ప్రధాన మంత్రి కార్యాలయం
ఒడిశా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పీఎం ప్రసంగం
प्रविष्टि तिथि:
20 JUN 2026 5:01PM by PIB Hyderabad
గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, గవర్నర్ శ్రీ హరిబాబు, ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ, ఉప ముఖ్యమంత్రి శ్రీ కనక్ వర్ధన్ సింగ్ డియో, శ్రీమతి ప్రవతి పరిదా, ఒడిశా మంత్రి శ్రీ గణేశ్ సింగ్ ఖుంటియా, శ్రీ కృష్ణ చంద్ర మోహపాత్ర, పార్లమెంటు సభ్యుడు శ్రీ నబా చరణ్ మాఝీ, శ్రీ మన్మోహన్ సమాల్, శ్రీ బైజయంత్ పాండా, ఇతర ప్రముఖులు, సోదరీసోదరులారా.
ఇటీవల కాలంలో ఒడిశా పండగ సంబరాల్లో మునిగిపోయింది. గత వారమే రాజా పండగను ఉత్సాహంగా జరుపుకున్నారు. మహాప్రభు జగన్నాథుని రథయాత్ర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మయూర్భంజ్లోని బరిపడ రథయాత్రపై ప్రజల్లో ఉత్సాహం నెలకొంది.
వీటన్నింటి మధ్య ప్రజాస్వామ్య, అభివృద్ధి పండగ కూడా జరుగుతోంది. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా మిమ్మల్ని కలిసే అవకాశం రావటం, మయూర్భంజ్ని సందర్శించే భాగ్యం కలగటం, పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి రావటంతో ఈ సందర్భం నాకు మరింత ప్రత్యేకంగా మారింది.
మీ అభిమానమే నన్ను మళ్లీ మళ్లీ ఇక్కడికి తీసుకువస్తోంది. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో ఒడిశా అభివృద్ధి ప్రయాణం పట్ల ప్రజలకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నా.
ఈ సందర్భంగా పండిట్ రఘునాథ్ ముర్ము, డాక్టర్ దమయంతి బెస్రా, శ్రీ చరణ్ హెంబ్రం వంటి ప్రముఖ వ్యక్తులకు నివాళులర్పిస్తున్నా. సంతాలీ భాష కోసం ఓల్ చికి లిపిని రఘునాథ్ ముర్ము సృష్టించారు. మన ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని సంతాలీ భాషలోనూ అందుబాటులోకి తెచ్చింది. ఒడిశా ముద్దుబిడ్డలను పద్మ అవార్డులతో గౌరవించాం. ఈ మహానుభావుల కలలన్నింటినీ సాకారం చేసేందుకు గత రెండేళ్లుగా ఒడిశా ప్రభుత్వం అహర్నిశలూ శ్రమిస్తోంది.
మిత్రులారా,
మరో కారణం వల్ల కూడా ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. మయూర్భంజ్ నేలపై పెరిగిన ఒడిశా ముద్దుబిడ్డ, గౌరవ రాష్ట్రపతి ఇవాళ మనతో ఉన్నారు. ఆమె పుట్టినరోజు కూడా ఇవాళే.
గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆయురారోగ్యాలతో ఆమె దీర్ఘకాలం జీవించాలని ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థనలను ఆ జగన్నాథ స్వామికి భక్తిపూర్వకంగా సమర్పిస్తున్నా. ఒడిశా పుత్రిక దేశంలోనే అత్యున్నత పదవిని చేపట్టి, దిశానిర్దేశం చేయటం మనందరికీ గర్వకారణం.
రాష్ట్రపతి వ్యక్తిత్వం, ఉదారమైన, దయాగుణం గల స్వభావం.. దేశానికి, సమాజానికి సేవ చేయటంలో ఆమెకున్న అంచంచలమైన నిబద్ధత కేవలం మయూర్భంజ్ కు గుర్తింపునే కాక, ఒడిశా ఖ్యాతిని పెంచాయి. ఈ సందర్భంగా ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా.
మిత్రులారా,
ఈ కార్యక్రమానికి సిద్ధం అవుతున్నపుడు కేవలం ప్రయాణ ఏర్పాట్లకు సంబంధించిన కారణాలు మాత్రమే ఉన్నాయి. ఈ పర్యటన కోసం చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. కానీ కుదరలేదు. జూన్ 21న కోల్కతాలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం ఖరారైనప్పుడు, అదే రోజున బెంగాల్ దినోత్సవం కావడంతో.. ఉదయం మయూర్భంజ్ని సందర్శించి, సాయంత్రానికి కోల్కతా కార్యక్రమానికి హాజరుకావచ్చని నేను భావించాను. అలా జూన్ 20వ తేదీ ఖరారైంది.
కానీ కొన్ని విషయాలు దైవానుగ్రహంతో జరుగుతాయి. కాకతాళీయమే అయినా, ఈ రోజు మరో గొప్ప విషయం కూడా ఉంది. ఇవాళ గౌరవ రాష్ట్రపతి పుట్టినరోజు కూడా కావడం విశేషం. ఈ శుభ సందర్భంగా ఆమె స్వగ్రామాన్ని సందర్శించి, స్వయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపే గొప్ప అవకాశం నాకు లభించింది.
మిత్రులారా,
నేడు రాష్ట్రపతితో కలిసి పహాడ్పూర్ను సందర్శించాను. ఈ ప్రాంతంలోని పిల్లల కోసం ఆమె నిర్మించిన పాఠశాలను చూశాను. అక్కడున్న పిల్లలతో కొన్ని మరపురాని క్షణాలను గడిపే అవకాశం నాకు లభించింది.
ఆ పిల్లల ముఖాల్లోని వెలుగును, రాష్ట్రపతి పంచే ఆప్యాయతను, అనురాగాన్ని నేను గమనించాను. అక్కడున్న పిల్లల్లో ఏ ఒక్కరూ రాష్ట్రపతి వచ్చినట్లుగా భావించటం లేదు.. తమ తల్లే వారి వద్దకు వచ్చినట్లు భావిస్తున్నారు.
నిజంగా ఆ పిల్లలు ఎంతో అదృష్టవంతులు. ఈ ప్రాంతంలోని పేద, వెనకబడిన, గిరిజన పిల్లలు.. దేశం కోసం ఏదైనా గొప్పగా చేయాలనే స్ఫూర్తిని, విశ్వాసాన్ని పొందుతున్నారు.
ఇలాంటి గొప్ప అనుభవాలను పొందే అవకాశం కల్పించిన రాష్ట్రపతికి నేను కృతజ్ఞతలు చెబుతున్నా. ఈ రోజును నేను మర్చిపోలేను. ఎందుకంటే, ఇవాళ నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను.
మిత్రులారా,
ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని కూడా నేను తెలియజేయాలనుకుంటున్నా. పహాడ్పూర్ గ్రామాన్ని సోలార్ గ్రామంగా, సూర్య గ్రామంగా అభివృద్ధి చేయనున్నారు.
ప్రతి ఇల్లూ సౌర విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయానికి ప్రసిద్ధి చెందినట్లుగా, పహాడ్పూర్ సూర్య గ్రామంగా గుర్తింపు పొందుతుందని గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ దిశగా పనులు వెంటనే ప్రారంభమయ్యేలా చూడటమే నా ప్రయత్నం. ఈ గ్రామం సోలార్ విలేజ్గా గుర్తింపు పొందుతుంది. ఈ కార్యక్రమం ద్వారా పహాడ్పూర్ ప్రజలకు ఉచిత సౌర విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. ఉత్పత్తి అయిన అదనపు విద్యుత్ ఆదాయాన్ని పెంచుతుంది.
మిత్రులారా,
ఒడిశాలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వ రెండేళ్ల పాలన చరిత్రాత్మకమైనది. ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ నాయకత్వంలో నేడు ఒడిశా అభివృద్ధి పథంలో వేగంగా దూసుకెళ్తోంది. ఇక్కడ పేదల సంక్షేమ పథకాల ద్వారా సామాన్య ప్రజల జీవితాల్లో మార్పులొస్తున్నాయి. పెరుగుతున్న ఆర్థిక కార్యకలాపాల ద్వారా ఒడిశా.. పెట్టుబడులను, పరిశ్రమలను ఆకర్షించే సామర్థ్యాన్ని నిరూపించుకుంటోంది. కొత్త ఉపాధి అవకాశాల కల్పనకు వేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మిత్రులారా,
తూర్పు భారత అభివృద్ధి ద్వారానే భారతదేశం అభివృద్ధి చెందుతుందనేది కేంద్ర ప్రభుత్వ దార్శనికత. అందుకే మేం పూర్వోదయ విధానంపై పని చేస్తున్నాం. కాంగ్రెస్ హయాంలో వెనుకబాటుతనానికి చిహ్నంగా మారిన తూర్పు భారతం, ప్రస్తుతం ప్రగతికి ముఖద్వారంగా మారుతోంది. ఒడిశా రాష్ట్రమే ఈ మార్పుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది.
మిత్రులారా,
ఒడిశాకు సముద్ర తీరం, ఖనిజ సంపద, బలమైన వ్యవసాయ రంగం, అన్నింటికీ మించి ప్రతిభ గల యువత ఉన్నారు. ఈ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు మనం కలిసికట్టుగా పని చేస్తున్నాం. దీనివల్ల ఒడిశా రైల్వే మౌలిక సదుపాయాల్లో రికార్డు స్థాయి పెట్టుబడులు వస్తున్నాయి. కొత్త రహదారులు, ఆర్థిక కారిడార్ల నిర్మాణం, ఓడరేవుల విస్తరణ జరుగుతోంది. ఇంధనం, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ ఆధునిక పరిశ్రమల్లోకి పెట్టుబడులు వస్తున్నాయి.
ఒడిశా అభివృద్ధికి సంబంధించి ఇవాళ ఎన్నో ముఖ్యమైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. మరికొన్నింటికి శంకుస్థాపనలు జరిగాయి. ఈ ప్రాజెక్టులు సుమారు రూ.47,000 కోట్ల వ్యయంతో కూడినవి. విద్యుత్, రోడ్లు, రైల్వేలు, ఆరోగ్యం, విద్యా రంగాలకు సంబంధించిన ఈ ప్రాజెక్టులు మీ అందరికీ ఎంతో మేలు చేస్తాయి. ఈ ప్రాజెక్టుల సందర్భంగా ఒడిశా ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా.
మిత్రులారా,
మా ప్రభుత్వం ఒడిశా వనరులను అవకాశాలుగా మారుస్తోంది. భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు, నూతన పరిశ్రమల స్థాపనకు ఉత్కర్ష్ ఒడిశా వంటి ప్రచార కార్యక్రమాలను చేపడుతోంది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే దాదాపు రూ.20 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు అందాయి. రూ.3.5 లక్షల కోట్లకు పైగా విలువైన పలు మెగా ప్రాజెక్టుల పనులు కూడా కొనసాగుతున్నాయి.
పరిశ్రమలకు అనువైన వాతావరణాన్ని సృష్టించేందుకు ఒడిశా సమగ్రాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాం. విద్యుత్ రంగంలో రూ. 6,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. సమృద్ధ షహరా యోజన ద్వారా పట్టణాభివృద్ధి వేగంగా జరుగుతోంది. రాబోయే ఏళ్లలో ఈ ప్రయత్నాల ఫలితాలను చూస్తాం.
మిత్రులారా,
డబుల్-ఇంజిన్ ప్రభుత్వ ప్రధాన లక్షణం.. నేరుగా ప్రజలకు ప్రయోజనాలను అందించటం. సామాన్య పౌరులు సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేయటమే మా ప్రయత్నం. ఈ ప్రయత్నాల ఫలితంగానే నేడు యువత, మహిళలు, రైతులు, సామాన్య పౌరుల ఆకాంక్షలు నెరవేరుతున్నాయి. రైతులకు క్వింటాలు వరి కొనుగోలుకు రూ. 3,100 అందించాలని నిర్ణయం తీసుకున్నాం. సుభద్ర యోజన ద్వారా కోటి మందికి పైగా తల్లులకూ, ఆడపడుచులకు ఆర్థిక సహాయం అందింది.
ఆయుష్మాన్ భారత్ అమలు ద్వారా ఒడిశాలోని కుటుంబాలు దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందేందుకు మార్గం సుగమమైంది. గిరిజన విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేయకుండా ఉండేందుకు మాధో సింగ్ హాత్ ఖర్చా యోజనను ప్రారంభించాం.
మహాప్రభు శ్రీ జగన్నాథుని భక్తుల భావాలను గౌరవిస్తూ, భక్తుల కోసం శ్రీమందిరంలోని నాలుగు ద్వారాలను తెరిచారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వ బలంతో ఇప్పుడు అన్ని రంగాల్లోనూ, అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతోంది.
మిత్రులారా,
ఇటీవల ఇక్కడ నిర్వహించిన ప్రత్యేక పరిశుభ్రత ప్రచారం గురించి నాకు తెలిసింది. ఈ పరిశుభ్రత ప్రచార కార్యక్రమమైన "స్వచ్ఛత సే స్వాగత్" సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారటాన్ని గమనించాను. ఒడిశా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నేను ఎంతగానో అభినందిస్తున్నా. ఈ ప్రశంసనీయమైన ప్రయత్నానికిగానూ అక్కడి ప్రజలకు, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి అభినందనలను తెలియజేస్తున్నా.
మిత్రులారా,
పరిశుభ్రత మన జీవనశైలిలో భాగం కావాలి. ఇది రోజువారీ అలవాటుగా మారాలి. ఈ పరిశుభ్రతా కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
మిత్రులారా,
నా జీవితంలో కీలకమైన సమయంలో గిరిజన ప్రాంతాల్లో స్వచ్ఛంద సేవకుడిగా పనిచేస్తూ గడిపాను. అలాంటి ప్రాంతాల్లో గౌరవ రాష్ట్రపతి స్వయంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఎన్నో ఏళ్లు గడిపారు. గిరిజన ప్రాంతాలకు ప్రాథమిక వసతులు అంత సులభంగా చేరలేదనే విషయం మా ఇద్దరికీ తెలుసు. అందువల్ల మన ప్రభుత్వం గిరిజన అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. అటువంటి ప్రాంతాలను నిత్యావసర వసతులతో అనుసంధానించేందుకు ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ను మేం ప్రారంభించాం. ఈ కార్యక్రమం ద్వారా అక్కడ నివసించే ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు వీలుగా ఆరోగ్యం, విద్య, రహదారులు, గృహ నిర్మాణానికి సంబంధించిన విభాగాలు సమగ్రాభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేస్తున్నాయి.
గౌరవ రాష్ట్రపతితో నిర్వహించిన చర్చలు, వారి మార్గదర్శకత్వ ఫలితమే పీఎం జన్మన్ అభియాన్. గిరిజన సమాజంలోనే అత్యంత వెనుకబడిన గిరిజన సమూహాల కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు. ఇప్పుడు ప్రభుత్వ సేవలు గిరిజన వర్గాల వద్దకు, నేరుగా వారి గ్రామాలకు, ఇంటివద్దకే వెళ్తున్నాయి.
మిత్రులారా,
గిరిజన సమాజ అభ్యున్నతి కోసం గిరిజన యువతకు విద్యా, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాం. పిల్లలకు మెరుగైన విద్యా సౌకర్యాలను కల్పించేందుకు దేశవ్యాప్తంగా దాదాపు 500 ఏకలవ్య మోడల్ పాఠశాలలను ప్రారంభించాం. సుమారు 750 ఏకలవ్య పాఠశాలలకు అనుమతులు వచ్చాయి. ప్రీ-మెట్రిక్, పోస్టు-మెట్రిక్ స్థాయిల్లో 1.5 కోట్లకు పైగా గిరిజన విద్యార్థులకు వందల కోట్ల రూపాయల విలువైన ఉపకార వేతనాలను అందించాం. మయూర్భంజ్లో మరో నవోదయ విద్యాలయ స్థాపనకు ఆమోదం లభించిందని వెల్లడించేందుకు ఎంతో సంతోషిస్తున్నా.
మిత్రులారా,
దూరప్రాంతాల్లో నివాసాల వల్ల గిరిజన సమాజాలు ఆరోగ్య సంబంధిత సవాళ్లను ఎదుర్కొన్నాయి. సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధులు వీరికి పెద్ద సవాలుగా మారాయి. ఈ వ్యాధులకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రచారాన్ని మేం ప్రారంభించాం. నాలుగు కోట్లకు పైగా ఆరోగ్య కార్డులను పంపిణీ చేశాం. ఉచిత చికిత్స కోసం కోట్ల మంది గిరిజన లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులను అందించాం.
జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతోంది. ఈ ప్రయత్నాల ఫలితాలను ఇవాళ మనం చూస్తున్నాం.
దశాబ్దాలుగా ఉన్న ఇబ్బందుల నుంచి గిరిజన సమాజం బయటపడుతోంది. అభివృద్ధిలో ప్రధాన భాగం అవుతోంది.
మిత్రులారా,
రాబోయే ఏళ్లలో మన ముందు రెండు కీలక లక్ష్యాలున్నాయి. 2036 నాటికి ఒడిశా రాష్ట్రంగా ఏర్పడి 100 ఏళ్లు పూర్తవుతాయి. 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతాయి. ఒడిశా, దేశం.. రెండింటి మార్గం, గమ్యం ఒకటే. ఒడిశా ఆర్థిక వ్యవస్థ బలోపేతమైతే, భారత్ కూడా బలంగా మారుతుంది. ఒడిశా సామర్థ్యంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అందరం కలిసి ఒడిశాను అభివృద్ధి పథంలో ఉన్నత స్థాయికి చేర్చాలి.
మిత్రులారా,
రేపు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటాం. జ్ఞానభూమి, యోగభూమి అయిన ఒడిశా సాంస్కృతిక జీవన విధానంలో యోగా ఎప్పటి నుంచో భాగంగా ఉంది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ అత్యధిక సంఖ్యలో యోగా దినోత్సవంలో పాల్గొనాలని ఈ ఒడిశా గడ్డ నుంచి పిలుపునిస్తున్నా. నేటి ఈ కార్యక్రమం, అభివృద్ధి ప్రాజెక్టుల సందర్భంగా మీ అందరికీ మరోసారి నా అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా గౌరవ రాష్ట్రపతి పని చేసిన, సేవలందించిన ప్రాంతానికి ఆమెతో కలిసి వచ్చే అవకాశాన్ని కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
మరోసారి ఆమెకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ధన్యవాదాలు.
జై జగన్నాథ్!
జై జగన్నాథ్!
జై జగన్నాథ్!
గమనిక: ప్రధానమంత్రి ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం. వాస్తవానికి ఆయన హిందీలో ప్రసంగించారు.
***
(रिलीज़ आईडी: 2276894)
आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam