దేశంలోని పలు ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న వడగాలుల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) ఆధ్వర్యంలోని ఆయుష్ విభాగం.. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రస్తుత వేసవి కాలానికి గానూ సమగ్రమైన ప్రజారోగ్య సలహాలను జారీ చేసింది.
ఇందులో వడదెబ్బ, ఎండ తీవ్రత నుంచి తగిన రక్షణ పొందేందుకు వీలుగా సాధారణ ప్రజలు, వృద్ధులు, గర్భిణులు, ఉద్యోగులు, కార్మికులు...అలాగే బహిరంగ సభలు, క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనే వారి కోసం వివరణాత్మక మార్గదర్శకాలను అందించింది. శరీరానికి సరిపడా నీరు తాగడం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్న సమయాల్లో నేరుగా ఎండ తగలకుండా చూసుకోవడం, లేత రంగు కాటన్ దుస్తులను ధరించడం, ఆయా కాలాల్లో లభించే పండ్లు, ఎలక్ట్రోలైట్లు ఎక్కువగా ఉండే ద్రవ పదార్థాలను తీసుకోవడం వంటి అంశాల గురించి వివరించింది.
వడగాలుల సమయంలో శిశువులు, చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, ఎండలో పనిచేసే కార్మికులు, గుండె జబ్బులు, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు చాలా త్వరగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని.. వీరి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు నిరంతరం పర్యవేక్షణ అవసరమని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.
పని ప్రదేశాలు, బహిరంగ సభల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలను సూచించింది. వీటిలో విశ్రాంతి తీసుకోవడానికి నీడ కలిగిన ప్రాంతాలను ఏర్పాటు చేయడం, క్రమం తప్పకుండా నీరు తాగేందుకు విరామం తీసుకోవడం, వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేలా కార్మికులకు తగిన వసతులు కల్పించడం, వడదెబ్బ లక్షణాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
తీవ్రమైన ఎండల కారణంగా వచ్చే అనారోగ్యాల పట్ల, వాటి ప్రమాద సంకేతాల పట్ల ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య సూచనల్లో తెలిపింది. కళ్ళు తిరగడం, తలనొప్పి, వాంతులు, కంగారు లేదా స్పృహ తప్పడం, శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరగడం, డీహైడ్రేషన్, ఫిట్స్ రావడం వంటి వాటిని తీవ్ర లక్షణాలుగా గుర్తించాలని పేర్కొంది. ముఖ్యంగా వడదెబ్బను తక్షణ వైద్య సహాయం అవసరమయ్యే వైద్య అత్యవసర పరిస్థితిగా గుర్తించింది. పరిస్థితి విషమంగా ఉంటే వెంటనే 108 లేదా 102 అత్యవసర హెల్ప్లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపింది.
డీజీహెచ్ఎస్ పరిధిలోని ఆయుష్ విభాగం విడుదల చేసిన అదనపు సూచనల్లో తీవ్రమైన ఎండల నుంచి రక్షణ కోసం ఆయుర్వేదం, సిద్ధా, యోగా, యునానీ, హోమియోపతి వంటి ఆయుష్ విధానంలో అందుబాటులో ఉన్న సంప్రదాయ ఆరోగ్య, నివారణ చర్యలను కూడా మంత్రిత్వ శాఖ పొందుపరిచింది.
శరీరానికి చలవనిచ్చే ఆహార నియమాలను పాటించాలని ఆయుర్వేద విభాగం సూచించింది. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి పానీయాలు తీసుకోవడంతో పాటు.. తీవ్రమైన ఎండల్లో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సాంప్రదాయకంగా తయారుచేసే నిమ్మరసం, మామిడి, చింతపండుతో చేసిన పానీయాలను తీసుకోవాలని సూచించింది.
శరీరానికి చల్లదనాన్నిచ్చే సహజ ఆహార పదార్థాలతో పాటు శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడానికి, ఎండ వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించడానికి శీతలీ ప్రాణాయామం వంటి శ్వాస పద్దతులు, తేలికపాటి యోగాసనాలను పాటించాలని సిద్ధ, యోగా విభాగాలు సూచించాయి.
యునానీ వైద్య విధానంలో వడదెబ్బ, డీహైడ్రేషన్ నివారణకు సంప్రదాయ శీతల పానీయాలు, ఔషధ లేపనాలను సూచించగా.. హోమియోపతి విభాగం తీవ్ర ఎండ సమయాల్లో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను వివరించింది.
వేసవిలో దోస, పుచ్చ, నిమ్మ, ఖర్బూజా, బూడిద గుమ్మడి, టమాటా వంటి శరీరానికి చల్లదనం ఇచ్చే ఆహారాలను రోజువారీ ఆహారంలో చేర్చాలని ప్రజలకు సూచించింది.
భారత వాతావరణ శాఖ జారీ చేసే వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వడగాలుల హెచ్చరికల సమయాల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది.
వివరణాత్మక సూచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
The detailed advisory is attached.