యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
వికసిత భారత్ యూత్ పార్లమెంట్-2026ను రేపు ప్రారంభించనున్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా
చర్చల నుంచి తీర్మానాల వరకు... నారీశక్తి వందన్: సమ్మిళితత్వానికి ఊతం, వికసిత భారత్ - 2047 అంశాలపై చర్చ
పార్లమెంటరీ కార్యకలాపాలను ప్రత్యక్షంగా వీక్షించనున్న యువత: పరిపాలన వ్యవహారాలపై స్పష్టమైన అవగాహన
దేశ పురోగతి, పరిపాలన వ్యవహారాల్లో యువతను ముందంజలో నిలిపేలా కార్యక్రమం
प्रविष्टि तिथि:
15 JUN 2026 2:06PM by PIB Hyderabad
కేంద్ర యువజన వ్యవహారాలు - క్రీడలు - కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో.. యువజన వ్యవహారాలు - క్రీడల మంత్రిత్వ శాఖ 2026 జూన్ 15 నుంచి 17 వరకు న్యూఢిల్లీలో ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ – 2026’ను నిర్వహిస్తోంది. జాతీయ స్థాయి వికసిత భారత్ యూత్ పార్లమెంటును గౌరవ లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా 2026 జూన్ 16న ప్రారంభిస్తారు. విజయవంతమైన గత ఎడిషన్ల అనుభవంతో ఈ యేడూ ప్రతిష్ఠాత్మకంగా యూత్ పార్లమెంటును నిర్వహిస్తున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియల్లో యువత భాగస్వామ్యాన్ని పునస్సమీక్షిస్తూ.. పరిపాలన, విధాన చర్చలు, పార్లమెంటరీ వ్యవహారాలపై యువతకు ప్రత్యక్ష అవగాహనను ఈ కార్యక్రమం అందిస్తుంది.
‘వికసిత భారత్ యూత్ పార్లమెంట్’ కేవలం అధికారికంగా నిర్వహించే ఒక కార్యక్రమం మాత్రమే కాదు.. దేశ యువత శక్తినీ, ఆలోచనలనూ, ఆశయాలనూ జాతీయ స్థాయి చర్చల్లో భాగస్వామ్యం చేసే ఉద్యమమిది. సెంట్రల్హాల్లో వారు చేసే తీర్మానాలు.. ఈ మూడు రోజులకే పరిమితం కాదు. వికసిత భారత్ - 2047 దిశగా భారత్ ప్రస్థానాన్ని ముందుండి నడిపేలా ఈ తరం యువ నాయకులందరికీ స్ఫూర్తినిచ్చేలా ఇవి నిలుస్తాయి.
మూడు దశల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. యువత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేలా ప్రతి దశనూ రూపొందించారు:
-
జిల్లా స్థాయిలో నోడల్ దశ:
-
అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)కి 50 ఏళ్లపై విస్తృత స్థాయి చర్చలు: 757 నోడల్ విశ్వవిద్యాలయాలు/ విద్యాసంస్థల్లో దేశ ప్రజాస్వామ్య సంబంధిత పాఠ్యాంశాలను బోధించారు. తద్వారా ఈ చర్చ దేశంలోని నలుమూలకూ చేరింది.
-
ప్రతి జిల్లా నుంచి మొదటి అయిదు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులకు రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనే అవకాశం లభించింది.
రాష్ట్ర స్థాయి దశ:
-
అన్ని రాష్ట్రాల్లోని శాసనసభలు, ప్రముఖ ప్రభుత్వ వేదికల్లో ఈ కార్యక్రమాలు జరిగాయి. ‘కేంద్ర బడ్జెట్ 2026: యువశక్తి ప్రాతిపదికగా బడ్జెట్’కు సంబంధించి ప్రాంతీయ పాలన విధానాలపై యువతకు అర్థవంతమైన అవగాహన కల్పించేలా ఈ దశ కార్యక్రమాలు దోహదపడ్డాయి.
-
రాష్ట్ర శాసనసభ స్పీకర్లు, గవర్నర్ల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాలు.. ప్రభుత్వ చర్చల్లో యువత భాగస్వామ్యం ప్రాధాన్యాన్ని పెంచాయి.
జాతీయ స్థాయి దశ (2026 జూన్ 15–17):
-
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రతినిధులు న్యూఢిల్లీలో తుది కార్యక్రమంలో పాల్గొంటారు.
-
జాతీయ దశలో అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి:
-
ప్రారంభోపన్యాసం: ‘నారీ శక్తి వందన్: సమ్మిళితత్వానికి ఊతం, వికసిత భారత్ - 2047’ అంశంపై ప్రతి జట్టు నుంచీ ఒక్కో ప్రతినిధి సభను ఉద్దేశించి 3 నిమిషాలు మాట్లాడుతారు.
-
ప్రశ్నోత్తరాల సమయం: యూత్ పార్లమెంటులో పాల్గొనే బృందాలన్నీ నిజమైన పార్లమెంటరీ స్ఫూర్తితో ప్రశ్నలు వేసి, వాటిపై ప్రతిస్పందిస్తాయి. ప్రశ్నకు 3 నిమిషాలు, సమాధానమివ్వడానికి 3 నిమిషాలు... ఈ విధంగా ఒక సామూహిక తీర్మానాన్ని వారు ఆమోదిస్తారు.
-
నిపుణులతో తరగతులు: వక్తృత్వం, ప్రజలనుద్దేశించి ప్రసంగించడంపై నిష్ణాతుడితో అభ్యర్థులకు తరగతులు నిర్వహిస్తారు. వారి నాయకత్వ నైపుణ్యాలకు ఇది మరింత పదును పెడుతుంది.
-
పీఎం సంగ్రహాలయ సందర్శన: పీఎం సంగ్రహాలయను ప్రత్యేకంగా సందర్శించడం ద్వారా.. సుసంపన్నమైన దేశ రాజకీయ వారసత్వాన్నీ, నాయకత్వ పరంపరనూ ప్రతినిధులు పరిశీలిస్తారు.
-
కొత్త పార్లమెంటు సందర్శన: దేశ నూతన పార్లమెంటు భవనంలో పర్యటన అభ్యర్థులకు కొత్త స్ఫూర్తినిస్తుంది. ఇది వారికి దేశ ప్రజాస్వామ్య మూలాలతో ప్రత్యక్షానుబంధాన్ని అనుభూతి చెందేలా చేస్తుంది.
-
పురస్కార ప్రదానోత్సవం: ఈ కార్యక్రమంలో భాగస్వాములైన యువ విశేష కృషికి గుర్తింపుగా.. జూన్ 17న ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్- 2026’ పురస్కారాలను అందిస్తారు.
***
(रिलीज़ आईडी: 2273037)
आगंतुक पटल : 47