ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
‘‘ఊపిరితిత్తుల ఆరోగ్య పరీక్షలపై మంత్రుల స్థాయి దృష్టి కోణాలు’’ అనే అంశంపై జెనీవాలో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 79వ సమావేశం.. పాల్గొన్న కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ జె.పి. నడ్డా
నాడు పోస్టు చేయడమైనది:
21 MAY 2026 9:18AM by PIB Hyderabad
వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 79వ సమావేశాన్ని జెనీవాలో నిర్వహించారు. దీనిలో భాగంగా ‘‘ఊపిరితిత్తుల పరీక్షలపై మంత్రుల స్థాయి దృష్టికోణాలు’’పై ఏర్పాటు చేసిన ఒక ఉన్నత స్థాయి కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా ప్రసంగించారు. ‘‘మీ ఆరోగ్య వ్యవస్థ ఊపిరితిత్తుల పరీక్షలో సవాళ్లను ఎదుర్కొంటోందా?’’ శీర్షికన నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ‘స్టాప్ టీబీ పార్ట్నర్షిప్’ ఏర్పాటు చేయగా భారత్, జపాన్, ఫిలిప్పీన్స్, జాంబియాలు సహ నిర్వాహకుల పాత్రను పోషించాయి.
కార్యక్రమానికి ఆహ్వానించిన వారిని ఉద్దేశించి శ్రీ నడ్డా ప్రసంగిస్తూ.. సకాలంలో పరీక్ష చేయించుకోవడం, తొలి దశలోనే రోగనిర్ధారణ, అందరికీ ఆరోగ్యసంరక్షణ సేవల లభ్యత.. ఇవి సుదృఢ, ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యాన్ని ఇచ్చే ఆరోగ్య వ్యవస్థలకు కీలకమన్నారు. ఊపిరితిత్తుల ఆరోగ్యపరీక్షల్ని బలోపేతం చేయడం ఒక్క సాంకేతికత, రోగినిర్ధారణ పరికరాలకే పరిమితమైన విషయం కాదనీ, అది.. ప్రాణాలను కాపాడే, బాధను తగ్గించే, ఆరోగ్యరక్షణలో భారీ ఖర్చుల్ని నివారించే, ఉపాధిని రక్షించే, ఆరోగ్యసంరక్షణ వ్యవస్థల్ని పటిష్ఠపరచడంతో ముడిపడి ఉంటుందని ఆయన వివరించారు.
క్షయను నిర్మూలించే అంశంలో భారత్ నిబద్ధతతో ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి స్పష్టం చేశారు. ‘‘జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం, ‘‘టీబీ-ముక్త్ భారత్’’ దార్శనికతలలో భాగంగా ప్రపంచంలో అత్యంత భారీ స్థాయి పరీక్షల నిర్వహణ ప్రక్రియనీ, వ్యాధిని ప్రాధమిక దశలోనే గుర్తించే ప్రయత్నాల్ని భారత్ చేపట్టిందని ఆయన తెలిపారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే ఉద్యమం, సంచార పరీక్షల బృందాల్ని రంగంలోకి దింపడం, సాముదాయిక ప్రచార కార్యక్రమాల్ని నిర్వహించడంతో పాటు, వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలూ, వర్గాల నడుమ లక్షిత కార్యక్రమాల్ని చేపట్టి యాక్టివ్ కేసుల్ని గుర్తించే ప్రక్రియను కూడా భారత్ అనుసరిస్తోందని శ్రీ నడ్డా చెప్పారు.
క్షయవ్యాధినీ, ఊపిరితిత్తులకు సోకే ఇతర వ్యాధుల్నీ గుర్తించడానికి భారత్ ఆధునిక రోగనిర్ధారణ వ్యవస్థలను గణనీయంగా విస్తరించిందని శ్రీ నడ్డా వెల్లడించారు. మాలిక్యూలార్ టెస్టింగ్ ప్లాట్ఫారాలూ, డిజిటల్ ఛాతీ ఎక్స్-రే సేవలూ, కృత్రిమ మేధ (ఏఐ) సహాయంతో పని చేసే పరికరాలూ, చేతిలో పట్టుకోదగ్గ పరికరాలూ, పలు చోట్ల నెలకొల్పిన పరీక్షా వ్యవస్థలను వినియోగించుకుంటున్నట్లు ఆయన వివరించారు. నూతన ఆవిష్కరణలు అందరికీ సమానంగా ఉపయోగపడాలనీ, సాంకేతికత సమాజంలో చివరి వ్యక్తి చెంతకు కూడా చేరుకోవాలనీ ఆయన స్పష్టం చేశారు.
ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో భాగంగా ప్రాథమిక ఆరోగ్యసంరక్షణ సంబంధిత సంస్కరణలతో పాటు ముందు వరుసలో నిలిచి పనిచేసే సిబ్బంది కీలక పాత్రను పోషించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి చెప్పారు. ఇది జరిగితేనే ఆరోగ్య సేవలు ప్రజలకు అందుతాయని ఆయన అన్నారు. రోగనిర్ధారణ చేసినంత మాత్రాననే సరిపోదనీ, పోషకాహార సంబంధిత సహకారం, చికిత్స నియమాల పాలనపరమైన సహాయాన్ని కూడా అందజేయడం, సామాజిక భద్రత, తోటివారి మద్దతు లభించడం.. ఇవన్నీ ముఖ్యేనని ఆయన పునరుద్ఘాటించారు. ‘‘ టీబీ ముక్త్ భారత్ అభియాన్ ద్వారా క్షయవ్యాధిగ్రస్తులకూ, వారి కుటుంబాలకూ సాయపడటానికి పౌరులు, సంస్థలు, కార్పొరేట్లు, సముదాయాలను భారత్ ఏకతాటి మీదకు తెచ్చింది’’ అని ఆయన తెలిపారు.
భారత్ అమలుచేస్తున్న డిజిటల్ కార్యక్రమాల్ని శ్రీ నడ్డా ప్రస్తావిస్తూ, ఏఐ-ఆధారిత బహుభాషా చాట్బాట్ ‘ఖుషీ’ ఒక భాగంగా ఉన్న ‘టీబీ ముక్త్ భారత్ యాప్’ను తీసుకువచ్చామన్నారు. దీనిని ఆరంభ స్థాయి స్మార్ట్ఫోన్లలోనూ తేలికగా ఉపయోగించవచ్చన్నారు. ఈ డిజిటల్ ప్లాట్ఫారమ్ వ్యాధి లక్షణాలు, హక్కులు, అతి సమీపంలో ఉన్న రోగనిర్ధారణ కేంద్రాల సమాచారాన్ని వాస్తవ కాల (రియల్-టైం) ప్రాతిపదికన అందిస్తుందనీ, వ్యాధి లక్షణాలు మొదలైన తరువాత చికిత్సను ఆరంభించడానికి మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఇది తోడ్పడుతుందనీ ఆయన అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా బలమైన సహకారం అవసరమంటూ శ్రీ నడ్డా పిలుపునిచ్చారు. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి కొన్ని కీలక అంతర్జాతీయ ప్రాధాన్యాల్ని ఆయన ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనల్లో.. అందరికీ ఆరోగ్య సేవల విస్తరణ ప్రణాళికల్లో ‘ఊపిరితిత్తుల స్వస్థత’ అంశాన్ని కూడా చేర్చడం, తక్కువ ఖర్చులో రోగనిర్ధారణ సేవలు, డిజిటల్ పరికరాలు, పరీక్షాసంబంధిత సాంకేతికతల పరిధిని విస్తరించడం, శ్వాసకోశ స్వస్థతను దృష్టిలో పెట్టుకొని ప్రాథమిక ఆరోగ్యసంరక్షణ వ్యవస్థల్ని పటిష్ఠపరచడం, నూతన ఆవిష్కరణల్నీ, దేశీయ తయారీ విధానాల్నీ, సాంకేతికత బదలాయింపునీ ప్రోత్సహించడం, టీబీతో పాటు శ్వాసకోశానికి వచ్చే ఇతర వ్యాధులను కూడా ప్రారంభ దశలోనే గుర్తించడానికీ, ఆ వ్యాధుల్ని నివారించడానికీ నిరంతర ఆర్థిక సహాయాన్ని అందించడానికి ముందుకు రావడం వంటివి భాగంగా ఉన్నాయి.
ప్రపంచ నిర్దేశిత లక్ష్యాల కన్నా ముందగానే క్షయవ్యాధిని సమాప్తం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి పునరుద్ఘాటించారు. దృఢతర ఆరోగ్య వ్యవస్థలు, మెరుగైన రోగనిర్ధారణ ప్రక్రియలు, స్వచ్ఛ పరిసరాలు, పోషణకు సంబంధించిన చైతన్యాన్ని పెంపొందింప చేయడం, అందరికీ సమాన ఆరోగ్య సంరక్షణానుకూల అవకాశాల కల్పన వంటి ప్రణాళికలను అమలుపరిస్తే టీబీకి వ్యతిరేకంగా జరిపే పోరాటం సానుకూల ఫలితాలను ఇస్తుందని ఆయన తెలిపారు. వ్యాధి ముదిరిపోయాక గాని రోగనిర్ధారణని పూర్తి చేయని స్థితి నుంచి వ్యాధిని ప్రారంభిక దశలోనే గుర్తించే పద్ధతులకు మారాలనీ, అరకొర పద్ధతిలో అమలు చేస్తున్న కార్యక్రమాలకు బదులు ఏకీకృత సంరక్షణ వ్యవస్థ ఏర్పాటు దిశగా పురోగమించాలనీ, రోగ నియంత్రణ వైఖరిని వీడి ఆరోగ్య పరిరక్షక వ్యవస్థను నిర్మించడానికి మొగ్గు చూపాలనీ ప్రపంచ దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా ఊపిరితిత్తుల సంబంధిత ఆరోగ్య పరీక్షలకు ఆచరణీయ, విస్తృత స్థాయి పరిష్కారాల్ని కనుగొనడంలో ప్రభుత్వాలు, నూతన ఆవిష్కర్తలు, అభివృద్ధి ప్రక్రియలో పాలుపంచుకొనే వర్గాలు, సముదాయాలతో కలిసి ముందుకు సాగడానికి భారత్ సిద్ధంగా ఉందని పునరుద్ఘాటిస్తూ శ్రీ నడ్డా ప్రసంగాన్ని ముగించారు.
***
(రిలీజ్ ఐడి: 2264157)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12