ప్రధాన మంత్రి కార్యాలయం
అస్సాంలోని గువాహటిలో భారతరత్న డాక్టర్ భూపేన్ హజారికా శత జయంతి వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
దేశాన్ని ఏకం చేయడమే కాకుండా ఎన్నో తరాలకు స్ఫూర్తినిచ్చిన భూపేన్ దా సంగీతం: ప్రధానమంత్రి
‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తికి భూపేన్ జీవితం నిలువెత్తు సాక్ష్యం: ప్రధానమంత్రి
ఎల్లప్పుడూ దేశ ఐక్యతకు గళమెత్తిన వ్యక్తి భూపేన్: ప్రధానమంత్రి
భూపేన్ దాకు భారత రత్న అందించడం.. ఈశాన్య ప్రాంతాలపై మన ప్రభుత్వానికున్న నిబద్ధతకు నిదర్శనం: ప్రధానమంత్రి
జాతీయ సమగ్రతకు సాంస్కృతిక అనుసంధానం అత్యంత కీలకం: ప్రధానమంత్రి
భద్రత, అత్మగౌరవం విషయంలో నవ భారత్ ఎప్పటికీ రాజీపడదు: ప్రధానమంత్రి
వోకల్ ఫర్ లోకల్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారి.. స్వదేశీ ఉత్పత్తుల పట్ల గర్వపడదాం: ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
13 SEP 2025 8:35PM by PIB Hyderabad
అస్సాంలోని గువాహటిలో నిర్వహించిన భారతరత్న డాక్టర్ భూపేన్ హజారికా 100వ జయంతి వేడుకల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని, ప్రసంగించారు. ఈ సందర్భంగా పీఎం మాట్లాడుతూ.. నేడు ఎంతో విశేషమైనదని, ఈ క్షణం నిజంగా అమూల్యమైనదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేటి ప్రదర్శనలు, కళాకారుల ప్రతిభ, వారిలోని ఉత్సాహం, సమన్వయం తనను ఎంతగానో ప్రభావితం చేశాయని అన్నారు. వేడుక అంతటా భూపేన్ దా సంగీతంలోని లయ ప్రతిధ్వనిస్తోందని కొనియాడారు. భూపేన్ హజారికా రాసిన ఒక పాటలోని కొన్ని పదాలు తన మనసులో పదేపదే మెదులుతున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. భూపేన్ సంగీత తరంగాలు ప్రతిచోటా నిరంతరంగా ప్రవహిస్తూనే ఉండాలని తన హృదయం కోరుకుంటోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులందరినీ ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. అస్సాం రాష్ట్ర స్ఫూర్తి అద్భుతమైనదని, ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం ఒక కొత్త రికార్డును సృష్టిస్తుందని ప్రధాని అన్నారు. నేటి ప్రదర్శనలలో కళాకారుల అసాధారణమైన కృషి, సన్నద్ధత కనిపిస్తోందని తెలిపారు. ప్రదర్శనకారులందరినీ ఆయన ప్రశంసించారు.
కొద్దిరోజుల క్రితమే (సెప్టెంబర్ 8న) భూపేన్ హజారికా జయంతి జరుపుకున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆ రోజున తాను భూపేన్ దా గౌరవార్థం ఒక ప్రత్యేక వ్యాసం రాసి తన భావాలను పంచుకున్నట్లు గుర్తుచేశారు. భూపేన్ దా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు శ్రీ మోదీ తెలిపారు. ప్రజలందరూ భూపేన్ హజారికాను ప్రేమగా ‘‘శుద్ధ కంఠో (అద్భుతమైన స్వరం కలిగిన వారు) అని పిలుచుకుంటారని శ్రీ మోదీ అన్నారు. భారత్ భావోద్వేగాలకు గొంతుకను ఇచ్చిన భూపేన్.. సంగీతాన్ని సున్నితత్వంతో అనుసంధానించారని కొనియాడారు. తన సంగీతం ద్వారా దేశ కలలను పరిరక్షించి, గంగా మాత ద్వారా మాతృభూమి కరుణను వివరించిన శుద్ధ కంఠో శతజయంతి సంవత్సరం ఇదేనని అన్నారు.
భూపేన్ దా తన అద్భుతమైన రాగంతో దేశాన్ని ఏకం చేసి తరతరాల భారతీయులను చైతన్యపరిచేలా గొప్ప రచనలు అందించారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు. భూపేన్ దా భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ.. ఆయన పాటలు, స్వరం దేశ అభివృద్ధి ప్రయాణానికి సాక్ష్యంగా నిలుస్తూ, దేశానికి నిరంతరం శక్తినిస్తూనే ఉన్నాయని తెలిపారు. భూపేన్ దా జత జయంతి వేడుకలను ప్రభుత్వం ఎంతో గర్వంగా నిర్వహిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భూపేన్ హజారికా పాటలను, సందేశాలను జీవిత ప్రయాణాన్ని ప్రతి ఇంటికీ చేరువ చేస్తున్నట్లు తెలిపారు. ఇదే కార్యక్రమంలో భూపేన్ హజారికా జీవిత చరిత్రను విడుదల చేసినట్లు వెల్లడించారు. డాక్టర్ భూపేన్ హజారికాకు ఘన నివాళులర్పించిన శ్రీ మోదీ.. ఆయన శత జయంతి సందర్భంగా అస్సాం ప్రజలకు, దేశ ప్రజలందరికీ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
‘‘భూపేన్ హజారికా తన జీవితం మొత్తాన్ని సంగీత సేవకే అంకితం చేశారు’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సంగీతం ఒక ఆధ్యాత్మిక సాధనగా మారినప్పుడు అది ఆత్మను స్పృశిస్తుందని, అదే సంగీతం ఒక సంకల్పంగా మారినప్పుడు అది సమాజాన్ని సరైన మార్గంలో నడిపించే మార్గదర్శిగా నిలుస్తుందని అన్నారు. భూపేన్ దా సంగీతం అంత ప్రత్యేకంగా ఉండటానికి ఇదే ప్రధాన కారణమని చెప్పారు. భూపేన్ పాటల్లో తాను ఆచరించిన ఆదర్శాలు, జీవితానుభవాలు ప్రతిబింబించాయని పేర్కొన్నారు. మాతృభూమిపై భూపేన్ దా సంగీతంలో కనిపించే ప్రేమ ‘‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’’ అనే భావన పట్ల ఆయనకు ఉన్న అంకితభావం నుంచి పుట్టిందని ప్రధానమంత్రి తెలిపారు. భూపేన్ ఈశాన్య భారత్ లో జన్మించారని, పవిత్ర బ్రహ్మపుత్ర నది తరంగాలు ఆయనకు సంగీతాన్ని నేర్పించాయని అన్నారు. ఆ తర్వాత భూపేన్ పట్టభద్ర విద్య కోసం కాశీకి వెళ్లారని గుర్తుచేశారు. బ్రహ్మపుత్ర నదితో ప్రారంభమైన ఆయన సంగీత ప్రస్థానం.. గంగా నది ప్రవాహ లయతో పరిపూర్ణత సాధించిందని తెలిపారు. కాశీలోని చైతన్యం ఆయన జీవితానికి ఒక నిరంతర ప్రవాహాన్ని అందించిందని పేర్కొన్నారు. భూపేన్ దా ఒక సంచారిలా దేశమంతా పర్యటించారని, పీహెచ్ డీ కోసం అమెరికాకు కూడా వెళ్లారని చెప్పారు. జీవితంలోని ప్రతి దశలోనూ భూపేన్ అస్సాం నేలతో ఒక నిజమైన పుత్రుడిలా పెనవేసుకుపోయారని తెలిపారు. అందుకే ఆయన దేశానికి తిరిగి వచ్చి, సినిమాల ద్వారా సామాన్యుడి గొంతుకగా మారారని అన్నారు. భూపేన్ తన స్వరంతో సామాన్య ప్రజల కష్టాలను, బాధలను వినిపించారని, ఆ గొంతు నేటికీ దేశాన్ని కదిలిస్తుందని వ్యాఖ్యానించారు. భూపేన్ రాసిన ఒక పాట అర్థాన్ని పీఎం వివరించారు. ‘‘ మనిషి తోటివారి సుఖదుఃఖాల గురించి, కష్టనష్టాల గురించి పట్టించుకోకపోతే.. ఈ ప్రపంచంలో ఒకరిని ఒకరు ఎవరు చూసుకుంటారు?’’ అనే ఆలోచన ఎంత స్ఫూర్తిదాయకమైనదో ప్రతి ఒక్కరూ లోతుగా ఆలోచించాలని కోరారు. పేదలు, అణగారిన వర్గాలు, దళితులు, గిరిజన తెగల జీవితాలను మెరుగుపరిచే దిశగా భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఇదే ఆలోచన నేడు మార్గదర్శకంగా నిలుస్తోందని శ్రీ మోదీ పేర్కొన్నారు.
దేశ ఐక్యత, సమగ్రతకు భూపేన్ ను గొప్ప యోధుడిగా అభివర్ణించారు. దశాబ్దాల క్రితం ఈశాన్య ప్రాంతం నిర్లక్ష్యానికి గురై, హింస, వేర్పాటువాదంలో కూరుకుపోయిన సమయంలో కూడా ఆయన దేశ ఐక్యతకు గళమెత్తారని శ్రీ మోదీ గుర్తుచేశారు. సంపన్నమైన ఈశాన్య ప్రాంతాన్ని భూపేన్ కలలు కన్నారని, ఆ ప్రాంత సౌందర్యాన్ని తన పాటల్లో వర్ణించారని పేర్కొన్నారు. అస్సాం గురించి ఆయన రచించిన ఓ పాటలోని కొన్ని పంక్తుల గురించి చెబుతూ.. మనం ఈ గీతాన్ని ఆలపించినప్పుడు అస్సాం వైవిధ్యం, శక్తి, సామర్థ్యాన్ని చూసి గర్వపడతామని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
అరుణాచల్ ప్రదేశ్ పై కూడా భూపేన్ కు ఎంతో ప్రేమ ఉండేదని ప్రధానమంత్రి తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ గురించి ఆయన రాసిన పాటలోని కొన్ని పంక్తులను ప్రధానమంత్రి గుర్తుచేశారు. నిజమైన దేశభక్తుడి హృదయం నుంచి వచ్చిన స్వరం ఎన్నటికీ వృథా పోదని అన్నారు. ఈశాన్య ప్రాతం గురించి భూపేన్ దా కన్న కలలను సాకారం చేసేందుకు ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని స్పష్టం చేశారు. భూపేన్ కు భారతరత్న పురస్కారం అందించడం ద్వారా.. ఈశాన్య రాష్ట్రాల ఆకాంక్షలను, గౌరవాన్ని ప్రభుత్వాన్ని గౌరవించిందని. ఆ ప్రాంతానికి జాతీయ ప్రాధాన్యత కల్పించిందని ప్రధాని శ్రీ మోదీ తెలిపారు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లను కలిపే దేశంలోని పొడవైన వంతెనలలో ఒకదానికి ‘భూపేన్ హజారికా వంతెన’గా నామకరణం చేసినట్లు చెప్పారు. అస్సాంతో పాటు ఈశాన్య ప్రాంతమంతా వేగంగా అభివృద్ధి చెందుతోందని, అభివృద్ధికి సంబంధించిన ప్రతి రంగంలోనూ కొత్త రికార్డులు సృష్టిస్తోందని చెప్పారు. ఈ విజయాలే భూపేన్ దాకు దేశం అందిస్తున్న నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు.
‘‘దేశ సాంస్కృతిక వైవిధ్యంలో అస్సాం ఈశాన్య రాష్ట్రాలు ఎల్లప్పుడూ కీలక పాత్ర పోషించాయి’’ అని ప్రధానమంత్రి తెలిపారు. ఈ ప్రాంతానికి ఉన్న సుసంపన్నమైన చరిత్ర, పండుగలు, వేడుకలు, కళలు, సంస్కృతి, ప్రకృతి సౌందర్యం, దైవిక శోభ గురించి ప్రస్తావించారు. వీటితో పాటు మాతృభూమి గౌరవం, రక్షణ కోసం ఈ ప్రాంత ప్రజలు చేసిన త్యాగాలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. ఈ సహకారం లేకుండా మన గొప్ప దేశాన్ని ఊహించుకోలేమని వ్యాఖ్యానించారు. దేశానికి ఒక సరికొత్త వెలుగును, కొత్త ఉదయాన్ని ఇచ్చే ప్రాంతం ఈశాన్య రాష్ట్రాలని ప్రధానమంత్రి అభివర్ణించారు. దేశంలోనే తొలి సూర్యోదయం ఇక్కడే జరుగుతుందని పేర్కొన్నారు. భూపేన్ దా తన పాటలో ఇదే భావానికి ప్రాణం పోసిన కొన్ని పంక్తులను పీఎం ప్రస్తావించారు. అస్సాం చరిత్రను మనం ఘనంగా నిర్వహించుకున్నప్పుడే దేశ చరిత్ర సంపూర్ణమవుతుందని, అప్పుడే దేశ ఆనందం పూర్తవుతుందని, మనం ఈ వారసత్వాన్ని గర్వంగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన స్పష్టం చేశారు.
అనుసంధానం అనగానే ప్రజలు సాధారణంగా రైలు, రోడ్డు, లేదా విమాన మార్గాల అనుసంధానం గురించే ఆలోచిస్తారని, అయితే జాతీయ ఐక్యతకు మరో రకమైన అనుసంధానం కూడా అంతే ముఖ్యమని.. అదే సాంస్కృతిక అనుసంధానమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు. గత 11 ఏళ్లుగా ఈశాన్య ప్రాంత అభివృద్ధితో భాగంగా సాంస్కృతిక అనుసంధానానికి కూడా భారత్ ఎంతో ప్రాధాన్యతనిచ్చిందని, ఇది నిరంతర ఉద్యమంలా సాగుతోందని ఆయన పేర్కొన్నారు. నేటి కార్యక్రమం ఈ ప్రచారానికి ఒక ఉదాహరణ మాత్రమేనని అన్నారు. ఇటీవల వీర్ లచిత్ బోర్ఫుకాన్ 400వ జయంతిని జాతీయ స్థాయిలో నిర్వహించిన విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. స్వాతంత్ర్య పోరాటంలో అస్సాం, ఈశాన్య ప్రాంతాలకు చెందిన ఎందరో వీర యోధులు అసాధారణ త్యాగాలు చేశారని చెప్పారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఈశాన్య రాష్ట్రాల స్వాతంత్ర్య సమరయోధుల వారసత్వాన్ని, చరిత్రను ప్రభుత్వం మళ్లీ వెలుగులోకి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. నేడు యావత్ దేశం అస్సాం చరిత్రను, దాని సేవలను తెలుసుకుంటోందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన అష్టలక్ష్మి మహోత్సవంలో కూడా అస్సాం శక్తి, నైపుణ్యాన్ని ప్రదర్శించినట్లు ప్రధానమంత్రి తెలిపారు.
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. అస్సాం ఎల్లప్పుడూ దేశ గౌరవానికి గొంతుకగా నిలిచిందని, ఇదే స్ఫూర్తి భూపేన్ పాటల్లోనూ ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. 1962 యుద్ధం సమయంలో అస్సాం ఆ సంఘర్షణను నేరుగా ఎదుర్కొందని.. ఆ తరుణంలో ఆయన తన సంగీతంతో దేశ సంకల్పాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లారని గుర్తు చేశారు. అప్పట్లో దేశ ప్రజల్లో కొత్త శక్తిని నింపేలా భూపేన్ రాసిన ఒక పాటలోని పంక్తులను పీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు.
భారత ప్రజల స్ఫూర్తి, సంకల్పం ఎల్లప్పుడూ దృఢంగా, నిశ్చలంగా ఉంటాయని.. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇది స్పష్టంగా కనిపించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాద దురుద్దేశాలకు భారత్ నిర్ణయాత్మకమైన సమాధానం ఇచ్చిందని, దేశ బలం ప్రపంచమంతటా ప్రతిధ్వనించిందని చెప్పారు. దేశ శత్రువు ఏ మూలన ఉన్నా సురక్షితంగా ఉండలేరని భారత్ నిరూపించిందని స్పష్టం చేశారు. ‘‘నవ భారత్ ఎలాంటి పరిస్థితుల్లోనూ తన భద్రత, ఆత్మగౌరవం విషయంలో రాజీ పడదు’’ అని పేర్కొన్నారు.
అస్సాం సంస్కృతిలోని ప్రతి అంశం అద్భుతమైనది, అసాధారణమైనదని ప్రధానమంత్రి కొనియాడారు. అస్సాం సంస్కృతి, గౌరవం, గర్వం ఆ రాష్ట్ర అభివృద్ధికి గొప్ప అవకాశాలని ఆయన తెలిపారు. సంప్రదాయ వస్త్రధారణ, వంటకాలు, పర్యాటకం, ఉత్పత్తులు అస్సాం గొప్ప వారసత్వానికి, అవకాశాలకు నిలయమని ప్రస్తావించారు. వీటికి కేవలం దేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు . అస్సాం గమోచా బ్రాండింగ్ను తాను స్వయంగా ప్రోత్సహిస్తానని గర్వంగా చెప్పారు. అస్సాంలోని ప్రతి ఉత్పత్తిని ప్రపంచంలోని నలు మూలలకూ తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.
‘‘భూపేన్ జీవితమంతా దేశ లక్ష్యాలకే అంకితమైంది’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు. భూపేన్ శత జయంతి వేడుకల సందర్భంగా దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా మార్చేందుకు అందరం సంకల్పించాలని పిలుపునిచ్చారు. అస్సాంలోని తన సోదర సోదరీలందరూ వోకల్ ఫర్ లోకల్ ఉద్యమానికి ప్రచార కర్తలుగా మారాలని విజ్ఞప్తి చేశారు. స్వదేశీ ఉత్పత్తుల పట్ల గర్వపడాలని చెబుతూ.. ప్రతి ఒక్కరూ స్థానిక వస్తువులనే కొనాలని, అమ్మాలని కోరారు. ఈ ఉద్యమాలను మనం ఎంత వేగంగా ముందుకు తీసుకువెళితే అభివృద్ధి చెందిన భారత్ కల అంత త్వరగా సాకారమవుతుందని పేర్కొన్నారు.
తన 13వ ఏటనే భూపేన్ ఒక పాటను రాశారని, ఆ పాటలో ఆయన తనను తాను ఒక అగ్ని కణంగా భావించుకున్నారని, నవ భారతాన్ని నిర్మించాలని సంకల్పించుకున్నారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అణచివేతకు గురైన వారు, అవకాశం దక్కని ప్రతి ఒక్కరూ తమకు దక్కాల్సిన న్యాయమైన స్థానాన్ని తిరిగి పొందే ఒక దేశాన్ని భూపేన్ ఆనాడే ఊహించారని చెప్పారు. భూపేన్ దా కన్న నవ భారత కల, ఇప్పుడు దేశ సమష్టి సంకల్పంగా మారిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సంకల్పంతో మమేకమవ్వాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ ను సాధించాలనే లక్ష్యాన్ని ప్రతి ప్రయత్నానికి, ప్రతి సంకల్పానికి కేంద్ర బిందువుగా చేసుకునే సమయం ఇదేనని అన్నారు. ఈ మహత్తర లక్ష్య సాధనకు భూపేన్ గీతాలు, జీవితం స్ఫూర్తినిస్తాయని చెప్పారు. ఈ సంకల్పాల ద్వారానే భూపేన్ హజారికా కలలు సాకారమవుతాయన్నారు. భూపేన్ శత జయంతి సందర్భంగా పౌరులందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో అస్సాం గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూ, కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
నేపథ్యం
గువాహటిలో జరిగిన భారతరత్న డాక్టర్ భూపేన్ హజారికా 100వ జయంతి వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. అస్సామీ సంగీతం, సాహిత్యం, సంస్కృతికి డాక్టర్ హజారికా అందించిన సేవలను, అలాగే ఆయన జీవితాన్ని, వారసత్వాన్ని గౌరవించే లక్ష్యంతో ఈ ఉత్సవాలను నిర్వహించారు.
***
(రిలీజ్ ఐడి: 2254695)
సందర్శకుల సూచీ సంఖ్య : : 20
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam