండోనేషియా నేషనల్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఏజెన్సీ (బీఆర్ఐఎన్) మధ్య కొనసాగుతున్న అంతరిక్ష సహకారం, బాహ్య అంతరిక్ష సహకారంపై 2026 జూన్ 24 - 25 తేదీలలో భారత్లోని బెంగళూరులో జరిగిన 6వ జాయింట్ కమిషన్ సమావేశం పట్ల ఇరు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. శాంతియుత ప్రయోజనాల కోసం బాహ్య అంతరిక్ష అన్వేషణ, వినియోగంలో సహకారానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ ఒప్పంద గడువు పొడిగింపుపై భారత్, ఇండోనేషియాలు సంతకాలు చేయడాన్ని కూడా వారు స్వాగతించారు.
40. భారత ఉపగ్రహ- ప్రయోగ వాహక నౌకల కార్యక్రమాలకు, 'గగన్యాన్' మిషన్కు... బీఆర్ఐఎన్- ఇస్రో, 'బియాక్' టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ (టీటీసీ) కేంద్రాల మధ్య కుదిరిన ఉమ్మడి ఏర్పాట్ల ద్వారా ఇండోనేషియా అందిస్తున్న నిరంతర సహకారానికి ప్రధానమంత్రి మోదీ అధ్యక్షుడు ప్రబోవోకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇండోనేషియా ఉపగ్రహాల ప్రయోగానికి భారత్ అందిస్తున్న మద్దతును, సెంటర్ ఫర్ స్పేస్ సైన్స్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఇన్ ఆసియా అండ్ ది పసిఫిక్ (సీఎస్ఎస్టీఈఏపీ), ఆసియాన్-ఇండియా అంతరిక్ష సహకారం ద్వారా ఇండోనేషియా అధికారులకు లభిస్తున్న శిక్షణను అధ్యక్షుడు ప్రబోవో అభినందించారు. ఇండోనేషియాలో అంతరిక్ష ప్రయోగ కేంద్రం ప్రాజెక్టుపై ఇరు దేశాల మధ్య అంతరిక్ష వ్యవస్థల స్థాయి సహకారాన్ని అధ్యక్షుడు ప్రబోవో స్వాగతించారు.
41. అణుశక్తి శాంతియుత ప్రయోజనాల రంగంలో ఇరు దేశాల మధ్య సహకారంపై జరుగుతున్న చర్చలను నాయకులు ప్రస్తావించారు. ఈ చర్చలు పరిశోధన, సామర్థ్య పెంపు, అణు భద్రత రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేస్తాయని వారు పేర్కొన్నారు. పరిశ్రమలు, అణు వైద్యం, వ్యవసాయం, నీటి నిర్వహణ రంగాల్లో సంబంధిత చట్టపరమైన నియంత్రణ, సాంకేతిక పురోగతులు, వాటి అనువర్తనాలతో పాటు పౌర అణుశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడానికి జరుగుతున్న ప్రయత్నాలను ఇరు నాయకులు స్వాగతించారు.
సంస్కృతి, పర్యాటకం, ప్రజల మధ్య సంబంధాల మార్పిడి
42. యోగ్యకర్తాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ప్రాంబనన్ ఆలయ సముదాయాల పునరుద్ధరణ, పరిరక్షణ కోసం భారతదేశ మద్దతుతో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ద్వారా చేపట్టిన ప్రాజెక్ట్ ప్రారంభమవటాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు. క్రీస్తు శకం 860 కాలానికి చెందిన దేవనాగరి లిపి, సంస్కృత భాషలో చెక్కిన అసలైన 'నలంద రాగి పలక' ప్రతిరూపాన్ని భారత జాతీయ మ్యూజియం బహుమతిగా ఇవ్వడాన్ని ఇండోనేషియా అభినందించింది. ఈ ప్రతిరూపాన్ని ప్రస్తుతం మువారా జాంబిలోని నూతన మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. 2023 ఆగస్టులో వారణాసిలో జరిగిన జీ20 సాంస్కృతిక మంత్రుల సమావేశంలో ఆమోదించిన 'కాశీ కల్చరల్ పాత్వే'లోని సూత్రాలను ఇరు నేతలు ఈ సందర్భంగా గుర్తుచేశారు. స్నేహం, పరస్పర గౌరవ భావంతో పాటు తమ తమ దేశాల చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా సాంస్కృతిక వారసత్వ అంశాలపై ఇరు ప్రభుత్వాల మధ్య నిరంతర సంప్రదింపులు జరగాల్సిన ప్రాముఖ్యతను వారు చెప్పారు.
43. భారత్, ఇండోనేషియా మధ్య ఉమ్మడి సాంస్కృతిక, విద్యా సంబంధాలకు బలమైన పునాది వేయడంలో తోడ్పడిన రవీంద్రనాథ్ ఠాగూర్, ‘కి హజర్ దేవాంతర’ల శాశ్వతమైన మేధో వారసత్వాన్ని.. వారి ఉమ్మడి విద్యా దృక్పథాన్ని ఇరువురు నేతలు గుర్తించారు. దీనికి గుర్తుగా 2026–2027 సంవత్సరాన్ని ‘ఠాగూర్–దేవాంతర భారత్–ఇండోనేషియా సాంస్కృతిక, విద్యా దౌత్య సంవత్సరం’గా జరుపుకోవడానికి వారు అంగీకరించారు. 1927లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఇండోనేషియా సందర్శన విషయంలో శతాబ్ది ఉత్సవాన్ని పురస్కరించుకొని ఇరు దేశాల్లో ఏడాది పొడవునా ఉమ్మడి సాంస్కృతిక, విద్యా, విద్యాసంబంధ, ప్రజల మధ్య పరస్పర సంబంధాల కార్యక్రమాలను ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించనున్నారు.
44. ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించడంలో పర్యాటక రంగానికి ఉన్న సామర్థ్యాన్ని ప్రధానంగా చెబుతూ.. పర్యాటక రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి, ఇరు దేశాల మధ్య పర్యాటకుల రాకపోకలను మెరుగుపరచడానికి తమకున్న ఉమ్మడి నిబద్ధతను ఇరు నేతలు వ్యక్తం చేశారు. ప్రయాణాలను సులభతరం చేయడం, వీసా ప్రక్రియను సరళీకృతం చేసే మార్గాలపై ఇరు వైపులా మరిన్ని చర్చలు చేపట్టేందుకు వారు అంగీకరించారు.
45. విద్యా రంగంలో కొనసాగుతున్న సహకారాన్ని ఇరు నేతలు ప్రస్తావించారు. విద్యార్థుల మార్పిడితో పాటు విద్యాసంబంధ, సంస్థాగత భాగస్వామ్యాలను మరింత పెంపొందించే దిశగా ఇరు పక్షాలు కృషి చేయాలన్నారు. ప్రాథమిక, మాధ్యమిక విద్యా రంగంలో సహకారానికి సంబంధించిన అవగాహన ఒప్పందంపై వీలైనంత త్వరగా సంతకాలు జరిగేలా చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
46. ఉన్నత విద్యా రంగం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి తమకున్న నిబద్ధతను ఇరు నేతలు పునరుద్ఘాటించారు. విద్యాసంబంధ రాకపోకలు, ఉమ్మడి పరిశోధనలు, విజ్ఞాన మార్పిడి, సామర్థ్య పెంపు, సంస్థాగత భాగస్వామ్యం, మానవ వనరుల అభివృద్ధికి తోడ్పడే ఇతర కార్యక్రమాల ద్వారా పరస్పర ప్రయోజనకరమైన బంధాన్ని విస్తరించుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. ఉన్నత విద్యా రంగం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహకారానికి సంబంధించిన అవగాహన ఒప్పందంపై వీలైనంత త్వరగా సంతకాలు జరగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఇండోనేషియాలో తమ ప్రాంగణాలను ఏర్పాటు చేయడానికి భారత్లోని ప్రతిష్ఠాత్మక ఉన్నత విద్యా సంస్థలు చూపుతున్న ఆసక్తిని అధ్యక్షుడు ప్రబోవో స్వాగతించారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇండోనేషియాలో క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించటాన్ని ఇరు నేతలు స్వాగతించారు.
47. ఎన్నికల విషయంలో మానవ వనరుల అభివృద్ధి, మెరుగైన నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం కోసం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ), ఇండోనేషియా జనరల్ ఎలక్షన్ కమిషన్ల (కేపీయూ) మధ్య కొనసాగుతున్న సహకారాన్ని ఇరు నేతలు ప్రస్తావించారు. ఎన్నికల నిర్వహణ, సాంకేతిక వినియోగ రంగంలో సహకారం కోసం ఈసీఐ, కేపీయూల మధ్య అవగాహన ఒప్పందం కుదరడాన్ని వారు స్వాగతించారు.
48. అధికారిక గణాంకాలు, సామర్థ్య పెంపు, వ్యూహాత్మక భాగస్వామ్య రంగంలో భారత ప్రభుత్వ గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (ఎంఓఎస్పీఐ), స్టాటిస్టిక్స్ ఇండోనేషియాల (బీపీఎస్) మధ్య ప్రతిపాదిత సహకారాన్ని ఇరు నేతలు స్వాగతించారు.
ప్రాంతీయ, బహుపాక్షిక సహకారం
49. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితిని, ఆర్థిక- సరఫరా గొలుసు అంతరాయాలను, పరస్పర ఆందోళన కలిగించే ప్రపంచ సమస్యల గురించి మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి, దాని ప్రత్యేక సంస్థలతో సహా అంతర్జాతీయ, ప్రాంతీయ వేదికలపై భారత్ - ఇండోనేషియా మధ్య మరింత వ్యూహాత్మక ఏకీకరణ, సన్నిహిత సమన్వయం అవసరమని ఇరు నేతలు అన్నారు. ఇది ఈ ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాల్లో అంతర్జాతీయ చట్టాలపై ఆధారపడుతూ శాంతి, స్థిరత్వం, సహకార, శ్రేయస్సుతో కూడిన మరింత సమతుల్య, ప్రాతినిధ్య ప్రపంచ వ్యవస్థ ఏర్పాటుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత పట్ల తమకున్న ఉమ్మడి గౌరవాన్ని ఇరు పక్షాలు పునరుద్ఘాటించాయి. ఈ ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వం, పరస్పర ప్రయోజనకరమైన సహకారానికి పునాదులుగా సాంస్కృతిక, మతపరమైన వైవిధ్యం, బహుళత్వం, చట్టబద్ధమైన పాలనను నిలబెట్టుకోవాల్సిన ప్రాముఖ్యతను వారు చెప్పారు. ఈ దిశగా సౌత్-సౌత్ సహకారానికి పెరుగుతున్న పాత్రను ఇరు నేతలు గుర్తించారు. గ్లోబల్ సౌత్ స్వరాన్ని బలోపేతం చేయడంలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి అంగీకరించారు.
50. సమకాలీన భౌగోళిక రాజకీయ వాస్తవాల పరిస్థితులను ప్రతిబింబించేలా, గ్లోబల్ సౌత్ ఆకాంక్షలకు అనుగుణంగా స్పందించేలా అంతర్జాతీయ సంస్థల్లో అర్థవంతమైన సంస్కరణల కోసం కృషి చేయడానికి ఇరు నేతలు అంగీకరించారు. రాత పూర్వక చర్చలతో సహా సమ్మిళిత, సభ్య దేశాల నేతృత్వంలోని వివిధ ప్రభుత్వాల చర్చల ద్వారా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని (యూఎన్ఎస్సీ) శాశ్వత, తాత్కాలిక సభ్యత్వాల విభాగాల్లో సమగ్ర సంస్కరణలు, విస్తరణ జరగాల్సిన అవసరాన్ని ఇరు పక్షాలు పునరుద్ఘాటించాయి. బహుపాక్షిక వేదికల్లో పరస్పర మద్దతు విషయంలో బలమైన స్ఫూర్తిని ప్రదర్శిస్తూ వివిధ అంతర్జాతీయ అభ్యర్థిత్వాలకు పరస్పరం మద్దతు ఇచ్చుకునే అంశంపై ఇరు నేతలు చర్చించారు.
51. ప్రపంచ ఆర్థిక నిర్మాణంలో సంస్కరణల అవసరాన్ని గుర్తిస్తున్నట్లు ఇరు దేశాల నాయకులు తెలిపారు. మార్కెట్ నియమాలకు విరుద్ధమైన చర్యల విషయంలో సవాళ్లు, సరఫరా గొలుసుల కేంద్రీకరణ, అనిశ్చిత మార్కెట్ లభ్యత వంటి సమస్యలను పరిష్కరిస్తూ.. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) కేంద్రంగా నియమ ఆధారిత, నిష్పాక్షికమైన, బహిరంగ, సమ్మిళిత అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను కలిగి ఉండటానికి ఉన్న ప్రాముఖ్యతను కూడా వారు ప్రముఖంగా చెప్పారు.
52. 2026 బ్రిక్స్ కూటమికి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న భారత్కు పూర్తి మద్దతు ఇవ్వనున్నట్లు ఇండోనేషియా తెలిపింది. బ్రిక్స్ సభ్య దేశంగా ఇండోనేషియా పాత్రకు మద్దతునిచ్చేందుకు భారత్ నిబద్ధతను వ్యక్తం చేసింది. సమానత్వంతో కూడిన ప్రపంచ పాలనకు, సుస్థిర అభివృద్ధికి నిర్మాణాత్మకంగా సహకరించడం కోసం.. బ్రిక్స్, జీ20, ఐఓఆర్ఏ వంటి కీలక వేదికల ద్వారా పరస్పర భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవడానికి ఇరు నేతలు అంగీకరించారు.
53. 2018వ సంవత్సరంలో ప్రకటించిన ‘ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్-ఇండోనేషియా సముద్రతీర సహకార ఉమ్మడి దృక్పథాన్ని' గుర్తుచేసుకుంటూ... స్వేచ్ఛాయుతమైన, బహిరంగ, పారదర్శక, నియమ ఆధారిత, శాంతియుత, శ్రేయస్కరమైన, సమ్మిళిత ఇండో-పసిఫిక్ ప్రాంతం పట్ల తమకున్న నిబద్ధతను ఇరు నేతలు పునరుద్ఘాటించారు.
54. సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతను గౌరవించడం, 1982 యూఎన్సీఎల్ఓఎస్తో సహా అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండటం, స్వేచ్ఛా నౌకాయానం- విమానయానానికి ఉన్న ప్రాముఖ్యతను ఇరువురు నేతలు పేర్కొన్నారు. బెదిరింపులకు లేదా బలప్రయోగానికి దూరంగా ఉంటూ చర్చలు, సహకారాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని వారు తెలియజేశారు.
55. మారుతున్న ప్రాంతీయ సంబంధాల క్రమంలో ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం ఆసియాన్ ఐక్యత, ఆసియాన్ కేంద్రీకరణకు భారత్ అందిస్తోన్న స్థిరమైన మద్దతును అధ్యక్షుడు ప్రబోవో అభినందించారు. ఆయా సభ్య దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలకు అదనపు బలాన్ని చేకూర్చే 'ఆసియాన్-ఇండియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని' మరింత బలోపేతం చేయడానికి ఇరు పక్షాలు మద్దతు పలికాయి. 'సంబంధిత ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం ఇండో-పసిఫిక్పై ఆసియాన్ దృక్పథం' (ఏఓఐపీ), భారతదేశ 'ఇండో-పసిఫిక్ సముద్రాల కార్యక్రమం' (ఐపీఓఐ) మధ్య నిర్దిష్టమైన కార్యక్రమాలతో కూడిన సమన్వయాన్ని మరింత పెంపొందించుకోవాలని కోరుకుంటున్నట్లు ఇరువురు నేతలు తెలిపారు.
56. 'భారత్-ఇండోనేషియా-ఆస్ట్రేలియా' త్రైపాక్షిక కూటమి సమర్థవంతమైన యంత్రాంగం ద్వారా ఉన్న సహకారాన్ని ఇరు నేతలు స్వాగతించారు. సముద్ర రంగ అవగాహన, సముద్ర కాలుష్యం, నీలి ఆర్థిక వ్యవస్థ రంగాలతో పాటు తూర్పు ఆసియా సదస్సు (ఈఏఎస్), ఇండో-పసిఫిక్ సముద్రాల కార్యక్రమం (ఐపీఓఐ), ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ (ఐఓఆర్ఏ) ఫ్రేమ్వర్క్ పరిధిలో పరస్పర సహకార అవకాశాలను అన్వేషించడానికి వారు అంగీకరించారు.
57. పశ్చిమాసియా లేదా మధ్యప్రాచ్య ప్రాంతంలోని పరిస్థితి, దాని వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభావాలపై ఇరు నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2026 జూన్ 17న సంతకం చేసిన అవగాహన ఒప్పందాన్ని వారు స్వాగతించారు. ఉద్రిక్తతలను తగ్గించాల్సిన ప్రాముఖ్యతను వారు ప్రధానంగా చెప్పారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ చట్టాలతో పాటు యూఎన్సీఎల్ఓఎస్ నిబంధనలకు అనుగుణంగా స్వేచ్ఛా నౌకాయానాన్ని, ప్రపంచ వాణిజ్య ప్రవాహాన్ని గౌరవించడంతో పాటు హార్ముజ్ జలసంధి గుండా రవాణా మార్గాన్ని కొనసాగించాలనే విషయంలో ఇరు నేతలు ఒకే విధమైన దృక్పథాన్ని పంచుకున్నారు.
58. ఈ పర్యటన సందర్భంగా తనకు, తన ప్రతినిధి బృందానికి లభించిన ఘన స్వాగతానికి, అద్భుతమైన ఆతిథ్యానికి గాను అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మిత్రదేశమైన ఇండోనేషియా ప్రజలు శ్రేయస్సు, పురోగతి సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపిన ఆయన.. పరస్పరం అనుకూలమైన సమయంలో భారత్లో పర్యటించాల్సిందిగా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోను సాదరంగా ఆహ్వానించారు.
***
(रिलीज़ आईडी: 2282284)
आगंतुक पटल : 33
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada