సహకార మంత్రిత్వ శాఖ
గుజరాత్ లో భారత్ టాక్సీ సేవలు ప్రారంభం
గాంధీనగర్ నుంచి ప్రారంభించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
అహ్మదాబాద్, సూరత్, రాజ్కోట్లతో పాటు గుజరాత్లోని అన్ని ప్రధాన నగరాల్లో ద్విచక్ర వాహనాలు, ఆటో, నాలుగు చక్రాల వాహనాల కేటగిరీలలో అందుబాటులోకి వచ్చిన భారత్ టాక్సీ సేవలు
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘సహకార్ సే సమృద్ధి’ దార్శనికతను సాకారం చేస్తూ రవాణా రంగంలో వాహన డ్రైవర్ల జీవితాల్లో విప్లవాత్మక మార్పులను తెస్తున్న భారత్ టాక్సీ
భారత్ టాక్సీ సేవల్లో ప్రస్తుతం 7 లక్షల మందికి పైగా సారథులు... వారే యజమానులు కావడంతో వారి జీవితాల్లో పెరుగుతున్న గౌరవం, భద్రత, ఆదాయం
మార్కెట్లోని పోటీ కంపెనీలు అకస్మాత్తుగా ఛార్జీలను తగ్గించడం వెనుక భారత్ టాక్సీని అడ్డుకునే కుట్ర... వారు భవిష్యత్తులో మళ్లీ చార్జీలు పెంచుతారు…
ఇలాంటి సవాళ్లు ఎదురైనప్పటికీ, భారత్ టాక్సీ సేవా సంకల్పంతో మార్కెట్లో స్థిరంగా ముందడుగు వేస్తుంది
వచ్చే 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా 500కు పైగా నగరాలు, పట్టణాలకు భారత్ టాక్సీ విస్తరణ; జూలై 31 లోపే దేశంలోని మరో 7 ప్రధాన నగరాల్లో సేవల లభ్యత
‘డ్రైవర్’ - ‘సారథి’ మధ్య ప్రాథమిక వ్యత్యాసం; ప్రైవేట్ కంపెనీల దృష్టిలో డ్రైవర్లకు భారత్ టాక్సీ లో సారథులుగా ఉన్నతమైన గౌరవం
భారత్ టాక్సీలో సారథులు కేవలం డ్రైవర్లు మాత్రమే కాదు... వారు వాటాదారులు కూడా... వారు ఏ యాప్ కంపెనీపైనా ఆధారపడే పరిస్థితి లేదు
భారత్ టాక్సీని విజయవంతం చేయాల్సిన అతిపెద్ద బాధ్యత సారథులు, వినియోగదారులపైనే ఉంది; తాత్కాలిక లేదా తక్షణ లాభాలను చూసుకోకుండా, వారంతా ముందుకు వచ్చి ఈ సేవలను ఆదరించాలి
భారత్ టాక్సీ.. సారథుల స్వంత సహకార సంస్థ - ఇది వారికి రుణాల మంజూరులో సహాయం అందించడమే కాకుండా, బీమా రక్షణ కూడా కల్పిస్తుంది; వారి వ్యాపార విస్తరణ నమూనాను ప్రోత్సహిస్తుంది
గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్, గుజరాత్ రాష్ట్ర సహకార బ్యాంక్, ట్రాఫిక్ పోలీస్, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ పశ్చిమ రైల్వలతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసిన భారత్ టాక్సీ
प्रविष्टि तिथि:
27 JUN 2026 6:24PM by PIB Hyderabad
గుజరాత్లోని గాంధీనగర్లో గల మహాత్మా మందిర్ కన్వెన్షన్, ఎగ్జిబిషన్ సెంటర్ నుంచి సహకార ఆధారిత రవాణా వేదిక ‘భారత్ టాక్సీ’ని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. టాక్సీ, ఆటో, ద్విచక్ర వాహనాల రవాణా సేవలలో ఉన్న సారథులకు యాజమాన్య వాటా, ఆత్మగౌరవం, భద్రత, ఆదాయాన్ని కల్పించడంతో పాటు ప్రజలకు నమ్మకమైన, సేవా దృక్పథంతో కూడిన రవాణా సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా భారత్ టాక్సీ సేవలందిస్తుంది. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, ఉప ముఖ్యమంత్రి శ్రీ హర్ష్ సంఘ్వీ, గుజరాత్ సహకార శాఖ మంత్రి శ్రీ జితుభాయ్ వాఘాని, గుజరాత్ సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ రమేష్భాయ్ కటారా, కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఆశిష్ కుమార్ భుతానీ, గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ మనోజ్ దాస్, భారత్ టాక్సీ చైర్మన్ డాక్టర్ జయెన్ మెహతాతో పాటు సహకార రంగ ప్రముఖులు, ఉన్నతాధికారులు, భారీ సంఖ్యలో సారథులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ, భారత రవాణా రంగానికి ఈ రోజు అత్యంత కీలకమైన రోజు అని అన్నారు. దేశం అభివృద్ధి చెందుతున్న కొద్దీ, టాక్సీ, రవాణా సేవల అవసరం ప్రతి ఇంటికీ చేరిందని ఆయన పేర్కొన్నారు. టాక్సీ అనే భావన ఇకపై కేవలం నాలుగు చక్రాల వాహనాలకే పరిమితం కాబోదని, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇతర పట్టణ రవాణా సేవలు కూడా ఇప్పుడు అందులో భాగమయ్యాయని వివరించారు. గుజరాత్లో 'భారత్ టాక్సీ' ని ప్రారంభించడం విస్తరిస్తున్న రవాణా అవసరాలకు సహకార రంగం ద్వారా ఒక కొత్త దిశను చూపించే మార్గమని పేర్కొన్నారు.
వాహనాలు నడిపే వారిని ఇతర కంపెనీలు కేవలం డ్రైవర్లుగానే పరిగణిస్తాయని, కానీ 'భారత్ టాక్సీ' వారిని 'సారథులు'గా గుర్తిస్తుందని శ్రీ అమిత్ షా అన్నారు. ఇది కేవలం పదాల మధ్య ఉన్న వ్యత్యాసం మాత్రమే కాదని, వారి పట్ల దృక్పథంలోనే పూర్తి తేడా అని ఆయన పేర్కొన్నారు. ఒక 'సారథి' అనే వ్యక్తి కేవలం సేవలను అందించేవాడు మాత్రమే కాదని, ఈ సహకార సంస్థలో గౌరవప్రదమైన భాగస్వామీ, యజమానీ అని స్పష్టం చేశారు. సారథులు, వినియోగదారులు ఇద్దరూ దోపిడీకి గురికాకుండా నిరోధించడం, సేవల నాణ్యతను మెరుగుపరచడం, రవాణా రంగంలో ఒక న్యాయబద్ధమైన వ్యవస్థను నెలకొల్పడమే 'భారత్ టాక్సీ' ప్రధాన ఉద్దేశమని వివరించారు.
గత కొన్ని సంవత్సరాలుగా యాప్ ఆధారిత టాక్సీ సేవలపై అనేక ఫిర్యాదులు వచ్చాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో సారథుల సంపాదన నుంచి మితిమీరిన కమీషన్ కట్ చేసుకున్నారనీ, మరికొన్ని సందర్భాల్లో వారికి రావలసిన చెల్లింపులు సమయానికి అందలేదనీ, అలాగే కొన్ని కేసుల్లో వారికి కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా రిజిస్ట్రేషన్లను రద్దు చేశారనీ ఆయన వివరించారు. ప్రతి సమస్యకూ చట్టాలు చేయడం ద్వారానే పరిష్కారం లభించదనీ, చాలా సార్లు సరైన సంస్థాగత నమూనా మాత్రమే శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుందనీ ఆయన అన్నారు. ఈ ఆలోచనతోనే సహకార నమూనాపై ‘భారత్ టాక్సీ’ భావన రూపుదిద్దుకుందని పేర్కొన్నారు.
దేశంలోని అనేక రంగాలలో దోపిడీకి సహకార వ్యవస్థ ముగింపు పలికిందనీ, ప్రజలకు హక్కులను, ఆర్థిక సమృద్ధిని చేకూర్చిందనీ శ్రీ అమిత్ షా అన్నారు. అమూల్ సంస్థను ఉదాహరణగా పేర్కొంటూ... కేవలం రూ. 100 వాటాతో సహకార వ్యవస్థలో చేరిన ఒక గ్రామీణ పశుపోషక మహిళ, ఈరోజు రూ. 1.25 లక్షల కోట్ల టర్నోవర్ కలిగిన అత్యంత విశ్వసనీయమైన ఒక ఫుడ్ బ్రాండ్లో భాగస్వామిగా నిలిచిందని ఆయన వివరించారు. మధ్యవర్తులు లేకుండా, ఎలాంటి దోపిడీకి తావులేకుండా, పూర్తి పారదర్శకతతో సహకార రంగం ద్వారానే ఒక భారీ ఆర్థిక వ్యవస్థను నిర్మించవచ్చని అమూల్ నిరూపించిందని ఆయన స్పష్టం చేశారు. ఈ నమూనా పాడి రంగంలో దోపిడీకి ముగింపు పలికిందనీ, పశువులను పోషించే మహిళలు కష్టపడి సంపాదించిన ఆదాయం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి చేరేలా చూసిందనీ పేర్కొన్నారు. నేడు గ్రామీణ భారతదేశంలోని పశుపోషక మహిళలు తమ శ్రమకు తగ్గ పూర్తి ఫలితాన్ని ఆత్మగౌరవంతో అందుకుంటున్నారని ఆయన అన్నారు. ఇదే విధంగా, ఇఫ్కో, క్రిబ్కో వంటి సహకార సంస్థలు నేడు దేశంలోని రైతుల ఎరువుల అవసరాలలో దాదాపు 35 శాతాన్ని తీరుస్తున్నాయని ఆయన వివరించారు. ఇది కూడా సహకార రంగంలో ఒక అతిపెద్ద విజయగాథ అని కొనియాడారు. రవాణా రంగంలో కూడా ఈ విజయవంతమైన సహకార సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నమే 'భారత్ టాక్సీ' అని పేర్కొన్నారు. అయితే, భారత్ టాక్సీ వంటి కార్యక్రమానికి అవసరమైన వనరులు ఎక్కడి నుంచి వస్తాయనే ప్రశ్నను చాలా మంది లేవనెత్తారని అంటూ, ఈ విషయమై దేశంలోని ప్రముఖ సహకార సంస్థలతో చర్చలు జరిగాయని, ఈ కీలకమైన చొరవలో భాగస్వాములు కావాలని వాటిని కోరామని వివరించారు. దేశంలోని పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీల ముందర ఒక బలమైన, పారదర్శకమైన, సారథులకు ప్రాధాన్యతనిచ్చే సహకార ప్రత్యామ్నాయాన్ని నిలబెట్టేందుకు ఎన్సీడీసీ, ఇఫ్కో, క్రిబ్కో, ఎన్డీడీబీ, నాబార్డ్, ఎన్సీఈఎల్, అమూల్ వంటి ప్రతిష్ఠాత్మక సహకార సంస్థలన్నీ కలిసి రవాణా రంగంలో ఈ సారథుల స్వంత సహకార సంస్థను నిర్మించాలని నిర్ణయించడం ఎంతో సంతోషంకరమైన విషయమని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటివరకు 7 లక్షలమందికి పైగా సారథులు భారత్ టాక్సీలో చేరారని కేంద్రమంత్రి తెలిపారు. సారథులకు ఆత్మగౌరవాన్ని, భద్రతను ఇవ్వడమే కాకుండా రాబోయే రోజుల్లో వారి ఆర్థిక సమృద్ధికి భారత్ టాక్సీ మార్గం సుగమం చేస్తుందని ఆయన అన్నారు. ఈ సహకార సంస్థ సారథుల సంపాదనను రక్షించడంతో పాటు భవిష్యత్తులో వారికి రుణాలు, భీమా, వారి వ్యాపార విస్తరణలోనూ కూడా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు దాదాపు 37 లక్షల మంది వినియోగదారులు భారత్ టాక్సీ సేవలను వినియోగించుకున్నారని, దీని పెరుగుతున్న ప్రజాదరణకు, నమ్మకానికి ఇదే స్పష్టమైన నిదర్శనమని ఆయన వివరించారు.
భారత్ టాక్సీ ఛార్జీలు ఎక్కువగా ఉన్నట్లు కొన్ని వార్తాపత్రికలు కథనాలు ప్రచురించడాన్ని శ్రీ అమిత్ షా ప్రస్తావిస్తూ, “భారత్ టాక్సీని అడ్డుకోడానికి అది విస్తరిస్తున్న ప్రతి చోటా, తోటి పోటీ కంపెనీలు నష్టాలను భరిస్తూ తాత్కాలికంగా మాత్రమే తమ ఛార్జీలను తగ్గిస్తున్నాయని వినియోగదారులు గుర్తించాలి. కానీ ఈ పరిస్థితి ఎంతో కాలం ఉండదు. మహా అయితే ఒకటి లేదా రెండేళ్లు మాత్రమే” అని అన్నారు. అయితే భారత్ టాక్సీ ఎప్పటికీ అలసిపోదని, వెనక్కి తగ్గదని, రంగం నుంచి తప్పుకోదని తాను పూర్తి నమ్మకంతో చెప్పాలనుకుంటున్నానని ఆయన అన్నారు. సేవా భావంతో, సహకార స్ఫూర్తితో భారత్ టాక్సీ మార్కెట్లో బలంగా నిలబడి, ఆరోగ్యకరమైన రీతిలో పోటీ పడుతుందని స్పష్టం చేశారు. ఎవరికీ నష్టం కలిగించడం తమ ఉద్దేశం కాదని, రవాణా రంగంలో ఒక న్యాయబద్ధమైన, పారదర్శకమైన, స్థిరమైన వ్యవస్థను నిర్మించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
నేడు ఛార్జీలను తగ్గించి, తాత్కాలికంగా సారథులకు ఎక్కువ కమీషన్ ఇస్తూ మార్కెట్లో ఒత్తిడిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్న కంపెనీలు కేవలం భారత్ టాక్సీ పురోగతిని అడ్డుకోవడానికే అలా చేస్తున్నాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు. భారత్ టాక్సీ ఈ రంగం నుంచి తప్పుకుంటే, తాము మళ్లీ పాత ఇష్టారాజ్య పద్ధతులను ప్రారంభించవచ్చని ఆ కంపెనీలు భావిస్తున్నాయని ఆయన అన్నారు. “కానీ నేను ఈ రోజు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను, వారి కోరిక ఎప్పటికీ నెరవేరదు. సేవా సంకల్పం, సహకార బలం, సారథుల నమ్మకంతో భారత్ టాక్సీ నిరంతరం ముందుకు సాగుతూనే ఉంటుంది” అని ఆయన స్పష్టం చేశారు. వదంతులను వ్యాప్తి చేసేవారికి మన సహకార స్ఫూర్తి, మన నిరంతర కృషి, సేవా సమర్పణ భావమే సమాధానం చెబుతాయని ఆయన అన్నారు. భారత్ టాక్సీని విజయవంతం చేయడంలో అతిపెద్ద బాధ్యత మన సారథులపైనే ఉందన్నారు. కేవలం తక్షణ లాభాలను చూసుకుని మనం నిర్ణయాలు తీసుకుంటే రాబోయే సంవత్సరాల్లో మళ్లీ అదే దోపిడీని ఎదుర్కోవలసి వస్తుందనీ, అటువంటి పరిస్థితి నుంచి నుండి బయటపడడానికే భారత్ టాక్సీని స్థాపించామనీ ఆయన గుర్తుచేశారు.
సారథులు ఎన్నో ఏళ్లుగా వివిధ కంపెనీలలో పనిచేశారని, చాలా సందర్భాల్లో తమ వాదన వినకుండానే నిర్ణయాలు తీసుకోవడం, తమ సంపాదనను తగ్గించడం, తమ శ్రమకు పూర్తి గౌరవం ఇవ్వకపోవడాన్ని వారు స్వయంగా చూశారని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన సారథులకు భరోసా ఇస్తూ, “భారత్ టాక్సీ మిమ్మల్ని ఎప్పటికీ దోపిడీ చేయదని నేను మీకు హామీ ఇస్తున్నాను, ఎందుకంటే ఇది ఎవరిదో పరాయి కంపెనీ కాదు, మీ సొంత సహకార సంస్థ” అని స్పష్టం చేశారు. నష్టాలను భరిస్తూ, అనారోగ్యకరమైన పోటీ ద్వారా భారత్ టాక్సీని మార్కెట్ నుంచి బయటకు నెట్టేయాలని కొన్ని కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. ఇటువంటి వ్యూహాలు ప్రపంచంలోని కొన్ని దేశాల్లో పనిచేయవచ్చేమో కానీ, భారతదేశంలో మాత్రం సాగవనీ, భారతదేశ ఆత్మ సహకారం, సేవ, అందరి సంక్షేమంలోనే ఇమిడి ఉందని స్పష్టం చేశారు. ఇక్కడ కేవలం స్వార్థ ప్రయోజనాలకే కాకుండా, అందరి హితానికే అత్యున్నత ప్రాధాన్యత ఇస్తారని ఆయన పేర్కొన్నారు.
దీర్ఘకాలికమైన, నమ్మకమైన, న్యాయబద్ధమైన రవాణా వ్యవస్థ మనకు కావాలనుకుంటే భారత్ టాక్సీని విజయవంతం చేయడం మనందరి ఉమ్మడి బాధ్యత అని సారథులకు, వినియోగదారులకు శ్రీ అమిత్ షా విజ్ఞప్తి చేశారు. “భారత్ టాక్సీతోనే ఉండండి, భారత్ టాక్సీ ఎల్లప్పుడూ మీకు అండగా నిలుస్తుంది” అని ఆయన పిలుపునిచ్చారు. సహకార రంగంలో తాము ఇప్పటికే ఎన్నో విజయవంతమైన ఉదాహరణలను నిరూపించామని గుర్తుచేశారు. ఒకప్పుడు అమూల్ కూడా ప్రైవేట్ డెయిరీల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొందనీ, అలాగే ఇఫ్కో, క్రిబ్కో, ఎన్డీడీబీ సంస్థలు సైతం ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడవలసి వచ్చిందనీ, అయితే ఈ సంస్థలన్నీ సహకారం, పారదర్శకత, ప్రజల నమ్మకం అనే బలంతోనే విజయం సాధించాయని ఆయన వివరించారు.
భారత్ టాక్సీ సారథుల సొంత సంస్థ అనీ, వారిపై జరిగే దోపిడీని అడ్డుకోవడానికీ, వారికి గౌరవాన్ని ఇవ్వడానికీ, వారిని ఆర్థికంగా సంపన్నులను చేయడానికీ దీనిని ఏర్పాటు చేశామని శ్రీ అమిత్ షా తెలిపారు. రాబోయే రోజుల్లో ఇదే సంస్థ వారికి రుణాలు అందించడంలోనూ , భీమా రక్షణ కల్పించడంలోనూ, వారి వ్యాపార విస్తరణకు మద్దతు ఇవ్వడంలోనూ తోడ్పడుతుందని వివరించారు. ఏ ప్రైవేట్ సంస్థా కూడా ఇలా చేయలేదని , వాటి లక్ష్యం కేవలం స్వంత లాభార్జనేనని, కానీ భారత్ టాక్సీ లక్ష్యం తన సారథుల సంక్షేమమేనని ఆయన స్పష్టం చేశారు. తక్షణ లాభాల కంటే... దీర్ఘకాలిక భద్రత, గౌరవం, స్థిరమైన ఆదాయానికే అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
పోటీ కంపెనీలు ఎన్ని నగరాలకని ఛార్జీలను తగ్గిస్తూ పోతాయని కేంద్రమంత్రి ప్రశ్నించారు. రాబోయే ఒకటిన్నర నుంచి రెండేళ్లలో భారత్ టాక్సీ 500కు పైగా నగరాలు, పట్టణాలకు విస్తరిస్తుందని ఆయన వెల్లడించారు. నాగ్పూర్, పూణే, ముంబయి, లక్నో, చండీగఢ్, జైపూర్, కోల్కతా సహా దేశంలోని పలు నగరాలకు భారత్ టాక్సీ తన సేవలను విస్తరించనుందని పేర్కొన్నారు. రాబోయే జూలై 31, 2026 నాటికి భారత్ టాక్సీ ఏడు ప్రధాన నగరాలకు చేరుకుంటుందని తెలిపారు. రాబోయే రెండేళ్లలో టూ-వీలర్స్ (ద్విచక్ర వాహనాలు), ఆటోలు, ఫోర్-వీలర్స్ అనే మూడు విభాగాలలోనూ దేశంలోని 500కు పైగా నగరాలు, పట్టణాలలో ఈ 'భారత్ టాక్సీ' నమూనాను అమలు చేయనున్నట్లు ఆయన వివరించారు.
గుజరాత్లో భారత్ టాక్సీ ప్రారంభం కావడం పట్ల శ్రీ అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. నేడు గుజరాత్ సారథులు ఏడు లక్షలమంది సభ్యులు గల ఒకే ఒక పెద్ద కుటుంబంలో భాగమయ్యారనీ, భారత్ టాక్సీలో చేరడం ద్వారా సహకార ఉద్యమానికి సరికొత్త బలాన్ని చేకూరుస్తున్నారనీ ఆయన కొనియాడారు. రాబోయే రోజుల్లో ఈ సహకార సంస్థ రవాణా రంగంలో సరికొత్త శిఖరాలను అధిరోహిస్తుందనీ, కచ్చితంగా విజయం సాధిస్తుందనీ తనకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. దేశంలోని కోట్ల మంది రైతులు అనుసంధానమై ఉన్న ఒకే విస్తృతమైన సహకార కుటుంబంలో నేడు వీరు భాగస్వాములయ్యారని, ఇప్పుడు గుజరాత్ సారథులు సైతం ఈ ప్రతిష్టాత్మక సహకార కుటుంబంలో ఒక అంతర్భాగంగా మారుతున్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశానికి ‘సహకార్ సే సమృద్ధి’ అనే మంత్రాన్ని అందించారని, రవాణా రంగంలో ఈ మంత్రాన్ని సాకారం చేసే దిశగా భారత్ టాక్సీ ఒక ముఖ్యమైన ముందడుగు అని ఆయన అభివర్ణించారు. రాబోయే రోజుల్లో సహకార రంగం మరిన్ని కొత్త రంగాలకు విస్తరిస్తుందనీ, సారథుల ఆత్మగౌరవానికీ, భద్రతకూ, వారి ఆదాయం పెంపునకూ భారత్ టాక్సీ ఒక బలమైన సాధనంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు.
గుజరాత్కు చెందిన భారత్ టాక్సీ సారథులందరికీ శ్రీ అమిత్ షా శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ టాక్సీ విజయం సేవా భావం, సహకార స్ఫూర్తి, సారథుల క్రియాశీల భాగస్వామ్యంపైనే ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. భారత్ టాక్సీలో చేరడం ద్వారా సారథులు తమ ఆర్థిక సమృద్ధి, ఆత్మగౌరవం, సామాజిక భద్రత అనే మూడింటికీ బాటలు వేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం సందర్భంగా, విస్తరణ సులభతర నిర్వహణ కోసం వివిధ సంస్థలతో భారత్ టాక్సీ అవగాహనా ఒప్పందాలను కూడా కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలు చేసుకున్న వాటిలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (రాజ్కోట్), ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సూరత్), గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్/బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, గుజరాత్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, అదానీ ఎయిర్పోర్ట్, గుజరాత్ ట్రాఫిక్ పోలీస్, పశ్చిమ రైల్వే - అహ్మదాబాద్ డివిజన్, వడోదర ఎయిర్పోర్ట్ ఉన్నాయి. ఈ అవగాహనా ఒప్పందాలు విమానాశ్రయాలు, రైల్వేలు, మెట్రో, పట్టణ రవాణా, ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించిన రంగాలలో భారత్ టాక్సీ సేవల విస్తృతిని మరింత బలోపేతం చేయనున్నాయి. ఈ కార్యక్రమం సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సారథులకు షేర్ సర్టిఫికెట్లను కూడా పంపిణీ చేశారు.
***
(रिलीज़ आईडी: 2278570)
आगंतुक पटल : 3