ప్రధాన మంత్రి కార్యాలయం
అస్సాంలోని గౌహతిలో భారతరత్న డాక్టర్ భూపేన్ హజారికా 100వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పీఎం ప్రసంగం
నాడు పోస్టు చేయడమైనది:
13 SEP 2025 8:57PM by PIB Hyderabad
నేను భూపేన్ దా! అని చెప్తాను. మీరు 'అమర్ రహే! అమర్ రహే'! అని చెప్పండి (ఆయన చిరకాలం వర్ధిల్లాలి)
భూపేన్ దా, అమర్ రహే! అమర్ రహే!
భూపేన్ దా, అమర్ రహే! అమర్ రహే!
భూపేన్ దా, అమర్ రహే! అమర్ రహే!
అస్సాం గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ప్రజాదరణ పొందిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిస్వ శర్మ, అరుణాచల్ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి శ్రీ ప్రేమాఖండూ, మంత్రివర్గ సహచరులు శ్రీ సర్బానంద సోనోవాల్, వేదికపైనున్న భూపేన్ హజారికా సోదరుడు శ్రీ సమర్ హజారికా, భూపేన్ హజారికా సోదరి శ్రీమతి కవితా బారువా, భూపేన్ దా కుమారుడు శ్రీ తేజ్ హజారికా.. తేజ్, 'కెమ్ చో' అని పలకరిస్తున్నా. ఇక్కడకు విచ్చేసిన ఇతర ప్రముఖులకు, అస్సాం సోదరీసోదరులకు వందనాలు!
ఇవాళ ఎంతో అద్భుతమైన రోజు. ఈ క్షణం వెలకట్టలేనిది. ఇక్కడ నేను చూసిన దృశ్యం, ఉత్సాహం, సామరస్యం, భూపేన్ దా సంగీతంలోని లయ.. భూపేన్ దా మాటల్లోనే చెప్పాలంటే, "సమయ్ ఓ ధీరే చలో, సమయ్ ఓ ధీరే చలో" అని నా హృదయం పదే పదే ప్రతిధ్వనిస్తోంది. భూపేన్ దా సంగీతపు కెరటం నిరంతరం ప్రవహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఇక్కడ ప్రతి సందర్భం నూతన రికార్డును సృష్టించటం అస్సాం ప్రత్యేకత. మీ ప్రదర్శనల వెనకున్న అపారమైన కృషి ఇవాళ స్పష్టంగా కనిపిస్తోంది. మీ అందరికీ నా అభినందనలు.
మిత్రులారా,
కొద్ది రోజుల కిందట సెప్టెంబర్ 8న మనం భూపేన్ హజారికా జయంతిని జరుపుకున్నాం. ఆ రోజున భూపేన్ దాకు అంకితమిచ్చిన వ్యాసంలో నా భావోద్వేగాలను పంచుకున్నాను. ఈ 100వ జయంతి వేడుకల్లో పాల్గొనే అవకాశం రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఇక్కడికి రావటం ద్వారా ఆశీస్సులు అందించానని ఇప్పుడే శ్రీ హిమంత బిస్వ శర్మ చెప్పారు. కానీ నిజానికి అది దానికి విరుద్ధం! ఇటువంటి పవిత్రమైన సందర్భంలో ఇక్కడ ఉండటం నా అదృష్టం. మనమందరం భూపేన్ను ఎంతో ఇష్టంగా 'సుధా కంఠ' అని పిలుచుకుంటాం. భారతీయ భావోద్వేగాలకు గొంతుకనిచ్చిన, సంగీతానికి సున్నితత్వాన్ని జోడించిన, భారతీయుల కలలను పాటల్లో అల్లిన.. గంగా బెహతీ హో క్యూన్? గంగా బెహతీ హో క్యూన్? అంటూ గంగామాత కరుణను భారతావనికి వినిపించిన ఆ 'సుధా కంఠ' శతజయంతి సంవత్సరమిది.
మిత్రులారా,
చిరస్థాయిగా నిలిచిపోయే భూపేన్ దా స్వరకల్పనలు భారతావనిని ఐక్యం చేస్తూ, తరతరాలుగా భారతీయులకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి.
సోదరీసోదరులారా,
భూపేన్ దా భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాటలు, స్వరం నేటికీ భారతదేశ అభివృద్ధి ప్రయాణానికి నిదర్శనంగా నిలుస్తూ మనల్ని ఉత్తేజపరుస్తున్నాయి. భూపేన్ దా శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం గర్వంగా నిర్వహిస్తోంది. భూపేన్ హజారికా గీతాలను, సందేశాలను ఆయన జీవిత ప్రయాణాన్ని మేం ప్రతి ఇంటికీ తెలియజేస్తున్నాం. ఇవాళ ఇక్కడ ఆయన జీవిత చరిత్రను విడుదల చేశాం. ఈ సందర్భంగా డాక్టర్ భూపేన్ హజారికాకి నేను హృదయపూర్వక నివాళులర్పిస్తున్నాను. భూపేన్ దా శత జయంతి సంవత్సరం సందర్భంగా నా అస్సాం సోదరీసోదరులతో పాటు భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
మిత్రులారా,
భూపేన్ హజారికా జీవితం మొత్తం సంగీత సేవలో తరించారు. సంగీతం ధ్యానంగా మారినప్పుడు ఆత్మను స్పృశిస్తుంది. సంగీతం ఒక సంకల్పంగా మారినప్పుడు.. అది సమాజానికి సరికొత్త దిశను చూపే మాధ్యమం అవుతుంది. అందుకే భూపేన్ దా సంగీతం ఎంతో ప్రత్యేకమైనది. ఆయన ఏ ఆశయాల కోసమైతే జీవించారో, ఏ అనుభవాలనైతే పొందారో, వాటినే పాటల రూపంలో ఆలపించారు. ఆయన పాటల్లో భరతమాత పట్ల అపారమైన ప్రేమ కనిపిస్తుంది. ఎందుకంటే 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని ఆయన ఆచరించారు.
ఈశాన్య భారతంలో భూపేన్ జన్మించారు. బ్రహ్మపుత్ర నది పవిత్ర అలలు ఆయనకు సంగీత పాఠాలను నేర్పాయి. తర్వాత గ్రాడ్యూయేషన్ కోసం ఆయన కాశీకి వెళ్లారు. బ్రహ్మపుత్ర అలలతో మొదలైన ఆ సంగీతాన్వేషణ, గంగానది మధుర నాదంతో పరిపూర్ణమైంది. కాశీ నగర చైతన్యం ఆయన జీవితానికి అచంచలమైన ప్రవాహాన్ని ఇచ్చింది. ఆయన యాత్రికునిలా మారి భారత్ వ్యాప్తంగా పర్యటించారు. పీహెచ్డీ కోసం ఏకంగా అమెరికాకు వెళ్లారు. అయినప్పటికీ, జీవితంలోని ప్రతి దశలోనూ ఆయన అస్సాం పుత్రుడిగా ఆ నేలతో అనుబంధాన్ని కొనసాగించారు. అందుకే ఆయన తిరిగి భారతదేశానికి వచ్చారు. ఇక్కడ సినిమా రంగంలో సామాన్యుడి గొంతుకగా మారారు. ప్రజల జీవితాల్లోని బాధలకు ప్రాణం పోశారు. ఆ స్వరం నేటికీ మనల్ని కదిలిస్తూనే ఉంది.
ఆయన గీతం “మనుహే మనుహోర్ బాబే, జోదిహే ఆకోను నభాబే, ఆకోని హోహానుభూతిరే, భాబిబో కోనేను కువా?” అంటే.. మనుషులే సాటి మనుషుల సుఖదుఃఖాలు, బాధలు, కష్టాల గురించి ఆలోచించకపోతే, ఇక ఈ ప్రపంచంలో ఒకరి గురించి ఒకరు శ్రద్ధ వహించేదెవరు? అని అర్థం. ఒక్కసారి ఊహించండి.. ఇది మనకెంత స్ఫూర్తిదాయకమో. సరిగ్గా ఇదే స్ఫూర్తితో గ్రామాల్లోని ప్రజలు, పేదలు, దళితులు, అణగారిన, గిరిజన వర్గాల జీవితాలను మెరుగుపరచటంలో నేడు భారత్ నిమగ్నమై ఉంది.
మిత్రులారా,
భారతదేశ ఐక్యతకు, సమగ్రతకు భూపేన్ దా గొప్ప ధీరుడు. దశాబ్దాల కిందట ఈశాన్య భారతం నిర్లక్ష్యానికి గురైనప్పుడు, హింస, వేర్పాటువాద సెగల్లో దగ్ధమవుతున్నప్పుడు.. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ భూపేన్ దా భారతదేశ ఐక్యత కోసం గళాన్ని వినిపించారు. ఆయన ఒక సుసంపన్నమైన ఈశాన్య భారతాన్ని కలగన్నారు. ప్రకృతి ఒడిలో విలసిల్లే ఈశాన్య రాష్ట్రాల అద్భుత సౌందర్యాన్ని పాటల ద్వారా కొనియాడారు. అస్సాం గురించి ఇలా పాడారు:
"నానా జాతి-ఉపోజాతి, రహోనియా క్రిష్టి, అకువాలి లోయి హోయిసిల్ సృష్టి, ఈ మోర్ అహోం దేశ్” పాటను హమ్ చేసినప్పుడు అస్సాం వైవిధ్యం, బలం, సామర్థ్యం పట్ల మాకు గర్వంగా ఉంటుంది.
మిత్రులారా,
అతను అరుణాచల్ను ఎంతగానో ప్రేమించాడు. అందుకే ఇవాళ అరుణాచల్ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఇక్కడకు వచ్చారు. "అరుణ్ కిరణ్ శిష్ భూషణ్, భూమి సురమయి సుందర, అరుణాచల్ హమారా, అరుణాచల్ హమారా" అని భూపేన్ దా రాశారు.
మిత్రులారా,
నిజమైన దేశభక్తుడి హృదయాంతరాల నుంచి వచ్చే స్వరం ఎన్నటికీ వృథాగా పోదు. ఈశాన్య భారతం పట్ల ఆయన కన్న కలలను సాకారం చేసేందుకు మేం అహర్నిషలు శ్రమిస్తున్నాం. భూపేన్ దాకు భారత రత్నను ప్రదానం చేయడం ద్వారా మా ప్రభుత్వం ఈశాన్య ప్రాంత కలలను, గౌరవాన్ని చాటిచెప్పడమే కాక, ఈశాన్య భారతాన్ని దేశ ప్రాధాన్యతల్లో ఒకటిగా నిలిపింది. అస్సాం, అరుణాచల్ప్రదేశ్లను అనుసంధానిస్తూ నిర్మించిన దేశంలోనే అతి పొడవైన వంతెనల్లో ఒకదానికి భూపేన్ హజారికా వంతెన అని పేరు పెట్టాం. నేడు అస్సాం, ఈశాన్య భారతం వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అభివృద్ధిలోని ప్రతి అంశంలోనూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. ఈ అభివృద్ధి విజయాలే భూపేన్ దాకు దేశం అర్పించే నిజమైన నివాళి.
మిత్రులారా,
మన అస్సాం, మన ఈశాన్య భారతం.. భారతదేశ సాంస్కృతిక వైవిధ్యానికి ఎల్లప్పుడూ గొప్ప సహకారాన్ని అందిస్తున్నాయి. ఇక్కడి చరిత్ర, పండగలు, వేడుకలు, కళలు, సంస్కృతి, ప్రకృతి సౌందర్యం, దైవిక భావన.. వీటన్నింటితో పాటు భారతావని ప్రతిష్ఠ, ఆత్మగౌరవం, రక్షణకు ఇక్కడి ప్రజల త్యాగాలు లేని భారతదేశాన్ని మనం ఊహించలేం. నిజంగా మన ఈశాన్య ప్రాంతం దేశానికే ఒక కొత్త వెలుగు, కొత్త ఉదయం వంటిది. ఎందుకంటే మన దేశంలో మొదటగా ఇక్కడే సూర్యోదయం అవుతుంది. భూపేన్ దా పాటలో ఇదే భావాన్ని పలికించారు: “అహోం అమర్ రుపోహి, గుణోరు నై హేష్, భారతర్ పూర్బో దిఖర్, సూర్యో ఉఠా దేశ్!”
సోదరీసోదరులారా,
అస్సాం చరిత్రను కీర్తించినప్పుడే భారతదేశ చరిత్ర పరిపూర్ణమవుతుంది. అప్పుడే భారత్ ఆనందం పరిపూర్ణమవుతుంది. మనం గర్వంతో ముందుకు సాగుతుండాలి.
మిత్రులారా,
సాధారణంగా అనుసంధానం గురించి మాట్లాడితే… రైలు, రోడ్డు, విమాన మార్గాల గురించే ఆలోచిస్తాం. కానీ దేశ సమగ్రతకు వీటితో పాటు మరో ముఖ్యమైన అనుసంధానం అవసరం… అదే సాంస్కృతిక అనుసంధానం. పదకొండేళ్లుగా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూనే, దేశ సాంస్కృతిక అనుసంధానానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చాం. ఇదొక నిరంతర ప్రక్రియగా సాగుతున్న మహా యజ్ఞం. కార్యక్రమంలో ఆ లక్ష్యానికి సంబంధించిన వెలుగుని ఇవాళ మనం చూస్తున్నాం. కొంతకాలం కిందటే జాతీయ స్థాయిలో వీర లచిత్ బోర్ఫుకన్ 400వ జయంతి వేడుకలను మనం ఘనంగా జరుపుకున్నాం. స్వాతంత్య్ర పోరాటంలోనూ అస్సాం, ఈశాన్య భారతంలోని అసంఖ్యాక యోధులు సాటిలేని త్యాగాలు చేశారు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సందర్భంగా… ఈశాన్య భారత స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను, ఈ ప్రాంత విశిష్టతను మనం మరోసారి స్మరించుకున్నాం. ఈ రోజు దేశమంతా అస్సాం చరిత్రను, ఆ రాష్ట్రం అందించిన సహకారాన్ని తెలుసుకుంటోంది. ఇటీవల మనం ఢిల్లీలో అష్టలక్ష్మి మహోత్సవాన్ని కూడా నిర్వహించాం. ఆ వేడుకల్లోనూ అస్సాం శక్తి సామర్థ్యాలు, నైపుణ్యం స్పష్టంగా కనిపించాయి.
మిత్రులారా,
పరిస్థితులు ఎలా ఉన్నా అస్సాం ఎల్లప్పుడూ దేశ ఆత్మగౌరవాన్ని చాటిచెబుతూనే ఉంది. అదే స్వరాన్ని మనం భూపేన్ దా గీతాల్లో వింటాం. 1962 యుద్ధాన్ని అస్సాం ప్రత్యక్షంగా చూసింది. ఆ సమయంలో భూపేన్ దా పాటలతో దేశానికి కొండంత బలాన్ని ఇచ్చారు. “ప్రోతి జోవాన్ రుక్తోరే బిందు, హహహోర్ అనంత్ హిందూ, సే హహహోర్ దుర్జోయ్ లాహోర్, జషీలే ప్రతిజ్ఞ జోయ్రే” అంటూ పాడారు. ఆ ప్రతిజ్ఞ దేశ ప్రజలందరిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.
మిత్రులారా,
ఆ భావం, ఆ స్ఫూర్తి ప్రజల హృదయాల్లో ఇప్పటికీ శిలలా దృఢంగా నిలిచి ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ మనం చూశాం. పాకిస్థాన్ ఉగ్రవాద కుట్రలకు భారత్ ఎంత ధీటైన సమాధానం ఇచ్చిందంటే.. భారత పరాక్రమం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించింది. భారతదేశ శత్రువు ఏ మూలనున్నా సురక్షితంగా ఉండలేరని మేం నిరూపించాం. భద్రత, ఆత్మగౌరవం విషయంలో నవ భారతం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదు.
మిత్రులారా,
అస్సాం సంస్కృతిలో ప్రతీదీ అద్భుతం, అసాధారణమైనది. దేశంలోని పిల్లలు 'ఏ అంటే అస్సాం' అని నేర్చుకునే రోజు ఎంతో దూరంలో లేదని నేను తరచూ చెబుతుంటాను. అస్సాం సంస్కృతి, గౌరవం, ఆత్మగౌరవంతో పాటు అపారమైన అవకాశాలకు నిలయం. అస్సాం వస్త్రధారణ, ఆహారం, పర్యాటకం, ఉత్పత్తులకు దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలి. మీ అందరికీ తెలుసు… అస్సాం గమోసా బ్రాండింగ్ను నేను ఎంతో గర్వంగా ప్రచారం చేస్తుంటాను. అస్సాంలోని ప్రతి ఉత్పత్తిని ప్రపంచంలోని మారుమూల ప్రాంతాలకు మనం చేరవేయాలి.
మిత్రులారా,
భూపేన్ దా జీవితం దేశ లక్ష్యాల కోసమే అంకితమైంది. భూపేన్ దా శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో దేశ స్వావలంబనకు మనం పట్టుదలగా సంకల్పం తీసుకోవాలి. అస్సాంలోని నా సోదరీసోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనం వోకల్ ఫర్ లోకల్ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి. స్వదేశీ వస్తువుల పట్ల మనం గర్వపడాలి. మనం స్వదేశీ వస్తువులనే కొనాలి, స్వదేశీ ఉత్పత్తులనే విక్రయించాలి. ఈ ప్రచారాలను మనం ఎంతగా ముందుకు తీసుకెళ్తే.. వికసిత్ భారత్ కల అంత త్వరగా సాకారమవుతుంది.
మిత్రులారా,
పదమూడేళ్ల వయసులో భూపేన్ దా ఒక పాట రాశారు: “అగ్నిజుగోర్ ఫిరింగోటి మోయి, నోతున్ భారత్ గాధీమ్, హర్బోహరర్ హర్బోష్వో పునోర్ ఫిరై అనిమ్, నోతున్ భారత్ గాధీమ్”
మిత్రులారా,
ఈ పాటలో తనను తాను నిప్పుకణికగా ఆయన భావించుకున్నారు. నవ భారతాన్ని నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేశారు. బాధితులు, అణగారిన వర్గాలు తిరిగి తమ హక్కులు పొందేలా నూతన భారతాన్ని ఆవిష్కరిస్తానని ఆయన సంకల్పించుకున్నారు.
సోదరీసోదరులారా,
నవ భారతం కోసం భూపేన్ దా ఆనాటి దార్శనికత.. నేడు దేశ దృఢ సంకల్పంగా మారింది. మనం కూడా ఆ సంకల్పంతో మమేకమవ్వాలి. ప్రతి ప్రయత్నం, ప్రతి లక్ష్యం వెనుక వికసిత్ భారత్-2047 లక్ష్యాన్ని ఉంచాల్సిన సమయమిది. భూపేన్ దా రాసిన పాటలు, ఆయన జీవితం ఈ ప్రయాణంలో మనకు స్ఫూర్తినిస్తాయి. మన ఈ పట్టుదలే భూపేన్ హజారికా కలలను నిజం చేస్తుంది. ఈ స్ఫూర్తితో భూపేన్ దా శత జయంతి సంవత్సర సందర్భంగా దేశ ప్రజలందరికీ మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీ అందరినీ నేను కోరుతున్నాను. దయచేసి మీ మొబైల్ ఫోన్లను బయటకు తీసి, ఫ్లాష్లైట్ ఆన్ చేసి, భూపేన్ దాకు నివాళులర్పించండి. వేల సంఖ్యలో వెలుగుతున్న ఈ దీపాలు... భూపేన్ దా అమర ఆత్మకు నివాళులర్పిస్తున్నాయి. నేటి తరం ఆయన గాత్రాన్ని వెలుగులతో అలంకరిస్తోంది. మీకు నా ధన్యవాదాలు!
***
(రిలీజ్ ఐడి: 2254696)
సందర్శకుల సూచీ సంఖ్య : : 19
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam