పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
01 JUN 2026 6:02PM by PIB Hyderabad
పశ్చిమ ఆసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ అప్రమత్తంగా ఉంచేందుకు భారత ప్రభుత్వం తన ప్రయత్నాలను చురుగ్గా కొనసాగిస్తోంది. ఈ సందర్భంగా నేడు ఢిల్లీలోని జాతీయ మీడియా సెంటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ, ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఇంధన లభ్యత గురించి, కీలక రంగాలలో స్థిరత్వాన్ని కాపాడేందుకు తీసుకుంటున్న చర్యల గురించి తాజా వివరాలను వెల్లడించారు. రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక సేవల విభాగం అధికారులు కూడా ఈ సందర్భంగా మీడియాకు తాజా పరిణామాలను వివరించారు.
ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఈసీఎల్జీఎస్) 5.0
ఆర్థిక సేవల విభాగం తెలిపిన ప్రకారం, కేంద్ర మంత్రివర్గం అత్యవసర రుణ హామీ పథకం (ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ - ఈసీఎల్జీఎస్) 5.0కు ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో ఏర్పడిన స్వల్పకాలిక నగదు లభ్యత (లిక్విడిటీ) సమస్యలను అధిగమించేందుకు అర్హులైన రుణగ్రహీతలకు అదనపు రుణ సౌకర్యం కల్పిస్తారు. ఈ అదనపు రుణాలపై డిఫాల్ట్ జరిగితే, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 100 శాతం, ఎంఎస్ఎంఈయేతర సంస్థలు, విమానయాన రంగానికి 90 శాతం వరకు రుణ హామీ కవరేజీని నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ (ఎన్సీజీటీసీ) ద్వారా రుణ సంస్థలకు అందిస్తారు.
పథకం ముఖ్యాంశాలు:
• రుణగ్రహీతల అర్హత: 2026 మార్చి 31 నాటికి ప్రస్తుత వర్కింగ్ క్యాపిటల్ పరిమితులు కలిగిన ఎంఎస్ఎంఈలు, ఎంఎస్ఎంఈయేతర సంస్థలు, బకాయి రుణ సౌకర్యాలు ఉన్న షెడ్యూల్డ్ ప్రయాణికుల విమానయాన సంస్థలు ఈ పథకానికి అర్హులు. వీరి రుణ ఖాతాలు స్టాండర్డ్ ఖాతాలుగా ఉండాలి.
• హామీ కవరేజీ: ఎంఎస్ఎంఈలు100 శాతం, ఎంఎస్ఎంఈలకు చెందని సంస్థలు, విమానయాన రంగానికి 90 శాతం వరకు రుణ హామీ కవరేజీ ఉంటుంది.
• హామీ రుసుము: రుణ హామీ కోసం ఎలాంటి రుసుము వసూలు చేయరు.
*సహాయ పరిమితి: ఎంఎస్ఎంఈలు, ఇతర సంస్థలకు ఆర్థిక సంవత్సరం 2025-26 నాలుగో త్రైమాసికంలో ఉపయోగించుకున్న గరిష్ట వర్కింగ్ క్యాపిటల్లో 20% వరకు అదనపు రుణాన్ని అందిస్తారు (గరిష్ట పరిమితి రూ. 100 కోట్లు). విమానయాన సంస్థలకుకొన్ని నిర్దిష్ట షరతులకు లోబడి, 100% వరకు అదనపు రుణాన్ని (ఒక్కో రుణగ్రహీతకు గరిష్ట పరిమితి రూ. 1,500 కోట్లు) అందిస్తారు.
*రుణ కాలపరిమితి ఎంఎస్ఎంఈలు, ఇతర సంస్థలకు (విమానయాన రంగానికి మినహా) తొలి విడత రుణ పంపిణీ జరిగిన తేదీ నుంచి 5 సంవత్సరాలు. ఇందులో 1 సంవత్సరం మారటోరియం కూడా కలిసి ఉంటుంది.
విమానయాన రంగానికి తొలి విడత రుణ పంపిణీ జరిగిన తేదీ నుంచి 7 సంవత్సరాలు. ఇందులో 2 సంవత్సరాల మారటోరియం కలిసి ఉంటుంది.
*గ్యారెంటీ కవరేజీ కాలపరిమితి: ఈ పథకం కింద లభించే గ్యారెంటీ కవరేజీ గరిష్ట కాలపరిమితి సదరు రుణం కాలపరిమితితోనే ముగుస్తుంది. అంటే రుణ కాలపరిమితి ఎంతవరకు ఉంటే, గ్యారెంటీ కవరేజీ కూడా అంతవరకు వర్తిస్తుంది.
*పథకం వ్యవధి ఎన్సీజీసీటీ ద్వారా మార్గదర్శకాలు జారీ అయి తేదీ నుంచి న 31.03.2027 వరకు మంజూరయ్యే అన్ని రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.
ప్రభావం
పశ్చిమ ఆసియా ఘర్షణ వల్ల ఏర్పడిన సవాళ్లను ఎదుర్కొనేందుకు వ్యాపార సంస్థలకు తోడ్పాటు అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ పథకం ద్వారా సంస్థలు తమ కార్యకలాపాలను నిరంతరాయంగా కొనసాగించడానికి, ఉపాధిని కాపాడడానికి, అలాగే సరఫరా శ్రేణులను స్థిరంగా నిర్వహించడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు. ప్రతిపాదిత రుణ హామీ పథకం వ్యాపారాలకు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు, విమానయాన రంగానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా వారి అదనపు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు సకాలంలో తీర్చడంలో ఒక కీలకమైన అడుగు. సరియైన సమయంలో ఈ నగదు లభ్యతను కల్పించడం ద్వారా, ఈ పథకం వ్యాపారాలను నిలబెట్టడమే కాకుండా ఉద్యోగ నష్టాలను నివారిస్తుంది. అలాగే, ఇది దేశీయ ఉత్పత్తి అంతరాయం లేకుండా సాగడానికి, ఈ మొత్తం పారిశ్రామిక వ్యవస్థ సుస్థిరతకు తోడ్పడుతుంది.
నిత్యావసర వస్తువుల ధరలు, లభ్యత
వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖకు చెందిన వినియోగదారుల వ్యవహారాల విభాగం దేశవ్యాప్తంగా ఉన్న 578 కేంద్రాల నుంచి నుండి అందుతున్న సమాచారం ఆధారంగాప్రతిరోజూ 40 రకాల ఆహార వస్తువుల ధరలను నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఆ విభాగం వెల్లడించిన వివరాలు:
ప్రస్తుతం కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య, భారత ఆహార ధరల స్థిరత్వానికి దేశంలో నమోదైన రికార్డు స్థాయి ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంతగానో దోహదపడుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 3,766 లక్షల మెట్రిక్ టన్నులు)గా నమోదైంది. ఇది 2024-25 నాటి 3,577 ఎల్ఎమ్టీ ఉత్పత్తితో పోలిస్తే 5.2% పెరుగుదలను, అలాగే 2023-24 నాటి ఉత్పత్తి స్థాయిలతో పోలిస్తే దాదాపు 13% అధిక వృద్ధిని సూచిస్తోంది. తృణధాన్యాలు, పప్పుధాన్యాలు రెండింటిలోనూ కూడా అధిక దిగుబడి రావడం వల్ల నిత్యావసరాల లభ్యతపై ఉన్న ఆందోళనలు తొలగిపోయాయి, ఇది స్వల్పకాలిక ధరల స్థిరత్వానికి దారితీసింది.
2025-26లో మొత్తం పప్పుధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 274.09 ఎల్ఎమ్టీగా అంచనా. ఇది అంతకుముందు సంవత్సరం నమోదైన 257 ఎల్ఎమ్టీతో పోలిస్తే 6.7% పెరుగుదలను, 2023-24 నాటి 242 ఎల్ఎమ్టీతో పోలిస్తే దాదాపు 13% వృద్ధిని సూచిస్తోంది. 2024-25, 2025-26 సంవత్సరాల మధ్య అన్ని ప్రధాన పప్పుధాన్యాల ఉత్పత్తిలోనూ పెరుగుదల కనిపించింది. గత ఏడాది నమోదైన 111 ఎల్ఎమ్టీతో పోలిస్తే శనగల ఉత్పత్తి 12.6% గణనీయమైన వృద్ధితో 125.14 ఎల్ఎమ్టీకి చేరింది. పెసల ఉత్పత్తి 42.44 ఎల్ఎమ్టీ నుంచి దాదాపు 6% పెరిగి 44.92 ఎల్ఎమ్టీకి చేరుకుంది. కంది పప్పు ఉత్పత్తి గత ఏడాది ఉన్న 16.54 ఎల్ఎమ్టీ నుంచి సుమారు 7% వృద్ధి చెంది 17.62 ఎల్ఎమ్టీకి చేరింది, ఇది ప్రధాన పప్పుధాన్యాల పంటలన్నింటిలోనూ విస్తృతమైన వృద్ధిని ప్రతిబింబిస్తోంది.
పెరుగుతున్న దేశీయ ఉత్పత్తి కారణంగా పప్పుధాన్యాల దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. ఆర్థిక సంవత్సరం 2024-25లో 73 ఎల్ఎమ్టీగా ఉన్న పప్పుధాన్యాల దిగుమతులు, ఆర్థిక సంవత్సరం 2025-26 నాటికి 60 ఎల్ఎమ్టీకి తగ్గాయి. దీనివల్ల దిగుమతి ఖర్చు దాదాపు 30% మేర తగ్గింది. అంతకుముందు ఏడాది నమోదైన 15.06 ఎల్ఎమ్టీతో పోలిస్తే ఆర్థిక సంవత్సరం 2025-26లో శనగల దిగుమతులు సుమారు 51% తగ్గాయి. పప్పుధాన్యాల కోసం స్వేచ్ఛా దిగుమతి విధానం కొనసాగుతున్నప్పటికీ ఈ తగ్గుదల నమోదు కావడం విశేషం. దీన్ని బట్టి ఈ మార్పు ప్రధానంగా మెరుగైన దేశీయ లభ్యత వల్లే జరిగిందని స్పష్టమవుతోంది. అంతేకాకుండా, భారతదేశం పప్పుధాన్యాలను దిగుమతి చేసుకునే మయన్మార్, టాంజానియా, మలావి, మొజాంబిక్, కెనడా, ఆస్ట్రేలియా, బ్రెజిల్ వంటి దేశాలపై పశ్చిమ ఆసియా సంక్షోభ ప్రభావం పడకపోవడం కూడా ఇందుకు కలిసొచ్చిన అంశం.
రూపాయి విలువ క్షీణిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ విధమైన దిగుమతుల తగ్గుదల అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశీయంగా నిత్యావసరాల లభ్యత బలంగా ఉన్న నేపథ్యంలో, దిగుమతి పరిమాణం తగ్గడం వల్ల మొత్తం దిగుమతి ఖర్చుపై పడే ఒత్తిడిని తగ్గించడానికి ఇది ఎంతగానో సహాయపడింది.
మే 2026 నాటికి ప్రభుత్వం వద్ద పప్పుధాన్యాల నిల్వలు సుమారు 43 ఎల్ఎమ్టీ గా ఉన్నాయి. ఇది గత మూడు సంవత్సరాలలోనే అత్యధిక స్థాయి కాగా, మే 2024 (~21 ఎల్ఎమ్టీ), మే 2025 (~18 ఎల్ఎమ్టీ)లలో నమోదైన నిల్వల కంటే రెండింతలు పైగా ఎక్కువగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం ధరల మద్దతు పథకం కింద సేకరణ ప్రక్రియ విస్తృతంగా కొనసాగుతోంది; ఇప్పటివరకు 5.34 ఎల్ఎమ్టీలకు పైగా కందులు, 20.35 ఎల్ఎమ్టీల శనగలను సేకరించారు.
అధిక ఉత్పత్తి, తగ్గిన దిగుమతులు, బలమైన సేకరణ ప్రక్రియలు అన్నీ కలిసి పప్పుధాన్యాల లభ్యత పరంగా దేశం పటిష్టమైన స్థితిలో ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించడం, రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించడం పంటల సాగు విధానంలో దీర్ఘకాలిక స్థిరత్వాన్ని పెంపొందించడం వంటి ప్రభుత్వ విస్తృత వ్యూహాలకు అనుగుణంగానే ఈ ఫలితాలు కనిపిస్తున్నాయి.
బంగాళాదుంప, టొమాటో, ఉల్లిపాయ వంటి ప్రధాన ఉద్యానవన పంటల ఉత్పత్తి దేశీయ డిమాండ్ను తీర్చడానికి తగినంతగా ఉంది. గత ఏడాది 586 ఎల్ఎమ్టీ గా ఉన్న బంగాళాదుంప ఉత్పత్తి ఈసారి 584 ఎల్ఎమ్టీగా నమోదైంది; గత ఏడాది ~205 ఎల్ఎమ్టీగా ఉన్న టొమాటో ఉత్పత్తి ఈసారి ~227 ఎల్ఎమ్టీకి పెరిగింది. అలాగే గత ఏడాది 307 ఎల్ఎమ్టీగా ఉన్న ఉల్లిపాయ ఉత్పత్తి ఈసారి ~273 ఎల్ఎమ్టీగా నమోదైంది.
ప్రభుత్వం 2026-27 సంవత్సరానికి గాను ఉల్లిపాయల కోసం 2 ఎల్ఎమ్టీ ధర స్థిరీకరణ బఫర్ లక్ష్యాన్ని నిర్దేశించింది. మే 15 నుంచి ఈ సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది, ఇది మార్కెట్ ధరలకు మద్దతుగా నిలుస్తుందని, ధరలలో వచ్చే హెచ్చుతగ్గులను తగ్గించడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. మార్కెట్లకు ఉల్లిపాయల రాక పెరుగుతున్న తరుణంలో, సకాలంలో సేకరణను మరింత ప్రోత్సహించడానికి గాను మే 26, 2026 నుంచి అమలులోకి వచ్చేలా సేకరణ ధరను పెంచారు.
ఆహార వస్తువుల ధరలు స్థిరంగా ఉన్నాయి. తృణధాన్యాలు, పాలు, పప్పుధాన్యాలు, చక్కెర వంటి కీలకమైన ఆహార వస్తువుల ధరల ధోరణి నిలకడగా ఉంది. కూరగాయలలో బంగాళాదుంప, ఉల్లిపాయల ధరలు ఒక నిర్దిష్ట పరిధిలోనే కొనసాగుతున్నాయి, ఇది ఆహార ఉత్పత్తుల మొత్తం స్థిరత్వాన్ని కాపాడటానికి సహాయపడుతోంది. ప్రస్తుతం ఆహార వస్తువుల ధరలలో ఎలాంటి అసాధారణ హెచ్చుతగ్గులు లేవు.
జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్ ద్వారా అందిన వినియోగదారుల ఫిర్యాదుల డేటా ప్రకారం, ఏప్రిల్ నెల నుంచి న ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లకు సంబంధించిన ఫిర్యాదులలో గణనీయమైన తగ్గుదల కనిపించింది.
ప్రారంభంలో వచ్చిన ఫిర్యాదుల పెరుగుదల స్వల్పకాలం మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత నిబంధనల అమలు, వ్యవస్థాగత జోక్యాల ద్వారా క్రమంగా సర్దుకుంది.
మే 24 వరకు ఉన్న డేటా ప్రకారం బ్లాక్ మార్కెటింగ్, సేవలలో లోపాలు, సిలిండర్/హోమ్ డెలివరీ కోసం అదనపు వసూళ్లకు సంబంధించిన ఫిర్యాదులలో భారీ తగ్గుదల నమోదైంది.
ఆహార ధాన్యాల నిల్వ స్థితి - ఆహార భద్రత సంసిద్ధత
జాతీయ ఆహార భద్రతా చట్టం, ఇతర సంక్షేమ పథకాల కింద అవసరాలను తీర్చడానికి భారత ప్రభుత్వం తగినంత పరిమాణంలో ఆహార ధాన్యాల నిల్వలను నిర్వహిస్తోంది. మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, అంతర్జాతీయ వంటనూనెల మార్కెట్లలో జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోందని ఆహార, ప్రజా పంపిణీ విభాగం వెల్లడించింది.
మే 28, 2026 నాటికి సెంట్రల్ పూల్లో ఉన్న గోధుమల నిల్వలు 513 లక్ష మెట్రిక్ టన్నులుగా ఉన్నాయి. జూలై 1 నాటికి ఉండాల్సిన నిర్దేశిత బఫర్ పరిమాణం 275.80 ఎల్ఎమ్టీలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ప్రస్తుత రబీ మార్కెటింగ్ సీజన్లో గోధుమల సేకరణ ఇప్పటివరకు సుమారు 350 ఎల్ఎమ్టీలకు చేరుకుంది, ఈ సేకరణ ప్రక్రియ జూన్ 30, 2026 వరకు కొనసాగుతుంది.
జూలై 1 నాటికి ఉండాల్సిన నిర్దేశిత బఫర్ పరిమాణం 135.40 ఎల్ఎమ్టీలతో పోలిస్తే, సెంట్రల్ పూల్లో ఉన్న బియ్యం నిల్వలు 397 ఎల్ఎమ్టీలుగా ఉన్నాయి. దీనికి అదనంగా, సేకరించిన సుమారు 298 ఎల్ఎమ్టీల ధాన్యం ఇంకా మిల్లింగ్ కావాల్సి ఉంది, ఆ తర్వాత ఇవి కూడా బియ్యం నిల్వల్లో చేరుతాయి.
మొత్తంగా చూస్తే, ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న ఆహార ధాన్యాల నిల్వలు నిర్దేశిత బఫర్ పరిమాణం కంటే గణనీయంగా ఎక్కువగా ఉన్నాయి. ఇది ఆహార భద్రత అవసరాలకు, అవసరమైతే మార్కెట్ జోక్యానికి తగినంత లభ్యతను అందిస్తోంది.
నిరంతర దిగుమతులు, దేశీయ ఉత్పత్తి, ప్రస్తుత నిల్వల మద్దతుతో వంటనూనెల దేశీయ లభ్యత తగినంతగా ఉంది. ఇండోనేషియా, మలేషియా (పామాయిల్), రష్యా, ఉక్రెయిన్ (సన్ఫ్లవర్ ఆయిల్), అర్జెంటినా, బ్రెజిల్ (సోయాబీన్ ఆయిల్) వంటి ప్రధాన సరఫరా దేశాల నుంచి దిగుమతులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం సంబంధిత భాగస్వాములతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. సరఫరా, ధరల ధోరణులను కూడా పర్యవేక్షిస్తోంది.
దేశంలో చక్కెర లభ్యత దేశీయ వినియోగ అవసరాలను తీర్చడానికి తగినంతగా ఉంది. దేశీయ మార్కెట్లో నిరంతర లభ్యతను నిర్ధారించడానికి ప్రస్తుతం ఉన్న నిల్వలు,ఉత్పత్తి స్థాయిలు సరిపోతాయి.
ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (ఈబీపీ) కార్యక్రమం కింద బ్లెండింగ్ అవసరాలను తీర్చడానికి భారత్ తగినంత ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇథనాల్ ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు లభ్యత కూడా పుష్కలంగా ఉంది. ఈ కార్యక్రమం దిగుమతి చేసుకునే శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడంలో దోహదపడుతుంది. దేశీయంగా ఉత్పత్తి అయిన పునరుత్పాదక ఇంధన వినియోగానికి మద్దతు ఇస్తుంది.
ఎరువుల నిల్వల స్థితి, లభ్యత
భారత ఎరువుల భద్రత బలంగా, స్థిరంగా, మంచి నిర్వణతో ఉందనీ, అన్ని ప్రధాన ఎరువుల లభ్యత అవసరాలను మించి ఉందని ఎరువుల శాఖ పేర్కొంది. దేశంలో ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి సంతృప్తికరంగా ఉంది.
వ్యవసాయ, కుటుంబ సంక్షేమ శాఖ... రాష్ట్రాలతో సంప్రదించి, ఖరీఫ్-2026 కోసం ప్రధాన ఎరువుల అవసరాన్ని పునఃపరిశీలించింది. యూరియా అవసరాన్ని 194.02 నుంచి 190.32 మెట్రిక్ టన్నులకు, డీఏపీ అవసరాన్ని 59.17 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 56.23 లక్షల మెట్రిక్ టన్నులకు సవరించింది.
2026 ఖరీఫ్ సీజన్ కోసం మొత్తం 383.9 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని డీఏ-ఎఫ్డబ్ల్యూ అంచనా వేసింది. ఈ రోజు నాటికి అందుబాటులో ఉన్న నిల్వ సుమారు 199.86 లక్షల మెట్రిక్ టన్నులు (దాదాపు 52 శాతం)గా ఉంది. ఇది సాధారణ నిల్వ కంటే గణనీయంగా సుమారు 33 శాతం అధికం. ప్రభుత్వ మెరుగైన ప్రణాళిక, ముందస్తు నిల్వలు, సమర్థ రవాణా నిర్వహణను ఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి.
సంక్షోభం తర్వాత ఎరువుల దేశీయ ఉత్పత్తి మరియు దిగుమతి: (లక్షల టన్నులు)
|
Product
|
Domestic production after crisis
|
Import reached on Indian Ports after crisis
|
|
Urea
|
63.67
|
15.44
|
|
DAP
|
8.89
|
1.43
|
|
NPKs
|
20.29
|
6.30
|
|
SSP
|
11.96
|
0
|
|
MOP
|
0
|
4.45
|
|
Total
|
104.81
|
27.62
|
సంక్షోభ పరిస్థితి తర్వాత దిగుమతులు, దేశీయ ఉత్పత్తి ద్వారా సుమారుగా 132.43 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అదనంగా అందుబాటులోకి వచ్చాయి.
జూన్-జూలైలో భారత ఓడరేవులకు చేరుకోనున్న ఎస్వోహెచ్ ద్వారా సుమారు 25 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 15 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ, ఏఎస్ సహా 10 లక్షల మెట్రిక్ టన్నుల ఎన్పీకే ఎరువులను భారత్ ఇప్పటికే సమకూర్చుకుంది.
17 లక్షల టన్నుల యూరియా సేకరణ కోసం భారత్ మరో గ్లోబల్ టెండర్ను జారీ చేసింది. ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
సవాళ్లు ఉన్నప్పటికీ, దేశీయంగా భారత్ 2026 మే నాటికి సుమారు 25.17 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తిని సాధించింది. 2025 మే నాటికి సాధించిన ఉత్పత్తితో పోలిస్తే ఇది 2.80 లక్షల మెట్రిక్ టన్నులు అధికం.
2026 మే నాటికి భారత్ దేశీయంగా సుమారు 3.86 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ ఉత్పత్తిని సాధించింది. 2025 మే నాటికి సాధించిన ఉత్పత్తితో పోలిస్తే ఇది 2,000 మెట్రిక్ టన్నులు అధికం.
ఎరువుల ఉత్పత్తికి అవసరమైన యూరియా, ఫాస్ఫరస్-పొటాషియం ఎరువుల లభ్యతను ఎరువుల శాఖ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.
కంపెనీల ద్వారా అందిన అన్ని సబ్సిడీ బిల్లులను ఆర్థిక శాఖ వారానికోసారి క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. ఎరువుల సబ్సిడీ చెల్లింపు కోసం తగినంత బడ్జెట్ ప్రస్తుతం అందుబాటులో ఉంది.
ఎరువుల లభ్యత తగినంత ఉండేలా నిర్ధారించడానికి ఇప్పటివరకు ఈజీవోఎస్ 10 సమావేశాలు నిర్వహించింది. లభ్యతకు సంబంధించిన చాలా సవాళ్లనూ ఈజీవోఎస్ పరిష్కరించింది.
అన్ని ప్రధాన ఎరువుల విషయంలోనూ లభ్యత స్థిరంగా అవసరానికి మించి ఉన్న పరిస్థితిలో... భారత ఎరువుల భద్రత పటిష్ఠంగా, స్థిరంగా, సమర్థ నిర్వహణలో ఉంది.
ఇంధన సరఫరా, ఇంధన లభ్యత
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో... పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చూసేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వం వివరించింది. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ప్రస్తుత ఇంధన సరఫరా పరిస్థితిపై తాజా సమాచారాన్ని అందించింది. ఈ సందర్భంగా కింది విషయాలు తెలియజేసింది:
ప్రజలకు సూచనలు - అవగాహన
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీల లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నందున, పౌరులు వీటిని భయాందోళనతో కొనుగోలు చేయడం మానుకోవాలి.
వదంతుల పట్ల అప్రమత్తంగా ఉంటూ, సరైన సమాచారం కోసం అధికారిక వనరులపైనే ఆధారపడాలి.
ఎల్పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ ప్లాట్ఫారమ్లను ఉపయోగించుకోవాలనీ, పంపిణీదారుల వద్దకు వెళ్లడం మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పీఎన్జీ, విద్యుత్, ఇండక్షన్ కుక్టాప్ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించాల్సిందిగా పౌరులను ప్రోత్సహిస్తున్నారు.
పెద్దమొత్తంలో, పారిశ్రామికంగా డీజిల్ను వినియోగించేవారు అధీకృత కొనుగోలు వనరుల ద్వారానే కొనుగోలు చేయవలసిందిగా కోరడమైనది.
ప్రస్తుత పరిస్థితుల్లో, పౌరులంతా తమ రోజువారీ వినియోగంలో ఇంధనాన్ని పొదుపు చేయాలని కోరడమైనది.
ప్రభుత్వ సంసిద్ధత, సరఫరా నిర్వహణ చర్యలు
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో గృహావసరాల కోసం ఎల్పీజీ, పీఎన్జీ, సీఎన్జీ (రవాణా)లకు 100 శాతం సరఫరా జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
వాణిజ్య ఎల్పీజీ సరఫరాలో ఆసుపత్రులకు, విద్యా సంస్థలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఔషధ, ఉక్కు, ఆటోమొబైల్, విత్తన, వ్యవసాయ రంగాలకూ ప్రాధాన్యత కొనసాగిస్తున్నారు. 2026 మార్చి 2, 3 తేదీల్లో నమోదైన సగటు రోజువారీ సరఫరా ఆధారంగా వలస కార్మికులకు అందించే 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల సరఫరాను రెట్టింపు చేశారు.
సరఫరా, డిమాండ్ రెండు వైపులా ప్రభుత్వం ఇప్పటికే అనేక హేతుబద్ధీకరణ చర్యలను అమలు చేసింది. రిఫైనరీల ద్వారా ఉత్పత్తిని పెంచడం... పట్టణ ప్రాంతాల్లో బుకింగ్ విరామాన్ని 21 రోజుల నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకూ పెంచడం... సరఫరా విషయంలో నిర్దిష్ట రంగాలకు ప్రాధాన్యమివ్వడం వంటి చర్యలు వీటిలో ఉన్నాయి.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ ప్రయత్నాలు
నిత్యావసర వస్తువుల చట్టం-1955, ఎల్పీజీ నియంత్రణ ఉత్తర్వులు-2000 ప్రకారం సరఫరాను పర్యవేక్షించడం... అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది.
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ వంటి నిత్యావసర వస్తువుల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడంలో, నియంత్రించడంలో... రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంది. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు లేఖలు, వీడియో అనుసంధానాల ద్వారా పునరుద్ఘాటించింది.
తగినంత ఇంధన లభ్యత గురించి పౌరులకు భరోసా ఇచ్చేందుకు గానూ ప్రజలకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించాల్సిన అవసరాన్ని భారత ప్రభుత్వం పలు లేఖలు, వీడియో అనుసంధానాల ద్వారా స్పష్టం చేసింది.
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు జిల్లా వారీగా హెచ్ఎస్డీ/ఎంఎస్ కొనుగోలు సరళిని పర్యవేక్షించి, సమీక్షించాలనీ... పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు రిటైల్ అవుట్లెట్ల ద్వారా హెచ్ఎస్డీని అనధికారికంగా కొనుగోలు చేయడాన్ని నివారించడం కోసం సమస్యాత్మక ప్రాంతాల్లో, ప్రధాన రవాణా-పారిశ్రామిక కారిడార్ల వెంబడి తనిఖీలను, ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాలను ముమ్మరం చేయాలనీ... చట్టాలను ఉల్లంఘించిన వారిపై తక్షణం శిక్షా చర్యలు ప్రారంభించేలా రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని భారత ప్రభుత్వం 26.05.2026 తేదీ నాటి లేఖ ద్వారా కోరింది.
ఎన్ఫోర్స్మెంట్, పర్యవేక్షణ చర్యలు
ఎల్పీజీ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్లను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా తనిఖీ చర్యలు కొనసాగుతున్నాయి.
ఎల్పీజీ సంబంధిత చర్యలు – గత 3 రోజుల్లో దేశవ్యాప్తంగా 10 ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా, ముగ్గురిని అరెస్టు చేశారు.
పెట్రోల్, డీజిల్ సంబంధిత చర్యలు – గత 3 రోజుల్లో దేశవ్యాప్తంగా సుమారు 1300 సోదాలు నిర్వహించగా... వాటిలో 960 లీటర్ల పెట్రోల్, 2194 లీటర్ల డీజిల్ను స్వాధీనం చేసుకున్నారు. 18 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, ఏడుగురిని అరెస్టు చేశారు.
అదేసమయంలో, పీఎస్యూ ఓఎంసీల అధికారులు చేపట్టే ఆకస్మిక తనిఖీలూ కొనసాగుతున్నాయి.
ఎల్పీజీ పంపిణీ కేంద్రాలు - గత 3 రోజుల్లో 460కి పైగా ఎల్పీజీ పంపిణీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. 42 ఎల్పీజీ పంపిణీ కేంద్రాలకు జరిమానాలూ విధించారు.
రిటైల్ అవుట్లెట్లు – గత 3 రోజుల్లో, సుమారు 1850 రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు నిర్వహించారు. 19 రిటైల్ అవుట్లెట్లకు జరిమానాలు విధించగా, 446 రిటైల్ అవుట్లెట్లను సస్పెన్షన్లో ఉంచారు.
ఎల్పీజీ సరఫరా
గృహావసరాల కోసం ఎల్పీజీ సరఫరా స్థితి...
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్పీజీ సరఫరాపై ప్రభావం కొనసాగుతోంది.
గృహ వినియోగదారులకు ఎల్పీజీ సరఫరా కోసం అత్యంత ప్రాధాన్యం కొనసాగుతోంది.
ఎల్పీజీ పంపిణీదారుల వద్ద ఎక్కడా నిల్వల కొరత ఉన్నట్లు నివేదికలు అందలేదు.
నిన్న పరిశ్రమవ్యాప్తంగా ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు సుమారు 99 శాతానికి పెరిగాయి.
సిలిండర్ల దారి మళ్లింపును అరికట్టడానికి డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత పంపిణీ విధానాన్ని సుమారు 95 శాతానికి పెంచారు. నమోదు చేసుకున్న ఫోన్ నంబర్కు డీఏసీ వస్తోంది.
గత 3 రోజుల్లో, సుమారు 1.21 కోట్ల ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్లకు గానూ, దాదాపు 1.22 కోట్ల ఎల్పీజీ సిలిండర్లు పంపిణీ చేశారు.
వాణిజ్య ఎల్పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు:
మొత్తం వాణిజ్య ఎల్పీజీ కేటాయింపులు సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలో సుమారు 70 శాతానికి పెరిగాయి. ఇందులో సంస్కరణలతో ముడిపడి ఉన్న 10 శాతం కేటాయింపులూ ఉన్నాయి.
గత 3 రోజుల్లో, 1.8 లక్షలకు పైగా 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి.
2026 ఏప్రిల్ 3 నుంచి, ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు 17150 కంటే ఎక్కువ అవగాహన శిబిరాలు నిర్వహించాయి. ఈ శిబిరాల ద్వారా 2.72 లక్షలకు పైగా 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి.
నిన్న, సుమారు 179 శిబిరాల ద్వారా 2527 - 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వాణిజ్య ఎల్పీజీ పంపిణీని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ సంస్థల కార్యనిర్వహక డైరెక్టర్లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ... రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల విభాగాలతో సమన్వయం చేసుకుంటోంది.
2026 ఏప్రిల్ నెలలో... మొత్తం 2,09,353 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్పీజీని విక్రయించారు.
గత 3 రోజుల్లో మొత్తం 22,641 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్పీజీని విక్రయించారు.
2026 మే నెలలో, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు సుమారు 8382 మెట్రిక్ టన్నుల ఆటో ఎల్పీజీని విక్రయించాయి. 2026 ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఇది సుమారు 170 శాతం అధికం.
సహజవాయువు సరఫరా – పీఎన్జీ విస్తరణ చర్యలు
· డీ-పీఎన్జీ, సీఎన్జీ రవాణాకు 100 శాతం సరఫరాతో వినియోగదారులకు ప్రాధాన్యం.
· ప్రస్తుతం పనిచేస్తున్న యూరియా ప్లాంట్లకు గత 6 నెలల సగటు వినియోగంలో దాదాపు 98 శాతం సరఫరా అవుతోంది.
· సీజీడీ నెట్వర్క్ ద్వారా సరఫరా సహా ఇతర పారిశ్రామిక-వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరా 80 శాతం దాకా పెరిగింది.
· వాణిజ్య ఎల్పీజీ లభ్యతపై సమస్యల పరిష్కారం దిశగా సీజీడీ సంస్థలు తమ జీఏలన్నిటి పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వడంపై ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వం సూచించింది.
· సీజీడీ నెట్వర్క్ విస్తరణకు అవసరమైన ఆమోద ప్రక్రియను వేగిరపరచాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు సహా కేంద్ర మంత్రిత్వ శాఖలను కోరింది.
· ఎల్పీజీ నుంచి పీఎన్జీకి దీర్ఘకాలిక మార్పిడి దిశగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు దోహదం చేస్తే, వాటికి 10 శాతం అదనపు వాణిజ్య ఎల్పీజీ కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం 18.03.2026 నాటి లేఖ ద్వారా ప్రతిపాదించింది.
· దేశవ్యాప్తంగా సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్లైన్లు, ఇతర సౌకర్యాల కల్పన, నిర్మాణం-నిర్వహణ-విస్తరణ ద్వారా) కోసం పైప్లైన్లు వేయడంతోపాటు, విస్తరణ దిశగా క్రమబద్ధ, వ్యవధి నిర్దేశిత చట్రాన్ని సూచిస్తూ నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద కేంద్ర ప్రభుత్వం 24.03.2026న గెజిట్ ఉత్తర్వు ద్వారా ప్రకటన చేసింది. ఈ పనులకు అనుమతులు, భూ సేకరణలో జాప్యాలను పరిష్కరించి, నివాస ప్రాంతాలు సహా సహజ వాయువు మౌలిక సదుపాయాల సత్వర అభివృద్ధికి ఇది వీలు కల్పిస్తుంది. అలాగే పీఎన్జీ నెట్వర్క్ వృద్ధి వేగవంతమై, చివరి అంచెదాకా సంధానాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా కాలుష్య రహిత ఇంధనం వైపు మార్పిడికి మద్దతిస్తూ ఇంధన భద్రతను బలోపేతం చేసి, భారత గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తుందని అంచనా.
· డీ-పీఎన్జీ కనెక్షన్లను వేగిరపరచాలని సీజీడీ సంస్థలను పీఎన్జీఆర్బీ ఆదేశించింది. అలాగే, పీఎన్జీ విస్తరణలో వేగం కొనసాగేలా జాతీయ పీఎన్జీ కార్యక్రమం 2.0ను 30.06.2026 వరకు పొడిగించింది.
· పరిశుభ్ర, సురక్షిత, స్వయం సమృద్ధ ఇంధన భవిష్యత్తును ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదా ‘సీబీజీ’ విధానాన్ని రూపొందించింది. దీనికింద రాష్ట్రాలు తమ సొంత, పెట్టుబడిదారు హిత, అమలు అనుగుణం వ్యవస్థను సృష్టించుకోవచ్చు. ఆ మేరకు ఒక సమగ్ర, సరళ, మార్గదర్శక చట్రంగా ఇది ఉపయోగపడుతుంది. ఇందుకు సుముఖంగా గల రాష్ట్రాలకు వాణిజ్య ఎల్పీజీ అదనపు కేటాయింపుల తదుపరి విడతలో ప్రాధాన్యం లభిస్తుంది.
· ఈ ఏడాది మార్చి నుంచి సుమారు 8.56 లక్షల పీఎన్జీ కనెక్షన్లు గ్యాసిఫై చేశారు. దీనికి అదనంగా 2.96 లక్షల కనెక్షన్ల కోసం మౌలిక సదుపాయాలు కల్పించారు. దీంతో మొత్తం కనెక్షన్ల సంఖ్య 11.52 లక్షలకు చేరింది. మరో 8.78 లక్షల మంది వినియోగదారులు కొత్త కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్నారు.
· ఈ ఏడాది మే 31 నాటికి 77,800 మందికిపైగా పీఎన్జీ వినియోగదారులు ‘MYPNGD.in’ వెబ్సైట్ ద్వారా ఎల్పీజీ కనెక్షన్లను వదులుకున్నారు.
ముడిచమురు నిల్వలు... శుద్ధి కర్మాగారాల కార్యకలాపాలు
· దేశంలో తగినంత ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉండటంతో శుద్ధి కర్మాగారాలన్నీ అదనపు సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. దీంతోపాటు పెట్రోల్, డీజిల్ నిల్వల నిర్వహణ సంతృప్తికరంగా ఉంది.
· దేశీయ వినియోగానికి కొరత రాకుండా శుద్ధి కర్మాగారాల్లో వంటగ్యాస్ ఉత్పత్తిని పెంచారు.
· దేశీయ మార్కెట్కు పెట్రోరసాయన ముడిసరకు సరఫరా లభ్యతకు భరోసా దిశగా అంతర-మంత్రిత్వ సంయుక్త కార్యవర్గం ఏర్పాటైంది. అనంతరం, 01.04.2026 నాటి ఒక ఉత్తర్వు ద్వారా పెట్రోరసాయన పరిశ్రమలు సహా చమురుశుద్ధి కర్మాగారాలను, సెంటర్ ఫర్ హై టెక్నాలజీ నిర్దేశిత కీలక రంగాలకు నిర్దిష్ట కనీస పరిమాణంలో సి3, సి4 స్ట్రీమ్లను అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.
· ఔషధ విభాగం, రసాయనాలు, పెట్రో రసాయనాల విభాగం పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగాల నుంచి అందిన అభ్యర్థనల ఆధారంగా ఫార్మా, రసాయన, పెయింట్ రంగ సంస్థల కోసం ఎల్పీజీ నిల్వల నుంచి రోజుకు 1,120 ఎంటీల మేర సి3-సి4 మాలిక్యూల్స్ కేటాయింపు వెసులుబాటు కల్పించారు.
· ఈ ఏడాది మే నెలలో ముంబయి, కొచ్చి, విశాఖపట్నం, చెన్నై, మధుర, గుజరాత్ చమురుశుద్ధి కర్మాగారాలు రసాయన, ఔషధ, పెయింట్ పరిశ్రమలకు సుమారు 14,500 టన్నుల (ప్రొపిలీన్, బ్యూటిలీన్ సహిత) సి3-సి4 మాలిక్యూల్స్ను, సుమారు 6,100 టన్నుల బ్యూటైల్ అక్రిలేట్ను విక్రయించాయి.
చిల్లర ఇంధన లభ్యత... ధరల నిర్ధారణ చర్యలు
· దేశవ్యాప్తంగా అన్ని చిల్లర విక్రయ కేంద్రాలు యథావిధిగా పనిచేస్తున్నాయి.
· మధ్యప్రాచ్య సంక్షోభం వల్ల ముడిచమురు ధర అసాధారణంగా పెరిగింది. దీంతో వినియోగదారులను ఆదుకోవడానికి, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గించడం ద్వారా భారాన్ని పాక్షికంగా భరించాలని నిర్ణయించింది.
· కేంద్ర ప్రభుత్వం 31.05.2026 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా పెట్రోల్పై ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ.3 నుంచి రూ.1.50కు, డీజిల్పై లీటరుకు రూ.16.50 నుంచి రూ.13.50కి, ఏటీఎఫ్పై లీటరుకు రూ.16 నుంచి రూ.9.50కి తగ్గించింది.
· కొన్ని ప్రాంతాల్లోని చిల్లర విక్రయ కేంద్రాల వద్ద అసాధారణంగా అధిక అమ్మకాలు, భారీ రద్దీ కనిపిస్తున్నప్పటికీ, దేశంలోని అన్ని పెట్రోల్ పంపులలో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.
· ఈ ఏడాది మే 26వ తేదీన అనేక జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు 30 శాతానికి పైగా పెరిగాయి.
· ప్రైవేట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల అమ్మకాలు (-38శాతం), ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల బల్క్ అమ్మకాలు (-29శాతం) తగ్గాయి. ఈ అమ్మకాల పరిమాణం ప్రభుత్వ రంగ సంస్థల చిల్లర విక్రయ కేంద్రాలకు మళ్లించారు.
· ఈసీ చట్టంలోని సంబంధిత నిబంధనలు, వాటి కింద జారీచేసిన నియంత్రణ ఉత్తర్వుల ప్రకారం చిల్లర వినియోగదారులకు ఉద్దేశించిన సరఫరాలను బల్క్ వినియోగదారులు, నిల్వదారులు దుర్వినియోగం చేయడంపైనా, నల్లబజారు సహా అనధికారిక నిల్వ, పెట్రోలియం ఉత్పత్తుల దారి మళ్లింపు వంటి వాటిని అరికట్టేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు ద్వారా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.
· పారిశ్రామిక సంఘాల్లోని సభ్య సంస్థలు అధీకృత సేకరణ మార్గాల ద్వారా డీజిల్ కొనుగోలు చేసేలా సూచనలు జారీచేయాలని కోరింది.
సముద్ర భద్రత, నౌకా రవాణా కార్యకలాపాలు
పర్షియన్ జలసంధిలో సముద్ర పరిస్థితిపై ఓడరేవులు-నౌకా రవాణా-జలమార్గాల మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ఇచ్చింది. ఈ ప్రాంతంలో భారత నౌకలు, సిబ్బంది భద్రత, రక్షణ దిశగా తీసుకుంటున్న చర్యలను వివరించింది. ఆ సమాచారం మేరకు..
· పశ్చిమాసియాలో సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ నౌకా రవాణా సేవలు స్థిరంగా, నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. హోర్ముజ్ జలసంధికి తూర్పు నుంచి, ఎర్ర సముద్రం మీదుగా నిర్వహించే సర్వీసుల సంఖ్య ఫిబ్రవరిలో 127 నుంచి ఏప్రిల్లో గరిష్ఠంగా 257కు పెరిగింది. అలాగే, మే నెలలో 245 సర్వీసులు నమోదు కావడం సముద్ర వాణిజ్య పునరుత్థాన సామర్థ్యాన్ని, నౌకా రవాణా భాగస్వాముల విశ్వాసం నిలకడగా కొనసాగడాన్ని స్పష్టం చేస్తోంది.
· నావికుల సంక్షేమం, నిరంతరాయ సముద్ర కార్యకలాపాలకు భరోసా ఇస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయాలు, సముద్ర రంగ భాగస్వాములతో సమన్వయం కొనసాగుతోంది.
· ఆ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గడచిన 72 గంటల్లో భారతీయ పతాకంగల నౌకలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని మంత్రిత్వశాఖ తెలిపింది.
· డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ 24 గంటలూ పనిచేస్తూనే ఉండగా, ప్రారంభం నుంచి ఇప్పటిదాకా 11,186 కాల్స్, 24,830కి పైగా ఈమెయిళ్లను స్వీకరించి పరిష్కరించింది. గత 72 గంటల్లో సముద్రయాన సిబ్బంది, వారి కుటుంబాలు, భాగస్వాముల నుంచి 345 కాల్స్, 732 ఈమెయిళ్లు అందాయి.
· డీజీ షిప్పింగ్ ద్వారా గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుంచి గత 72 గంటల్లో 24 మంది సహా ఇప్పటిదాకా 3,446 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో మంత్రిత్వ శాఖ సహాయపడింది.
· దేశవ్యాప్తంగా ఓడరేవుల కార్యకలాపాలు సర్వసాధారణ స్థితిలో కొనసాగుతుండగా, ఎటువంటి రద్దీ నమోదు కాలేదు.
***