పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై అంతర్-మంత్రిత్వ శాఖల సమావేశం
ఎరువుల లభ్యత అవసరానికి మించి ఉండటంతో, పటిష్ఠంగా, సుస్థిరంగా, సమర్థంగా... భారత ఎరువుల భద్రత
యూరియా సహా భాస్వరం, పొటాషియం ఎరువుల ఉత్పత్తికి అవసరమైన ముడిపదార్థాల లభ్యతను నిరంతరం సమీక్షిస్తున్న ఎరువుల మంత్రిత్వ శాఖ
గత ఏడాదితో పోలిస్తే ఈ నెల మొదటి మూడు వారాల మొత్తం ఎగుమతుల్లో 20 శాతానికి పైగా పెరుగుదల
సుమారు 5.78 లక్షల పీఎన్జీ కనెక్షన్లకు గ్యాసిఫికేషన్ పూర్తి
అదనంగా 2.66 లక్షల కనెక్షన్ల కోసం మౌలిక సదుపాయాల కల్పన
మార్చి 2026 నుంచి కొత్త కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్న సుమారు 6.47 లక్షల మంది వినియోగదారులు
నిన్న సుమారు 70,000 – 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల పంపిణీ
ఈ నెల 3 నుంచి 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల కోసం 9,750కి పైగా అవగాహన శిబిరాలను నిర్వహించిన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు
ఈ శిబిరాల ద్వారా 1,64,000కు పైగా 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల విక్రయం
ఈ ప్రాంతంలోని భారతీయ నావికులంతా క్షేమం
గత 24 గంటల్లో భారత జెండా కలిగిన నౌకలకు సంబంధించి ఎటువంటి ఘటనలూ నమోదు కాలేదు
ఈ ప్రాంతంలోని భారతీయ నావికుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం
భారత్ తిరిగి రావడం కోసం పౌరులకు మద్దతునందిస్తూ, స్థానిక ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటున్న భారత రాయబార కార్యాలయాలు
నాడు పోస్టు చేయడమైనది:
30 APR 2026 5:45PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల గురించి భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు పౌరులకు తాజా సమాచారం అందించే ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఈ రోజు జాతీయ మీడియా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ... ఓడరేవులు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖల అధికారులు ఇంధన లభ్యత, నౌకా వాణిజ్య కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారత పౌరులకు అందుతున్న సహాయం, కీలక రంగాల్లో సుస్థిరతను కాపాడటానికి తీసుకుంటున్న చర్యలను గురించి తాజా సమాచారాన్ని అందించారు. రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఎరువుల నిల్వల పరిస్థితి, లభ్యత గురించి మీడియాకు వివరించింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ ఎగుమతులపై తాజా సమాచారాన్ని అందించింది.
ఎరువుల నిల్వల స్థితి, లభ్యత
దేశంలో ఎరువుల మొత్తం నిల్వ స్థితి
|
Product
|
As on today
|
As on today last year
|
|
Urea
|
73.32
|
72.90
|
|
DAP
|
22.38
|
15.44
|
|
NPKs
|
58.45
|
45.14
|
|
SSP
|
26.60
|
26.38
|
|
MOP
|
12.63
|
12.89
|
|
Total
|
193.38
|
172.75
|
డీఏ-ఎఫ్డబ్ల్యూ 2026 ఖరీఫ్ సీజన్ కోసం మొత్తం 390.54 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేసింది. ఈ రోజు నాటికి అందుబాటులో ఉన్న నిల్వ సుమారు 193.38 లక్షల మెట్రిక్ టన్నులు (దాదాపు 50 శాతం)గా ఉంది. ఇది సాధారణ నిల్వ కంటే గణనీయంగా సుమారు 33 శాతం అధికం. ప్రభుత్వ మెరుగైన ప్రణాళిక, ముందస్తు నిల్వలు, సమర్థ రవాణా నిర్వహణను ఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి.
రాష్ట్రాల్లో సరఫరా సమర్థంగా కొనసాగుతోంది. ఈ నెల 1 నుంచి 30వ తేదీ వరకు... యూరియా లభ్యత అవసరాల కంటే గణనీయంగా ఎక్కువగా ఉంది. 22.91 లక్షల మెట్రిక్ టన్నుల అవసరానికి గానూ 73.81 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా లభ్యత... 7.44 లక్షల మెట్రిక్ టన్నుల అవసరానికి గానూ 23.47 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ లభ్యత... 2.18 లక్షల మెట్రిక్ టన్నుల అవసరానికి గానూ 8.54 లక్షల మెట్రిక్ టన్నుల ఎమ్వోపీ లభ్యత... 9.40 లక్షల మెట్రిక్ టన్నుల అవసరానికి గాను 54.04 లక్షల మెట్రిక్ టన్నుల ఎన్పీకే లభ్యత... 4.16 లక్షల మెట్రిక్ టన్నుల అవసరానికి గానూ 26.20 లక్షల మెట్రిక్ టన్నుల ఎస్ఎస్పీ లభ్యత నమోదైంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించి ప్రారంభ పరిస్థితి అత్యంత బలంగా ఉందని ఇది స్పష్టంగా సూచిస్తోంది.
ప్రధాన ఎరువుల ఎంఆర్పీ – ప్రధాన ఎరువుల ఎంఆర్పీలో ఎటువంటి మార్పు లేదు
|
Product
|
(Rs. Per Bag)
|
|
Urea
|
266.5
|
|
DAP
|
1350
|
|
TSP
|
1300
|
సంక్షోభానంతరం ఎరువుల దేశీయ ఉత్పత్తి, దిగుమతి
|
Product
|
Domestic production after crisis
|
Import reached on Indian Ports after crisis
|
|
Urea
|
37.49
|
9.98
|
|
DAP
|
4.79
|
0.76
|
|
NPKs
|
12.69
|
2.55
|
|
SSP
|
7.40
|
0
|
|
MOP
|
0
|
2.10
|
|
Total
|
62.37
|
15.39
|
సంక్షోభ పరిస్థితి అనంతరం, సుమారు 78 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అదనంగా అందుబాటులోకి వచ్చాయి.
ఈ నెలలో యూరియా ఉత్పత్తిలో దాదాపు 20.8–21 లక్షల మెట్రిక్ టన్నుల దేశీయ ఉత్పత్తి సాధ్యపడింది. గత ఏడాది ఏప్రిల్ నెలలో ఈ ఉత్పత్తి 21.89 లక్షల మెట్రిక్ టన్నులుగా నమోదైంది.
ప్రపంచ యూరియా టెండర్ – ఫిబ్రవరి చివరి నుంచి ఇప్పటి వరకు, మొత్తం 38.07 లక్షల మెట్రిక్ టన్నుల (13.07 లక్షల మెట్రిక్ టన్నుల ఆర్సీఎఫ్ + 25 లక్షల మెట్రిక్ టన్నుల ఐపీఎల్) యూరియాను భారత్ పొందింది.
డీఏపీ, టీఎస్పీ, అమ్మోనియం సల్ఫేట్ కోసం ప్రపంచ స్థాయి టెండర్ - భారతీయ ఎరువుల సంస్థలు శుక్రవారం, అంటే 24.04.2026న 12 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ, 4 లక్షల మెట్రిక్ టన్నుల టీఎస్పీ, 3 లక్షల మెట్రిక్ టన్నుల అమ్మోనియం సల్ఫేట్ల సేకరణ కోసం ఒక సమగ్ర ప్రపంచ స్థాయి టెండర్ను జారీ చేశాయి. పంటల సాగు ముమ్మరంగా సాగే కీలక సమయంలో ఈ ఎరువుల లభ్యత తగినంతగా ఉండేలా చూడటానికి ఇవి సహాయపడతాయి.
ఎరువుల ఉత్పత్తికి అంటే యూరియా సహా పొటాషియం, భాస్వరం ఎరువుల ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాల లభ్యతను ఎరువుల శాఖ నిరంతరం సమీక్షిస్తోంది.
ఎరువుల లభ్యత తగినంత ఉండేలా నిర్ధారించడానికి ఇప్పటివరకు ఈజీవోఎస్ 6 సమావేశాలు నిర్వహించింది. లభ్యతకు సంబంధించిన చాలా సవాళ్లనూ ఈజీవోఎస్ పరిష్కరించింది.
అన్ని ప్రధాన ఎరువుల విషయంలోనూ లభ్యత నిరంతరం అవసరానికి మించి ఉండటంతో, భారత ఎరువుల భద్రత పటిష్ఠంగా, స్థిరంగా, సమర్థ నిర్వహణలో ఉంది.
వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి తాజా సమాచారం:
ఏప్రిల్ 2026 మొదటి మూడు వారాల్లో (ఏప్రిల్ 1 నుంచి 21 వరకు) మొత్తం ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే 20 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి.
2026 ఏప్రిల్ 1 నుంచి 21వ తేదీ మధ్య కాలంలో, ఎగుమతులు గణనీయంగా పెరిగిన ప్రధాన ఉత్పత్తులు పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు.
ఇంధన సరఫరా, ఇంధన లభ్యత
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో... పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చూసేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వం వివరించింది. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ప్రస్తుత ఇంధన సరఫరా పరిస్థితిపై తాజా సమాచారాన్ని అందించింది. ఈ సందర్భంగా కింది విషయాలు తెలియజేసింది:
ప్రజలకు సూచనలు, పౌరులకు అవగాహన
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీల లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నందున, పౌరులు వీటిని భయాందోళనతో కొనుగోలు చేయడం మానుకోవాలి.
వదంతుల పట్ల అప్రమత్తంగా ఉంటూ, సరైన సమాచారం కోసం అధికారిక వనరులపై ఆధారపడాలి.
ఎల్పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ ప్లాట్ఫారమ్లను ఉపయోగించుకోవాలనీ, పంపిణీదారుల వద్దకు వెళ్లడం మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పీఎన్జీ, విద్యుత్, ఇండక్షన్ కుక్టాప్ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించాల్సిందిగా పౌరులను ప్రోత్సహిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో, పౌరులంతా తమ రోజువారీ వినియోగంలో ఇంధనాన్ని పొదుపు చేయాలని కోరడమైనది.
ప్రభుత్వ సంసిద్ధత, సరఫరా నిర్వహణ చర్యలు
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో గృహావసరాల కోసం ఎల్పీజీ, పీఎన్జీ, సీఎన్జీ (రవాణా)లకు 100 శాతం సరఫరా జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
వాణిజ్య ఎల్పీజీ సరఫరాలో ఆసుపత్రులకు, విద్యా సంస్థలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఔషధ, ఉక్కు, ఆటోమొబైల్, విత్తన, వ్యవసాయ రంగాలకూ ప్రాధాన్యత కొనసాగిస్తున్నారు. 2026 మార్చి 2, 3 తేదీల్లో నమోదైన సగటు రోజువారీ సరఫరా ఆధారంగా వలస కార్మికులకు అందించే 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల సరఫరాను రెట్టింపు చేశారు.
సరఫరా, డిమాండ్ రెండు వైపులా ప్రభుత్వం ఇప్పటికే అనేక హేతుబద్ధీకరణ చర్యలను అమలు చేసింది. వీటిలో రిఫైనరీ ఉత్పత్తి పెంపుదల... పట్టణ ప్రాంతాల్లో బుకింగ్ విరామాన్ని 21 రోజుల నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకూ పెంచడం... సరఫరా విషయంలో నిర్దిష్ట రంగాలకు ప్రాధాన్యమివ్వడం వంటి చర్యలు ఉన్నాయి.
ఎల్పీజీ డిమాండ్పై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలు అందుబాటులో ఉంచుతున్నారు.
చిన్న, మధ్య తరహా వినియోగదారులకు పంపిణీ చేసే నిమిత్తం రాష్ట్రాలకు అదనపు బొగ్గును కేటాయించాలని బొగ్గు మంత్రిత్వ శాఖ 'కోల్ ఇండియా', 'సింగరేణి కాలరీస్'లను ఆదేశించింది.
గృహ, వాణిజ్య వినియోగదారులు కొత్త పీఎన్జీ కనెక్షన్లను పొందుటను సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ ప్రయత్నాలు
నిత్యావసర వస్తువుల చట్టం-1955, ఎల్పీజీ నియంత్రణ ఉత్తర్వులు-2000 ప్రకారం సరఫరాను పర్యవేక్షించడం... అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది.
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ వంటి నిత్యావసర వస్తువుల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడంలో, నియంత్రించడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంది. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు లేఖలు, వీడియో అనుసంధానాల ద్వారా పునరుద్ఘాటించింది.
తగినంత ఇంధన లభ్యతపై పౌరులకు భరోసా కల్పించేందుకు, ప్రజలకు ముందస్తుగా సమాచారం ఇవ్వాల్సిన ఆవశ్యకతను భారత ప్రభుత్వం 27.03.2026, 02.04.2026 తేదీల నాటి లేఖల ద్వారా స్పష్టం చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో నిరంతరం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. 02.04.2026న (ఎమ్వోపీఎన్జీ కార్యదర్శి అధ్యక్షతన), 06.04.2026న (ఎమ్వోపీఎన్జీ కార్యదర్శితో పాటు సమాచార-ప్రసార శాఖ, వినియోగదారుల వ్యవహారాల శాఖల కార్యదర్శుల అధ్యక్షతన) సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో కింది అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు:
-
రోజువారీ పత్రికా సమావేశాలను నిర్వహించడం, క్రమం తప్పకుండా ప్రజలకు సూచనలు జారీ చేయడం.
-
సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, తప్పుడు సమాచారాన్ని చురుగ్గా పర్యవేక్షించడం, తిప్పికొట్టడం.
-
జిల్లా యంత్రాంగం ద్వారా రోజువారీ అమలు చర్యలను ముమ్మరం చేయడం, ఓఎమ్సీలతో సమన్వయం ద్వారా సోదాలు, తనిఖీలను కొనసాగించడం.
-
తమ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో వాణిజ్య ఎల్పీజీ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం
-
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన అదనపు ఎస్కేవో కోసం ఎస్కేవో కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.
-
పీఎన్జీ వినియోగాన్ని, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం.
-
ముఖ్యంగా గృహావసరాల కోసం ఎల్పీజీ సరఫరాకు ప్రాధాన్యమివ్వడం. సరఫరా స్థిరత్వాన్ని నిర్ధారించడానికి లక్ష్యానికి అనుగుణంగా 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల పంపిణీని అమలు చేయడం.
-
అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూమ్లను, జిల్లా పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశాయి.
-
అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పత్రికా ప్రకటనలను జారీ చేస్తున్నాయి, సమావేశాలను నిర్వహిస్తున్నాయి.
అమలు, పర్యవేక్షణ చర్యలు
ఎల్పీజీ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్లను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా తనిఖీ చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 2,300కు పైగా సోదాలు నిర్వహించారు.
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేసి, 336 ఎల్పీజీ పంపిణీ కేంద్రాలకు జరిమానాలు విధించాయి. నిన్నటి వరకు 72 ఎల్పీజీ పంపిణీ కేంద్రాల లైసెన్సును నిలిపివేశాయి.
29.04.2026న, 50 మంది ఎల్పీజీ పంపిణీదారులకు సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. 11 పంపిణీ సంస్థలకు జరిమానాలు విధించారు.
గృహ వినియోగ ఎల్పీజీ సరఫరా పరిస్థితి:
• ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల వల్ల ఎల్పీజీ సరఫరాపై ప్రభావం కొనసాగుతోంది.
• గృహ వినియోగదారులకు ఎల్పీజీ సరఫరాలో మొదటి ప్రాధాన్యత ఇచ్చారు.
• ఎల్పీజీ పంపిణీ కేంద్రాల వద్ద నిల్వలు అయిపోయినట్లు ఎక్కడా నమోదు కాలేదు.
• పరిశ్రమ గణాంకాల ప్రకారం నిన్న ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు 98 శాతానికి పెరిగాయి.
• సిలిండర్ల పంపిణీ పక్కదారి పట్టకుండా నిరోధించేందుకు డెలివరీ అథెంటికేషన్ కోడ్(డీఏసీ) ఆధారిత పంపిణీ 93 శాతానికి పైగా పెరిగింది. వినియోగదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఈ కోడ్ అందుతుంది.
• 29.04.2026న సుమారు 43 లక్షల ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్లకు గాను, 47 లక్షల పైగా సిలిండర్లను పంపిణీ చేశారు.
వాణిజ్య ఎల్పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు:
• సంస్కరణల ఆధారిత 10 శాతం కేటాయింపుతో కలిపి మొత్తం వాణిజ్య ఎల్పీజీ సరఫరాను సంక్షోభానికి ముందు ఉన్న సుమారు 70 శాతం స్థాయికి పెంచారు.
• భారత ప్రభుత్వం 06.04.2026 తేదీ లేఖ ద్వారా ప్రతి రాష్ట్రంలో వలస కార్మికులకు అందజేసే 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల రోజువారీ పరిమాణాన్ని రెట్టింపు చేస్తున్నట్లు తెలిపింది. 21.03.2026 లేఖలో పేర్కొన్న 20 శాతం పరిమితి కంటే అదనంగా, మార్చి 2-3, 2026 తేదీల మధ్య వలస కార్మికులకు చేసిన సగటు రోజువారీ సరఫరా ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) సహాయంతో ఆయా రాష్ట్రాల్లోని వలస కార్మికులకు మాత్రమే సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద అందుబాటులో ఉంటాయి.
• ఫిబ్రవరి 2026 నెలలో మొత్తం 21.7 లక్షల 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి. ఏప్రిల్ 1, 2026 నుంచి సుమారు 21.75 లక్షల 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్లు విక్రయించారు.
• నిన్న సుమారు 70 వేల 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్లను పంపిణీ చేశారు.
• ఏప్రిల్ 3, 2026 నుంచి ప్రభుత్వ రంగ చమురు విక్రయ సంస్థలు 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్లపై 9750 పైగా అవగాహన శిబిరాలు నిర్వహించాయి, వీటి ద్వారా 1,64,000 పైగా 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి.
• నిన్న సుమారు 190 శిబిరాల ద్వారా 5663 ఐదు కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్లు విక్రయించారు.
•ఐఓసీఎల్, హెచ్పీసీఎల్ ,బీపీసీఎల్ సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో, పరిశ్రమల విభాగాలతో కలిసి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో వాణిజ్య ఎల్పీజీ పంపిణీని సమన్వయం చేస్తోంది.
• ఏప్రిల్ నెలలో (29.04.26 వరకు) మొత్తం 1,92,532 మెట్రిక్ టన్నుల (101.33 లక్షల పైగా 19 కిలోల ఎల్పీజీ సిలిండర్లతో సమానం) వాణిజ్య ఎల్పీజీ అమ్ముడైంది.
• 29.04.2026న 8489 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్పీజీ (4.46 లక్షల పైగా 19 కిలోల సిలిండర్లతో సమానం) విక్రయించారు.
• ఫిబ్రవరిలో జరిగిన సుమారు 5000 మెట్రిక్ టన్నుల విక్రయాలతో పోలిస్తే, ఏప్రిల్ నెలలో (29.04.2026 వరకు) ఆటో ఎల్పీజీ అమ్మకాలు సుమారు 10250 మెట్రిక్ టన్నులుగా నమోదయ్యాయి.
• జనవరి, ఫిబ్రవరి నెలల్లో సగటున రోజుకు సుమారు 177 మెట్రిక్ టన్నులుగా ఉన్న ఆటో ఎల్పీజీ అమ్మకాలు, ఏప్రిల్ నెలలో (29.04.26 వరకు) రోజుకు సుమారు 353 మెట్రిక్ టన్నులకు చేరాయి. ప్రభుత్వ రంగ చమురు విక్రయ సంస్థల ఆటో ఎల్పీజీ అమ్మకాల్లో ఇది సుమారు 100 శాతం వృద్ధిని సూచిస్తోంది.
సహజ వాయు సరఫరా, పీఎన్జీ విస్తరణ చర్యలు:
• గృహ పీఎన్జీ, రవాణా సీఎన్జీ విభాగాలకు 100 శాతం సరఫరా చేస్తూ వినియోగదారులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు.
• ఎరువుల కర్మాగారాలకు మొత్తం గ్యాస్ కేటాయింపును వారి ఆరు నెలల సగటు వినియోగంలో సుమారు 95 శాతానికి పెంచారు.
• వీటితో పాటు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) నెట్వర్క్ల ద్వారా అందే సరఫరాతో సహా ఇతర పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరాను 80 శాతం వరకు పెంచారు.
•వాణిజ్య ఎల్పీజీ లభ్యతకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం, హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్జీ కనెక్షన్లు ప్రాధాన్యత క్రమంలో ఇవ్వాలని సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలకు సూచించారు.
• ఐజీఎల్, ఎంజీఎల్, గెయిల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు గృహ, వాణిజ్య పీఎన్జీ కనెక్షన్లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి.
•సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ల విస్తరణకు అవసరమైన అనుమతులను వేగవంతం చేయాలని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల, కేంద్ర మంత్రిత్వ శాఖలను కోరారు.
• ఎల్పీజీ నుంచి పీఎన్జీకి దీర్ఘకాలిక మార్పునకు సహకరించే రాష్ట్రాలకు, అదనంగా 10 శాతం వాణిజ్య ఎల్పీజీ కేటాయింపును అందిస్తున్నట్లు భారత ప్రభుత్వం 18.03.2026 లేఖ ద్వారా వెల్లడించింది.
• పీఎన్జీ విస్తరణ సంస్కరణలకు అనుగుణంగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అదనపు వాణిజ్య ఎల్పీజీ కేటాయింపులను పొందుతున్నాయి.
•రోడ్లు, రహదారుల మంత్రిత్వ శాఖ 24.03.26 లేఖ ద్వారా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ మౌలిక సదుపాయాల కోసం వేగవంతమైన అనుమతుల విధానాన్ని అమలులోకి తెచ్చింది. దీని ద్వారా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ మౌలిక సదుపాయాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యత ప్రాతిపదికన పరిష్కరించేందుకు, ప్రత్యేకంగా 3 నెలల పాటు గడువు సమయాన్ని తగ్గించారు.
•భారత ప్రభుత్వం 24.03.2026 నాటి గెజిట్ ద్వారా నిత్యావసర వస్తువుల చట్టం, 1955 కింద పైప్లైన్లు, ఇతర సౌకర్యాల ఏర్పాటు, నిర్మాణం, నిర్వహణ,విస్తరణ ద్వారా సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ ఉత్తర్వు, 2026ను నోటిఫై చేసింది. ఈ ఉత్తర్వు దేశవ్యాప్తంగా పైప్లైన్ల ఏర్పాటు, విస్తరణ కోసం క్రమబద్ధమైన, కాలపరిమితితో కూడిన విధానాన్ని అందిస్తుంది. ఇది అనుమతులలో జాప్యం, భూసేకరణ సమస్యలను పరిష్కరిస్తూ, నివాస ప్రాంతాలతో సహా సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి వీలు కల్పిస్తుంది. ఈ చర్య పీఎన్జీ నెట్వర్క్ వృద్ధిని వేగవంతం చేయడంతో పాటు, మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచుతుందని, స్వచ్ఛమైన ఇంధనాల వైపు మార్పునకు మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. తద్వారా ఇంధన భద్రత బలపడటమే కాకుండా భారత గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుంది.
• గృహ పీఎన్జీ కనెక్షన్లను వేగవంతం చేయాలని పిఎన్జీఆర్బి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలను ఆదేశించింది. అలాగే, పీఎన్జీ విస్తరణ వేగాన్ని కొనసాగించేందుకు నేషనల్ పీఎన్జీ డ్రైవ్ 2.0 గడువును 30.06.2026 వరకు పొడిగించారు.
• స్వచ్ఛమైన, సురక్షితమైన, స్వయం సమృద్ధి కలిగిన ఇంధన భవిష్యత్తును ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం రాష్ట్రాలకు ఒక నమూనా సీబీజీ విధానాన్ని రూపొందించింది. రాష్ట్రాలు తమ సొంత పెట్టుబడిదారుల అనుకూల, అమలు ఆధారిత సీబీజీ అభివృద్ధి వ్యవస్థను నిర్మించుకోవడానికి ఈ నమూనా విధానం ఒక సమగ్రమైన, సరళమైన మార్గదర్శిగా ఉపయోగపడుతుంది. ఈ విధానాన్ని ఎంచుకునే రాష్ట్రాలకు తదుపరి విడత అదనపు వాణిజ్య ఎల్పీజీ కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తారు.
• పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 07.04.2026 ఉత్తర్వు ద్వారా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లేదా మౌలిక సదుపాయాల ఏర్పాటుకు లేదా నిర్వహణకు అవసరమైన అనుమతులను 15 రోజుల్లోగా మంజూరు చేయాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి లేదా కమిటీలకు తగిన సూచనలు ఇవ్వాలని పేర్కొంది.
• మార్చి 2026 నుంచి ఇప్పటివరకు సుమారు 5.78 లక్షల పీఎన్జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా ప్రారంభమైంది. అదనంగా 2.66 లక్షల కనెక్షన్ల కోసం మౌలిక సదుపాయాలు సిద్ధం చేశారు. దీనితో మొత్తం సంఖ్య 8.44 లక్షలకు చేరుకుంది. అలాగే, కొత్త కనెక్షన్ల కోసం సుమారు 6.47 లక్షల మంది వినియోగదారులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
* 29.04.2026 వరకు, 43,050 పైగా పీఎన్జీ వినియోగదారులు మైపీఎన్జీడీ.ఇన్ వెబ్సైట్ ద్వారా తమ ఎల్పీజీ కనెక్షన్లను వదులుకున్నారు.
ముడి చమురు నిల్వలు, శుద్ధి కర్మాగారాల నిర్వహణ
• అన్ని చమురు శుద్ధి కర్మాగారాలు తగినంత ముడి చమురు నిల్వలతో పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయి. అలాగే పెట్రోల్, డీజిల్ నిల్వలు కూడా సరిపడా అందుబాటులో ఉన్నాయి.
• గృహ వినియోగానికి మద్దతుగా శుద్ధి కర్మాగారాల నుంచి దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని పెంచారు.
• దేశీయ మార్కెట్ కోసం పెట్రోకెమికల్ ముడిపదార్ధాల సరఫరా అందుబాటులో ఉండేలా చూసేందుకు అంతర్ మంత్రిత్వ శాఖల అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేశారు. దీనిని అనుసరించి, సెంటర్ ఫర్ హై టెక్నాలజీ (సీహెచ్టీ) గుర్తించిన కీలక రంగాల కోసం నిర్ణీత కనీస పరిమాణంలో సీ3, సీ4 స్ట్రీమ్స్ అందుబాటులో ఉంచాలని పెట్రోకెమికల్ కాంప్లెక్స్లతో సహా చమురు శుద్ధి సంస్థలను ఆదేశిస్తూ భారత ప్రభుత్వం 01.04.2026 ఉత్తర్వు ద్వారా అనుమతి ఇచ్చింది.
• ఔషధ విభాగం, రసాయనాలు,పెట్రో రసాయనాల విభాగం (డీసీపీసీ), పరిశ్రమల అభివృద్ధి, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) నుంచి అందిన అభ్యర్థనల మేరకు, ఔషధ, రసాయన రంగ సంస్థల కోసం ఎల్పీజీ నిల్వల నుంచి రోజుకు 1000 మెట్రిక్ టన్నుల కేటాయింపు చేశారు.
• ఏప్రిల్ 9, 2026 నుంచి ముంబయి, కొచ్చి, వైజాగ్, చెన్నై, మథుర శుద్ధి కర్మాగారాల ద్వారా రసాయన, ఔషధ, రంగుల పరిశ్రమలకు 9400 మెట్రిక్ టన్నుల పైగా ప్రొపిలీన్, 1000 మెట్రిక్ టన్నుల పైగా బ్యూటైల్ అక్రిలేట్ విక్రయించారు.
రిటైల్ ఇంధన లభ్యత, ధరల నియంత్రణ చర్యలు:
• దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ విక్రయ కేంద్రాలు యధాతథంగా పని చేస్తున్నాయి.
• పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ముడి చమురు ధరలు అసాధారణంగా పెరిగాయి. అయితే, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 చొప్పున తగ్గించింది.
• భారత ప్రభుత్వం 11.04.2026 గెజిట్ నోటిఫికేషన్ ద్వారా దేశీయ మార్కెట్లో డీజిల్, ఏటీఎఫ్ లభ్యత కోసం డీజిల్ పై ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ. 55.50 కు, ఏటీఎఫ్ పై లీటరుకు రూ.42 కు పెంచింది.
• వదంతుల కారణంగా కొన్ని రిటైల్ విక్రయ కేంద్రాల వద్ద ప్రజలు ఆందోళనతో ఇంధనాన్ని అధికంగా కొనుగోలు చేయడం కనిపిస్తోంది. దేశంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం ఎప్పటికపుడు తెలియచేస్తోంది. పెట్రోల్, డీజిల్ సాధారణ రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రభుత్వ రంగ చమురు విక్రయ సంస్థల కేంద్రాల వద్ద కూడా ఎలాంటి ధరల పెంపూ లేదు.
కిరోసిన్ లభ్యత - పంపిణీ చర్యలు
• రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలకు సాధారణ కేటాయింపులతో పాటు అదనంగా 48,000 కిలో లీటర్ల కిరోసిన్ను కేటాయించారు.
•18 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు కిరోసిన్ (ఎస్కేఓ) కేటాయింపు ఉత్తర్వులను జారీ చేశాయి, అయితే హిమాచల్ ప్రదేశ్, లడఖ్ తమకు అవసరం లేదని తెలియజేశాయి.
సముద్ర భద్రత - షిప్పింగ్ కార్యకలాపాలు
పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న సముద్ర స్థితిగతులపై నౌకాయాన, ఓడరేవులు, జలమార్గాల మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని అందించింది. ఆ ప్రాంతంలోని భారతీయ నౌకలు, సిబ్బంది భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను పేర్కొంది:
• నౌకాయాన సిబ్బంది సంక్షేమం, నిరంతరాయమైన సముద్ర కార్యకలాపాల కోసం నౌకాయాన, ఓడరేవులు, జలమార్గాల మంత్రిత్వ శాఖ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారతీయ మిషన్లు, సముద్ర వ్యాపార భాగస్వాములతో నిరంతరం సమన్వయం చేసుకుంటోంది.
• ఆ ప్రాంతంలోని భారతీయ నౌకాయాన సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారత జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదు.
• షిప్పింగ్ డైరెక్టరేట్ జనరల్ కంట్రోల్ రూమ్ తాజా సమాచారం: కంట్రోల్ రూమ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 8,155 కాల్స్, 17,399 పైగా ఈమెయిల్స్ను పరిష్కరించింది. గత 24 గంటల్లో, 121 కాల్స్, 285 ఈమెయిల్స్ అందాయి.
• షిప్పింగ్ డైరెక్టరేట్ జనరల్ ద్వారా మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు 2,857మందికి పైగా భారత నౌకాయాన సిబ్బందిని సురక్షితంగా స్వదేశానికి రప్పించింది; వీరిలో గత 24 గంటల్లో గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 28 మంది కూడా ఉన్నారు.
•దేశవ్యాప్తంగా ఓడరేవు కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయి.ఎక్కడా రద్దీ ఉన్నట్లు సమాచారం లేదు.
భారత పౌరుల భద్రత
గల్ఫ్, పశ్చిమ ఆసియా ప్రాంతంలోని పరిణామాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఆ ప్రాంతంలోని భారతీయుల భద్రత, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది.
• మంత్రిత్వ శాఖలోని ప్రత్యేక కంట్రోల్ రూమ్ భారతీయ పౌరులు, వారి కుటుంబాల సందేహాలకు సమాధానమిచ్చేందుకు నిరంతరం పని చేస్తోంది.
• సమాచారాన్ని పంచుకోవడానికి, సమన్వయంతో ప్రయత్నాలను వేగవంతం చేయడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రపాలిత ప్రాంతాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.
• భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు మన పౌరులకు సకాలంలో సహాయం అందించడానికి నిరంతరం హెల్ప్లైన్లను నిర్వహిస్తూ చురుకుగా సహాయ సహకారాలు అందిస్తున్నాయి. అలాగే స్థానిక ప్రభుత్వాలతో కూడా అవి నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి.
• స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాలు, విమాన, ప్రయాణ పరిస్థితులు, కాన్సులర్ సేవలు, భారతీయ సమాజం కోసం చేపడుతున్న వివిధ సంక్షేమ చర్యలకు సంబంధించిన సమాచారంతో కూడిన సలహాలను ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నారు.
• భారతీయ మిషన్లు అక్కడ నివసిస్తున్న భారతీయ సమాజంతో చురుకుగా నిమగ్నమై ఉన్నాయి. వారి ఆందోళనలను పరిష్కరించడానికి భారతీయ అసోసియేషన్లు, సంస్థలు, ఉద్యోగ బృందాలు, భారతీయ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి.
• ఆ ప్రాంతంలోని భారతీయ నౌకాయాన సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. స్థానిక అధికారులు, ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవడం, కాన్సులర్ సహాయాన్ని అందించడం, తిరిగి భారతదేశానికి రావాలనుకునే వారి అభ్యర్థనలను పరిష్కరించడం వంటి అన్ని రకాల సహాయ సహకారాలను భారతీయ మిషన్లు అందిస్తున్నాయి.
• ఆ ప్రాంతం నుంచి భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు అదనపు విమానాలు నడుస్తుండటంతో, మొత్తం మీద విమాన ప్రయాణ పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి.
•యూఏఈలో, విమానయాన సంస్థలు భద్రత, నిర్వహణ అంశాలను పరిగణనలోకి తీసుకుని యూఏఈ, భారత్ మధ్య పరిమిత స్థాయిలో వాణిజ్య విమానాలను నడుపుతున్నాయి. నేడు యూఏఈ,భారత్ మధ్య సుమారు 110 విమానాలు నడుస్తాయని అంచనా.
• సౌదీ అరేబియా, ఒమన్లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారతదేశంలోని వివిధ నగరాలకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.
• ఖతార్ గగనతలాన్ని పాక్షికంగా తెరవటంతో, ఖతార్ ఎయిర్వేస్ భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు విమానాలను నడుపుతోంది. ఎయిర్ ఇండియా,ఇండిగో సంస్థలు కూడా త్వరలో ఖతార్ నుంచి భారత్కు విమాన సర్వీసులను పునఃప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
• కువైట్ గగనతలం తెరవడంతో జజీరా ఎయిర్వేస్, కువైట్ ఎయిర్వేస్ కువైట్ నుంచి భారత్కు కొన్ని విమాన సర్వీసులను పునఃప్రారంభించాయి.
• బహ్రెయిన్ గగనతలం తెరవడంతో గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ నుంచి భారతదేశంలోని వివిధ నగరాలకు విమానాలను నడుపుతోంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో సంస్థలు కూడా త్వరలో బహ్రెయిన్ నుంచి భారత్కు విమాన సర్వీసులను పునఃప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
• ఇరాక్ గగనతలం కూడా తెరిచారు. ఆ ప్రాంతంలోని ఇతర నగరాలకు పరిమిత విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుని ప్రయాణికులు భారతదేశానికి చేరుకోవచ్చు.
• ఇరాన్ గగనతలాన్ని కార్గో, చార్టర్డ్ విమానాల కోసం పాక్షికంగా తెరిచారు. భారతీయ పౌరులను ఇరాన్కు ప్రయాణించవద్దని సూచించారు. ఇప్పటికే అక్కడ ఉన్నవారు భారత రాయబార కార్యాలయ మద్దతుతో భూ సరిహద్దు మార్గాల ద్వారా ఇరాన్ విడిచి వెళ్లాలని కోరారు. టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం ఇప్పటి వరకు 2,485 మంది భారతీయ పౌరులను భూ సరిహద్దు మార్గాల ద్వారా ఇరాన్ నుంచి తరలించే ప్రక్రియను సులభతరం చేసింది.
• ఇజ్రాయెల్ గగనతలం తెరవడంతో ఆ ప్రాంతంలోని ఇతర నగరాలకు పరిమిత విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. వీటిని భారతదేశానికి వచ్చే ప్రయాణాల కోసం ఉపయోగించుకోవచ్చు.
***
(రిలీజ్ ఐడి: 2257136)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam