ప్రధాన మంత్రి కార్యాలయం
ఏప్రిల్ 27–28 తేదీల్లో సిక్కింలో ప్రధాని పర్యటన
గ్యాంగ్టక్లో సిక్కిం రాష్ట్ర 50వ అవతరణోత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని
రాష్ట్రవ్యాప్తంగా రూ. 4,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
మౌలిక సదుపాయాలు, అనుసంధానం, ఆరోగ్య రక్షణ, విద్య, విద్యుత్, పట్టణాభివృద్ధి, పర్యావరణం, పర్యాటకం, వ్యవసాయం వంటి అనేక రంగాల్లో విస్తరించి ఉన్న ప్రాజెక్టులు
సిక్కింలో సంపూర్ణ, సమ్మిళిత అభివృద్ధిని వేగవంతం చేయడమే ప్రాజెక్టుల లక్ష్యం
నాడు పోస్టు చేయడమైనది:
26 APR 2026 3:47PM by PIB Hyderabad
2026 ఏప్రిల్ 27, 28 తేదీల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సిక్కింలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 27న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన గ్యాంగ్టక్ చేరుకుంటారు. ఏప్రిల్ 28న ఉదయం దాదాపు 9:30 గంటలకు గ్యాంగ్టక్లోని ఆర్కిడేరియాన్ని ప్రధానమంత్రి సందర్శిస్తారు. సిక్కిం రాష్ట్ర పర్యావరణ, పుష్ప వైభవాన్ని చాటేలా.. అత్యాధునిక, ప్రపంచ స్థాయి ఆర్కిడ్ అనుభూతి కేంద్రంగా స్వర్ణజయంతి మైత్రీ మంజరి పార్కును అభివృద్ధి చేశారు.
అనంతరం ఉదయం దాదాపు 10 గంటల సమయంలో పాల్జోర్ స్టేడియంలో సిక్కిం 50వ రాష్ట్ర అవతరణోత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రూ. 4,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సభనుద్దేశించి ప్రసంగిస్తారు.
మౌలిక సదుపాయాలు, రవాణా, ఆరోగ్య రక్షణ, విద్య, విద్యుత్, పట్టణాభివృద్ధి, పర్యావరణం, పర్యాటకం, వ్యవసాయం వంటి అనేక రంగాలకు చెందిన ఈ ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. సిక్కింలో సంపూర్ణ, సమ్మిళిత అభివృద్ధిని వేగవంతం చేయడమే వీటి లక్ష్యం.
వైద్య రంగంలో భాగంగా.. నామ్చీ జిల్లాలోని యాంగాంగ్లో 100 పడకల ఆయుర్వేద ఆస్పత్రికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. అలాగే ఎన్ఐటీ డియోరాలి వద్ద 30 పడకల సమీకృత సోవా రిగ్పా ఆస్పత్రిని ఆయన ప్రారంభిస్తారు. తద్వారా రాష్ట్రంలో సంప్రదాయ, సమగ్ర వైద్య విధానాలు ప్రజలకు మరింత మెరుగ్గా అందుబాటులోకి వస్తాయి.
విద్యా రంగం విషయానికొస్తే.. యాంగాంగ్లో సిక్కిం విశ్వవిద్యాలయం శాశ్వత ప్రాంగణాన్ని, చాకుంగ్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ ఆఫ్ ఎక్సలెన్స్ పరిపాలన విభాగాన్ని, గ్యాంగ్టక్ జిల్లా సోచేగాంగ్లో హెలెన్ లెప్చా వైద్య కళాశాలను, గ్యాల్షింగ్ జిల్లా డెంటమ్లో డెంటమ్ ప్రొఫెషనల్ కాలేజీని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. వీటితోపాటు హీ గ్యాథంగ్లో ఆదర్శ ఆవాస పాఠశాలలను, మాంగన్ జిల్లా మాంగ్శిలాలో కొత్త ఆదర్శ డిగ్రీ కాలేజీని, నామ్చీ జిల్లా బూంతార్ గుంపాలో మొనాస్టిక్ హాస్టల్-క్లాస్రూమును ఆయన ప్రారంభిస్తారు. అలాగే సిక్కింలోని 160 పాఠశాలల్లో ఐటీ ఆధారిత విద్యా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలును కూడా శ్రీ మోదీ ప్రారంభిస్తారు.
సిక్కింలో రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపరచడం కోసం.. నామ్చీ, గ్యాంగ్టక్ జిల్లాలను కలుపుతూ సిర్వాని, దిగువ శామ్డాంగ్ వద్ద తీస్తా నదిపై నిర్మించనున్న రెండు వరుసల హింజ్డ్ స్టీల్ ఆర్చ్ వంతెనలు రెండింటికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. వీటితోపాటు బిర్ధాంగ్ నుంచి కిచ్చుదుమ్రా మీదుగా నామ్చీ వరకు ఉన్న రహదారి విస్తరణ, బలోపేతం పనులను కూడా ఆయన ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టుల వల్ల జిల్లాల మధ్య రాకపోకలు సులభతరమవ్వడమే కాకుండా, ప్రయాణ సామర్థ్యం పెరుగుతుంది. ప్రయాణికులు, సరుకుల రవాణా అంతరాయం లేకుండా సాగుతుంది.
విద్యుత్ రంగానికి సంబంధించి.. గాంగ్టక్లో విద్యుత్ ప్రసార, పంపిణీ నెట్వర్క్ అభివృద్ధి, నవీకరణ, పునరుద్ధరణ పనులను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం తొలగిపోయి బలోపేతమవుతుంది.
పట్టణాభివృద్ధి, పరిపాలన మౌలిక సదుపాయాల్లో భాగంగా.. గ్యాంగ్టక్లోని లుమ్సే వద్ద జనసేవా సచివాలయం (మినీ సెక్రటేరియట్), సివిల్ సర్వీస్ అధికారుల సంస్థను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. వీటితోపాటు లింగ్డింగ్లో సిక్కిం అర్బన్ గరీబ్ ఆవాస్ యోజన, పోలీసు సిబ్బంది కోసం గృహ సముదాయాలు, ఎస్ఏపీ - పాంగ్థాంగ్ వద్ద గ్రేడ్ ‘సి’ క్వార్టర్ల వంటి గృహ నిర్మాణ ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభిస్తారు. అంతేకాకుండా ఎంజీ మార్గ్లో సద్భావ మండపం నిర్మాణానికి శ్రీ మోదీ శంకుస్థాపన చేస్తారు.
పర్యావరణ పరిరక్షణ చర్యలను తీసుకుంటే.. నదీ కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా సింగ్టమ్ పట్టణంలో మురుగునీటి వ్యవస్థ పునరుద్ధరణకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. గ్యాంగ్టక్లోని జోన్-IIIలో రోరో చూ నది ద్వారా రాణి చూ నదీ కాలుష్య నివారణ పథకాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు. మెరుగైన పట్టణ పారిశుధ్యం, సుస్థిర పర్యావరణ వ్యవస్థలకు ఇది దోహదపడుతుంది.
పర్యాటకం, పుణ్యక్షేత్రాల రంగంలో.. గాంగ్టక్లోని రిడ్జ్ ప్రిసింక్ట్ పునరుద్ధరణను, సోరెంగ్లోని డోడాక్లో పర్యావరణ హిత పర్యాటక, తీర్థయాత్రా మౌలిక సదుపాయాలను, 18వ మైలు- హాంగు సరస్సు వద్ద సదుపాయాలు సహా కైలాస మానస సరోవర యాత్ర కోసం మౌలిక సదుపాయాలను, నాంఫింగ్లోని కృష్ణ ప్రణామి మంగళ్ధామ్లో ఒక యాత్రి నివాస్ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. గ్యాల్షింగ్ జిల్లా సిల్నాన్లో పర్యావరణ హిత పుణ్యక్షేత్ర సముదాయానికి కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు.
రాష్ట్రంలో వ్యవసాయోత్పత్తుల ప్రాసెసింగ్ను బలోపేతం చేయడంతోపాటు రైతుల జీవనోపాధినీ, అన్ని దశల్లోనూ రాష్ట్రంలో ఆ రంగాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సిక్కిం ఇఫ్కో ప్రాసెసింగ్ ప్లాంటును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దీనితోపాటు యువతను ప్రోత్సహించడం, క్రీడారంగాన్ని అభివృద్ధి చేయడం కోసం పాక్యోంగ్ జిల్లా రంగ్పో (మైనింగ్) వద్ద ఇండోర్ క్రికెట్ సౌకర్యాలను కూడా ఆయన ప్రారంభిస్తారు.
సిక్కిం రాష్ట్ర అవతరణ స్వర్ణోత్సవ సంవత్సరంలో ప్రధానమంత్రి పర్యటన ఒక కీలక మైలురాయిగా నిలవబోతోంది. సిక్కింతోపాటు మొత్తం ఈశాన్య భారత వేగవంతమైన, సుస్థిర అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి ఉన్న అచంచల నిబద్ధతకు ఇది నిదర్శనం.
***
(రిలీజ్ ఐడి: 2255733)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8