వ్యవసాయ మంత్రిత్వ శాఖ
భారతీయ మామిడి పండ్ల దిగుమతిపై ఎలాంటి నిషేధం విధించని నేపాల్
प्रविष्टि तिथि:
10 JUN 2026 8:04PM by PIB Hyderabad
భారతదేశ మామిడి పండ్ల దిగుమతిపై నేపాల్ నిషేధం విధించిందనీ, లేదా తాత్కాలికంగా ఆపివేసిందనీ కొన్ని మీడియా సంస్థల నుంచి వార్తలు... కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చాయి. ఈ వార్తలు వాస్తవ విరుద్ధమైనవే కాకుండా తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయి.
భారతీయ మామిడి పండ్ల దిగుమతిపై ఎలాంటి నిషేధం విధించలేదని నేపాల్ ప్రభుత్వం తెలియజేసింది. ఈ మేరకు 2026 జూన్ 10న ఆ దేశ ‘ప్లాంట్ క్వారంటైన్, పెస్టిసైడ్ మేనేజ్మెంట్ సెంటర్ (నేపాల్ నేషనల్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్)’ స్పష్టతనిచ్చింది. నిర్దేశిత వృక్ష ఆరోగ్య సంరక్షణ (ఫైటోశానిటరీ) నిబంధనలకు లోబడి ఈ దిగుమతులను అనుమతిస్తున్నారు. ఈ నిబంధనలను పాటిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే వృక్ష ఆరోగ్య సంరక్షణ ధ్రువీకరణ పత్రాలను సమర్పించిన తర్వాతే దిగుమతికి అనుమతులు, క్లియరెన్స్ ఆర్డర్లు జారీ అవుతున్నాయి.
భారత్ నుంచి నేపాల్కు మామిడి పండ్ల ఎగుమతులు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. 2026 జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 2005 మెట్రిక్ టన్నుల (ఎంటీ) మామిడి పండ్లతో కూడిన 149 కన్సైన్మెంట్లు నేపాల్కు ఎగుమతి అయ్యాయి. కేవలం 2026 జూన్ నెలలోనే ఇప్పటి వరకు 266 మెట్రిక్ టన్నుల పరిమాణం గల 18 కన్సైన్మెంట్లు ఆ దేశానికి వెళ్లాయి.
నేపాల్ ప్రభుత్వం ఇటీవల హాట్ వాటర్ ట్రీట్మెంట్ (హెచ్డబ్ల్యూటీ) వంటి కొన్ని దిగుమతి నిబంధనలను సవరించినప్పటికీ భారత్ ఆ నిర్దేశిత నిబంధనలకు లోబడి ఎగుమతులను ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగిస్తోంది. ముందస్తు సంప్రదింపులు లేకుండా ఇలాంటి కొత్త ‘వృక్ష ఆరోగ్య సంరక్షణ (ఫైటోశానిటరీ) చర్యలను’ తీసుకోవటంపై భారత్ ఆందోళనలను వ్యక్తం చేసింది. డబ్ల్యూటీఓ ఎస్పీఎస్ ఒప్పందం, అంతర్జాతీయ వృక్ష సంరక్షణ కన్వెన్షన్ (ఐపీపీసీ) నిబంధనల ప్రకారం తగిన ద్వైపాక్షిక మార్గాల ద్వారా భారత్ ఈ విషయాన్ని చర్చిస్తోంది.
దిగుమతి, ఎగుమతి నిబంధనలకు సంబంధించిన సమాచారం కోసం భాగస్వాములు, వ్యాపారులు, ప్రజలు కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రభుత్వం సూచిస్తోంది. నేపాల్కు భారతీయ మామిడి పండ్ల ఎగుమతులపై వాణిజ్య ఆంక్షలు విధించారంటూ వస్తున్న ధ్రువీకరించని నివేదికలు, కథనాలను నమ్మొద్దని కోరింది.
***
(रिलीज़ आईडी: 2271382)
आगंतुक पटल : 14