యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
‘వికసిత్ వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రాం-2026’ జాతీయ క్విజ్ ప్రారంభం
ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారు జూన్ 2026లో జరిగే సరిహద్దు గ్రామ అభివృద్ధి కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో పాల్గొంటారు
నాడు పోస్టు చేయడమైనది:
13 MAY 2026 11:31AM by PIB Hyderabad
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో మై భారత్ ద్వారా యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ వికసిత్ వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రాం (వీవీవీపీ)-2026 కోసం జాతీయ స్థాయి క్విజ్ను ప్రారంభించింది. మై భారత్ వెబ్సైట్ [MY Bharat portal]లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. 2026 జూన్లో సరిహద్దు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనే యువతను ఎంపిక చేయడంలో మొదటి దశగా ఈ క్విజ్ జరుగుతుంది.
యువత నేతృత్వంలో చేపట్టే జాతీయ కార్యక్రమమే వికసిత్ వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రాం - 2026. లేహ్-లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా వ్యూహాత్మక ప్రాధాన్యమున్న ప్రాంతాల్లోని సరిహద్దు గ్రామాల అభివృద్ధిలో క్షేత్రస్థాయిలో పాల్గొనడాన్ని, సామాజిక భాగస్వామ్యాన్ని, సాంస్కృతిక వినిమయాన్ని, అవగాహనను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం.

దేశవ్యాప్తంగా 2026 మే 10 నుంచి 20 వరకు ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తారు. వికసిత్ వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రాం దార్శనికత, లక్ష్యాల గురించి పోటీదారుల్లో అవగాహన పెంపొందించడం, దేశ నిర్మాణంలో, సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి లో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ లక్ష్యం.
సరిహద్దు గ్రామాల అభివృద్ధి, స్థానిక సంస్కృతి, పర్యావరణ అవగాహన, పరిపాలన కార్యకలాపాలు, సమాజ భాగస్వామ్యం, సరిహద్దు ప్రాంతాలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాల గురించి తెలుసుకొనే వేదికగా ఈ క్విజ్ పనిచేస్తుంది.
క్విజ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి అర్హత, శారీరక ధారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 500 మంది మై భారత్ స్వచ్ఛంద సేవకులను 2026 జూన్లో నిర్వహించే వికసిత్ వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రాంలో ఒక వారం పాటు పాల్గొనేందుకు ఎంపిక చేస్తారు.
గుర్తించిన సరిహద్దు గ్రామాల్లో క్షేత్రస్థాయి కార్యక్రమాల్లోనూ, సామాజిక కార్యకలాపాల్లోనూ ఎంపికైన స్వచ్ఛంద సేవకులు నిమగ్నమవుతారు. క్షేత్రస్థాయి అభివృద్ధికి, జాతీయ సమైక్యతకు సంబంధించిన స్వచ్ఛతా డ్రైవ్లు, యువతతో చర్చలు, పర్యావరణపరమైన కార్యక్రమాలు, సాంస్కృతిక వినమయ కార్యకలాపాలు, అవగాహన సదస్సులు, కెరీర్ కౌన్సిలింగ్ సెషన్లు, ప్రయోగాత్మక అభ్యాస అవకాశాలపై దృష్టి సారిస్తారు.
2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యంలో చురుకైన భాగస్వామిగా యువతను శక్తిమంతం చేయాలనే ప్రభుత్వం అంకితభావాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది. అలాగే శక్తిమంతమైన, స్థిరమైన సరిహద్దు సమాజాలకు ఇస్తున్న ప్రాధాన్యంపై అవగాహనను పెంపొందిస్తుంది.
ఆసక్తి ఉన్న యువత MY Bharat portal ద్వారా క్విజ్లో పాల్గొనవచ్చు.
***
(రిలీజ్ ఐడి: 2260571)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8