ఆర్థిక మంత్రిత్వ శాఖ
దేవాలయాల బంగారం నిల్వలను నగదుగా మార్చడంపై అసత్య ప్రచారం.. కేంద్రం వివరణ
నాడు పోస్టు చేయడమైనది:
19 MAY 2026 9:37AM by PIB Hyderabad
దేశంలోని దేవాలయాలకు చెందిన బంగారం నిల్వలకు బదులుగా కేంద్ర ప్రభుత్వం ఆలయాలకు బంగారు బాండ్లను జారీ చేయనుందని.. అలాగే ఆలయాల్లోని బంగారు నిల్వలను నగదుగా మార్చే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపిందని కొన్ని మీడియా నివేదికలు, సోషల్ మీడియాలో పోస్టులు ప్రచారంలో ఉన్నాయి. వీటిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
దేశవ్యాప్తంగా ఉన్న ఆలయ ట్రస్టులు లేదా మరేదైనా మతపరమైన సంస్థల వద్ద ఉన్న బంగారాన్ని నగదుగా మార్చే పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టాలని యోచిస్తోందంటూ వస్తున్న ఊహాగానాలు, వదంతులు పూర్తిగా అవాస్తవమని, తప్పుదోవ పట్టించేవని, వాటికి ఎలాంటి ఆధారాలు లేవని కేంద్రం స్పష్టం చేసింది.
ఆలయ గోపురాలు, తలుపులు, ఇతర నిర్మాణాలపై ఉండే బంగారు పూతను ‘‘భారత వ్యూహాత్మక బంగారు నిల్వ’’గా పరిగణిస్తారంటూ జరుగుతున్న ప్రచారంలోనూ ఎలాంటి నిజం లేదని, అవి పూర్తిగా నిరాధారమైనవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇలాంటి పుకార్లను నమ్మవద్దని, వాటిని ఇతరులకు షేర్ చేయవద్దని ప్రభుత్వం పౌరులను కోరింది. ధ్రువీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయడం వల్ల ప్రజల్లో అనవసరమైన గందరగోళం ఏర్పడుతుందని పేర్కొంది.
విధానపరమైన నిర్ణయాలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని అధికారిక పత్రికా ప్రకటనలు, ప్రభుత్వ వెబ్సైట్లు, ధ్రువీకరించిన ప్రజా సమాచార వేదికల ద్వారానే పంచుకుంటామని, పౌరులందరూ కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వాసంలోకి తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
***
(రిలీజ్ ఐడి: 2262738)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13