హోం మంత్రిత్వ శాఖ
త్రిపుర సరిహద్దు ప్రాంతాల సమస్యలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
సరిహద్దు భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ ప్రతి సరిహద్దు ప్రాంతాన్ని బలోపేతం చేస్తోన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం: కేంద్ర హోం మంత్రి
సరిహద్దు భద్రత కేవలం ఒక విభాగానికి పరిమితమైన విధి కాదు.. అది అన్ని ప్రాంతాల బాధ్యత: కేంద్ర హోం మంత్రి
జిల్లా మేజిస్ట్రేట్లు, ఎస్పీలు, పట్వారీలు, సర్పంచ్లు, ఆధునిక సాంకేతికతలు, బీఎస్ఎఫ్.. ఇలా అందరినీ కలుపుకుంటూ ఒక పటిష్ఠమైన భద్రతా వ్యవస్థను అభివృద్ధి చేయాలి: కేంద్ర హోం మంత్రి
కేవలం కంచె వేయడం మాత్రమే కాకుండా స్థానిక పరిపాలన, స్మార్ట్ సాంకేతికత, బీఎస్ఎఫ్లతో కూడిన సంపూర్ణ భూభాగ రక్షణ ద్వారా మాత్రమే పూర్తి సురక్షితమైన, అభేద్యమైన సరిహద్దు వ్యవస్థ సాధ్యం: కేంద్ర హోం మంత్రి
మాదకద్రవ్యాలు, ఆయుధాల ముప్పును ఎదుర్కొనేలా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలి: కేంద్ర హోం మంత్రి
ఈ శిబిరాల్లో పట్వారీలు, స్థానిక పోలీసులు, బీఎస్ఎఫ్ సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనేలా చూడాలి: కేంద్ర హోం మంత్రి
కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సంబంధించిన సీసీటీవీ మోడల్ను మొదటగా త్రిపురలో అమలు చేయాలి: కేంద్ర హోం మంత్రి
బీఎస్ఎఫ్కు చెందిన ప్రతి కెమెరాను అప్గ్రేడ్ చేసి జిల్లా పరిపాలనా యంత్రాంగంతో అనుసంధానించాలి: కేంద్ర హోం మంత్రి
మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాను నిరోధించేందుకు తరచుగా ఆపరేషన్లు చేపట్టాలి: కేంద్ర హోం మంత్రి
మాదకద్రవ్యాల సరఫరా గొలుసులో భాగస్వాములైన వారందరిపై కఠినమైన వైఖరితో ఉక్కుపాదం మోపాలి: కేంద్ర హోం మంత్రి
సరిహద్దు జిల్లాల్లో ఆర్థిక క్రమశిక్షణను నిర్ధారించడం రాష్ట్రాల బాధ్యత కూడా: కేంద్ర హోం మంత్రి
కలెక్టర్లు, జీఎస్టీ అధికారులకు ఈ విషయమై శిక్షణ ఇవ్వాలి: కేంద్ర హోం మంత్రి
నకిలీ నోట్లపై సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) ఒక సర్వే నిర్వహించాలి: కేంద్ర హోం మంత్రి
प्रविष्टि तिथि:
06 JUN 2026 8:17PM by PIB Hyderabad
త్రిపురలోని సల్బగన్లో ఆ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల సమస్యలను కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా సమీక్షించారు. ఈ సమావేశంలో త్రిపుర ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర సీనియర్ అధికారులతో పాటు త్రిపురలోని మొత్తం 8 సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మరింత మెరుగైన సమన్వయంతో సరిహద్దుల సమగ్ర నిర్వహణను పటిష్ఠం చేయడంపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించారు.
సరిహద్దు భద్రత కేవలం ఒక విభాగానికి పరిమితమైన విధి కాదని, అది అన్ని ప్రాంతాల బాధ్యత అని కేంద్ర హోం మంత్రి పేర్కొన్నారు. జిల్లా మేజిస్ట్రేట్లు, ఎస్పీలు, పట్వారీలు, సర్పంచ్లు, ఆధునిక సాంకేతికతలు, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) అందరినీ కలుపుకుంటూ ఒక పటిష్ఠమైన భద్రతా వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సరిహద్దు భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ ప్రతి సరిహద్దు ప్రాంతాన్ని బలోపేతం చేస్తోందని శ్రీ అమిత్ షా అన్నారు. కేవలం కంచె వేయడం మాత్రమే కాకుండా స్థానిక పరిపాలన, స్మార్ట్ సాంకేతికత, బీఎస్ఎఫ్లతో కూడిన సంపూర్ణ భూభాగ రక్షణ ద్వారా మాత్రమే పూర్తి సురక్షితమైన, అభేద్యమైన సరిహద్దు వ్యవస్థ సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.
మాదకద్రవ్యాలు, ఆయుధాల ముప్పును ఎదుర్కొనేలా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రి ఆదేశించారు. ఈ శిబిరాల్లో పట్వారీలు, స్థానిక పోలీసులు, బీఎస్ఎఫ్ సిబ్బంది తప్పనిసరిగా భాగస్వాములయ్యేలా చూసుకోవాలని ఆయన సూచించారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సంబంధించిన సీసీటీవీ మోడల్ను మొదటగా త్రిపురలో అమలు చేయాలని కేంద్ర హోం మంత్రి ఆదేశించారు. బీఎస్ఎఫ్కు చెందిన ప్రతి కెమేరాను అప్గ్రేడ్ చేసి జిల్లా పరిపాలనా యంత్రాంగంతో అనుసంధానించాలని తెలిపారు.
మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాను నిరోధించేందుకు తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. మాదకద్రవ్యాల సరఫరా ముఠాలో భాగస్వాములైన వారందరిపై కఠినమైన, ఎలాంటి కనికరం లేకుండా ఉక్కుపాదం మోపాలని ఆయన స్పష్టం చేశారు.
సరిహద్దు జిల్లాల్లో ఆర్థిక క్రమశిక్షణను నిర్ధారించడం రాష్ట్రాల బాధ్యత కూడా అని కేంద్ర హోం మంత్రి అన్నారు. ఈ విషయమై కలెక్టర్లు, జీఎస్టీ అధికారులకు శిక్షణ ఇవ్వాలని.. అలాగే నకిలీ నోట్లపై సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) ఒక సర్వే నిర్వహించాలని ఆయన ఆదేశించారు.
సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, పెద్ద ఎత్తున జరిగే భవన నిర్మాణాలు, ఆస్తుల కొనుగోలు, విక్రయాలపై తీవ్ర నిఘా ఉంచాలని శ్రీ అమిత్ షా కోరారు. గత ఐదేళ్ల భూ రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని ఆయన ఆదేశించారు.
అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి అత్యున్నత స్థాయి భద్రతను నిర్ధారించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గట్టిగా కట్టుబడి ఉందన్న విషయాన్ని ఈ సమావేశం తెలియజేసింది. సరిహద్దు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల మధ్య అత్యంత సన్నిహిత సమన్వయాన్ని పెంపొందించడంపై కూడా ఈ సమావేశం ప్రత్యేకంగా దృష్టి సారించింది.
***
(रिलीज़ आईडी: 2270178)
आगंतुक पटल : 26