ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్లోని వడోదరలో సర్దార్ ధామ్ వసతి గృహాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
సమూల మార్పులు, శాశ్వత ఫలితాల కోసం సమాజం, ప్రభుత్వం సమష్టిగా పనిచేయడం అవసరం... క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితుల ఆధారంగా విద్యారంగంలోని కార్యక్రమాలు కొనసాగుతున్నాయి... జాతీయ విద్యావిధానం దీనికి ఒక ముఖ్యమైన ఉదాహరణ: ప్రధాని
చిన్న పట్టణాల్లోనే ఆవిర్భవిస్తున్న ప్రధాన అంకుర సంస్థలు... స్టార్టప్ల్లో పెరుగుతున్న మహిళా భాగస్వామ్యం... ఒకప్పుడు ప్రమాదకరమైనవిగా భావించిన రంగాలను ఎంచుకోవడానికే ప్రాధాన్యమిస్తున్న యువత: పీఎం
కొవిడ్-19 ఈ శతాబ్దంలో అతి పెద్ద సంక్షోభమైతే.. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఈ దశాబ్దంలో అతిపెద్ద సంక్షోభం, మహమ్మారిని సమష్టిగా ఎలా ఎదుర్కొన్నామో, ఈ అనిశ్చితిని కూడా అలాగే అధిగమిస్తాం: పీఎం
పశ్చిమాసియా యుద్ధ సంక్షోభ ప్రభావం మన పౌరులపై అతి తక్కువగా ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది: పీఎం
భారతీయ పౌరులుగా మన విధులకు మనం ప్రాధాన్యమివ్వాలి, గడచిన దశాబ్దాల్లో యుద్ధాలు లేదా ఇతర సంక్షోభాలను దేశం ఎదుర్కొన్నప్పుడు.. ప్రభుత్వ పిలుపు మేరకు ప్రతి పౌరుడూ తమ బాధ్యతలను నెరవేర్చడానికి ముందుకొచ్చారు, ఇప్పుడు మరోసారి మన బాధ్యతలు సమష్టిగా నిర్వర్తించి, దేశ వనరులపై పడిన భారాన్ని తగ్గించాల్సిన అవసరం మరోసారి ఏర్పడింది: ప్రధాని
మన ప్రయత్నాల ద్వారా దిగుమతుల వినియోగాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలి, విదేశీ మారక నిల్వలను తగ్గించే వ్యక్తిగత కార్యకలాపాలను కూడా నివారించాలి:పీఎం
‘ఓకల్ ఫర్ లోకల్’ను ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైంది, విదేశీ వస్తువులకు బదులుగా స్థానిక ఉత్పత్తులను స్వీకరించాలి, మన గ్రామాలు, నగరాలు, దేశానికి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను శక్తిమంతం చేయాలి: పీఎం
నాడు పోస్టు చేయడమైనది:
11 MAY 2026 9:53PM by PIB Hyderabad
గుజరాత్లోని వడోదరలో సర్దార్ ధామ్ వసతి గృహాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. వడోదరలోని సర్దార్ ధామ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. సోమనాథ్ ఆలయ 75వ ప్రతిష్ఠాపన వార్షికోత్సవాలను నిర్వహించుకొంటున్న రోజునే విద్యా సంస్థల ప్రారంభోత్సవం, ఆధ్యాత్మిక స్మరణ జరగడం శుభపరిణామన్నారు. డాక్టర్ దుష్యంత్, దక్ష్ పటేల్ భవన సముదాయాన్ని, బోధనా సహాయక పథకాన్ని ప్రారంభించారు. వివిధ విద్యా సంబంధమైన ప్రాజెక్టులకు భూమి పూజ చేశారు. వీటిన్నింటినీ భవిష్యత్తులో యువతకు అవకాశాన్ని కల్పించే వేదికలుగా వర్ణించారు. ‘‘కొన్ని గంటల క్రితమే, ప్రభాస్ పటాన్లో సోమనాథ్ అమృత మహోత్సవాల్లో నేను పాల్గొన్నాను. ఇక్కడ పరివర్తనాత్మక విద్యా సంస్థలను ప్రారంభించుకుంటున్నాం. చారిత్రక వారసత్వం, ప్రగతి రెండూ కలసి ముందుకు సాగుతాయనడానికి ఇదే నిదర్శనం’’ అని శ్రీ మోదీ అన్నారు.
భారత దేశంలో సర్దార్ ధామ్ విద్యాసంస్థ విస్తరిస్తున్న తీరును వివరిస్తూ... ఆ సంస్థ 75 ఏళ్ల విద్యా ప్రస్థానాన్ని స్మరించుకున్నారు. 2021లో జరిగిన బాలికల వసతి గృహం శంకుస్థాపనకు వచ్చిన సమయాన్ని గుర్తు చేసుకున్నారు. సూరత్, రాజ్కోట్, భుజ్, మెహసానా, ఢిల్లీల్లోనూ ఈ సంస్థ ఉందన్నారు. అహ్మదాబాద్లోని నికోల్ వద్ద వెయ్యి మందికి వసతి కల్పించే బాలికల హాస్టల్ ప్రారంభోత్సవం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అలాగే కొత్తగా వచ్చిన మార్పుల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘గతేడాది ప్రారంభమైనప్పటి నుంచీ ఈ వసతి గృహంలో వేలాది మంది అమ్మాయిలు చదువుకుంటున్నారు. తమ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. ఈ రోజు శంకుస్థాపన చేసిన వసతి గృహం కూడా దేశంలో బాలికలకు విద్యను అందిచడంలో సర్దార్ ధామ్ కనబరుస్తున్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
విద్యారంగంలో మార్పులను సామాజిక పరిణామం అనే విస్తృత కోణంలో చూపిస్తూ... సంస్కరణలను వాస్తవ అనుభవాలకు తగినట్లుగా చేపట్టాలని ప్రధానమంత్రి అన్నారు. సమగ్ర మార్పు సాధించేందుకు ప్రభుత్వం, సమాజం మధ్య సహకారాత్మక ప్రయత్నం అవసరమని తెలిపారు. వ్యవస్థాగత మార్పులను తీసుకొచ్చే సాక్ష్యం ఆధారిత విధానానికి జాతీయ విద్యా విధానం ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. భాషా పరమైన వివక్షను తొలగించడం నుంచి పాఠ్యాంశాల్లో నైపుణ్యాభివృద్ధిని, ఆవిష్కరణలను భాగం చేయడం వరకూ ఈ విధానంలోని అనేక నూతనాంశాల గురించి వివరించారు. ‘‘సమూలమైన మార్పులు, శాశ్వత ఫలితాల కోసం సమాజం, ప్రభుత్వం సమష్టిగా పనిచేయడం అవసరం. అప్రెంటిస్ షిప్ అవకాశాలతో యువత డిగ్రీలను పూర్తి చేయాలి. ఫలితంగా పట్టభద్రులైన అనంతరం గందరగోళానికి గురి కాకుండా ఉంటారు’’ అని శ్రీ మోదీ తెలిపారు.
విద్యారంగంలో పెట్టుబడుల వల్ల కలిగే విస్తృత ప్రయోజనాల గురించి ప్రధానమంత్రి వివరించారు. విశిష్టమైన గుజరాత్ పారిశ్రామిక సంస్కృతిని ప్రశంసించారు. ఈ రాష్ట్ర యువతకు సహజసిద్ధంగా ఉన్న వ్యాపార నైపుణ్యాన్ని స్టార్టప్ ఇండియా మిషన్ విధానాల ద్వారా మరింత ప్రోత్సహిస్తున్నామని తెలియజేశారు. చిన్న నగరాల్లో అంకుర సంస్థలను ఏర్పాటు చేయడంలో ఇటీవలి కాలంలో వచ్చిన పెరుగుదలను, ఔత్సాహిక పారిశ్రామిక రంగంలో వేగంగా పెరుగుతున్న మహిళల భాగస్వామ్యం గురించి వివరించారు. గతంలో ప్రమాదకరమైనవిగా భావించిన రంగాలు ఇప్పుడు యువ ఆవిష్కర్తలను ఆకర్షిస్తున్నాయన్నారు. "భవిష్యత్తులో విస్తృత స్థాయిలో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి దేశంలో ఉంటుంది. దీనివల్ల దేశంలో తయారీ రంగం అపూర్వమైన వేగాన్ని సాధిస్తుంది. గడచిన దశాబ్దంలో క్రీడల నుంచి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం వరకు సాధించిన అభివృద్ధి దీనికి నిదర్శనం’’ అని శ్రీ మోదీ తెలియజేశారు.
మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని నాగరికత పురోగతికి ప్రాథమిక కొలమానంగా ప్రధానమంత్రి గుర్తించారు. ఈ విషయాన్ని రెండు దశాబ్దాల క్రితమే గుజరాత్ గుర్తించిందని చెప్పారు. అలాగే ఆ రాష్ట్రం అనుసరిస్తున్న స్త్రీ పురుష – సమ్మిళిత అభివృద్ధి విధానాన్ని వివరించారు. ఈ నమూనాను జాతీయ స్థాయిలో అమలు చేయడం ద్వారా పారిశుద్ధ్యం, నీరు, ఇంధన సదుపాయాల కల్పనతో పాటుగా కోట్లాది మంది మహిళలకు బ్యాంకు ఖాతాలను అందించామన్నారు. ముద్ర పథకం అందించిన సాధికారత, ఆయుష్మాన్ భారత్ అందించిన భద్రత గురించి కూడా వివరించారు. ‘‘మహిళల భాగస్వామ్యంపైనే సమాజం ప్రగతి ప్రాథమికంగా ఆధారపడి ఉందని గుజరాత్ అర్థం చేసుకుంది. దానికి తగినట్లుగా బలమైన చర్యలు చేపట్టింది. దాని ఫలితాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందుతున్నాయి’’ అని శ్రీ మోదీ వెల్లడించారు.
చరిత్రాత్మకంగా పురుషాధిక్యత అధికంగా ఉన్న రంగాల్లో మహిళా శ్రామిక శక్తిని ఏకీకృతం చేయడం గురించి ప్రధానమంత్రి వివరించారు. గతంలో తమకు అందనంత దూరంలో ఉన్న నాయకత్వ పాత్రల్లో మహిళలు రాణిస్తున్నారని ప్రశంసించారు. సైనిక, విమానయాన, రాజకీయ రంగాల్లో వేగంగా వస్తున్న మార్పులను అంగీకరించారు. పార్లమెంటులో నారీశక్తి వందన్ సవరణను ఆమోదం పొందడానికి చేసిన విఫల యత్నాలను ఉటంకించారు. రాజకీయంగా అడ్డంకులున్నాయని అంగీకరిస్తూనే.. స్త్రీపురుష సమానత్వ లక్ష్యాల పట్ల తమకున్న అంకితభావాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ‘‘జాతీయ డిఫెన్స్ అకాడమీలో మహిళా క్యాడెట్లు శిక్షణ పొందుతున్నారు. మన అమ్మాయిలు ఫైటర్ పైలట్లుగా మారుతున్నారు. రాజకీయాల్లోనూ మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సవరణ ఆమోదానికి రాజకీయ కారణాలు అడ్డుపడినప్పటికీ, మా చిత్తశుద్ధి చెదిరిపోదు’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
స్త్రీ, పురుష సమానత్వంతో కూడిన అవకాశాలను విస్తరించే బాధ్యత ప్రభుత్వానికి మాత్రమే కాకుండా పౌర సమాజ సంస్థలకు కూడా ఉందని చెబుతూ.. సంస్థాగత ఆచరణకు ఉదాహరణగా సర్దార్ ధామ్ అంకితభావాన్ని ప్రధానమంత్రి ఉదహరించారు. వివిధ రంగాల్లో మహిళా సాధికారతను సాధించేందుకు ఈ సంస్థ చేపడుతున్న సమగ్ర ప్రయత్నాలను ప్రశంసిస్తూ.. సంస్థాగత గుర్తింపును అందించారు. ‘‘సర్దార్ ధామ్ ఈ బాధ్యతను పూర్తి అంకితభావంతో చేపట్టి, సామాజిక అభివృద్ధికి సంస్థాగత నిబద్ధతను కొనసాగించడం అవసరమని తన చర్యల ద్వారా నిరూపిస్తున్నందుకు సంతోషిస్తున్నాను’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
మారుతున్న కాలం దిశను వేగంగా గుర్తించడమే గుజరాత్కున్న విశిష్ట సాంస్కృతిక లక్షణమని ప్రధానమంత్రి అన్నారు. అలాగే ఆటంకాలను అవకాశాలుగా మార్చుకొనే సంస్థాగత సామర్థ్యమే ఆ రాష్ట్రానికున్న బలమైన పోటీతత్వానికి కారణమని తెలియజేశారు. ఈ నేపథ్యంలో తయారీరంగంలో వస్తున్న సమకాలీన మార్పులను చారిత్రక పరిణామక్రమంలో భాగంగా పేర్కొన్నారు. సెమీకండక్టర్లు, ఏరోస్పేస్, అడ్వాన్స్డ్ ఇంజినీరింగ్, హరిత విద్యుత్, ఆర్థిక సేవలతో సహా వైవిధ్యమైన ఆధునిక రంగాల్లో రాష్ట్రం సాధించిన సంస్థాగత సామర్థ్యాన్ని వివరించారు. ‘‘మార్పును అవకాశంగా మలుచుకోవడం, నూతన అవకాశాలను స్వీకరించడం, భవిష్యత్తుకు తగినట్టుగా సిద్ధమవడం గుజరాత్ పని సంస్కృతిలో భాగం. దీని ఫలితంగానే నూతనంగా ఆవిర్భవిస్తున్న ప్రతి రంగంలోనూ రాష్ట్రం కొత్త గుర్తింపును సృష్టించుకుంటోంది’’ అని శ్రీ మోదీ వివరించారు.
దేశీయంగా సెమీకండక్టర్ ఉత్పత్తి సామర్థ్యం గురించి వివరిస్తూ... ఆధునిక తయారీ రంగ పరివర్తనను కీలకమైన మౌలిక వసతుల అభివృద్ధిగా ప్రధానమంత్రి వర్ణించారు. కైన్స్ సెమీకండక్టర్ ప్లాంటులో ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభం కావడంతో సనంద్లో మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్లు తయారవుతున్నాయన్నారు. ధోలెరా, సూరత్లో పురోగతిలో ఉన్న కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టు వివరాలను తెలియజేస్తూ, సరఫరా వ్యవస్థల కేంద్రీకరణ అంశంలో జాతీయ ఆకాంక్షను వ్యక్తం చేశారు. అలాగే అంతర్జాతీయ నెట్వర్క్లలో ప్రాంతీయ కేంద్రాలను గుర్తించారు. ‘‘అంతర్జాతీయ సెమీ కండక్టర్ సరఫరా వ్యవస్థలో ప్రధాన కేంద్రంగా గుజరాత్ తనని తాను మలుచుకుంటోంది. ఈ పరివర్తనలో వడోదర కీలక పాత్ర పోషిస్తోంది. ఎందుకంటే ఇక్కడి నుంచి మెట్రో కోచ్లు అంతర్జాతీయ మార్కెట్లకు చేరుకుంటున్నాయి’’ అని మోదీ అన్నారు.
వివిధ రంగాల్లో వడోదరకున్న తయారీ నైపుణ్యం గురించి వివరిస్తూ... ఇంజినీరింగ్, భారీ యంత్రాలు, రసాయనాలు, ఫార్మాసూటికల్స్, విద్యుత్ సామగ్రికి ఈ నగరం బలమైన కేంద్రంగా ఎదుగుతోందని ప్రధానమంత్రి చెప్పారు. అదే సమయంలో వృత్తిపరమైన అభివృద్ధి మౌలిక వసతుల గురించి కూడా చర్చించారు. గతిశక్తి విశ్వ విద్యాలయం ద్వారా రవాణా, లాజిస్టిక్స్ నిపుణులకు ఇచ్చే శిక్షణ, ఏరోస్పేస్ ప్రాజెక్టులు వడోదరను విమానయాన తయారీ కేంద్రంగా ఆవిర్భవించేందుకు సహకరిస్తున్నాయని అంగీకరించారు. అలాగే సమగ్ర ఆర్థిక మార్పుల గురించి వివరించారు. ‘‘అభివృద్ధి చెందుతున్న ఏరో స్పేస్ సామర్థ్యాలతో విభిన్న రంగాల్లో తయారీ కేంద్రంగా వడోదర రూపాంతరం చెందింది. ఇది అంతర్జాతీయ గుర్తింపు సాధించిన విమానయాన కేంద్రంగా ఈ నగరం ఎదుగుతుందని సూచిస్తోంది’’ అని మోదీ తెలియజేశారు.
పలు సంక్షోభాల వల్ల తలెత్తిన అస్థిరతను ప్రధానమంత్రి గుర్తించారు. చరిత్రలో ఎదురైన అనిశ్చిత పరిస్థితులతో ప్రస్తుత సవాళ్లను పోలుస్తూ.. కరోనా మహమ్మారి, ఆర్థిక అస్థిరత, పశ్చిమాసియా ఘర్షణలను కొనసాగుతున్న ఒత్తిడికి కారణాలని చెప్పారు. ఈ దశాబ్దపు అతిపెద్ద సంక్షోభంగా పశ్చిమాసియా సంఘర్షణను వర్ణించారు. మహ్మారి సమయంలో ప్రదర్శించిన సామూహిక స్ఫూర్తిని ఉటంకిస్తూ.. విస్తృతమైన సామాజిక బాధ్యత విధానాలకు అనుగుణంగా ప్రభుత్వం చేపట్టే చర్యలుంటాయన్నారు. ‘‘కరోనా సంక్షోభం వల్ల ఎదురైన ప్రపంచ ఆర్థిక అంతరాయాల నుంచి పశ్చిమాసియా ఉద్రిక్తతల వరకు మునుపెన్నడూ లేని విధంగా, ప్రతి దేశమూ ప్రభావితమయ్యేలా అస్థిరతను ఈ ప్రపంచం ఎదుర్కొంటోంది. కరోనాను ఎలా సమష్టిగా అధిగమించామో.. ఈ సంక్షోభాన్ని కూడా స్థిరమైన ప్రభుత్వం ప్రయత్నం ద్వారా అధగమిస్తాం’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
వ్యవస్థాగతమైన ఒత్తిడిని ఎదుర్కొనే సమయంలో అవసరమయ్యే వనరు ప్రజాభాగస్వామ్యేనని తెలియజేస్తూ... దేశ స్థిరత్వానికి ఉమ్మడి నిబద్ధతను ప్రదర్శించాలని ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. పౌరులు తమ కర్తవ్యానికి ఎలా ప్రాధాన్యమవివ్వాలో, జాతీయ వనరులపై భారాన్ని ఎలా తగ్గించాలో వివరించారు. ముడి చమురు విశ్లేషణ ద్వారా దిగుమతులపై భారత్ ఆధారపడటం గురించి వివరించారు. అలాగే ఇంధన భద్రతను అతి పెద్ద బలహీనతగా గుర్తిస్తూ.. ప్రాంతీయ సంఘర్షణ కారణంగా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో ఎదురైన అంతరాయాల గురించి ప్రస్తావించారు. ‘‘భారత దేశ ముడి చమురు దిగుమతుల్లో ఎక్కువ భాగం ప్రస్తుతం ఘర్షణలు కొనసాగుతున్న ప్రాంతం నుంచే వస్తోంది. దీనివల్ల కొరత, ధరల పెరుగుదల వంటి సంక్షోభాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశానికి ప్రజా భాగస్వామ్య శక్తి అవసరం ఏర్పడింది’’ అని శ్రీ మోదీ తెలిపారు.
పెట్రోలు-డీజీలు వినియోగాన్ని తగ్గించే వ్యూహాల గురించి వివరిస్తూ.. చిన్న చిన్న వ్యక్తిగత తీర్మానాల ద్వారా చేపట్టగలిగే సామూహిక చర్యను సూచించారు. కార్ పూలింగ్ సేవలతో పాటు ప్రజా రవాణా వ్యవస్థకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. వర్చువల్ సమావేశాలకు ప్రాధాన్యమివ్వడం, వర్క్ - ఫ్రమ్ - హోం ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా పని ప్రదేశాలను డిజిటలీకరించాలని కోరారు. సాంకేతిక ఆధారిత పరిష్కారాలను సామర్థ్యాన్ని రెట్టింపు చేసే సాధనాలని ఆయన అన్నారు. ‘‘మెట్రో, విద్యుత్ బస్సులు, ప్రజా రవాణా ఉపయోగించుకుటూ సాధ్యమైన ప్రతి చోటా పెట్రోలు, డీజిలు వినియోగాన్ని తగ్గించండి. అనవసరమైన ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో వర్చువల్ సమావేశాలకు, వర్క్-ఫ్రమ్-హోం విధానానికి ప్రాధాన్యమివ్వండి’’ అని శ్రీ మోదీ విజ్ఞప్తి చేశారు.
వినోదం కోసం చేసే ఖర్చుల గురించి వివరిస్తూ.. ఆహారం, ఖరీదైన లోహాల విషయంలో విదేశీ మారక ద్రవ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను ప్రధాని తెలియజేశారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా వంట నూనె వినియోగాన్ని తగ్గించాలని, సంక్షోభ సమయాల్లో బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని ప్రధానమంత్రి అభ్యర్థించారు. విదేశీ విహారయాత్రలు, డెస్టినేషన్ వెడ్డింగులు లాంటి ధోరణుల కారణంగా విదేశీ మారక నిల్వలు తరిగిపోతున్నాయన్నారు. దీని ప్రభావం వివిధ రంగాలపై పడుతోందన్నారు. ‘‘వంట నూనె, బంగారం దిగుమతుల కోసం దేశం భారీ మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చిస్తోంది. అదే సమయంలో డెస్టినేషన్ వెడ్డింగుల వల్ల సైతం ఈ నిల్వలు ఖర్చవుతున్నాయి. ఈ ప్రపంచ అనిశ్చితి సమయంలో సంయమనం పాటించడం అవసరం’’ అని శ్రీ మోదీ అన్నారు.
విహార యాత్రల కోసం చేస్తున్న వ్యయాన్ని దేశంలోని పర్యాటక గమ్యస్థానాలకు మళ్లించాలంటూ.. ఐక్యతా మూర్తిని వ్యూహాత్మక పర్యాటక ప్రత్యామ్నాయంగా సూచించారు. ఈ చారిత్రక ప్రదేశాన్ని ఆధునిక డెస్టినేషన్ వెడ్డింగ్ గమ్యస్థానంగా పేర్కొంటూ.. భారత్ కేంద్రంగా విహార యాత్రలను చేయాలని పిలుపునిచ్చారు. అద్భుతమైన సౌకర్యాలు, సాంస్కృతిక ప్రాముఖ్యం, ఆర్థిక పరమైన ప్రయోజనాలతో పాటుగా పర్యాటక అభివృద్ధిని మారక నిల్వల పరిరక్షణతో ముడిపెట్టారు. ‘‘విహార యాత్రల కోసం భారత్లోనే ఖర్చు చేయడం, దేశంలోని పర్యాటక ప్రాంతాలనే వివాహాల కోసం ఎంచుకోవడం అవసరం. ఈ విషయంలో గుజరాత్ మీకు గొప్ప గమ్యస్థానాలను అందిస్తోంది. డెస్టినేషన్ వివాహాలకు అవసరమైన అద్భుతమైన సౌకర్యాలను స్టాట్యూ ఆఫ్ యూనిటీ అందిస్తుంది. అదే సమయంలో విదేశీ మారక ద్రవ్యం మన దేశంలోనే ఉంటుంది’’ అని శ్రీ మోదీ వివరించారు.
ఈ విజ్ఞప్తులను ‘‘ఓకల్ ఫర్ లోకల్’’ నినాదం ద్వారా సమగ్ర జాతీయ ఉద్యమంతో అనుసంధానించారు. దేశీయ ఎరువులు, సహజ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించడం ద్వారా దీనిలో ఉన్న వ్యవసాయ కోణాన్ని తెలియజేశారు. బహుళ ఆర్థిక రంగాల్లో స్థానికీకరణను ప్రోత్సహిస్తూ... డీజిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేలా సోలార్ పంపులను ఉపయోగించాలని స్పష్టం చేశారు. పర్యావరణ సుస్థిరతను విదేశీ మారక ద్రవ్యం పరిరక్షణ లక్ష్యాలతో అనుసంధానించారు. ‘‘విదేశీ వస్తువులకు బదులుగా స్థానిక ఉత్పత్తులను స్వీకరించాలి. మన గ్రామాలు, నగరాలు, దేశానికి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి. ప్రత్యేకించి వ్యవసాయంలో స్వదేశీ ఎరువులను, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు, సోలార్ పంపుల వినియోగాన్ని పెంపొందించాలి. దీని వల్ల విదేశీ మారక ద్రవ్యం బయటకు వెళ్లడాన్ని, పర్యావరణ భారాన్నీ రెండింటినీ తగ్గించవచ్చు’’ అని శ్రీ మోదీ చెప్పారు.
పరిరక్షణ విజ్ఞప్తులను సామూహిక కార్యాచరణ విధాన పరిధిలోకి తీసుకువచ్చేలా ప్రజా భాగస్వామ్యానికి పిలుపునిస్తూ.. 140 కోట్ల మంది పౌరుల ఉమ్మడి నిబద్ధతను పరివర్తనాత్మక శక్తిగా గుర్తించారు. సంక్షోభాన్ని అధిగమించడంలో సామూహిక శక్తిపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ.. జాతీయ స్పందనను ఏకీకృతం చేయాల్సిన ఆవశ్యకతను పునరుద్ఘాటించారు. జాతీయ స్థిరత్వాన్ని బలోపేతం చేసేలా దేశవ్యాప్తంగా సమగ్ర సమాజ సమీకరణకు పిలుపునిచ్చారు. ‘‘ఈ ప్రయత్నాలు చిన్నవిగా కనిపించవచ్చు. కానీ 140 కోట్ల మంది ఉమ్మడి సంకల్పం తీసుకుంటే ఇలాంటి చిన్న ప్రయత్నాలే దేశానికి అతి పెద్ద శక్తిగా మారతాయి. ఈ సంక్షోభ ప్రభావం మన ప్రగతిపై లేదా అభివృద్ధిపై పడకుండా మనందరం మరోసారి ఏకమవ్వాలి. మనందరం కలిస్తే.. ఈ లక్ష్యాలను పూర్తి చేయడంతో పాటు మన దేశాన్ని బలోపేతం చేసుకోవచ్చు’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
తనకు సర్దార్ గౌరవ్ రత్న బిరుదును ప్రదానం చేసినందుకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. సర్దార్ పటేల్ పేరుతో ముడిపడి ఉన్న ఏ పురస్కారమైనా గొప్ప బాధ్యతతో ముడిపడి ఉందన్నారు. గగాజీ భాయ్ చాలా తెలివిగా తనకు ఈ బాధ్యతను అప్పగించారని తనదైన హాస్యచతురతతో చెప్పారు. వాస్తవరూపం దాల్చని సర్దార్ సాహెబ్ కలలను సాకారం చేయడం, ఆయన ప్రారంభించిన పనిని పూర్తి చేయడమే తన జీవిత లక్ష్యంగా మారిందన్నారు. సభకు హాజరైన ప్రజలు అందించే ఆశీర్వాదాలు, గుజరాత్ నేల నుంచి పుణికిపుచ్చుకున్న విలువలు, నేర్చుకున్న పాఠాలే తన సంకల్పాన్ని ఎల్లప్పుడూ బలంగా ఉంచుతాయని హామీ ఇచ్చారు.
ప్రపంచం ఎంతగా గౌరవించినప్పటికీ సొంత గడ్డపై లభించే గుర్తింపు ప్రత్యేకమైన ఆనందాన్నిస్తుందన్న జనరల్ కరియప్ప మాటలను గుర్తుచేశారు. పెరుగుతున్న భారత శక్తి అంతర్జాతీయంగా గౌరవాన్ని తీసుకొస్తున్నప్పటికీ.. సొంత నేలపై లభించే ఆశీర్వాదాలు సేవ చేసే సామర్థ్యాన్ని అనేక రెట్లు పెంచుతాయని ప్రధాని పేర్కొన్నారు.
విద్యా రంగంలో సర్దార్ ధామ్ చేస్తున్న సేవలను ప్రధాని ప్రశంసించారు. ఆ సంస్థ చేపట్టిన పరివర్తనాత్మక కృషిని, విద్యావకాశాలను అందించడం ద్వారా దేశ నిర్మాణంలో ఈ సంస్థ పోషిస్తున్న కీలకపాత్రను ప్రధాని గుర్తించారు. ఈ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులు యువ సాధికారత పట్ల సామాజిక నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తున్నాయని అభినందించారు. ‘‘విద్య, అవకాశాల ద్వారా దేశ భవిష్యత్తును నిర్మించడంలో సమాజ ఉమ్మడి నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తున్న నేటి ప్రాజెక్టులకు గాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని శ్రీ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.
***
(రిలీజ్ ఐడి: 2260529)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam