సహకార మంత్రిత్వ శాఖ
నాఫెడ్ ఈ-వేలం పోర్టల్ నాఫెక్స్ ను ప్రారంభించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
దేశ ఐక్యత, సమగ్రత కోసం అత్యున్నత త్యాగం చేసిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన శ్రీ అమిత్ షా
2014లో మూతపడే స్థాయి నుంచి మోదీ ప్రభుత్వం సహకారంతో ప్రస్తుతం రూ. 500 కోట్ల లాభంతో 74 లక్షల మంది రైతులకు సేవలందించేలా ఎదిగిన నాఫెడ్: శ్రీ అమిత్ షా
దళారీల వ్యవస్థకు పడనున్న అడ్డుకట్ట.. రైతుల కష్టార్జితం 48 గంటల్లోగా నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకే: శ్రీ అమిత్ షా
రాబోయే రెండేళ్లలో ప్రతి పప్పుధాన్యపు గింజనూ నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేయనున్న ఎన్సీసీఎఫ్, నాఫెడ్ సంస్థలు: శ్రీ అమిత్ షా
రైతుల పిల్లల ఉన్నత విద్య, ఉద్యోగ జీవితం కోసం ప్రారంభమైన 'నాఫెడ్ ఉపకారవేతనం'.. వచ్చే లాభాల్లో కొంత భాగం రైతు కుటుంబాలకే: శ్రీ అమిత్ షా
प्रविष्टि तिथि:
23 JUN 2026 4:41PM by PIB Hyderabad
'నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్)' ఈ-వేలం పోర్టల్ అయినర నాఫెక్స్ (NAFEX.in)ను ఈ రోజు ఢిల్లీలో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్.. సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ కృష్ణ పాల్ గుర్జర్, సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఆశిష్ కుమార్ భుతానీ, నాఫెడ్ ఛైర్మన్ శ్రీ జేతాభాయ్ అహిర్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ.. నాఫెడ్ ఈ రోజు నాఫెక్స్, ద్రిష్ఠి, ఈఆర్పీ, నాఫెడ్ కళ్యాణ్ పేర్లతో నాలుగు ప్రధాన కార్యక్రమాలను ప్రారంభించిందని తెలిపారు. 2014లో నాఫెడ్ మూతపడే స్థాయికి చేరుకుందన్నప్పటికీ ఈ సరికొత్త ప్రయత్నాల వల్ల నేడు ఆ సంస్థ రూ. 30,000 కోట్ల ఆదాయం, రూ. 500 కోట్ల లాభంతో దేశంలోని 74 లక్షల మందికి పైగా రైతులకు సేవలు అందిస్తోందని అన్నారు. అందుకే నాఫెక్స్ తో పాటు మిగిలిన కార్యక్రమాలు ఎంతో కీలకమైనవని ఆయన పేర్కొన్నారు. నాఫెడ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దీనిని పూర్తి పారదర్శకతతో నడపాలని నిర్ణయించారని శ్రీ అమిత్ షా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నాఫెడ్కు ఆర్థిక సహాయాన్ని అందించడం దీనిని మరోసారి మంచి స్థాయిలో నిలబెట్టిందని ఆయన తెలిపారు.
నేడు ఉత్పత్తి, కొనుగోలు రెండింటిలోనూ నాఫెడ్ గణనీయమైన వృద్ధిని నమోదు చేసిందని శ్రీ అమిత్ షా తెలిపారు. పప్పుధాన్యాల రంగంలో దేశాన్ని స్వయంసమృద్ధిగా మార్చడానికి.. ఎన్సీసీఎఫ్, నాఫెడ్ సంస్థలు పప్పుధాన్యాల ప్రతి గింజనూ నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేసే దిశగా వేగంగా అడుగులు వేయాల్సి ఉందన్నారు. ఇది రైతులకు తగిన గిట్టుబాటు ధరలను నిర్ధారిస్తుందని.. దీనివల్ల పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం పెరిగి పప్పుధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయంసమృద్ధి సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు.
గడిచిన మూడేళ్లలో పప్పుధాన్యాలు, మొక్కజొన్న, ఇతర పంట ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించినట్లు కేంద్ర సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా తెలిపారు. ఇప్పుడు ఈ మౌలిక సదుపాయాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సి ఉందన్నారు. నాఫెడ్, ఎన్సీసీఎఫ్ సంస్థలు పూర్తి నిబద్ధత, పారదర్శకతతో పనిచేయాలని.. అప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. రాబోయే రెండేళ్లలో రైతులందరూ పప్పుధాన్యాలను నేరుగా ఈ రెండు సంస్థలకే విక్రయించేలా, అందుకు సంబంధించిన చెల్లింపులను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో పడేలా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు.
నేడు నాఫెడ్ కేవలం వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకే పరిమితం కాలేదని శ్రీ అమిత్ షా తెలిపారు. గత మూడేళ్లలో నాఫెడ్ సంస్థ సేంద్రియ వ్యవసాయం, విత్తనోత్పత్తి, చిల్లర వర్తకం, జీవ ఎరువుల తయారీ, ఆహార భద్రత, అంతర్జాతీయ వాణిజ్యం వంటి రంగాల్లో అద్భుతమైన పనితీరును కనబరిచిందని.. ఇది నాఫెడ్ ప్రాధాన్యత, లాభదాయకతను రెండింటినీ పెంపొందించిందని ఆయన పేర్కొన్నారు. సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటైనప్పుడు నాఫెడ్ ఆదాయం రూ. 20,000 కోట్లుగా ఉండగా ఇప్పుడు అది రూ. 30,000 కోట్లకు పెరిగిందని ఆయన చెప్పారు. రాబోయే రెండేళ్లలో ఈ ఆదాయం రూ. 50,000 కోట్ల మార్కును దాటుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. నాఫెడ్ నికర లాభం రూ. 139 కోట్ల నుంచి రూ. 405 కోట్లకు పెరిగిందని.. ఆ సంస్థ నికర విలువ రూ. 358 కోట్ల నుంచి రూ. 2,050 కోట్లకు చేరిందని ఆయన వివరించారు. నేడు నాఫెడ్ ఒక బలమైన, ఆర్థికంగా సమర్థవంతమైన, స్వయంసమృద్ధి గల సంస్థగా అవతరించిందని ఆయన అన్నారు. పప్పుధాన్యాలు, ఇతర పంటల ప్రతి గింజనూ పూర్తి పారదర్శకతతో నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేయడానికి, దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడానికి, రైతులకు చెందాల్సిన లాభాలు నేరుగా వారికే అందేలా చూసేందుకు నాఫెడ్, ఎన్సీసీఎఫ్ సంస్థలకు ఇది సరైన సమయమని ఆయన అన్నారు.
రైతుల పిల్లల ఉన్నత విద్య, ఉద్యోగ జీవితం కోసం సంస్థ లాభాల్లో 1 శాతాన్ని ఉపకార వేతనాల కోసం కేటాయించాలని నాఫెడ్ నిర్ణయించిందని కేంద్ర సహకార శాఖ మంత్రి తెలిపారు. రైతుల పిల్లలు ఉన్నత చదువులు చదవడం, ఉద్యోగ జీవితంలో ఎదిగేందుకు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించడానికి ఇది ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
తన ప్రసంగం ప్రారంభంలో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా… మాజీ కేంద్ర మంత్రి, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. 'ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే నాయకుడు' అనే సిద్ధాంతాన్ని సాకారం చేయడానికి, దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఇదే రోజున ప్రాణ త్యాగం చేశారని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. ఈ దేశ గొప్ప నాయకులలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఒకరని ఆయన కొనియాడారు. ఆయన తన జీవితంలో కీర్తి ప్రతిష్టల కోసం ఏనాడూ పాకులాడలేదని.. ఆయన చేసిన ప్రతి పని... దేశంపై సుదూర, సానుకూల ప్రభావాలను చూపిందని చెప్పారు. దేశ విభజన సమయంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బ్రిటిష్ వారితో పోరాడి పశ్చిమ బెంగాల్ భారత్లోనే ఉండేలా చూశారని శ్రీ అమిత్ షా గుర్తుచేశారు. ఆయన చేసిన ఆ పోరాటం వల్లే నేడు పశ్చిమ బెంగాల్ భారత్లో అంతర్భాగంగా కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాశ్మీర్లో ఆర్టికల్ 370ని అమలు చేశారన్న కేంద్ర హోం మంత్రి.. దీనివల్ల కాశ్మీర్కు ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం ఉండేవని అన్నారు. ఈ ఆలోచన భారత్ ఐక్యత, సమగ్రతకు అత్యంత ప్రమాదకరమైందని ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరు నాయకులు ఉండకూడదని స్పష్టం చేస్తూ డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. దీని కోసం ఆయన ఢిల్లీ నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి కాశ్మీర్ భారత్లో భాగమేనని చాటిచెప్పారు. కాశ్మీర్లోకి ప్రవేశించడానికి ఎలాంటి అనుమతులు తీసుకునేందుకు శ్యామా ప్రసాద్ ముఖర్జీ నిరాకరించారని.. ఆ కారణంగానే ఆయనను అరెస్టు చేశారని చెప్పారు. అనంతరం కాశ్మీర్ జైలులోనే ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించారన్నారు. నాటి ప్రభుత్వంలో కాశ్మీర్ అంశంపైనే డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ పరిశ్రమల శాఖ మంత్రిగా పదవికి రాజీనామా చేశారని శ్రీ అమిత్ షా గుర్తుచేశారు. నేడు ఆయన కల సాకారమైందని హోం మంత్రి అన్నారు. ఆర్టికల్ 370 రద్దయిందని.. ఆయన స్థాపించిన పార్టీనే నేడు గంగోత్రి నుంచి బెంగాల్లోని గంగాసాగర్ వరకు అధికారంలో ఉందని చెప్పారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ సాంస్కృతిక జాతీయవాదానికి, భారతీయ సంస్కృతికి బలమైన మద్దతుదారుడని కేంద్ర సహకార మంత్రి కొనియాడారు.
***
(रिलीज़ आईडी: 2277340)
आगंतुक पटल : 16