రైల్వే మంత్రిత్వ శాఖ
బెంగళూరు–ముంబయి ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించిన కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్
కర్ణాటక, మహారాష్ట్రల మధ్య పెరిగిన రైలు అనుసంధానం
త్వరలోనే బెంగళూరు–ముంబయి వందే భారత్ స్లీపర్ సేవలూ ప్రారంభం
నాడు పోస్టు చేయడమైనది:
17 MAY 2026 3:40PM by PIB Hyderabad
బెంగళూరు – ముంబయి మధ్య ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈ రోజు వీడియో అనుసంధానం ద్వారా ప్రారంభించారు. ఇది కర్ణాటక, మహారాష్ట్రల మధ్య రైలు అనుసంధానాన్ని బలోపేతం చేసే దిశగా ఒక కీలక ముందడుగు.
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న దక్షిణ, ఉత్తర కర్ణాటక ప్రాంతాల డిమాండ్లు ఇప్పుడు నెరవేరుతున్నాయని శ్రీ వైష్ణవ్ తెలిపారు. బెంగళూరు-ముంబయిల మధ్య వందే భారత్ స్లీపర్ సేవలూ త్వరలోనే ప్రారంభం కానున్నాయని ఆయన ప్రకటించారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ... ఇటీవలి సంవత్సరాల్లో గణనీయంగా పెరిగిన రైల్వే నిధులతో కర్ణాటక వ్యాప్తంగా ప్రాజెక్టుల అమలు వేగవంతమైందని శ్రీ వైష్ణవ్ పేర్కొన్నారు.
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.2,160 కోట్ల వ్యయంతో 61 స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తుండగా... వాటిలో 9 ఇప్పటికే పూర్తయ్యాయి. బెంగళూరు కంటోన్మెంట్ స్టేషన్ను రూ.485 కోట్లతో, యశ్వంత్పూర్ స్టేషన్ను రూ.367 కోట్లతో మరింతగా అభివృద్ధి చేస్తున్నారు.
2014 నుంచి కర్ణాటకలో సుమారు 1,750 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లు నిర్మించారు. హసన్-మంగళూరు సెక్షన్ పరిధిలో సంక్లిష్టమైన విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్నాయి.
బెంగళూరు సబర్బన్ రైల్వే ప్రాజెక్ట్ గురించి శ్రీ వైష్ణవ్ మాట్లాడుతూ... నాలుగు కారిడార్లలోనూ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. బైయప్పనహళ్లి–చిక్కబనవర, హీలాలిగే–రాజనుకుంటె కారిడార్ల కోసం భూసేకరణ పూర్తయిందనీ, ప్రస్తుతం స్టేషన్ పనులూ జరుగుతున్నాయని తెలిపారు. కేఎస్ఆర్ బెంగళూరు–దేవనహళ్లి అలైన్మెంట్కు రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేలు సంయుక్తంగా ఆమోదం తెలిపాయనీ, జియోటెక్నికల్ సర్వే పూర్తయిందని తెలిపారు. కెంగేరి–వైట్ఫీల్డ్ అలైన్మెంట్కు ఇటీవలే ఆమోదం లభించిందనీ, త్వరలోనే సర్వే పనులూ ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. విమానాశ్రయం, ఎలక్ట్రానిక్ సిటీ, మారతహళ్లి, హెబ్బాల్ వంటి కీలక కేంద్రాలను ఈ సబర్బన్ రైలు నెట్వర్క్ అనుసంధానిస్తుందని ఆయన అన్నారు.
కర్ణాటక నుంచి 12 వందే భారత్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయని కేంద్ర రైల్వే మంత్రి తెలిపారు. బెంగళూరు-మంగళూరు మార్గంలోనూ పరీక్షలు జరుగుతున్నాయనీ, త్వరలోనే మడ్గావ్ వరకు తీరప్రాంత కనెక్టివిటీని విస్తరించనున్నట్లు శ్రీ అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.
బెంగళూరును హైదరాబాద్, చెన్నైలతో కలిపే బుల్లెట్ రైలు కారిడార్లకూ ఆమోదం లభించిందని శ్రీ వైష్ణవ్ ప్రధానంగా ప్రస్తావించారు. ముంబయి, బెంగళూరు, ఇతర ప్రధాన నగరాలను అనుసంధానించేలా దీర్ఘకాలిక దృష్టితో ఈ వ్యవస్థను 7,000 కిలోమీటర్ల వరకు విస్తరించే అవకాశం ఉందనీ ఆయన పేర్కొన్నారు.
16553/54 నంబరు గల ఈ ఎస్ఎమ్వీటీ బెంగళూరు – లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ వి. సోమన్న మాట్లాడుతూ... ఈ బెంగళూరు-ముంబయి కొత్త రైలును మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రైలు అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఒకటైన బెంగళూరులోని ప్రయాణికులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. కర్ణాటక అభివృద్ధికీ ఇది మరింత ఊతమిస్తుందని శ్రీ సోమన్న పేర్కొన్నారు.
కర్ణాటక నుంచి ప్రస్తుతం 14 జిల్లాలను కలుపుతూ 12 వందే భారత్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయని శ్రీ సోమన్న తెలిపారు. తానిసంద్రలో రూ.270 కోట్ల వ్యయంతో వందే భారత్ స్లీపర్ నిర్వహణ డిపోను, బెంగళూరులోని ఎస్ఎమ్వీటీలో రూ.52.73 కోట్ల వ్యయంతో చెయిర్ కార్ నిర్వహణ కేంద్రాన్నీ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సామర్థ్యాన్ని పెంపొందించేందుకు బైయప్పనహళ్లి–హోసూర్ (రూ. 1,116 కోట్లు), బెట్టహళ్లసూరు–రాజనుకుంటె (రూ. 248 కోట్లు) మార్గాల్లో డబ్లింగ్ పనులు... బెంగళూరు పరిసర ప్రాంతాల్లో క్వాడ్రుప్లింగ్ పనులు (రూ. 1,347 కోట్లు) చేపడుతున్నట్లు శ్రీ సోమన్న వివరించారు.
యశ్వంత్పూర్, కేఎస్ఆర్ బెంగళూరు, లొట్టెగొల్లహళ్లి, బైయప్పనహళ్లి, పెనుకొండ, మైసూరు, జోలార్పేట వంటి కీలక విభాగాల్లో మొత్తం రూ. 6,396 కోట్ల వ్యయంతో ఆటోమేటిక్ సిగ్నలింగ్ పనులు జరుగుతున్నాయని శ్రీ సోమన్న తెలియజేశారు. మొత్తం వృద్ధిని ప్రధానంగా ప్రస్తావిస్తూ... కర్ణాటకకు రికార్డు స్థాయిలో రూ. 7748 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయింపు లభించిందని ఆయన పేర్కొన్నారు. 2014 నుంచి, సుమారు 3,840 కిలోమీటర్ల రైల్వే లైన్లు అభివృద్ధి చేయగా... 3,742 కిలోమీటర్ల మార్గంలో విద్యుదీకరణ పూర్తయిందని తెలిపారు. రాష్ట్రం 100 శాతం విద్యుదీకరణకు చేరువలో ఉందనీ ఆయన పేర్కొన్నారు. 2014కు ముందు సుమారు 150 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు/రైల్వే అన్లయబుల్ వంతెనలు ఉండగా... ఇప్పుడు వాటి సంఖ్య 707కు పెరిగిందన్నారు. రాబోయే సంవత్సర కాలంలో మరో 146 పూర్తి కానుండగా, రానున్న మూడు సంవత్సరాల్లో అన్ని లెవెల్ క్రాసింగ్లను తొలగించాలనే లక్ష్యం నిర్దేశించుకున్నట్లు శ్రీ సోమన్న తెలిపారు.
బెంగళూరు సెంట్రల్ పార్లమెంటు సభ్యులు శ్రీ పి. సి. మోహన్, రాజ్యసభ సభ్యులు శ్రీ లెహర్ సింగ్ సిరోయా, బెంగళూరు సౌత్ పార్లమెంటు సభ్యులు శ్రీ తేజస్వి సూర్య కూడా వీడియో అనుసంధానం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో పాటు పలువురు సీనియర్ రైల్వే అధికారులూ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2262043)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2