ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా పీఎం ప్రసంగానికి తెలుగు అనువాదం

प्रविष्टि तिथि: 06 JUL 2026 8:43PM by PIB Hyderabad

కేంద్ర క్యాబినెట్లో సహ మంత్రులు అమిత్ భాయ్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, బీజేపీ సీనియర్ సభ్యులు, నాలాంటి లక్షలాది మంది కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలిచే శ్రీ మఖన్‌లాల్ జీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శమిక్ భట్టాచార్య, గౌరవ ప్రజా ప్రతినిధులు, విశిష్ట అతిథులు, సోదరీ సోదరులారా!

మీ అందరికీ శుభాకాంక్షలు!

ముందే నిర్దేశించిన కార్యక్రమం కారణంగా... నేను ప్రస్తుతం ప్రయాణంలో ఉన్నాను. కానీ సాంకేతికత సాయంతో ఈ చారిత్రక కార్యక్రమంలో మీతో కలసి పాల్గొనగలుగుతున్నాను.

మిత్రులారా,

మన దేశపు మట్టి, పశ్చిమ బెంగాల్ భూమి, తన గొప్ప పుత్రుల్లో ఒకరిని ఈ రోజు గౌరవంగా స్మరించుకుంటున్నాయి. ఆయన గొప్ప దేశభక్తుడు. భారత దేశ సమగ్రతకు జీవితాన్ని అంకితం చేసిన దార్శనికుడు. ఆయన నాటిన ఆలోచనా బీజం ఈ రోజు దేశమంతటా విస్తరించి, ఆధునిక భారతదేశానికి మార్గనిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆ ఉన్నత ఆశయాన్నే ఈ రోజు మనం వేడుకగా జరుపుకొంటున్నాం. 

మిత్రులారా,

మన ఆలోచనలు క్షేత్రస్థాయిలో కేంద్రీకృతమైనప్పుడు, ఆశయాలు బలంగా, స్వచ్ఛంగా ఉన్నప్పుడు, నూతన సంకల్పాలను పూర్తి నిబద్ధతతో సాధించినప్పుడు, ఇవన్నీ ఏకమైనప్పుడు, విజయం తథ్యం. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అలాంటి జీవితాన్నే గడిపారు. ఆయన 125వ జయంతి సందర్భంగా... ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

మిత్రులారా,

దేశానికే ప్రథమ ప్రాధాన్యమిచ్చే ప్రభుత్వం ఉన్నప్పుడు, జాతీయ నాయకులకు తగిన గౌరవం లభిస్తుందనడానికి, వారి ఆశయాల సాధనకు కృషి జరుగుతుందనడానికి ఈ కార్యక్రమమే నిదర్శనం. మన ప్రభుత్వం డాక్టర్ ముఖర్జీ 125వ జయంతిని రెండేళ్ల పాటు జాతీయ పండగలా నిర్వహిస్తోంది. గతేడాది జులై 6న ప్రారంభమైన ఈ వేడుకలు వచ్చే ఏడాది జులై 6 వరకు కొనసాగుతాయి. ఇప్పుడు బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో... ఈ జాతీయ ఉత్సవాలకు మరింత శోభ చేకూరింది. కొన్ని రోజుల క్రితమే... జూన్ 20న పశ్చిమ బెంగాల్ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం. అది బెంగాల్ మట్టికి, అక్కడి వారసత్వానికి మనం అర్పించిన వందనం. ఈనాటి కార్యక్రమం కూడా ఆ వారసత్వానికి ఇస్తున్న గౌరవంలో భాగమే. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నా హృదయపూర్వక అభినందనలు.

మిత్రులారా,

ఒక ఆలోచనను ప్రజా ఉద్యమంగా మార్చేందుకు డాక్టర్ ముఖర్జీ జీవితమే స్ఫూర్తి. భారత్‌లో ఒక సైద్ధాంతిక ఉద్యమానికి ఆయన పునాది వేశారు. జనసంఘ్ ప్రారంభించిన సమయంలో ప్రతి చోటా కాంగ్రెస్ ఆధిపత్యమే కనిపించేది. ప్రత్యామ్నాయ సిద్ధాంతాలకు తావులేని, నిలదొక్కుకొనేందుకు ఆస్కారం లేని ఆ కాలంలో... ఆ పరిస్థితులను డాక్టర్ ముఖర్జీ సవాలు చేశారు. కొత్త సిద్ధాంతాన్ని రూపొందించే ధైర్యం చేశారు. అది ఒక సంస్థను లేదా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే నిర్ణయం మాత్రమే కాదు. సైద్ధాంతిక వైవిధ్యానికి, జాతీయ ఆలోచనలకు, ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం పట్ల ఆయనకున్న అచంచలమైన విశ్వాసానికి నిదర్శనం. ఆ నమ్మకం నుంచే జనసంఘ్ ఆవిర్భవించింది.

మిత్రులారా,

ఏ ఆలోచననైనా ప్రారంభించగానే అది శాశ్వతంగా నిలిచిపోదు. తరతరాలు తమ జీవితాలను ధారపోసి దానిని పోషించినప్పుడే అది ఎప్పటికీ నిలిచి ఉండిపోతుంది. జనసంఘ్ జ్వాలను కొనసాగించడానికి లక్షలాది మంది కార్యకర్తలు తమ జీవితాలను అంకితం చేశారు. అనుక్షణం శ్రమించారు. ఎన్నో త్యాగాలు చేశారు. ఆ జ్వాలను వారు ఆరిపోనివ్వలేదు. ఇప్పుడు, జనసంఘ్ తన పూర్వ రూపంలో లేకపోయినా... కోట్లాది మంది దేశ ప్రజల విశ్వాసంలో ప్రతిఫలిస్తోంది. దేశవ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో వికసించిన తామరపూల రూపంలో ఆ వెలుగు కనిపిస్తోంది. ఒకప్పుటి జనసంఘే నేటి భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య శక్తిగా దేశ ప్రజలకు సేవలందిస్తోంది.

మిత్రులారా,

కొన్ని ఆలోచనలు కాలంతో పాటే తమ ప్రభను కోల్పోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ, డాక్టర్ ముఖర్జీ నాటిన ఆలోచనా బీజం ఎంత శక్తిమంతమైనదో చూడండి. అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా అది వేగంగా విస్తరిస్తోంది. భవిష్యత్తు తరాలు బీజేపీ చరిత్రను రచించి, దానిని అధ్యయనం చేసేటప్పుడు వారు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆలోచనలను, ఆయన ధైర్యాన్ని, ఆయన ముందుచూపు గురించి కచ్చితంగా ప్రస్తావిస్తారని నేను విశ్వసిస్తున్నాను.  నేను మరోసారి చెబుతున్నాను. ఇది బెంగాల్‌కు రెట్టింపు ఆనందం. మొదటిది డాక్టర్ ముఖర్జీ 125వ జయంతి, రెండోది బెంగాల్లోనే, ఆయన ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన బీజేపీ సారథ్యంలో ఈ ఉత్సవాలు జరగడం. ఇది తమ వీర పుత్రునికి పశ్చిమ బెంగాల్ ప్రజలు అర్పిస్తున్న హృదయపూర్వక నివాళి.

మిత్రులారా,

పార్లమెంటులో డాక్టర్ ముఖర్జీ చేసిన ఓ ప్రసంగంలో చెప్పిన మాట, ఈ నాటికీ మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ‘‘జాతీయ ఐక్యత అనే పునాదిపై మాత్రమే బంగారు భవిష్యత్తును నిర్మించగలం’’ అని ఆయన అన్నారు. డాక్టర్ ముఖర్జీ తన చివరి శ్వాస వరకు ఈ నమ్మకంతో జీవించారని భారతదేశం గర్వంగా చెప్పగలదు. 1947లో దేశ విభజన అనంతరం, మరో సంక్షోభం తలెత్తింది. బెంగాల్‌ను భారత్ నుంచి పూర్తిగా విభజించేందుకు కుట్రలు జరిగాయి. ఆ సమయంలో, ఈ కుట్రలకు అడ్డుగోడలా డాక్టర్ ముఖర్జీ నిలిచారు. ఆయన ప్రజాభిప్రాయాన్ని సమీకరించారు. రాజకీయ పోరాటాలు చేశారు. పశ్చిమబెంగాల్ భారత్‌లోనే అంతర్భాగంగా ఉండేలా చేశారు. అప్పుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ‘‘కాంగ్రెస్ దేశ్ భాగ్ కొరేఛే, ఆమి పాకిస్తాన్ కే భాగ్ కొరేఛి’’ అని నినదించారు. కాంగ్రెస్ దేశాన్ని విభజించింది. నేను పాకిస్థాన్‌ను విభజించాను అని దీనర్థం.

మిత్రులారా,

నేటి పరిస్థితుల్లో కూడా ఆ గర్జన, ఆ సామర్థ్యం, ఆ రాజకీయ సంకల్పానికి ఉన్న శక్తిని మనం అనుభూతి చెందుతున్నాం.

మిత్రులారా,

ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ దార్శనికతకు డాక్టర్ ముఖర్జీ పూర్తిగా కట్టుబడి ఉన్నారు. అందుకే రెండు రాజ్యాంగాల ఆలోచనను, ఇద్దరు ప్రధానమంత్రులను, రెండు జెండాలు ఎగరవేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘ఏక్ దేశే దుయ్ బిధాన్, దుయ్ ప్రధాన్ ఏబొంగ్ దుయ్ నిశాన్ - అమ్రా కొఖొనో మేనే నేబో నా’’ అనే మంత్రాన్ని దేశానికిచ్చారు. అంటే... ‘‘ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలను అంగీకరించం... అంగీకరించం’’  అని అర్థం. ఇది నినాదం మాత్రమే కాదు. ఇది సమాన హక్కులకు, ఒకే రాజ్యాంగానికి, ఏకీకృత జాతీయ స్ఫూర్తికి ఇచ్చిన పిలుపు. ఈ సిద్ధాంతాల కోసమే ఆయన పోరాటం చేశారు. జైలుకు వెళ్లారు. కాశ్మీర్ కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. మా ప్రభుత్వం... ఆర్టికల్ 370ని తొలగించడం ద్వారా డాక్టర్ ముఖర్జీ కలను సాకారం చేసింది.

మిత్రులారా,

ఇప్పుడు మనం ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ గురించి మాట్లాడుతున్నామంటే... అది డాక్టర్ ముఖర్జీ ప్రాణంతో నిర్వచితమైన జాతీయ దృక్పథానికి కొనసాగింపు. అలాంటి భారతదేశంలో ఉత్తరం, దక్షిణం మధ్య దూరం ఉండదు. తూర్పు, పడమర సమాన అవకాశాలను పంచుకుంటాయి. ప్రతి రాష్ట్రమూ ప్రత్యేక గుర్తింపుతో దేశ ఉమ్మడి సామర్థ్యానికి తోడ్పడుతుంది. పౌరులంతా రాజ్యాంగబద్ధులై, ఒకే జాతీయ స్ఫూర్తితో, ఒకే ఉమ్మడి భవిష్యత్తు పట్ల నిబద్ధులై ఉంటారు. డాక్టర్ ముఖర్జీ స్పూర్తితో... ఇప్పుడు దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగం అమల్లోకి రావడం, కోట్లాది మంది ప్రజల్లో చైతన్యం కలిగించడం చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది.

మిత్రులారా,

సంస్థాగత నిర్మాణంలోనే దేశ నిర్మాణం దాగి ఉందని డాక్టర్ ముఖర్జీ అర్థం చేసుకున్నారు. 33 ఏళ్ల వయసులోనే ఆయన కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్–ఛాన్సలర్‌గా పనిచేశారు. అత్యంత పిన్న వయసులోనే ఈ బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా నిలిచారు. అయితే ఆ బాధ్యతను పరిపాలనాపరమైనదిగా మాత్రమే ఆయన భావించలేదు. విశ్వవిద్యాలయాన్ని దేశ భవిష్యత్తును మలిచే సంస్థగా ఆయన పరిగణించారు. వలసవాద మనస్తత్వం నుంచి విద్యను బయటకు తీసుకొచ్చేందుకు ఆయన ప్రయత్నించారు. ‘‘బొంగో-జాతిర్ అత్తో-శొమ్మన్ పునోర్-ఉద్ధార్ ఏబొంగ్ మాత్రి-భాషార్ మాధ్యోమే శిఖ్ఖార్ ప్రోశార్ ఏయ్ ఆమాదేర్ ప్రోధాన్ లొక్ఖో హోవా ఉచిత్’’ అని ఆయన అన్నారు. అంటే బెంగాలీ జాతి ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించడం, మాతృభాష ద్వారా విద్యను విస్తరించడం... ఇదే మన ప్రధాన లక్ష్యం కావాలి అని అర్థం. ఇక్కడి విద్యా విధానం భారతీయ ఆత్మలో వేళ్లూనుకున్నప్పుడు మాత్రమే ఆత్మవిశ్వాసం కలిగిన దేశంగా భారత్ ఎదుగుతుందని ఆయన విశ్వసించారు. ఈ దార్శనికతతోనే ఆయన భారతీయ భాషలకు సముచిత గౌరవం ఇచ్చారు. ఆనాడు డాక్టర్ ముఖర్జీ కన్న కలల్ని నిజం చేస్తూ... నేటి నూతన జాతీయ విద్యా విధానంలో ప్రాంతీయ భాషల్లో విద్యాభ్యాసానికి ప్రాధాన్యమివ్వడం మనందరికీ గర్వకారణం.

మిత్రులారా,

స్వాతంత్ర్య భారతదేశ మొదటి పరిశ్రమల మంత్రిగా... పారిశ్రామికాభివృద్ధికి విశాల దార్శనికతను సిద్ధం చేశారు. దశాబ్దాలుగా భారతీయ ఆర్థిక సామర్థ్యానికి బలమైన ఆధారాలుగా మారిన జాతీయ సంస్థలను ఆయన నెలకొల్పారు. భారతీయ రైల్వేలకు చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ కొత్త వేగాన్ని జోడించింది. వ్యవసాయ రంగంలో స్వావలంబన దిశగా వేసిన ముందడుగే సింద్రీ ఎరువుల ప్లాంటు. విద్యుత్తు, సాగునీటి రంగాల్లో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. భారతీయ పరిశ్రమలకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌సీఐ) అందించింది.

మిత్రులారా,

ఆయన దృష్టిలో పరిశ్రమలు, కర్మాగారాలంటే.. వర్క్‌షాపులు కాదు. విశ్వవిద్యాలయాలంటే డిగ్రీలు అందించేవి కావు. పరిశోధనా సంస్థలు అంటే ప్రయోగాలకు మాత్రమే పరిమితమైనవి కావు. వీటిన్నింటినీ దేశానికి అంకితమైన కేంద్రాలుగా ఆయన భావించేవారు. ప్రతిభకు అవకాశాలను కల్పించే సంస్థలు, ఆవిష్కరణలను ప్రోత్సహించే విద్య, స్వావలంబనకు పునాదిగా మారే పరిశ్రమలు, బలమైన భారత్‌ను వారసత్వంగా భవిష్యత్తు తరాలకు అందించే వ్యవస్థలను ఆయన విశ్వసించారు. ఇదే ప్రస్తుతం అనుసరిస్తున్న వికసిత్ భారత్ లక్ష్యానికి స్ఫూర్తి.

మిత్రులారా,

బెంగాల్, దేశ యువతకు ఈ సందర్భంగా ఓ మాట చెప్పాలనుకుంటున్నాను. ఏక్ భారత్‌ కోసమే డాక్టర్ ముఖర్జీ తన జీవితాన్ని అంకితం చేశారు. శ్రేష్ఠ భారత్ కోసం మనం కృషి చేయాలి. మనందరం కలసి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించాలి. మన దేశాన్ని స్వయం సమృద్ధం చేయాలి. మరోసారి డాక్టర్ ముఖర్జీకి నివాళి అర్పిస్తున్నారు. ఆయన మాటలతోనే, ఆయన అందించిన స్ఫూర్తితోనే ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ‘‘జే కాజ్ ఏయ్ హాతే నావో నా కేనో, తా అత్యొంతో గురుత్తో శొహొకారే కోర్తే హోబే.’’ అంటే మీరు ఏ పని ప్రారంభించినా దానిని నిబద్ధతతో, అంకితభావంతో, నిజాయతీతో చేయండి. ఏ పనినీ అసంపూర్తిగా వదిలేయవద్దు. దానిని పూర్తి చేయండి. డాక్టర్ ముఖర్జీ వాక్కులు అందిస్తున్న ఈ స్ఫూర్తితో మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ధన్యవాదాలు!

సూచన- ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం.

***


(रिलीज़ आईडी: 2282206) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam