పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై వివిధ మంత్రిత్వ శాఖల వివరణ
· లాక్డౌన్ వదంతులను కొట్టిపారేసిన ప్రభుత్వం
· నకిలీ వార్తలు, తప్పుడు సమాచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
· అందుబాటులో తగినంత పెట్రోల్, డీజిల్
· పూర్తి స్థాయిలో పనిచేస్తోన్న సరఫరా వ్యవస్థలు
· అంతర్జాతీయ అనిశ్చితి మధ్య దేశ ఇంధన భద్రతను నిర్ధారించడమే లక్ష్యంగా పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన ప్రభుత్వం
· పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోన్న ప్రభుత్వం.. ప్రతి పక్షం రోజులకు ఒకసారి సమీక్ష
· దేశీయ చమురు శుద్ధి కర్మాగారాలు ఎగుమతి చేసే పెట్రోల్లో 50 శాతం, డీజిల్లో 30 శాతం తప్పనిసరిగా దేశీయ మార్కెట్కే సరఫరా చేయాలని ఆదేశం
· వాణిజ్య ఎల్పీజీ కేటాయింపును అదనంగా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం.. దీనితో సంక్షోభానికి ముందున్న 70 శాతానికి చేరుకున్న మొత్తం కేటాయింపు
· నిన్న 110 భౌగోళిక ప్రాంతాలలో జారీ అయిన 10,568 పీఎన్జీ కనెక్షన్లు (కొత్తవి, గ్యాస్-ఇన్)
· నల్లబజారు విక్రయాలు, అక్రమ నిల్వల విషయంలో కొనసాగుతున్న తనిఖీలు
· ఓడరేవులలో ఎటువంటి రద్దీ లేకుండా సజావుగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న భారత సముద్రయాన రంగం
· 2026 మార్చి 26–27 తేదీలలో నిర్వహిస్తోన్న జీ7 విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ఇతర దేశాల ప్రతినిధులతో అభిప్రాయాలను పంచుకున్న విదేశీ వ్యవహారాల మంత్రి
· గల్ఫ్, పశ్చిమాసియాలోని పరిస్థితులను నిశితంగా గమనిస్తోన్న ప్రభుత్వం
· భారతీయ సమాజం భద్రతకే అగ్ర ప్రాధాన్యతనిస్తోన్న ప్రభుత్వం
నాడు పోస్టు చేయడమైనది:
27 MAR 2026 6:16PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులపై మీడియాకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోన్న కేంద్ర ప్రభుత్వం ఈ రోజు జాతీయ మీడియా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పెట్రోలియం- సహజ వాయువు, ఓడరేవులు- నౌకాయానం- జలమార్గాలు, విదేశీ వ్యవహారాలు, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల ప్రతినిధులు.. ఇంధన లభ్యత, సముద్రయాన కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయులకు అందుతున్న సహాయం, ఆయా రంగాలలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి తీసుకుంటున్న చర్యలపై తాజా సమాచారాన్ని పంచుకున్నారు. సీబీఐసీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్) సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎక్సైజ్ సుంకానికి సంబంధించిన ఇటీవలి నిర్ణయాలపై సమాచారాన్ని అందించారు.
పన్ను, సుంకానికి సంబంధించిన తాజా సమాచారం
సరఫరా స్థిరత్వానికి మద్దతుగా ఇటీవల పన్ను, సుంకాల విషయంలో తీసుకున్న చర్యలను ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి:
· పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాలో అంతరాయాల కారణంగా ఈ ప్రభావం కనిపిస్తోంది.
· ఈ సంక్షోభం తర్వాత అంతర్జాతీయ ముడి చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్, విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) విషయంలో అంతర్జాతీయ ధరలు కూడా భారీగా పెరిగాయి.
· ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల వల్ల పెట్రోలియం ఉత్పత్తులను అధిక అంతర్జాతీయ ధరలకు ఎగుమతి చేసేందుకు చమురు శుద్ధి సంస్థలకు ప్రోత్సాహం లభిస్తోంది.
· ఈ పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం తగిన జాగ్రత్తలతో కూడిన చర్యలతో స్పందించింది.
· ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం (ఎస్ఏఈడీ), రోడ్ - మౌలికసదుపాయాల సెస్ రూపంలో ఎగుమతి సుంకాలు విధించారు. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే డీజిల్, విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతులపై ఈ సుంకాలను విధించారు.
· ప్రకటించిన రేట్ల ప్రకారం:
o డీజిల్ పై ఎగుమతి సుంకం: లీటరుకు రూ. 21.50
o విమానయాన ఇంధనంపై (ఏటీఎఫ్) ఎగుమతి సుంకం: లీటరుకు రూ. 29.50
o ప్రస్తుత క్రాక్ మార్జిన్ల ఆధారంగా పెట్రోల్పై ఎగుమతి సుంకం ప్రస్తుతం ఏమీ లేదు (సున్నా).
· ఈ రేట్ల విషయంలో ప్రతి పక్షం రోజులకు ఒకసారి సమీక్ష ఉంటుంది.
· దేశీయంగా డీజిల్, ఏటీఎఫ్ లభ్యతకు ప్రాధాన్యత ఇవ్వడమే ఈ చర్యల లక్ష్యం.
· ప్రపంచవ్యాప్త అనిశ్చితి మధ్య దేశ ఇంధన భద్రతను నిర్ధారించడం కూడా దీని ఉద్దేశం. సరఫరా గొలుసులలో అంతరాయాలు, లభ్యత- ధరల పరంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అస్థిరత కారణంగా ఈ అనిశ్చితులు మరింత పెరిగాయి.
· ఎగుమతి సంబంధిత చర్యలతో పాటు దేశీయ వినియోగం కోసం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాల్లో కూడా మార్పులు చేశారు.
· ఈ మార్పులలో భాగంగా పెట్రోల్, డీజిల్ రెండింటిపై దేశీయ ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం లీటరుకు రూ. 10 చొప్పున తగ్గించారు.
· ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభ సమయంలో వినియోగదారులపై పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల భారం పెరగకుండా చూడటమే ఈ చర్యల ముఖ్య ఉద్దేశం.
· ప్రస్తుత పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. పరిణామాలను శాఖా పరంగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన మేరకు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.
ఇంధన సరఫరా, లభ్యత
హోర్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చూసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ప్రస్తుత ఇంధన సరఫరా పరిస్థితిపై తాజా సమాచారాన్ని పంచుకున్నారు. ఆ వివరాలు:
ముడి చమురు, చమురు శుద్ధి కేంద్రాలు
· అన్ని చమురు శుద్ధి కేంద్రాలు తగినంత ముడి చమురు నిల్వలతో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ విషయంలో నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయి.
· దేశీయ వినియోగానికి మద్దతుగా చమురు శుద్ధి కేంద్రాల నుంచి దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి 40 శాతం పెరిగింది.
రిటైల్ విక్రయకేంద్రాలు
· దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ విక్రయకేంద్రాలు సాధారణంగానే పనిచేస్తున్నాయి.
· మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా ముడి చమురు ధరలు పెరిగిన దృష్ట్యా వినియోగదారులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం.. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 10 చొప్పున తగ్గించింది.
· దేశీయంగా తగినంత లభ్యతను నిర్ధారించడానికి డీజిల్ ఎగుమతిపై లీటరుకు రూ. 21.5, విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతిపై లీటరుకు రూ. 29.5 సుంకాన్ని ప్రభుత్వం విధించింది.
· దేశీయ చమురు శుద్ధి కర్మాగారాలు ఎగుమతి చేసే పెట్రోల్లో 50 శాతం, డీజిల్లో 30 శాతం తప్పనిసరిగా దేశీయ మార్కెట్కే సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
· వదంతుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనతో భారీగా కొనుగోళ్లు చేసినట్లు సమాచారం అందింది. దీనివల్ల రిటైల్ విక్రయకేంద్రాల్లో అసాధారణ విక్రయాలు, రద్దీ చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ దేశంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉంది.
· వందతులను నమ్మొద్దని ప్రభుత్వం ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేసింది.
సహజ వాయువు
· దేశీయ పీఎన్జీ, సీఎన్జీ రవాణాకు 100 శాతం సరఫరాతో ప్రాధాన్యత కేటాయింపు కొనసాగుతోంది. అదే సమయంలో గ్రిడ్కు అనుసంధానమైన పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు సగటు వినియోగంలో సుమారు 80 శాతం సరఫరా అందుతోంది.
· రెస్టారెంట్లు, హోటళ్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్జీ కనెక్షన్లను ప్రాధాన్యత క్రమంలో అందించాలని సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) సంస్థలకు సూచించారు.
· ఐజీఎల్, ఎంజీఎల్, గెయిల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి సిటీ గ్యాస్ కంపెనీలు దేశీయ, వాణిజ్య పీఎన్జీ కనెక్షన్ల విషయంలో ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.
· సీజీడీ నెట్వర్క్ల విస్తరణకు అవసరమైన అనుమతులను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు కేంద్ర మంత్రిత్వ శాఖలను కోరింది.
· ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారే ప్రక్రియకు అనుగుణంగా వాణిజ్య ఎల్పీజీలో అదనంగా 10 శాతం కేటాయింపును రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందించాలన్న ప్రతిపాదన ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం 18.03.2026 నాటి లేఖ ద్వారా తెలిపింది. సంస్కరణలు చేపడుతున్న రాష్ట్రాలకు అదనపు కేటాయింపులు సిఫార్సు చేశారు.
· పీఎన్జీ పంపిణీని వేగవంతం చేయడానికి పలు రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. ఇందులో వినియోగదారు హక్కు (రైట్ ఆఫ్ యూజర్) లేదా దారి హక్కు (రైట్ ఆఫ్ వే) అనుమతులను సరళీకరించడం, పని గంటలను పొడిగించడం, ఛార్జీలను హేతుబద్ధీకరించడం వంటివి ఉన్నాయి.
· సీజీడీ దరఖాస్తుల ప్రక్రియను 10 రోజుల్లోపు ప్రాధాన్యత ప్రతిపాదికన అందించాలని పీఈఎస్ఓ (పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్) తన పరిధిలోని కార్యాలయాలకు సూచించింది.
· ఆవాస పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, సామాజిక వంటశాలలు, అంగన్వాడీ కేంద్రాలతో పాటు వీలైన చోటల్లా ప్రాధాన్యత క్రమంలో ఐదు రోజులలోపు పీఎన్జీ కనెక్షన్లను అందించాలని సీజీడీ సంస్థలను పీఎన్జీఆర్బీ (పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్) 23.03.2026 నాటి ఉత్తర్వు ద్వారా ఆదేశించింది.
· సీజీడీ మౌలిక సదుపాయాల కోసం మూడు నెలల కాలానికి తక్కువ సమయ పరిమితితో కూడిన వేగవంతమైన ఆమోద ఫ్రేమ్వర్క్ను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది.
· పైప్లైన్ మౌలిక సదుపాయాల పెంపు, చివరి మైలు వరకు అనుసంధానతను పెంపొందించడం కోసం క్రమబద్ధీకరించిన, సమయ పరిమితితో కూడిన ఫ్రేమ్వర్క్ను అందిస్తూ కేంద్ర ప్రభుత్వం 24.03.2026 నాటి గెజిట్ ద్వారా ‘సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ ఉత్తర్వు- 2026’ను నోటిఫై చేసింది
· నిన్న ఒక్కరోజే 110 భౌగోళిక ప్రాంతాలలో 10,568 పీఎన్జీ కనెక్షన్లను (కొత్తవి, గ్యాస్-ఇన్) అందించినట్లు సీజీడీ సంస్థలు నివేదించాయి.
ఎల్పీజీ
· ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్పీజీ సరఫరాపై ప్రభావం కొనసాగుతోంది.
· ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద కొరత ఉందన్న నివేదికలు ఎక్కడా లేవు.
· గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా యథావిధిగా కొనసాగుతోంది.
· ప్రభుత్వం ఇప్పటికే వినియోగదారులకు పాక్షిక వాణిజ్య ఎల్పీజీ సరఫరాను (20 శాతం) పునరుద్ధరించింది. దీనికి అదనంగా పీఎన్జీ సంస్కరణలతో అనుసంధానమైన 10 శాతం కేటాయింపును కూడా అందించింది.
· 21.03.2026 నాటి లేఖ ద్వారా మరో 20 శాతం కేటాయింపును కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దీనితో మొత్తం కేటాయింపు 50 శాతానికి చేరుకుంది. ఇందులో రెస్టారెంట్లు, ధాబాలు, హోటళ్లు, పారిశ్రామిక క్యాంటీన్లు, ఆహార శుద్ధి కేంద్రాలు లేదా డైరీ, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు నడిపే రాయితీ క్యాంటీన్లు లేదా అవుట్లెట్లు, సామాజిక వంటశాలలు, వలస కార్మికుల కోసం ఉద్దేశించిన 5 కేజీల ఎఫ్టీఎల్ వంటి కీలక రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
· 27.03.2026 నాటి లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం.. వాణిజ్య ఎల్పీజీ విషయంలో అదనంగా మరో 20 శాతం కేటాయింపును ఆమోదించింది. దీనితో మొత్తం కేటాయింపు సంక్షోభానికి ముందున్న స్థాయిలో 70 శాతానికి చేరుకుంది. ఇందులో ఉక్కు, వాహనాలు, వస్త్రాలు, రంగులు (డై), రసాయనాలు, ప్లాస్టిక్ రంగాలకు ప్రాధాన్యత ఉంది. వీటిలో కూడా ప్రాసెస్ పరిశ్రమలకు లేదా సహజ వాయువుతో భర్తీ చేయలేని ప్రత్యేక హీటింగ్ అవసరాల కోసం ఎల్పీజీ అవసరమయ్యే పరిశ్రమలకు మొదటి ప్రాధాన్యత లభిస్తోంది.
· నిన్న ఒక్కరోజే 40,000 కంటే ఎక్కువ 5 కేజీల ఎఫ్టీఎల్ (ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ) సిలిండర్లు విక్రయమయ్యాయి.
· గృహేతర ఎల్పీజీ కోసం 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేటాయింపు ఉత్తర్వులు జారీ చేశాయి. మిగిలిన ప్రాంతాల్లో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు సరఫరా చేస్తున్నాయి.
· 2026 మార్చి 14 నుంచి ఇప్పటివరకు సుమారు 29,656 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్పీజీ సరఫరా అయింది.
కిరోసిన్
· అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సాధారణ కేటాయింపులకు అదనంగా 48,000 కిలోలీటర్ల కిరోసిన్ను కేటాయించారు.
· జిల్లా స్థాయి పంపిణీ కేంద్రాలను గుర్తించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు.
· 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కిరోసిన్ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేశాయి. కాగా హిమాచల్ ప్రదేశ్, లడఖ్ తమకు ఎటువంటి అవసరం లేదని తెలిపాయి.
రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పాత్ర
· నిత్యావసర సరకుల చట్టం- 1955, ఎల్పీజీ నియంత్రణ ఉత్తర్వు- 2000 ప్రకారం అక్రమ నిల్వలు, నల్లబజారు క్రయవిక్రయాలపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. నిత్యావసరాల సరఫరాను క్రమబద్ధీకరించడంలో ఆయా ప్రభుత్వాలు కీలక పాత్ర పోషిస్తాయి.
· అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఈ కింది చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వంకోరింది:
o ప్రతిరోజూ మీడియా సమావేశాలు నిర్వహించడం, క్రమం తప్పకుండా ప్రజలకు సూచనలు జారీ చేయడం.
o ప్రత్యేక కంట్రోల్ రూంలు, హెల్ప్లైన్లను ఏర్పాటు చేయడం.
o సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు సమాచారాన్ని నిశితంగా గమనిస్తూ వాటిని తిప్పికొట్టడం.
o తనిఖీలను ఉద్ధృతం చేయడం, అక్రమ నిల్వల విషయంలో క్రమం తప్పకుండా దాడులు నిర్వహించడం.
o వాణిజ్య ఎల్పీజీ, కిరోసిన్ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.
o దారి హక్కు (రైట్ ఆఫ్ వే) లేదా వినియోగదారు హక్కు (రైట్ ఆఫ్ యూజర్) అనుమతులతో సహా సీజీడీ విస్తరణను వేగవంతం చేయడం.
o పీఎన్జీ వాడకాన్ని, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం.
o కేంద్ర మంత్రిత్వ శాఖతో సమన్వయం కోసం సీనియర్ నోడల్ అధికారులను నియమించడం.
· ప్రస్తుతం 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రతిరోజూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. మిగిలిన రాష్ట్రాలను కూడా అలా చేయాలని కోరారు.
ఎన్ఫోర్స్మెంట్ చర్యలు
· రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 3,000కు పైగా తనిఖీలు నిర్వహించి... 1,500లకు పైగా ఎల్పీజీ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
· ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ అవుట్లెట్లు, ఎల్పీజీ పంపిణీ కేంద్రాల్లో 1,500లకు పైగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి.
· ఎల్పీజీ పంపిణీ సంస్థలకు 350కి పైగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ప్రభుత్వం చేపడుతున్న ఇతర చర్యలు
· ఆసుపత్రులు, విద్యాసంస్థల వంటి కీలక రంగాలు సహా గృహాలకు ఎల్పీజీ, పీఎన్జీ సరఫరాకు ప్రభుత్వం ప్రాధాన్యత కొనసాగిస్తోంది.
· రిఫైనరీ ఉత్పత్తిని పెంచడం, బుకింగ్ వ్యవధులను సవరించడం, ప్రాధాన్య సరఫరా కేటాయింపుల వంటివి ఈ చర్యల్లో భాగంగా ఉన్నాయి.
· ఎల్పీజీ డిమాండ్ను తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహిస్తున్నారు.
· చిన్న, మధ్య తరహా వినియోగదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్రాలకు బొగ్గు సరఫరాను పెంచాలని బొగ్గు మంత్రిత్వ శాఖ కోల్ ఇండియా, సింగరేణి బొగ్గు గనులను ఆదేశించింది.
· గృహ, వాణిజ్య వినియోగదారుల కోసం కొత్త పీఎన్జీ కనెక్షన్లను సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
ప్రజలకు సూచనలు
· పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. పౌరులు భయాందోళనలతో కొనుగోళ్లు చేయవద్దని సూచించారు.
· పౌరులు అధికారిక వనరుల సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలనీ, వదంతులను నమ్మవద్దని సూచించారు.
· ఎల్పీజీ విషయంలో వినియోగదారులు కింది సూచనలను పాటించాలని కోరుతున్నారు:
· బుకింగ్ కోసం డిజిటల్ పద్ధతులను ఉపయోగించాలి.
· అనవసరంగా ఎల్పీజీ పంపిణీదారుల వద్దకు వెళ్లడం మానుకోవాలి.
· పౌరులు పీఎన్జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను, విద్యుత్ ఇండక్షన్ కుక్టాప్లను ఉపయోగించాలని ప్రోత్సహిస్తున్నారు.
· పౌరులందరూ తమ రోజువారీ వినియోగంలో ఇంధనాన్ని పొదుపుగా వాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
· నౌకా వాణిజ్య భద్రత, నౌకాయాన కార్యకలాపాలు
పర్షియన్ గల్ఫ్లోని ప్రస్తుత నౌకా వాణిజ్య పరిస్థితితో పాటు భారతీయ నౌకలు, సిబ్బందిని కాపాడటానికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. కింది విషయాలు తెలియజేశారు:
· ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్న భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారత జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎలాంటి నౌకా ప్రమాదం జరగలేదు.
· సుమారు 540 మంది భారతీయ నావికులతో కూడిన 20 భారత జెండా గల నౌకలు పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోనే ఉన్నాయి. నౌకా యజమానులు, ఆర్పీఎస్ఎల్ ఏజెన్సీలు, భారత మిషన్ల సమన్వయంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీ షిప్పింగ్) పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది.
· డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ 24×7 పనిచేస్తూనే ఉంది. యాక్టివేషన్ అయినప్పటి నుంచి 4,326 కాల్లు, 8,556 ఈమెయిళ్లను నిర్వహించింది. వీటిలో గత 24 గంటల్లో వచ్చిన 98 కాల్లు, 335 ఈమెయిళ్లు... గత 48 గంటల్లో 218 కాల్లు, 647 ఈమెయిళ్లూ ఉన్నాయి.
· డీజీ షిప్పింగ్ ఇప్పటి వరకు విమానాశ్రయాలు, వివిధ ప్రాంతీయ ప్రదేశాల నుంచి 699 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో సహాయపడింది. గత 24 గంటల్లో వచ్చిన 25 మంది, గత 48 గంటల్లో వచ్చిన 64 మంది వీరిలో ఉన్నారు.
· గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళం, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి సహా రాష్ట్ర మారిటైమ్ బోర్డులు ధ్రువీకరించినట్లుగా... ఓడరేవుల అంతటా ఎటువంటి రద్దీ లేకుండా భారత నౌకా వాణిజ్య రంగ కార్యకలాపాలు సజావుగా కొనసాగుతున్నాయి.
· భారతీయ నావికుల సంక్షేమాన్ని, నిరంతరాయ నౌకా వాణిజ్య కార్యకలాపాలను నిర్ధారించడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారతీయ మిషన్లు, నౌకా వాణిజ్య రంగ భాగస్వాములతో మంత్రిత్వ శాఖ సమన్వయం కొనసాగిస్తోంది.
· పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా నౌకా రవాణా, ఓడరేవు కార్యకలాపాలు, భారతీయ నావికుల భద్రత, నౌకా వాణిజ్య కార్యకలాపాల కొనసాగింపును నౌకాశ్రయాలు, నౌకాయానం, జలరవాణా మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తోంది.
ఈ ప్రాంతంలో భారతీయ పౌరుల భద్రత
· భారత మిషన్ల ద్వారా అందిస్తున్న సహాయంతో సహా ఈ ప్రాంతంలోని ఇటీవలి పరిణామాలను బ్రీఫింగ్ సందర్భంగా పంచుకున్నారు. కింది విషయాలు తెలియజేశారు:
· ఈ నెల 26–27 తేదీల్లో జరుగుతున్న జీ7 విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు భారత విదేశాంగ మంత్రి ఫ్రాన్స్లో పర్యటిస్తున్నారు.
· సమావేశం సందర్భంగా భారత విదేశాంగ మంత్రి భాగస్వామ్య దేశాల అధినేతలతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఆయన ద్వైపాక్షిక అంశాలతో పాటు, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపైనా అభిప్రాయాలను పంచుకున్నారు.
· ఈ కార్యక్రమాల సందర్భంగా విదేశాంగ మంత్రి ఫ్రాన్స్, కెనడా, దక్షిణ కొరియా, జపాన్, బ్రెజిల్, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ దేశాల విదేశాంగ మంత్రులతో సమావేశమయ్యారు.
· విదేశాంగ మంత్రి నిన్న ఆహ్వానిత భాగస్వాముల సమక్షంలో జీ7 విదేశాంగ మంత్రుల సమావేశంలో ప్రపంచ పాలన సంస్కరణలపై ప్రసంగించారు.
· ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణల ఆవశ్యకతను, శాంతి పరిరక్షణ కార్యకలాపాలను క్రమబద్ధీకరించాల్సిన అవసరాన్ని, మానవతా సహాయ ఆధారిత సరఫరా గొలుసులను బలోపేతం చేయాల్సిన అవసరాన్నీ తన ప్రసంగంలో భారత విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు.
· గ్లోబల్ సౌత్ గురించి... ముఖ్యంగా ఇంధన సవాళ్లు, ఎరువుల సరఫరా, ఆహార భద్రతకు సంబంధించిన సమస్యల గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
· నిన్న జరిగిన జీ7 విదేశాంగ మంత్రుల రెండో సమావేశంలో పశ్చిమాసియాలోని ఘర్షణల వల్ల తలెత్తుతున్న అనిశ్చితులు... పటిష్ఠమైన వాణిజ్య మార్గాలు, సరఫరా గొలుసుల ఆవశ్యకతను స్పష్టం చేస్తున్నాయని విదేశాంగ మంత్రి తెలియజేశారు.
· భారతీయ పౌరుల భద్రత, క్షేమం, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది.
· భారత పౌరులకు, వారి కుటుంబాలకు సహాయం చేయడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ పనిచేస్తూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో నిరంతర సమన్వయం కొనసాగుతోంది.
· ఈ ప్రాంతంలోని భారతీయ మిషన్లు, పోస్టులు 24×7 హెల్ప్లైన్లతో నిరంతరం పనిచేస్తూ... ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తూ... భారతీయ కమ్యూనిటీ సంస్థలు, స్థానిక అధికారులతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నాయి.
· సముద్రయాన సిబ్బందికి, చిక్కుకుపోయిన భారతీయ పౌరులకు, స్వల్పకాలిక సందర్శకులకు వీసా సౌకర్యం, కాన్సులర్ సేవలు, లాజిస్టికల్ మద్దతుతో మిషన్లు చురుగ్గా సహాయం చేస్తూనే ఉన్నాయి.
· గల్ఫ్ ప్రాంతంలోని భారతీయ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తూ, వారి విద్యా సంవత్సరం ప్రభావితం కాకుండా చూసేందుకు కృషి చేస్తోంది.
· స్థానిక అధికారులు, భారతీయ పాఠశాలలు, సీబీస్ఈ, ఐసీఎస్ఈ, కేరళం బోర్డులు సహా పలు విద్యా బోర్డులతో మిషన్లు సమన్వయం చేసుకుంటున్నాయి.
· ఈ ప్రాంతంలో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డులు 10వ, 12వ తరగతి పరీక్షలను రద్దు చేయగా... పరీక్షలను వాయిదా వేసిన కేరళం బోర్డు ఏప్రిల్ 6న పరిస్థితిని సమీక్షించనుంది.
· కువైట్, దుబాయ్, బహ్రెయిన్ నుంచి నమోదు చేసుకున్న అభ్యర్థుల కోసం జేఈఈ (మెయిన్) 2026తో సహా పలు పోటీ పరీక్షల నిర్వహణకు సంబంధించి జాతీయ పరీక్షల ఏజెన్సీ సూచనలు జారీ చేసింది.
· ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు ఆ ప్రాంతం నుంచి సుమారు 4,75,000 మంది ప్రయాణికులు భారత్కు తిరిగి వచ్చారు.
· యూఏఈలో, విమానయాన సంస్థలు కార్యాచరణపరమైన అంశాల ఆధారంగా పరిమిత సంఖ్యలో షెడ్యూల్ చేయని విమాన సర్వీసులను కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు సుమారు 80 విమానాలు భారత్కు నడుస్తాయని అంచనా.
· సౌదీ అరేబియా, ఒమన్లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారత్లోని పలు గమ్యస్థానాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి.
· ఖతార్ గగనతలం పాక్షికంగా తెరుచుకోవడంతో, ఖతార్ ఎయిర్వేస్ ఈ రోజు సుమారు 10 విమానాలను భారత్కు నడపనుంది.
· కువైట్, బహ్రెయిన్ గగనతలం మూసి ఉంది. జజీరా ఎయిర్వేస్, గల్ఫ్ ఎయిర్ సంస్థలు సౌదీ అరేబియాలోని దమ్మమ్ విమానాశ్రయం నుంచి భారత్లోని పలు గమ్యస్థానాలకు విమానాలను నడుపుతున్నాయి.
· విమాన ప్రయాణ ఆంక్షలు, గగనతల మూసివేతల కారణంగా భారత పౌరులు కింది ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించేందుకు సౌకర్యం కల్పిస్తున్నారు:
· ఇరాన్ నుంచి అర్మేనియా, అజర్బైజాన్ మీదుగా
· ఇజ్రాయెల్ నుంచి జోర్డాన్ మీదుగా
· ఇరాక్ నుంచి జోర్డాన్, సౌదీ అరేబియాల మీదుగా
· కువైట్, బహ్రెయిన్ నుంచి సౌదీ అరేబియా మీదుగా
· అబుదాబిలో జరిగిన దాడిలో ఒక భారత జాతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రభుత్వం మృతుని కుటుంబానికి సంతాపం తెలిపింది. మృత దేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించేందుకు స్థానిక అధికారులతో మిషన్ సమన్వయం చేస్తోంది.
· ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన మరో భారత జాతీయుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
· వివిధ ఘటనల్లో మొత్తం ఏడుగురు భారత జాతీయులు ప్రాణాలు కోల్పోగా, ఒకరు గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ తెలుసుకోవడం, మృతదేహాలను స్వదేశానికి రప్పించడం కోసం ఒమన్, ఇరాక్, యూఏఈల్లోని రాయబార కార్యాలయాలు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి.
ప్రజలకు సమాచారం అందించడం
· సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కింది సమాచారాన్ని తెలియజేసింది:
· లాక్డౌన్ వంటి వదంతులను నమ్మవద్దనీ... సోషల్ మీడియా సహా ఇతర వేదికలపై ప్రచారంలో ఉన్న నకిలీ వార్తలు, తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం పౌరులందరికీ విజ్ఞప్తి చేస్తోంది.
· అంతకుముందు ఎల్పీజీ సిలిండర్ల కొరత గురించి వదంతులు వ్యాపించడంతో, కొన్ని ప్రాంతాల్లో భయాందోళనతో భారీగా బుకింగ్లు జరిగాయి.
· మీడియా సహకారం, ప్రభుత్వం చేపట్టిన ప్రచార కార్యక్రమాలతో భయాందోళనతో చేసే సిలిండర్ల బుకింగ్లు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.
· గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరతకు సంబంధించి ఇలాంటి వదంతులే ప్రచారంలో ఉన్నాయి.
· దేశంలో పెట్రోల్, డీజిల్ సరఫరాలకు కొరత లేదని స్పష్టం చేశారు.
· పౌరులు పెట్రోల్ పంపుల వద్ద గుమికూడవద్దని, భయాందోళనలతో కొనుగోళ్లు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
· పెట్రోల్, డీజిల్ తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయి. సరఫరా గొలుసులు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి.
· కొన్ని వర్గాల వారు వదంతులను వ్యాప్తి చేసి, పౌరుల్లో అనవసరమైన భయాందోళనలను సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, ప్రచారం చేయవద్దని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.
· నకిలీ వార్తలు, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసేవారిపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
· పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్లను నిల్వ చేయడానికి, బ్లాక్ మార్కెటింగ్ చేయడానికి చేసే ప్రయత్నాల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలి.
· పెట్రోలియం ఉత్పత్తులకు గానీ, ఎల్పీజీ సిలిండర్లకు గానీ ఎలాంటి కొరత లేదనీ... పౌరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... పెట్రోల్ పంపులు, పంపిణీదారుల వద్దకు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పునరుద్ఘాటిస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2246488)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam