వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
తప్పుదోవ పట్టించే ప్రకటనలు, చట్టవిరుద్ధ వ్యాపార పద్ధతులను
అనుసరిస్తున్న కోచింగ్ సంస్థలకు జరిమానా విధించిన సీసీపీఏ
కోచింగ్ రంగంలో తప్పుదోవ పట్టించే ప్రకటనలు, చట్ట వ్యతిరేక వాణిజ్య పద్ధతులపై దేశవ్యాప్తంగా చర్యలు చేపట్టిన సీసీపీఏ
కోచింగ్ సంస్థలకు 60కి పైగా నోటీసుల జారీ... రూ.1.39 కోట్లకు పైగా జరిమానా
నాడు పోస్టు చేయడమైనది:
15 MAY 2026 1:30PM by PIB Hyderabad
తప్పుదోవ పట్టించే ప్రకటనలు, చట్ట వ్యతిరేకమైన వాణిజ్య పద్ధతులకు పాల్పడటం, వినియోగదారుల హక్కులను ఉల్లంఘించినందుకు వినియోగదారుల పరిరక్షణ చట్టం – 2019 ప్రకారం మోషన్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్కు రూ.10 లక్షలు, సీకర్లోని కెరీర్ లైన్ కోచింగ్ (సీఎల్సీ)కు రూ. 5 లక్షల జరిమానా విధిస్తూ.. కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (సీసీపీఏ) తుది ఉత్తర్వులను జారీ చేసింది.
వినియోగదారులను ఒకే వర్గంగా పరిగణించి వారి హక్కులను పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి, వినియోగదారుల పరిరక్షణ చట్టం – 2019 లోని నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అసత్య లేదా తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (సీసీపీఏ) ప్రధాన కమిషనర్ శ్రీమతి నిధి ఖరే, కమిషనర్ శ్రీ అనుపమ్ మిశ్రా మోషన్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్, సీకర్లోని కెరీర్ లైన్ కోచింగ్ (సీఎల్సీ) సంస్థలకు ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సంస్థలు ఐఐటీ-జేఈఈ, నీట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల పేర్లు, ఫోటోలు, వారి విజయాలను ఉపయోగించుకుంటూ, వారు ఎంచుకున్న నిర్దేశిత కోర్సులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను దాచిపెడుతూ ప్రకటనలిస్తున్నాయని సీసీపీఏ గుర్తించింది.
మోషన్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కేసు: దిగువ పేర్కొన్న విధంగా ప్రకటనలున్నాయి -
i. “జేఈఈ అడ్వాన్స్ ఫలితాలు – 2025లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల శాతం 3231/6332 = 51.02శాతం”
ii. “జేఈఈ (మెయిన్స్) 65.8% 6930/10532”
iii. “మోషన్ సంస్థలో చేరితే సెలక్ట్ అయిపోయినట్టే’’
iv. “నీట్ ఫలితాలు-2025కు అర్హత సాధించిన మోషన్ విద్యార్థుల శాతం 6972/7645 = 91.2 శాతం”
v. “నీట్ ఫలితాలు -2025లో ఆల్ ఇండియా స్థాయిలో మొదటి 500 ర్యాంకుల్లో (జనరల్, ఓబీసీ) 19 మంది, 100 లోపు ర్యాంకుల్లో ఏడుగురు మా విద్యార్థులే”
ఈ సంస్థ తన అధికారిక వెబ్సైటు, యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లోనూ, వార్తాపత్రికల్లో తప్పుదోవ పట్టించే విధంగా ఇచ్చిన ప్రకటనలను సీసీపీఏ సుమోటోగా తీసుకుంది. వాటిలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల పేర్లు, ఫొటోలను ప్రచురించడంతో పాటు ‘‘ఫుల్ టైమ్ క్లాస్ రూం ప్రోగ్రాం’’, ‘‘రెసిడెన్షియల్ ప్రోగ్రాం’’, ‘‘నర్చర్ బ్యాచ్’’, ‘‘ఎంథూస్ బ్యాచ్’’, ‘‘డ్రాపర్/లీడర్ బ్యాచ్’’ లాంటి చెల్లింపులు చేయాల్సిన కార్యక్రమాలను ప్రచారం చేయడాన్ని సీసీపీఏ గుర్తించింది. అదే సమయంలో ఉత్తీర్ణులైన విద్యార్థులు దేనిని ఎంచుకున్నారనే వివరాలను దాచి ఉంచిందని కూడా గమనించింది.
ఈ ప్రకటనల్లో కనిపించిన విద్యార్థుల్లో అధిక శాతం మంది ఈ సంస్థ ఇచ్చిన ‘‘ఐ-ఏకలవ్య (ఆన్లైన్)’’ కోర్సులో చేరారని డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్) నిర్వహించిన దర్యాప్తులో తేలింది. ఐ-ఏకలవ్య.. జేఈఈ, నీట్ ఆశావహుల కోసం ఉద్దేశించిన ప్రీమియర్ ర్యాంకర్ల బ్యాచ్ అనీ, పరీక్ష, ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా ఎంపిక చేసిన విద్యార్థులకు దానిని ఆఫ్లైన్, ఆన్లైన్ విధానాలు రెండింటిలోనూ ఉచితంగానే అందిస్తుందనీ సీపీపీఏ గుర్తించింది. ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎంపిక చేసుకున్న కోర్సుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని వెల్లడించడంలో ఈ ప్రకటనలు విఫలమయ్యాయి.
అంతేకాకుండా.. పరీక్షల అనంతరం కోర్సులో చేరిన కొంతమంది విద్యార్థుల పేర్లను, ఫోటోలను ఈ సంస్థ ఉపయోగించుకుని, వారు సాధించిన విజయాన్ని తమ సంస్థకు అన్వయించుకుందని గుర్తించింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు/సంరక్షకుల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే విద్యార్థుల పేర్లను, ఫోటోలను దుర్వినియోగం చేసినట్లు దర్యాప్తులో తేలింది.
అనేక అవకాశాలు, ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఈ ప్రకటనల్లో చేసిన క్లెయిములకు సంబంధించిన పత్రాలను సాక్ష్యాలుగా సమర్పించడంలో ఈ సంస్థ విఫలమైందని సీసీపీఏ గుర్తించింది. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఎంపిక చేసుకున్న కోర్సులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని దాచిపెట్టడం వినియోగదారుల పరిరక్షణ చట్టం – 2019 లోని సెక్షన్ 2(28) ప్రకారం తప్పుదారి పట్టించే ప్రకటనగా, సెక్షన్ 2(47) ప్రకారం అక్రమ వాణిజ్య పద్ధతిగా పరిగణించవచ్చని సీసీపీఏ నిర్ధారించింది.
సీకర్ లోని కెరీర్ లైన్ కోచింగ్ (సీఎల్సీ) కేసు: ప్రకటలను దిగువ పేర్కొన్న విధంగా ఉన్నాయి -
i. “ఎంబీబీఎస్, ఐఐటీ, ఇతర కోర్సుల్లో 1650కి పైగా సీఎల్సీయన్లు’’
ii. “నీట్లో ఏఐఆర్-100లోపు ఇద్దరు సీఎల్సీ విద్యార్థులు’’
iii. “ఎయిమ్స్ ఢిల్లో ముగ్గురు సీఎల్సీ విద్యార్థులు’’
iv. “ఆరుగురు సీఎల్సీ విద్యార్థులకు 710కి పైగా మార్కులు (మొత్తం 720 మార్కులకు)”
v. “ఏఐఆర్-1000 లోపు ఫలితాల్లో ఏడు రెట్లు వృద్ధి’’
vi. “గతేడాది సీకర్లో ఏఐఆర్-1000లో ఏడు రెట్లు వృద్ధి సాధించిన సీఎల్సీ’’
సీకర్లోని కెరీర్ లైన్ కోచింగ్ (సీఎల్సీ) సంస్థ తన అధికారిక వెబ్సైట్తో పాటు వార్తాపత్రికల్లో తప్పుదోవ పట్టించేలా ప్రచురించిన ప్రకటనలను సీసీపీఏ సుమోటోగా స్వీకరించింది. విజయం సాధించిన అభ్యర్థులను ప్రముఖంగా చూపిస్తూ.. వివిధ తరగతులకు సంబంధించిన కార్యక్రమాలను ప్రచారం చేస్తోందని, అభ్యర్థులు ఎంచుకున్న కోర్సులకు సంబంధించిన వాస్తవ సమాచారాన్ని దాచి పెట్టిందని సీసీపీఏ గుర్తించింది.
ఈ క్లెయిములకు సంబంధించిన పత్రాలను సాక్ష్యంగా సమర్పించడానికి అనేక అవకాశాలను ఇచ్చినప్పటికీ వాటిని అందించడంలో సంస్థ విఫలమైందని డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్) చేసిన దర్యాప్తులో తేలింది. ప్రకటనల్లో పేర్లు, ఫోటోలు ఉపయోగించిన విద్యార్థుల్లో అనేక మంది టెస్టు సిరీస్ కోర్సులో మాత్రమే చేరారని, ఈ వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని దర్యాప్తులో తేలింది.
‘‘ఎంబీబీఎస్, ఐఐటీ, ఇతర కోర్సుల్లో 1650 మందికి పైగా సీఎల్సీ విద్యార్థులు ఉన్నార’’నే అంశంపైన కూడా ఈ సంస్థ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని సీసీపీఏ గుర్తించింది. 1996 నుంచి ఎంపికైన వారి సంఖ్యను సూచిస్తుందని ఆ సంస్థ లిఖితపూర్వకంగా సమర్పించింది. కానీ విచారణ సమయంలో ఈ సంఖ్య 2024 ఏడాదికి మాత్రమే సంబంధించిందని వాదించింది. పరస్పరం విరుద్ధంగా ఉన్న వాదనలను పరిగణనలోకి తీసుకొని ఈ క్లెయిమును నిరాధారమైనదిగా, తప్పుదోవ పట్టించేదిగా సీసీపీఏ నిర్ధారించింది.
కోచింగ్ రంగంలో తప్పుదోవ పట్టించే ప్రకటనల నివారణ మార్గదర్శకాలు-2024 ప్రకారం తప్పనిసరి చేసిన విధంగా ఫలితాల ప్రకటన అనంతరం ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి లిఖితపూర్వకమైన అనుమతి పొందినట్లు డాక్యుమెంట్ రూపంలో సాక్ష్యాలను అందించడంలో రెండు సంస్థలూ విఫలమయ్యాయయని సీసీపీఏ గుర్తించింది.
తప్పుదోవ పట్టించే ప్రకటనలు తక్షణమే నిలిపివేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు ప్రచురించవద్దనీ, ఇకపై ప్రచురించే ప్రకటనలు వాస్తవంగా, పూర్తి వివరాలతో ఉండాలని రెండు కోచింగ్ సంస్థలను సీసీపీఏ ఆదేశించింది. అయితే, ఈ రెండు సంస్థలూ సీసీపీఏ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ.. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ)లో అప్పీలు చేశాయి.
వినియోగదారులకు సమాచారం తెలుసుకొనే హక్కును వినియోగదారుల పరిరక్షణ చట్టం – 2019 అందిస్తుంది. ఈ చట్టం ప్రకారం సరైన నిర్ణయాలను తీసుకొనేలా వాస్తవమైన, కచ్చితమైన సమాచారాన్ని పొందే హక్కు కూడా వినియోగదారులకు ఉంటుంది. తప్పుదోవ పట్టించే ఇలాంటి ప్రకటనలు ఆ హక్కును హరిస్తాయి. ముఖ్యంగా అభ్యర్థులు తమ సమయాన్ని, శ్రమను, ఆర్థిక వనరులను అధికంగా వెచ్చించే విద్యా రంగంలో వినియోగదారుల ప్రయోజనాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి.
పూర్తి కాల కోచింగ్, ఆన్లైన్ కోర్సులు, ఫౌండేషన్ బ్యాచులు, క్రాష్ కోర్సులు లేదా టెస్టు సిరీస్లో అభ్యర్థులు దేనికి హాజరయ్యారనే విషయంతో సహా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎంచుకున్న నిర్దేశిత కోర్సులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచి పెట్టడం చట్టం ప్రకారం తప్పుదోవ పట్టించే ప్రకటన కిందకు వస్తుందని సీసీపీఏ గమనించింది.
విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటానికి, కోచింగ్ రంగంలో పారదర్శకతను అందించడానికి తప్పుదోవ పట్టించే ప్రకటనలు, చట్టవిరుద్ధమైన వాణిజ్య పద్ధతులపై కోచింగ్ సంస్థలకు 60కి పైగా నోటీసులను సీసీపీఏ జారీ చేసింది. సమగ్ర పరిశీలన, దర్యాప్తు అనంతరం యూపీఎస్సీ సివిల్ సర్వీసు పరీక్షలు (సీఎస్ఈ), ఐఐటీ-జేఈఈ, నీట్, ఆర్బీఐ, ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ ఇస్తున్న 31 కోచింగ్ సంస్థలకు రూ.1.39 కోట్లకు పైగా జరిమానాలను సీసీపీఏ విధించింది.
(కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ వెబ్సైట్లో తుది ఉత్తర్వు అందుబాటులో ఉంది: https://doca.gov.in/ccpa/orders-advisories.php?page_no=1)
***
(రిలీజ్ ఐడి: 2261522)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8