కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
లేబర్ కోడ్ పరిధిలోని కార్మికుల కోసం దేశవ్యాప్తంగా
వార్షిక వైద్య పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి డాక్టర్ శ్రీ మన్సుఖ్ మాండవీయ
దేశవ్యాప్తంగా 40 ఏళ్లు పైబడిన కార్మికులందరికీ ఉచితంగా వార్షిక వైద్య పరీక్షల నిర్వహణ
కార్మిక చట్టాల కింద గిగ్, ప్లాట్ఫాం కార్మికులకు సామాజిక భద్రత కల్పించిన తొలి దేశాల్లో ఒకటిగా నిలిచిన భారత్: డాక్టర్ మాండవీయ
దేశంలో సామాజిక భద్రత పరిధి 19 నుంచి 64 శాతానికి పెరిగిందని, దీనివల్ల సుమారు 94 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతోందని కేంద్రమంత్రి వెల్లడి
పదేళ్ల కిందట 7 కోట్లుగా ఉన్న ఈఎస్ఐసీ లబ్ధిదారుల సంఖ్య నేడు దాదాపు 15 కోట్లు: డాక్టర్ మాండవీయ
నాడు పోస్టు చేయడమైనది:
07 MAY 2026 1:54PM by PIB Hyderabad
40 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న కార్మికులందరి కోసం దేశవ్యాప్త వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని ఢిల్లీ బసాయిదారాపూర్లోని ఈఎస్ఐసీ (ఈఎస్ఐసీ) వైద్య కళాశాల, ఆసుపత్రి వేదికగా నేడు కేంద్ర కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. భారతీయ శ్రామిక శక్తికి వృత్తిపరమైన ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ఈ కార్యక్రమం కీలక ప్రస్థానంగా నిలవనుంది.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులకు గౌరవం, సంక్షేమం, సామాజిక భద్రతను కల్పించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హామీని నాలుగు కార్మిక చట్టాల అమలు ప్రతిబింబిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమాన్ని ‘‘శ్రమ శక్తి’’ గౌరవానికి అంకితమైన రోజుగా అభివర్ణిస్తూ.. కార్మికులందరికీ సామాజిక భద్రతా పరిధిని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా ఉపాధి కల్పన, సంక్షేమ చర్యల ద్వారా ‘‘శ్రమ శక్తి’’, ‘‘యువ శక్తి’’ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్రమంత్రి వెల్లడించారు.
దేశంలో సామాజిక భద్రత పరిధి గణనీయంగా విస్తరించిందని.. పదేళ్ల కిందట దాదాపు 30 కోట్లుగా ఉన్న లబ్ధిదారుల సంఖ్య నేడు సుమారు 94 కోట్లకు చేరిందని ఆయన వివరించారు. దీనివల్ల సామాజిక భద్రతా పరిధి 19 శాతం నుంచి 64 శాతానికి పెరిగిందని ఆయన పేర్కొన్నారు.
అలాగే పదేళ్ల కిందట ఈఎస్ఐసీ లబ్ధిదారుల సంఖ్య దాదాపు 7 కోట్లు ఉండగా.. నేడు అది దాదాపు 15 కోట్లకు చేరిందని కేంద్రమంత్రి వెల్లడించారు.
కార్మికుల సంక్షేమం కోసం ఒక భారీ కార్యక్రమాన్ని ప్రకటిస్తూ.. ఇకపై దేశవ్యాప్తంగా 40 ఏళ్లు పైబడిన కార్మికులందరికీ ప్రతి సంవత్సరం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు.
ఆరోగ్య పరీక్షల ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ శిబిరాల ద్వారా గుర్తించిన వ్యాధులకు అవసరమైన చికిత్స, మందులను ఈఎస్ఐసీ సౌకర్యాల ద్వారా అందజేస్తామని తెలిపారు.
నాలుగు కార్మిక చట్టాల కింద తీసుకొచ్చిన కీలక సంస్కరణల గురించి కేంద్రమంత్రి వివరిస్తూ.. పురుష, మహిళా కార్మికులు సమాన వేతనం పొందేలా నిబంధనలను చేర్చినట్లు చెప్పారు. అలాగే మహిళా కార్మికులకు ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచామని పేర్కొన్నారు. మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి వద్ద నుంచే పని) నిబంధనలను కూడా ఇందులో చేర్చామని చెప్పారు.

గిగ్, ప్లాట్ఫాం కార్మికులను సామాజిక భద్రతా పరిధిలోకి తీసుకురావడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఇంకా మార్గాలను అన్వేషిస్తుండగా.. ప్రధాని శ్రీ మోదీ ప్రభుత్వం కొత్త కార్మిక చట్టాల ద్వారా వారిని ముందస్తుగానే ఆ పరిధిలోకి చేర్చిందని తెలిపారు.
ప్రమాదకరమైన వృత్తుల్లో నిమగ్నమైన కార్మికులు, 10 మంది కంటే తక్కువ కార్మికులు ఉన్న సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను కూడా ఇప్పుడు ఈఎస్ఐసీ పరిధిలోకి తీసుకువస్తున్నారని డాక్టర్ మాండవీయ తెలిపారు.
గతంలో కార్మికులు నిర్లక్ష్యానికి గురయ్యేవారని, వారి సమస్యలను ఎవరూ పట్టించుకోలేదని.. కానీ ప్రస్తుత ప్రభుత్వం వారి ఆందోళనలను పూర్తి నిబద్ధతతో, సున్నితత్వంతో పరిష్కరిస్తోందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. దేశీయ శ్రామిక శక్తికి గౌరవాన్ని, రక్షణను, మెరుగైన ఆరోగ్య సంరక్షణను అందించే లక్ష్యంతో చేపట్టిన మరో ముఖ్యమైన ప్రయత్నమే ఈ దేశవ్యాప్త ఆరోగ్య తనిఖీ కార్యక్రమమని చెప్పారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం దేశవ్యాప్తంగా మరో 11 ప్రాంతాల్లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఆసుపత్రుల్లో ఏకకాలంలో నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో రాష్ట్ర కార్మిక మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ సభ్యులు, ఉన్నతాధికారులు, యజమానుల ప్రతినిధులు, కార్మికులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఢిల్లీ ప్రభుత్వ న్యాయ, కార్మిక, ఉపాధి, అభివృద్ధి, కళా సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కపిల్ మిశ్రా, ఈఎస్ఐసీ డైరెక్టర్ జనరల్ శ్రీ అశోక్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2258708)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9