ఎంఐఎఫ్ఎఫ్-2026లో ‘భారతి ఔర్ బిబో’ ప్రపంచ తొలి ప్రదర్శన: భారత మహిళా దిగ్గజాలకు యానిమేటెడ్ నివాళి
స్నేహా రవిశంకర్ దర్శకత్వంలో, ఎన్ఎఫ్డీసీ- పప్పెటికా మీడియా సంయుక్తంగా నిర్మించిన హిందీ యానిమేషన్ సిరీస్ ‘భారతి ఔర్ బిబో’ ప్రపంచ తొలి ప్రదర్శనకు 19వ ముంబయి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వేదికగా మారింది. ఈ సిరీస్ను పరిచయం చేసిన దర్శకురాలు రవిశంకర్.. దీనిని ఒక గొప్ప మైలురాయిగా అభివర్ణించారు. ఈ ప్రాజెక్టులో ఎన్ఎఫ్డీసీ సహకారాన్ని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారతీయ మహిళలకు నివాళిగా, వారి కథలకు ఎటువంటి మార్పులు చేయకుండా ఉన్నవి ఉన్నట్లుగా ప్రదర్శిస్తున్నామనే ప్రకటనతో ఈ సిరీస్ ప్రారంభమవుతుంది.
చిన్నారి భారతి, ఆమె మాంత్రిక సహచరి బిబో ద్వారా ఈ సిరీస్ కథనం సాగుతుంది. ఆమె పేరు భారత్ స్త్రీ రూపాన్ని సూచిస్తుంది. మహిళలు వారి రోజువారీ జీవితంలో డ్రైవర్లు, సంరక్షకులు, కథక్ నృత్యకారులు, రైతులు, జిమ్నాస్టులు, కళాకారులుగా పోషిస్తున్న పాత్రలను కీర్తించే ఒక బృందగానంతో ప్రతి ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. ఆ బృందగానంలో ‘‘నారీ మే దేవీ మే, ముఝ్ సే హై సబ్కుచ్, ముఝ్ మే హై సబ్కుచ్’’ అనే పల్లవి వినిపిస్తుంది. గొప్ప మహిళలంటే ఇలాగే ఉంటారనే ఒక మూస ధోరణిని ఈ వైవిధ్యమైన ప్రదర్శన తోసిపుచ్చుతుంది.
భారత్కు చెందిన నలుగురు నిజ జీవిత మహిళా దిగ్గజాల జీవితాలను వివరిస్తుంది. ఇందులో ‘అహల్యాబాయి హోల్కర్’ ఎపిసోడ్ ఇండోర్ రాజ కుటుంబం నుంచి మరాఠా రాణిగా ఆమె ఎదిగిన తీరును, ఆమె పరిపాలనా చాతుర్యాన్ని, దౌత్యనీతిని వర్ణిస్తుంది. ఆమెకు బలమైన నాయకత్వ పాఠాలు నేర్పిన ఆమె అత్తగారి పాత్ర ద్వారా మహిళలు పోషకులుగా ఎలా ఉంటారనే విషయాన్ని కూడా ఇందులో అద్భుతంగా ప్రతిబింబించారు.
గోండ్వానా రాణి పరిపాలన, అక్బర్ నేతృత్వంలోని మొఘల్ సామ్రాజ్యాన్ని ఆమె ఎదిరించిన తీరును రాణి దుర్గావతి ఎపిసోడ్ కళ్లకు కడుతుంది. ‘‘ఆమె కేవలం ఒక మహిళ మాత్రమే’’ అని అక్బర్ సైన్యం ఆమెను తక్కువ అంచనా వేస్తుంది. కానీ తన అచంచలమైన సంకల్పంతో తన శక్తిని వారు గుర్తించేలా ఆమె చేస్తుంది. శత్రువులకు లొంగిపోవడం కంటే మరణమే మేలని ఆమె ఎంచుకోవడంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. జబల్పూర్లోని రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం ద్వారా ఆమె వారసత్వాన్ని నేటికీ గౌరవిస్తున్నారు. సాధారణంగా మహిళల సున్నితత్వానికి ప్రతీకగా భావించే గులాబీ రంగును యానిమేటర్ ఇందులో భిన్నంగా చూపించారు. ఆ రంగును ధైర్యసాహసాలతో కూడిన సైన్యంగా మలిచారు.
ఈస్ట్ ఇండియా కంపెనీని ఎదిరించిన కోల్కతా సామాజిక సంస్కర్త ప్రయాణాన్ని రాణి రాష్మణి ఎపిసోడ్ చూపుతుంది. ఆమె ప్రజా సంక్షేమ మౌలిక సదుపాయాలను నిర్మించడమే కాకుండా, ఈశ్వర చంద్ర విద్యాసాగర్తో కలిసి బహుభార్యత్వాన్ని నిషేధించే చట్టంతో సహా పలు సంస్కరణల కోసం పనిచేశారు. దక్షినేశ్వర్ ఆలయాన్ని ఒక మహిళ నిర్మించినందున అక్కడ పూజలు చేయడానికి పూజారులు నిరాకరిస్తారు. దీంతో మతపరమైన పితృస్వామ్య వ్యవస్థను కూడా ఈ ఎపిసోడ్ ప్రశ్నిస్తుంది.
రాజ వంశాల కథలకు కాస్త భిన్నంగా సాలుమరద తిమ్మక్క ఎపిసోడ్ సాగుతుంది. ప్రాథమిక విద్యకు నోచుకోక చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న కర్ణాటకకు చెందిన పర్యావరణవేత్త కథ ఇది. ఆమె వందలాది చెట్లను నాటి, వాటిని తన సొంత పిల్లల్లా ఎలా పెంచి పోషించారో ఇందులో చూపించారు. ఆ సేవలకుగానూ ఆమెకు పద్మశ్రీ పురస్కారం కూడా వరించింది.
ఈ సిరీస్లోని అన్ని ఎపిసోడ్లలోనూ వైధవ్యం, వివాహ వ్యవస్థ, మహిళలు మౌనంగా భరించిన భావోద్వేగపూరితమైన కష్టాలను చాలా వాస్తవికంగా ఆవిష్కరించారు. కథాకథనంలో పూర్తిగా మాతృస్వామ్య విధానానికి పరిమితం కాకుండా, స్త్రీవాద దృక్పథంతో లింగ సమానత్వాన్ని అత్యంత సున్నితంగా చూపించడం ఇందులో విశేషం.
ఈ ధారావాహిక వినోదంతో కూడిన విద్య విధానంలో ఉండటం వల్ల యువతకు, పిల్లలకు చరిత్ర సులభంగా అర్థం కావడంతో పాటు ఆసక్తికరంగా ఉంటుంది. భారత్కు చెందిన ఇలాంటి గొప్ప మహిళల వీరగాథలు మరుగున పడిపోయే ప్రమాదం ఉన్న ప్రస్తుత తరుణంలో పిల్లలు వారి గురించి తెలుసుకోవడానికి, వారి సేవలకు విలువనిచ్చి, ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడానికి భారతి ఔర్ బిబో సిరీస్ ఒక అద్భుతమైన మార్గదర్శిగా ఉపయోగపడుతుంది.
***
रिलीज़ आईडी:
2276406
| Visitor Counter:
7