పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై అంతర మంత్రిత్వ శాఖల సమావేశం
గత 3 రోజుల్లో దాదాపు 1.36 కోట్ల ఎల్పీజీ సిలిండర్ల బుకింగులు జరగగా... దాదాపు 1.47 కోట్ల సిలిండర్ల పంపిణీ
2026 మార్చి నుంచి దాదాపు 10.02 లక్షల పీఎన్జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా… అదనంగా 3.22 లక్షల కనెక్షన్ల కోసం మౌలిక సదుపాయాలు... కొత్త కనెక్షన్ల కోసం దాదాపు 9.94 లక్షల వినియోగదారుల నమోదు
దాదాపు 62,370 మెట్రిక్ టన్నుల ఎల్ఎన్జీ సరుకుతో వస్తున్న దిశ ఎల్ఎన్జీ కార్గో నౌక.. జూన్ 19న దహేజ్కు చేరే అవకాశం
గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటివరకు 3,639 మందికి పైగా భారతీయ నావికులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి రావడానికి నౌకాయాన మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు
प्रविष्टि तिथि:
18 JUN 2026 4:57PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో.. ప్రజలకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించడంలో భారత ప్రభుత్వం తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. దీనికి సంబంధించి ఈ రోజు నేషనల్ మీడియా సెంటర్లో అధికారులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పెట్రోలియం - సహజ వాయువు మంత్రిత్వ శాఖ, ఓడరేవులు, నౌకాయానం-జలమార్గాల మంత్రిత్వ శాఖల అధికారులు.. ఇంధన లభ్యత, నౌకా వాణిజ్య కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయ పౌరులకు సహాయం, కీలక రంగాల్లో స్థిరత్వాన్ని కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలపై తాజా వివరాలను అందించారు.
ఇంధన సరఫరా, లభ్యత
పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రస్తుత ఇంధన సరఫరా పరిస్థితిపై తాజా వివరాలను అందించింది. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో.. పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ నిరంతరాయంగా లభించేలా చూసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించింది. ఆ వివరాలిలా ఉన్నాయి:
క్రూడ్ నిల్వలు - రిఫైనరీల పనితీరు
· తగినంత ముడి చమురు నిల్వలతో అన్ని రిఫైనరీలు అధిక సామర్థ్యంతో నడుస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ నిల్వలను కూడా సరిపడా స్థాయిలో నిర్వహిస్తున్నారు.
· గృహ వినియోగానికి సరిపడేలా రిఫైనరీల నుంచి ఆ విభాగంలో ఎల్పీజీ ఉత్పత్తిని పెంచారు.
· దేశీయ మార్కెట్ కోసం పెట్రోకెమికల్ ముడిపదార్థాలు లభించేలా చర్యలు తీసుకునేందుకు వివిధ మంత్రిత్వ శాఖల సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేశారు. సెంటర్ ఫర్ హై టెక్నాలజీ నిర్ణయించిన ప్రకారం... కీలక రంగాల కోసం కనీస పరిమాణంలో సీ3, సీ4 రకాలను అందుబాటులో ఉంచేందుకు చమురు శుద్ధి కంపెనీలతోపాటు పెట్రోకెమికల్ కాంప్లెక్సులకు భారత ప్రభుత్వం 2026 ఏప్రిల్ 1 నాటి ఉత్తర్వుల ద్వారా అనుమతి ఇచ్చింది.
· ఔషధ విభాగం, రసాయనాలు - పెట్రో కెమికల్స్ విభాగం, పారిశ్రామిక - అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగాల నుంచి వచ్చిన అభ్యర్థనల ఆధారంగా... ఫార్మా, రసాయన, పెయింట్ రంగ కంపెనీల కోసం మొత్తం ఎల్పీజీ నిల్వల నుంచి రోజుకు 1120 మెట్రిక్ టన్నుల సీ3 - సీ4 మాలిక్యూళ్ల కేటాయింపు నిబంధనను తెచ్చారు.
· 2026 జూన్ 1 నుంచి ముంబయి, కొచ్చి, వైజాగ్, చెన్నై, మథుర, గుజరాత్ రిఫైనరీల ద్వారా రసాయన, ఫార్మా, పెయింట్ పరిశ్రమలకు 7,630 మెట్రిక్ టన్నుల పైగా సీ3 - సీ4 మాలిక్యూళ్లు (ప్రొపిలీన్, బ్యూటిలీన్లతో కూడిన), అలాగే 6,230 మెట్రిక్ టన్నులకు పైగా బ్యూటైల్ అక్రిలేట్ను విక్రయించారు.
రిటైల్ ఇంధన లభ్యత - ధరల నియంత్రణ చర్యలు
· దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకులు యథావిధిగా పనిచేస్తున్నాయి.
· మధ్య ప్రాచ్య సంక్షోభం కారణంగా ముడి చమురు ధరలు అసాధారణంగా పెరిగాయి. అయినప్పటికీ, ఇది వినియోగదారులపై ప్రతికూల ప్రభావాన్ని చూపకుండా ఉండేందుకు… పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 10 చొప్పున తగ్గించడం ద్వారా ఈ భారాన్ని కొంతమేర భరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
· పెట్రోల్ ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ. 1.5 వద్ద యథాతథంగా ఉంచుతూనే... డీజిల్ ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ. 13.50 నుంచి రూ. 14కు, ఏటీఎఫ్ ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ. 9.5 నుంచి రూ. 12.5కు పెంచుతూ 2026 జూన్ 15న భారత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
· దేశంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయి.
సహజవాయువు సరఫరా, పీఎన్జీ విస్తరణ చర్యలు
· డీ-పీఎన్జీ, రవాణా రంగానికి సీఎన్జీలకు 100 శాతం సరఫరాను అందిస్తూ వినియోగదారులకే అత్యధి ప్రాధాన్యమిచ్చారు.
· యూరియా ప్లాంట్లకు సరఫరా... గత ఆరు నెలల్లో వాటి సగటు వినియోగంలో దాదాపు 100 శాతంగా ఉంది.
· సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ( సీజీడీ) నెట్వర్క్ల ద్వారా అందించే సరఫరాలు సహా.. ఇతర పారిశ్రామిక,వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరాను 80 శాతం వరకు పెంచారు.
· వాణిజ్య ఎల్పీజీ లభ్యతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం కోసం… తమ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్జీ కనెక్షన్లలో ప్రాధాన్యమివ్వాలని సీజీడీ సంస్థలకు సూచించారు.
· సీజీడీ నెట్వర్క్ విస్తరణకు అవసరమైన దరఖాస్తుల ఆమోదాన్ని వేగవంతం చేయాలని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను, కేంద్ర మంత్రిత్వ శాఖలను కేంద్ర ప్రభుత్వం కోరింది.
· దీర్ఘకాలంలో ఎల్పీజీ నుంచి పీఎన్జీ దిశగా మార్పునకు సహకరించే రాష్ట్రాలు/ కేంద్ర ప్రభుత్వాలకు వాణిజ్య ఎల్పీజీ కేటాయింపుల్లో 10 శాతం అదనంగా అందించేందుకు… 2026 మార్చి 18 నాటి లేఖ ద్వారా భారత ప్రభుత్వం ప్రతిపాదించింది.
· పీఎన్జీ విస్తరణ సంస్కరణలతో ముడిపడి ఉన్న అదనపు వాణిజ్య ఎల్పీజీ కేటాయింపులను 22 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు పొందుతున్నాయి.
· శుద్ధ, మరింత సురక్షితమైన, ఆత్మనిర్భర ఇంధన భవితకు ఊతమిచ్చేలా... ఒక నమూనా రాష్ట్ర సీబీజీ విధాన ముసాయిదాను భారత ప్రభుత్వం రూపొందించింది. రాష్ట్రాలు తమ పరిధిలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ( సీబీజీ) అభివృద్ధి కోసం పెట్టుబడిదారులకు అనుకూలమైన, సులభంగా అమలు చేయగల వ్యవస్థను సృష్టించుకునేందుకు ఒక సమగ్రమైన, సరళమైన మార్గదర్శక ప్రణాళికగా ఈ ముసాయిదా ఉపయోగపడుతుంది. ఈ విధానాన్ని ఎంచుకునే రాష్ట్రాలకు తదుపరి విడత అదనపు వాణిజ్య ఎల్పీజీ కేటాయింపుల్లో ప్రాధాన్యమిస్తారు.
· 2026 మార్చి నుంచి దాదాపు 10.02 లక్షల పీఎన్జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా ప్రారంభించారు. అదనంగా మరో 3.22 లక్షల కనెక్షన్ల కోసం మౌలిక సదుపాయాలను కల్పించారు. దీనితో మొత్తం కనెక్షన్ల సంఖ్య 13.24 లక్షలకు చేరింది. కొత్త కనెక్షన్ల కోసం దాదాపు మరో 9.94 లక్షల మంది వినియోగదారులు నమోదు చేసుకున్నారు.
ఎల్పీజీ సరఫరా
గృహ వినియోగ ఎల్పీజీ సరఫరా స్థితి
· ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఎల్పీజీ సరఫరాపై అంతరాయ ప్రభావం కొనసాగుతోంది.
· గృహ వినియోగదారులకు ఎల్పీజీ సరఫరాకు ప్రాధాన్యమిచ్చారు.
· ఎల్పీజీ పంపిణీ కేంద్రాల వద్ద నిల్వలు పూర్తిగా అయిపోయినట్టు ఎలాంటి సమాచారమూ లేదు.
· పరిశ్రమ స్థాయిలో ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగులు నిన్న దాదాపు 99 శాతానికి పెరిగాయి.
· పంపిణీదారుల స్థాయిలో గ్యాస్ సిలిండర్ల పక్కదారి మళ్లింపును అరికట్టేందుకు… డెలివరీ ధ్రువీకరణ కోడ్ (డీఏసీ) ఆధారిత పంపిణీని దాదాపు 96 శాతానికి పెంచారు. వినియోగదారుడు నమోదు చేసుకున్న మొబైల్ నంబరుకు కోడ్ వస్తుంది.
· గత మూడు రోజుల్లో దాదాపు 1.36 కోట్ల ఎల్పీజీ సిలిండర్ల బుకింగులకు గాను దాదాపు 1.47 కోట్ల సిలిండర్లు పంపిణీ అయ్యాయి.
వాణిజ్యపరమైన ఎల్పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు
· సంస్కరణలతో ముడిపడి ఉన్న 10 శాతం కేటాయింపు సహా… మొత్తం వాణిజ్యపరమైన కేటాయింపును సంక్షోభానికి ముందు స్థాయుల్లో దాదాపు 70 శాతానికి పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది
· గత మూడు రోజుల్లో –
· దాదాపు 1.98 లక్షల అయిదు కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల అమ్మకాలు జరిగాయి.
· దాదాపు 1334 శిబిరాల ద్వారా... 19,000కు పైగా 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల అమ్మకాలు జరిగాయి.
· మొత్తం 22,945 మెట్రిక్ టన్నుల వాణిజ్యపరమైన ఎల్పీజీ అమ్మకాలు జరిగాయి.
· దాదాపు 928 మెట్రిక్ టన్నుల ఆటో ఎల్పీజీని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు విక్రయించాయి.
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ చర్యలు
· నిత్యావసర వస్తువుల చట్టం-1955, ఎల్పీజీ నియంత్రణ ఉత్తర్వు-2000 ప్రకారం… సరఫరాను పర్యవేక్షించడానికి, అలాగే అక్రమ నిల్వలు, నల్లబజారు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారముంది.
· పెట్రోలు, డీజిలు, ఎల్పీజీ వంటి నిత్యావసర వస్తువుల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడంలో, నియంత్రించడంలో రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం పలు లేఖలు, వీడియో కాన్ఫరెన్సుల ద్వారా అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు స్పష్టం చేసింది.
· తగినంత ఇంధనం అందుబాటులో ఉందన్న విషయాన్ని ప్రజలకు స్పష్టం చేస్తూ, వారిలో నమ్మకాన్ని నింపడానికి… వారికి ఎప్పటికప్పుడు విస్తృతంగా సమాచారాన్ని చేరవేయాలని భారత ప్రభుత్వం పలు లేఖలు, వీడియో కాన్ఫరెన్సుల ద్వారా వివరించింది.
· 2026మే 26 నాటి లేఖ ద్వారా అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులకు భారత ప్రభుత్వం ఒక కీలకమైన అభ్యర్థన చేసింది. హెచ్ఎస్డీ, ఎమ్ఎస్ వినియోగ విధానాన్ని పర్యవేక్షించాలని రాష్ట్ర/జిల్లా అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా అందులో కోరింది. ముఖ్యంగా పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు పెట్రోలు బంకుల ద్వారా అనధికారికంగా డీజిలును కొనుగోలు చేయకుండా నిరోధించడానికి.. సమస్యాత్మక ప్రాంతాలు, ప్రధాన రవాణా, పారిశ్రామిక కారిడార్లలో తనిఖీలను తీవ్రతరం చేయాలని స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది.
అమలు, పర్యవేక్షణ చర్యలు
· పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్లను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా తనిఖీ చర్యలు కొనసాగుతున్నాయి.
· ఎల్పీజీ సంబంధిత చర్యలు – గత 3 రోజుల్లో దేశవ్యాప్తంగా 21 ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా... ఆరుగురిని అరెస్టు చేసి, 1056 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
· అదే సమయంలో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థల ధికారులు చేపట్టే ఆకస్మిక తనిఖీలూ కొనసాగుతున్నాయి.
· ఎల్పీజీ పంపిణీ కేంద్రాలు - గత 3 రోజుల్లో క్రమశిక్షణారహిత ప్రవర్తనకు గాను 4 రిటైల్ అవుట్లెట్లకు జరిమానాలు విధించగా, 598 రిటైల్ అవుట్లెట్లను సస్పెండ్ చేశారు.
· ఎల్పీజీ-గత 3 రోజుల్లో క్రమశిక్షణారాహిత్య ప్రవర్తనకు గానూ 8 ఎల్పీజీ పంపిణీ కేంద్రాలపై జరిమానాలు విధించారు.
· రిటైల్ అవుట్లెట్లు – గత 3 రోజుల్లో మార్కెట్ క్రమశిక్షణ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు 14 రిటైల్ అవుట్లెట్లపై జరిమానాలు విధించగా, 461 రిటైల్ అవుట్లెట్లను సస్పెండ్ చేశారు.
ప్రభుత్వ సంసిద్ధత, సరఫరా నిర్వహణ చర్యలు
· ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో గృహావసరాల కోసం ఎల్పీజీ, పీఎన్జీ, సీఎన్జీ (రవాణా)లకు 100 శాతం సరఫరా జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
· వాణిజ్య ఎల్పీజీ సరఫరాలో ఆసుపత్రులకు, విద్యా సంస్థలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఔషధ, ఉక్కు, ఆటోమొబైల్, విత్తన, వ్యవసాయ రంగాలకూ ప్రాధాన్యత కొనసాగిస్తున్నారు.
· వలస కార్మికులు, విద్యార్థులు మొదలైన వారి ఎల్పీజీ అవసరాలకు మద్దతుగా 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల సరఫరాను పెంచారు.
· సరఫరా, డిమాండ్ రెండు వైపులా ప్రభుత్వం ఇప్పటికే అనేక హేతుబద్ధీకరణ చర్యలను అమలు చేసింది. రిఫైనరీల ద్వారా ఉత్పత్తిని పెంచడం... పట్టణ ప్రాంతాల్లో బుకింగ్ విరామాన్ని 21 రోజుల నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు పెంచడం... సరఫరా విషయంలో నిర్దిష్ట రంగాలకు ప్రాధాన్యమివ్వడం వంటి చర్యలు వీటిలో భాగంగా ఉన్నాయి.
ప్రజలకు సూచనలు-అవగాహన చర్యలు
· పెట్రోల్, డీజిల్, ఎల్పీజీల లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నందున, పౌరులు వీటిని భయాందోళనతో కొనుగోలు చేయడం మానుకోవాలని సూచించింది.
· వదంతుల పట్ల అప్రమత్తంగా ఉంటూ, సరైన సమాచారం కోసం అధికారిక వనరులపైనే ఆధారపడాలి.
· పౌరులు పీఎన్జీ, ఇండక్షన్/ఎలక్ట్రిక్ కుక్టాప్లు మొదలైన ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాలని కోరారు.
· పెద్దమొత్తంలో పారిశ్రామికంగా డీజిల్ను వినియోగించేవారు అధీకృత కొనుగోలు వనరుల ద్వారానే కొనుగోలు చేయవలసిందిగా కోరారు.
· ప్రస్తుత పరిస్థితుల్లో పౌరులంతా తమ రోజువారీ వినియోగంలో ఇంధనాన్ని పొదుపు చేయాలని కోరారు.
నౌకా వాణిజ్య భద్రత, నౌకాయాన కార్యకలాపాలు
పర్షియన్ గల్ఫ్లో నెలకొన్న సముద్ర పరిస్థితిపై ఓడరేవులు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని అందించింది. ఈ ప్రాంతంలో భారతీయ నౌకలు, సిబ్బంది భద్రత, రక్షణను నిర్ధారించడానికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఈ నివేదికను అందించింది. అందులో కింది విషయాలను పేర్కొన్నది:
· షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ) నేతృత్వంలోని కన్సార్టియం పర్యవేక్షణలో నడుస్తున్న మాల్టా దేశ జెండా కలిగిన భారీ ఎల్ఎన్జీ కార్గో నౌక ‘దిశ’ (ఐఎంఓ:9250713) జూన్ 15, 2026 న హర్మోజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. దాదాపు 62,370 మెట్రిక్ టన్నుల ఎల్ఎన్జీ గ్యాస్ కార్గోతో భారత్లోని దాహేజ్ (గుజరాత్) రేవుకు వస్తున్న ఈ నౌక.. జూన్ 19, 2026 నాటికి దాహేజ్ పోర్టుకు చేరుకోనుందని భావిస్తున్నారు.
· భారతీయ నావికుల భద్రత, సంక్షేమం కోసం కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ద్వారా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, షిప్పింగ్ కంపెనీలు, ఇతర భాగస్వామ్య పక్షాలతో నిరంతరం అత్యంత కట్టుదిట్టమైన సమన్వయాన్ని కొనసాగిస్తోంది.
· నావికులు, వారి కుటుంబ సభ్యులకు సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ నిరంతరం పనిచేస్తోంది. ఈ కంట్రోల్ రూమ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 13,187 ఫోన్ కాల్స్, 29,376కి పైగా ఈమెయిళ్లను స్వీకరించి, పరిష్కరించింది. కేవలం గత 72 గంటల్లోనే నావికులు, వారి కుటుంబాలు, సముద్ర రవాణా భాగస్వాముల నుండి 450 ఫోన్ కాల్స్, 1,077 ఈమెయిళ్లు రాగా, అధికారులు వాటికి తక్షణ సహాయాన్ని అందించారు.
· గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చే ప్రక్రియ వేగంగా సాగుతోంది. డీజీ షిప్పింగ్ సహాయంతో ఇప్పటివరకు 3,639 మందికి పైగా భారతీయ నావికులు సురక్షితంగా భారతదేశానికి చేరుకున్నారు. వీరిలో కేవలం గత 72 గంటల్లోనే గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుంచి 47 మంది నావికులను అధికారులు సురక్షితంగా తరలించారు.
***
(रिलीज़ आईडी: 2274906)
आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam